-
కాయ్.. రాజా.. కాయ్
కోవూరు: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీకి సిద్ధిస్తుందనే అంశంపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. పోలింగ్ శాతం పెరగడం.. విజయంపై ఇరు పార్టీ లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోనూ బెట్టింగ్లు తారస్థాయిలో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు పోలయ్యాయనే అంశంపై ఇప్పటికే పలువురు ఆరాతీశారు. ఈ తరుణంలో ఎవరి అంచనాలతో వారు పందేలను కాస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకంటే మరోసారి సీఎం ఎవరవుతారనే అంశంపైనే బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. పందేల్లో కొత్త పోకడ కొన్ని చోట్ల రూ.లక్షలు.. అక్కడక్కడా రూ.కోట్లల్లో పందేలు కాస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా భూములనే పణంగా పెడుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక తేడాలు రాకుండా అగ్రిమెంట్లను ముందస్తుగానే చేసుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడి ఓ గ్రామంలో వైఎస్సార్సీపీ.. కూటమి నేతలు తమ పంట పొలాలను పెట్టి పందెం కాశారు. ఈ మేరకు సాక్ష్యుల సమక్షంలో స్టాంప్ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. కావలి, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరిలోనూ ఇదే తంతు నడుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ముందు వరకు పందేల్లో ముందున్న కూటమి శ్రేణులు.. పోలింగ్ తర్వాత వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో గెలుపుపై ధీమాతో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులు మాత్రం దూకుడుగా ఉన్నారు. ఎన్నికల్లో విజయంపై జోరుగా పందేలు లక్షల నుంచి కోట్లల్లో బెట్టింగ్లు కొన్ని చోట్ల భూములను సైతం.. తేడా రాకుండా ముందుగానే అగ్రిమెంట్లు -
దిగజారిన నిమ్మ ధరలు
● పెరిగిన దిగుబడి పొదలకూరు: వేసవిలోనూ నిమ్మధరలు దిగజారాయి. వాతావరణం చల్లబడటం.. తోటల్లో దిగుబడులు పెరగడంతో ధరలు పతమవుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ఇప్పటి వరకు గిట్టుబాటు ధరలకు ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే నాలుగు రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు చెప్తున్నారు. మరింత తగ్గేందుకు అవకాశం మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.30 నుంచి రూ.85 వరకు ప్రస్తుతం పలుకుతున్నాయి. వేసవి తాపం తగ్గే కొద్దీ కాయల ధరలు మరింత పడిపోయే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది నిమ్మ రైతులు ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించలేకపోయారు. ధరలున్న సమయంలో దిగుబడి లేకపోవడం.. ధరలు పడిపోయిన వేళ దిగు బడి పెరగడం రైతులకు ఇబ్బందిగా మారింది. బయటి ప్రాంతాల్లో నిమ్మకాయల దిగుబడి పెరగడం.. వాతావరణం అనుకూలించకపోవడంతో డిమాండ్ లేకుండా పోయిందని వ్యాపారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ విస్తారంగా సాగు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని బిజాపూర్లోనూ నిమ్మ సాగు విస్తారంగా ఉంది. రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి తదితర ప్రాంతాల నుంచి కాయల ఎగుమతి పెరిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్కు ఎగుమతులు ఎక్కువయ్యాయి. ఉత్తరాదిలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో నిమ్మ వాడకం తగ్గిపోయింది. ఫలితంగా నిమ్మ ధరలు దిగజారుతున్నాయి. -
