తిరువొత్తియూరు: చిత్ర మాసాన్ని పురస్కరించుకుని రామేశ్వరం అగ్నితీర్థంలో భక్తులు అధిక సంఖ్యలో మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించి, తమ పూర్వీకులకు తర్పణాలు వదిలారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ఉదయం 4.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పటికలింగ పూజలు చేశారు. అనంతరం మూల విరాట్కు ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారుజాము నుంచే అగ్నితీర్థం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సముద్రంలో పుణ్యస్నానం చేసి తమ పూర్వీకులకు తర్పణాలు వదిలారు. ఆ తర్వాత 22 పవిత్ర తీర్థాల్లో స్నానాలు చేసి, స్వామివారి దర్శనం చేసుకున్నారు.
చదురగిరిలో...
విరుదునగర్ జిల్లా, వత్రాయిరు సమీపంలోని చదురగిరి సుందరమహాలింగం ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. పశ్చిమ కనుమల్లో చదురగిరి సుందరమహాలింగం ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి నెలా అమావాస్య, పౌర్ణమికి 3 రోజులు, ప్రదోషానికి 2 రోజులు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ క్రమంలో చైత్ర మాసం ప్రదోషం సందర్భంగా గత 5వ తేదీ నుంచి బుధవారం వరకు 4 రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చదురగిరిలో స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. అమావాస్య సందర్భంగా చతురగిరి సుందర మహా లింగ స్వామివారికి జలాభిషేకం, చందనం, పన్నీటితో అభిషేకం చేశారు.