‘మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం జగనే’ | YSRCP Samajika Sadhikara Yatra Hindupur Public Meeting Speeches- Sakshi
Sakshi News home page

మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం జగనే: హిందూపురంలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర

Published Wed, Nov 15 2023 5:54 PM

YSRCP Samajika Sadhikara Yatra Hinudpur Public Meeting Speeches - Sakshi

సాక్షి, శ్రీసత్యసాయి:  వెనకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం హిందూపురంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో గత ప్రభుత్వంలో.. ఈ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు జరిగిన మంచిని అశేష జనవాహినికి వివరించారు. 

మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ..  ‘‘బీసీలను ఓటు బ్యాంకులా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని పదవులు ఆయన ఇచ్చారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌దే. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరాలి.

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు. జగన్ సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు మేలు చేశాయి. జగన్ పాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 30 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత జగన్‌దే. వైఎస్ జగన్ గొప్ప సంఘ సంస్కర్త. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. 

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ..  ‘‘ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు జగన్ ప్రభుత్వం లో నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది.  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల జీవితాలను మార్చిన ఘనత సీఎం జగన్‌దే. హిందూపురంలో 40 ఏళ్లుగా టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బాలకృష్ణను రెండు సార్లు గెలిపిస్తే.. హిందూపురం నియోజకవర్గాన్ని ఏ  మాత్రం పట్టించుకోలేదు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలని బాలకృష్ణ చెప్పటం అనైతికం. వచ్చే ఎన్నికల్లో హిందూపురం లో బాలకృష్ణ ను ఓడించాలి. 

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముస్లిం మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మైనారిటీలకు చంద్రబాబు ద్రోహం చేశారు. హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని పక్కనపెట్టి మరీ బాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. రూ. 2.40 లక్షల కోట్ల రూపాయల ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచిన పార్టీ. టీడీపీ - జనసేన పెత్తందార్ల పార్టీలు.

హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కురుబ దీపిక మాట్లాడుతూ.. ‘‘హిందూపురం నియోజకవర్గం లో నందమూరి బాలకృష్ణ చుట్టం చూపుగా వస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో హిందూపురం లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేస్తాం.

Advertisement
Advertisement