యువకుడి దారుణ హత్య
బాపట్ల టౌన్: యువకుడు దారుణహత్యకు గురైన ఘటన బాపట్లలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఈగల్ బార్ సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్న ప్రశాంత్ (28)ను నెల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టి వారి వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి చంపారు. హత్య కేసులో బెయిల్పై వచ్చి.. మృతుడు ప్రశాంత్ అలియాస్ మారి నెల్లూరులోని వైకుంఠపురంలో కారు డ్రైవర్గా జీవనం సాగించేవారు. కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్న సత్యనారాయణపురానికి చెందిన మహీధర్.. ప్రశాంత్ స్నేహితులు. గతేడాది వినాయక నిమజ్జనం సమయంలో వీరిద్దరూ గొడవపడ్డారు. అప్పట్లో పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. అయినా కోపం తగ్గని ప్రశాంత్.. మహీధర్ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. గతేడాది అక్టోబర్ 18న రాత్రి నెల్లూరులోని సత్యనారాయణపురంలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో ప్రశాంత్, మహీధర్, రామ్చరణ్ మద్యం తాగారు. మత్తులో ఉన్న మహీధర్ను ప్రశాంత్, రామ్చరణ్ కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. దీంతో మహీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. హత్య కేసులో జైలుకెళ్లిన ప్రశాంత్ బెయిల్పై బయటకొచ్చారు. అప్పటి నుంచి మహీధర్ బాబాయి కృష్ణారెడ్డి అతడ్ని హతమార్చేందుకు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. పథకం ప్రకారం అంతమొందించారు.. కృష్ణారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ప్రశాంత్ ఆయన్ను సైతం హతమార్చేందుకు పలుమార్లు యత్నించారు. దీన్ని మనస్సులో పెట్టుకున్న కృష్ణారెడ్డి.. ప్రశాంత్ స్నేహితుడి ద్వారా వివరాలను ఆరాతీయసాగారు. ఈ క్రమంలో తండ్రిని కలిసేందుకు బాపట్లకు ప్రశాంత్ వచ్చారు. విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి.. ప్రశాంత్ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడించి బాపట్లకు మరికొందరితో కలిసి చేరుకున్నాడు. పట్టణంలోని ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో రోడ్డుపై ఉన్నారని సమాచారం తెలుసుకొని కారుతో ఢీకొట్టి, వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. దీంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు హత్యకు పాల్పడిన వ్యక్తులు అనంతరం అదే కారులో చీరాల వైపు వెళ్తూ మార్గమధ్యలో వెదుళ్లపల్లి సమీపంలో నిలిపేసి పంట పొలాల్లోకి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హంతకులను అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. -
డబ్బులు తిరిగిచ్చేయండి..!
కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మరో దాష్టీకానికి తెరలేపారు. ఎన్నికల్లో సైకిల్ పార్టీకి ఓటమి తప్పదని తెలిసినా, ఓటర్లను ప్రలోభపర్చేందుకు నగదును ఏరులై పారించారు. తీరా పోలింగ్ సరళి బట్టి తన గెలుపు సాధ్యం కాదని తేలిపోవడంతో తాను పంచిన డబ్బును తిరిగి రాబట్టుకునే పనిలో ఆయన నిమగ్నమైన తంతును చూస్తున్న ప్రజలు నివ్వెరపోతున్నారు. కావలి: కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుల అరాచకాలు, ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్కు గంట ముందు వరకు సైతం ఓటుకు రూ.