టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌.. సిక్స‌ర్ల కింగ్‌లు ఎంట్రీ!? | Sakshi
Sakshi News home page

IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌.. సిక్స‌ర్ల కింగ్‌లు ఎంట్రీ!?

Published Fri, Apr 19 2024 5:17 PM

Rishabh Pant is likely to lead the Indian team in the tour of Zimbabwe - Sakshi

ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 అనంత‌రం భార‌త జ‌ట్టు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య‌ జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌ జూలై 6న ప్రారంభ‌మై అదే నెల 14న ముగియ‌నుంది.

ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు  హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ ‍శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట.

కాగా పంత్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. పున‌రాగ‌మ‌నంలో కెప్టెన్‌గానే కాకుండా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా కూడా స‌త్తాచాటుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన పంత్ 210 ప‌రుగులు చేశాడు. మ‌రోవైపు ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న రియాన్ ప‌రాగ్‌, శ‌శాంక్ సింగ్‌, అశుతోష్ శ‌ర్మ‌, సాయిసుద‌ర్శ‌న్, అభిషేక్ శ‌ర్మ‌ వంటి యువ ఆట‌గాళ్ల‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్‌, శివ‌మ్ దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌ వంటి స్టార్‌ ఆట‌గాళ్లను సైతం  జింబాబ్వే టూర్‌కు పంపించనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 
 

Advertisement
Advertisement