IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్‌ వీడియో | Sakshi
Sakshi News home page

IPL 2024 CSK VS KKR: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ

Published Tue, Apr 9 2024 10:29 AM

IPL 2024 CSK VS KKR: Ravindra Jadeja Teased The Chepauk Crowd By Coming Ahead Of MS Dhoni - Sakshi

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్‌కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్‌కు దిగుతున్నట్లు ప్రాంక్‌ చేసి ఫ్యాన్స్‌ను టీజ్‌ చేశాడు. సీఎస్‌కే గెలుపు ఖరారైన దశలో శివమ్‌ దూబే ఔట్‌ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది.

అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్‌ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం​ ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్‌ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్‌ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (3), రింకూ సింగ్‌ (9), రసెల్‌ (10) తస్సుమనిపించారు. నరైన్‌ (27), రఘువంశీ (24), శ్రేయస్‌ అయ్యర్‌ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేను రుతురాజ్‌ (67 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. రచిన్‌ రవీంద్ర 15, డారిల్‌ మిచెల్‌ 25, శివమ్‌ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లు) చేసి ఔట్‌ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

Advertisement
Advertisement