రెండు వేల చొప్పున పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన ఆయన అనుచరులు, అనంతరం తమ అసలు నైజాన్ని బయటపెట్టారు. పోలింగ్ సరళిని గమనించాక ఓటమి తప్పదనే అంశం స్పష్టం కావడంతో డబ్బులను వెనక్కివ్వాలంటూ ఓటర్లను వేధిస్తున్నారు. ఓటర్లపై దుర్భాషలు పోలింగ్ అనంతరం వార్డుల వారీగా లెక్కలు చూసుకున్న కావ్య అనుచరులు.. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి డబ్బులను వెనక్కివ్వాలంటూ ఓటర్లను దుర్భాషలాడుతున్నారు. మహిళలపై సైతం అసభ్య పదజాలాన్ని వాడుతున్నారు. కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు నున్నా మురళి ఫోన్లో ఓటర్లను బెదిరిస్తున్న ఆడియోలు గురువారం కలకలం సృష్టించాయి. సుమారు ఏడు నిమిషాల నిడివి గల రెండు ఆడియో రికార్డింగుల్లో ఓ కుటుంబాన్ని ఆయన తీవ్రంగా బెదిరిస్తున్న విషయం వెలుగు చూసింది. ఆశా.. నిరాశేనా.. ! ఓటుకు భారీ మొత్తం పంపిణీతో పాటు టీ కప్పులు, గ్రామాల్లో ప్రార్థన మందిరాల నిర్మాణానికి నగదును పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన తమ వ్యక్తులను కాపలాగా ఉంచారు. అయితే పోలింగ్ ప్రారంభమయ్యాక, వీరి ఆశలు అడియాశలయ్యాయి. దాదాపు అన్ని చోట్ల వైఎస్సార్సీపీకే మద్దతు తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయడంతో పోలింగ్ సరళికి అడ్డంకులు సృష్టించేందుకు సైతం కావ్య అనుచరులు యత్నించారు. ముసునూరుతో పాటు దగదర్తి, అల్లూరు మండలాల్లో పలుచోట్ల గొడవలు సృష్టించారు. అయినా పోలింగ్ సజావుగా సాగడంతో కంగుతిన్నారు. చివరికి లెక్కలు చూసుకొని డబ్బులను వెనక్కివ్వాలంటూ ఓటర్లను బెదిరిస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. డబ్బివ్వకపోతే బయట తిరగలేరు రూ.రెండు వేలు తీసుకున్నా, తమకు ఓటేయలేదని.. కృష్ణారెడ్డి కార్యాలయానికి వచ్చి డబ్బులను వెనక్కివ్వాలని హుకుం జారీ చేసిన అంశం ఆడియోల్లో స్పష్టంగా ఉంది. అలా కాని పక్షంలో బయట తిరగలేరని.. ఇంటికొచ్చి గొడవ చేస్తామంటూ పత్రికల్లో రాయలేని విధంగా సదరు కుటుంబాన్ని దూషించారు. ఈ బూతు పురాణాన్ని తట్టుకోలేక సదరు కుటుంబం ఫోన్ కట్ చేస్తున్నా, పదే పదే చేస్తూ బెదిరింపులకు దిగారు. కావలి పట్టణంలోని పలు వార్డులతో పాటు అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల్లోనూ ఇదే పరిస్థితి సాగుతోంది. తమ వద్ద డబ్బులు తీసుకొని ఓట్లను పక్కాగా ఫ్యాన్ గుర్తుకే వేశారని ఆరోపిస్తూ ఇళ్ల ముందుకొచ్చి రంకెలేస్తున్నారు. కాగా ఆడియో వైరల్ కావడంతో కావ్య వర్గం కాస్త వెనక్కి తగ్గింది. కావలిలో కావ్య అనుచరుల అరాచకం ఓటర్లకు బెదిరింపులు -
స్ట్రాంగ్రూమ్ల వద్ద అప్రమత్తత అవసరం
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ నెల్లూరు(దర్గామిట్ట): ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడులో గల ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ను గురువారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు వీక్షించేందుకు వీలుగా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను మానిటరింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏర్పాట్ల పరిశీలన నెల్లూరు(బారకాసు): కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను నెల్లూరు సిటీ నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ వికాస్ మర్మత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ఈ కేంద్రం ద్వారా ప్రకటించనున్నామని తెలిపారు. -
బీసీజీ వ్యాక్సిన్తో బహుళ ప్రయోజనాలు
