సిరికొండ: తాను కష్టపడే వ్యక్తినని, ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్లో మండల కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ఐదేళ్ల కాలంలో ఒక్క రుపాయి కూడా తేలేకపోయాడని విమర్శించారు. పసుపు బోర్డు మీద గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ఇప్పుడు ఓడిపోతానని మోదీని చూసి నన్ను గెలిపించాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నదని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుండా మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్ల పేరిట టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, ధర్పల్లి జెడ్పీటీసీ జగన్, వైస్ ఎంపీపీ రాజన్న, నాయకులు గోపి, గంగారెడ్డి, సురేందర్, ఫిలిప్, రాజేందర్, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.