కొడవలూరు: పెద్దల బీసీజీ వ్యాక్సిన్తో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఏడీఎంహెచ్ఓ బ్రిజిత పేర్కొన్నారు. నార్తురాజుపాళెంలో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. 60 ఏళ్లుపైబడిన వారు బీసీజీ వ్యాక్సిన్ను విధిగా వేయించుకోవాలని కోరారు. దీని వల్ల క్షయ రాకుండా ఉండటంతో పాటు బీపీ, షుగర్ అదుపులో ఉంటాయని చెప్పారు. షుగర్ బాధితులై 18 నుంచి 60 ఏళ్లలోపు వారు వ్యాక్సిన్ను వేయించుకోవచ్చని తెలిపారు. పీహెచ్సీల ద్వారా వ్యాక్సిన్ను ప్రతి గురువారం వేయనున్నారని వివరించారు. కొడవలూరు పీహెచ్సీ వైద్యాధికారి రామకృష్ణ, సీహెచ్ఓ సోమశేఖర్, ఎమ్మెల్హెచ్పీలు సరోజ, స్నేహ, ఏఎన్ఎం దీనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. అంధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న అంధుడైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు ఆర్టీసీ కాలనీ సమీపంలో చంద్రబాబునగర్కు వెళ్లే రహదారిపై గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామానికి చెందిన పి.నాగేంద్ర (31) అంధుడు. అవివాహితుడు. ఆయన అంధుల బ్యాండ్కు మైక్ సెట్టింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాగేంద్రకు తోటపల్లిగూడూరు మండలం కొత్తపాళేనికి చెందిన షేక్ జిలానీబాషా స్నేహితుడు. ఇతను కూడా అంధుడే. గురువారం ఇద్దరూ కలిసి తల్పగిరి కాలనీలోని స్నేహ చారిటుబల్ ట్రస్ట్ మేనేజర్ను కలిసేందుకు నెల్లూరుకు వచ్చారు. ఆర్టీసీ కాలనీ సమీపంలో బస్సు దిగి తల్పగిరికాలనీ వెళ్లేందుకు ఆటో ఎక్కారు. దానిని ఓ మైనర్ నడుపుతున్నాడు. అతను మితిమీరిన వేగంతో వెళ్తూ చంద్రబాబునగర్కు వెళ్లే మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఆటో తిరగబడి నాగేంద్ర తలపై పడడంతో తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. జిలానీకి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్సై కిశోర్బాబు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్సై కిశోర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీబీ వ్యాక్సినేషన్ను విజయవంతం చేద్దాం
● డీఎంహెచ్ఓ పెంచలయ్య నెల్లూరు(అర్బన్): వయోజనులకు తొలిసారిగా వేస్తున్న టీబీ వ్యాక్సినేషన్ను విజయవంతం చేద్దామని డీఎంహెచ్ఓ పెంచలయ్య, జిల్లా టీబీ నివారణ అధికారి ఖాదర్వలీ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలతోపాటు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపిక చేసిన వారికి టీబీ నివారణకు ముందస్తు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం నెల్లూరు వెంగళరావు నగర్ – ఎన్బీటీ కాలనీలోని పట్టణ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్ఓ, క్షయ నివారణ అధికారి మాట్లాడారు. మధుమేహం ఉన్నవారికి, పొగతాగే వారికి, 60 ఏళ్లు నిండిన వారికి, ఊబకాయులకు, టీబీకి గురైన వారికి, వారి ఇంటి సభ్యులకు తొలిదశలో ఈ వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ను మూడు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత
● ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. గురువారం ఆయన కళాశాలలోని స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రతా చర్యలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్ట్రాంగ్రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గంటలపాటు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారన్నారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్బీ, నెల్లూరు రూరల్, సంతపేట ఇన్స్పెక్టర్లు కె.రామకృష్ణారెడ్డి, మారుతీకృష్ణ, ఎ.సుబ్బరాజు, ఆర్ఐ అంకమరావు తదితరులున్నారు. -
డెంగీ నివారణ అందరి బాధ్యత
నెల్లూరు(అర్బన్): డెంగీని నివారించడం అందరి బాధ్యత అని డీఎంహెచ్ఓ పెంచలయ్య పేర్కొన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి సంతపేటలోని బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీని వైద్యాధికారులు, సిబ్బంది గురువారం నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దోమ కాటుతో డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. వీటికి దూరంగా ఉండేందుకు దోమలను నియంత్రించాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ, డెమో అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షలకు 813 మంది గైర్హాజరు వెంకటాచలం: విక్రమ సింహపురి వర్సిటీ (వీఎస్యూ) పరిధిలోని అనుబంధ కళాశాలల్లో గురువారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 813 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ మధుమతి ఒక ప్రకటనలో తెలిపారు. 8958 మందికి గానూ 8145 మంది హాజరయ్యారని చెప్పారు. ఈఏపీసెట్ ప్రారంభం నెల్లూరు(అర్బన్): ఇంజినీరింగ్, కొన్ని రకాల వైద్య కోర్సులు, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీసెట్ జిల్లాలో ప్రశాంతంగా గురువారం ప్రారంభమైంది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యా హ్నం 12 వరకు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకున్నారు. మెటల్ డిటెక్టర్తో క్షుణ్ణంగా పరిశీలించాకే విద్యార్థులను లోపలికి అనుమతించారు. కాగా ఈఏపీసెట్కు జిల్లాలో 16 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక నేడు నెల్లూరు(స్టోన్హౌస్పేట): విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్న బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే బాలబాలికల జిల్లా జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నామని బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గాదం వాసు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్లో సాయంత్రం ఐదు గంటలకు ప్రక్రియను నిర్వహించనున్నామని వివరించారు. 2008, జనవరి ఒకటి తర్వాత జన్మించిన వారు అర్హులని, వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 94408 79884 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కరెన్సీ కౌంటింగ్ యంత్రం విరాళం తిరుమల: తిరుమలలోని వేంకటేశ్వరస్వామివారి పరకామణికి రూ.9.33 లక్షల విలువైన కరెన్సీ కౌంటింగ్ యంత్రాన్ని విరాళంగా గురువారం అందజేశారు. నెల్లూరుకు చెందిన కాకులూరు వసంతకుమార్, కర్పగవల్లి దంపతులు ఈ యంత్రాన్ని పరకామణి డిప్యూటీ ఈఓ మల్లికార్జునకు అందజేశారు. దాతలను టీటీడీ అధికారులు అభినందించి, శ్రీవారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. జాయింట్ – 2 సబ్ రిజిస్ట్రార్గా జాఫర్ నెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయంలో జాయింట్ – 2 సబ్ రిజిస్ట్రార్గా జాఫర్ను డిప్యుటేషన్పై నియమిస్తూ అధికారులు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. జాయింట్ – 2 సబ్ రిజి స్ట్రార్గా పనిచేస్తున్న సంజయ్కుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ జాఫర్ ఇక్కడ నియమితులయ్యారు. -
లక్షణాలిలా..
● అధికంగా బీపీ ఉన్న వారికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. పనిలో అలసట, వికారం, వాంతులు, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ● అధిక రక్తపోటు ఉండేవారికి కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ● ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ● కొద్ది మందిలో ముక్కు నుంచి రక్తం కారుతుంది. ● నిద్రలో అతిగా గురక వస్తే హైబీపీకి ఒక కారణంగా పేర్కొనవచ్చు. ● రాత్రి వేళ తరచూ తలనొప్పి రావడం ఒక లక్షణం. -
19 నుంచి పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 19న శ్రీవారి ఉత్సవమూర్తులు గోనుపల్లినుంచి పెంచలకోనకు చేరుకుంటారు. రాత్రి అంకురార్పణ, 20న ఉదయం 9.36 గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం ఐదు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, 6 గంటలకు సహస్రదీపాలంకరణ సేవ, 9 గంటలకు శేషవాహనసేవ, 21న ఉదయం 8 గంటలకు హంస వాహనసేవ, 11.30కు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్రదీపాలంకరణసేవ, రాత్రి 10 గంటలకు బంగారు హనుమంతసేవ, 22న ఉదయం 8 గంటలకు సింహ వాహనసేవ, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణసేవ, రాత్రి 11 గంటలకు బంగారు గరుడవాహన సేవ, 23న ఉదయం 9.30 గంటలకు కల్యాణం, సాయంత్రం 6 గంటలకు రఽథోత్సవం, రాత్రి 9 గంటలకు గజవాహనసేవ, 24న ఉదయం 9 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు తెపోత్సవం, రాత్రి 9 గంటలకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. 25న స్వామి, అమ్మవార్లు గొనుపల్లికి చేరుకుంటారు. అక్కడ క్షేత్రోత్సం నిర్వహిస్తారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంపొదలకూరు: పట్టణంలో ఫ్రెండ్స్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఆర్గనైజర్ మన్నవరపు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ బహుమతుల కింద రూ.20 వేలు, రూ.10 వేలు నగదును అందజేయడం జరుగుతుంది. 16 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ బహుమతులను పలుకూరు మురళీరెడ్డి, వెడిచర్ల లీలావతి జ్ఞాపకార్ధం వెడిచర్ల మురళి అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఆల్రౌండర్ బహుమతులు కూడా ఉంటాయన్నారు. పిడుగుపడి ఎనిమిది మేకలు మృతిఅనుమసముద్రంపేట: పిడుగుపడి ఎనిమిది మేకలు మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని చౌటభీమవరం గ్రామానికి చెందిన రైతులు కృష్ణయ్య, హజరత్తయ్య, చిన్నయ్య గురువారం తమ మేకలను మేత నిమిత్తం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వారు తమ జీవాలను చెట్టు కిందకు తోలారు. ఈ సమయంలో పిడుగుపడి ఎనిమిది మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. పాపం మూగజీవాలు ● విద్యుదాఘాతానికి గురై గేదెలు మృతి సీతారామపురం: మండలంలోని పబ్బులేటిపల్లి గ్రామంలో గురువారం మద్దినేని రమణయ్య అనే వ్యక్తికి చెందిన రెండు గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి. బాధితుడి కథనం మేరకు.. బుధవారం తోటలో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. ఈ ఆ విషయాన్ని రమణయ్య విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మేతకు వెళ్లిన గేదెలకు తెగిపడిన విద్యుత్ తీగలడంతో మృతిచెందాయి. వాటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వీడాలని కోరుతున్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.85 సన్నవి : రూ.35 పండ్లు : రూ.25 -
అధిక రక్తపోటు.. తెస్తుంది చేటు
నెల్లూరు(అర్బన్): బీపీ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. జిల్లా జనాభాలో సుమారు 5 లక్షల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రభుత్వం ఆదేశాలతో గత నెల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పీహెచ్సీల పరిధిలో స్క్రీనింగ్ చేయించగా అందులో 1,01,172 మంది అధిక బీపీతో ఉన్నట్లు తెలిసింది. వీరే కాకుండా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి, కావలి, కందుకూరు ఏరియా ఆస్పత్రి, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్ల పరిధిలో కలిపితే మరో 4 లక్షల మంది వరకు రోగులున్నారు. వీరిలో చాలామంది అధిక రక్తపోటును నియంత్రించేందుకు మందులు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది రోగులున్నారు. నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు లాంటి పట్టణాల్లో సుమారు 20 శాతం మందికి పైగా బీపీతో బాధపడుతున్నారని అధికారుల అంచనా. కారణాలివి.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు, వ్యాపారస్తులు నిత్యం పనిఒత్తిడిలో టెన్షన్ పడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు తమ లక్ష్యాలను సాధించేందుకు అదనంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో సరైన నిద్రలేకపోవడంతోపాటు పనిఒత్తిడిలో జీవనం సాగిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి ఇవన్నీ హైబీపీకి కారణాలుగా మారాయి. అధిక ఉప్పుతో కూడిన కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం మరొక కారణం. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. దీనిని మెడికల్ పరిభాషలో హైపర్టెన్షన్గా పేర్కొంటారు. ఆహారపు అలవాట్లు, పనిఒత్తిడి, ఆందోళన తదితర కారణాలతో వచ్చే బీపీ విషయంలో నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ చాలామంది బీపీని పట్టించుకోరు. దీంతో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. అధిక రక్తపోటు (బీపీ) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీని నియంత్రణలో ఉంచుకుంటే మనిషి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నిర్లక్ష్యం వహించి సక్రమంగా మందులు వాడకపోతే ప్రమాదానికి దారి తీయొచ్చు. బీపీ నియంత్రణకు మందులుతోపాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లున్నాయి. తక్కువ ఖర్చుతోనే అదుపులో ఉంచుకోవచ్చు. సరైన వ్యాయామం, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవడం, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. బీపీ ఉన్న వారు క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. నేడు వరల్డ్ హైపర్టెన్షన్ డే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు అవగాహన, జాగ్రత్తలతో బీపీకి చెక్ జిల్లాలో 20 శాతం మంది బీపీ రోగులు -
పాలవ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
● న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన కందుకూరు: పాలవ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రగాయాలైన ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మహదేవపురం శ్రీనివాసకాలనీకి చెందిన కె.కిశోర్ (21) బుధవారం సింగరాయకొండ నుంచి మోటార్బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కందుకూరు నుంచి మహదేవపురం వైపు పాలవ్యాన్ వెళ్తోంది. మహదేవపురం అడ్డరోడ్డు వద్ద అది బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిశోర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. తర్వాత కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బంధువులు రాత్రి ఒంగోలు రిమ్స్కు తరలించారు. పరిస్థితి మరింత విషమించి కిశోర్ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని డీఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి డ్రైవర్ను అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ నఫీజ్బాషా ఆందోళన కారులకు సర్దిచెప్పారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్ను ఇప్పటికే అరెస్ట్ చేశామని, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, కచ్చితంగా పోలీస్ పరంగా అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించారు. -
నిర్లక్ష్యంగా ఉంటే..
బీపీని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి తీవ్ర హానికరం. నియంత్రించకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. పక్షవాతం ఏర్పడవచ్చు. కిడ్నీలు దెబ్బతింటాయి. లివర్ పాడవుతుంది. హైబీపీ మెదడుపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అవగాహన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006 నుంచి మేనెల 17వ తేదీని వరల్డ్ హైపర్టెన్షన్ డేగా ప్రకటించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోనూ బీపీపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్లతో ఖాళీగా థియేటర్లు
● వేసవిలో సినిమాల విడుదల తగ్గుముఖం ● నిర్వహణ భారంగా మారిందంటున్న నిర్వాహకులు ● సింగిల్ స్క్రీన్ల పరిస్థితి మరీ దారుణం నెల్లూరు సిటీ: సెలవులొచ్చాయంటే కుటుంబసమేతంగా థియేటర్లకు వెళ్లి తమ అభిమాన హీరో నటించిన చిత్రాన్ని చూడటం రివాజు. ఆ సమయంలో టికెట్లు పొందేందుకు పెద్ద ఫీట్లు చేయాల్సి వచ్చేది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండటం.. ఐపీఎల్ మేనియా ఆవహించడం.. సార్వత్రిక ఎన్నికల తరుణంలో థియేటర్ల ముఖం చూసే వారే కరువవుతున్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ ప్రతిబంధకాలే.. ప్రస్తుతం ఓటీటీల్లో వారానికి సగటున ఐదారు చిత్రాలు విడుదలవుతున్నాయి. తక్కువ మొత్తానికే లభిస్తున్న సబ్స్క్రిప్షన్లతో ఇంట్లోనే తమకు నచ్చిన సినిమాను చూసేందుకు పలువురు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు మల్టీప్లెక్సుల్లో ఆకాశాన్నంటుతున్న టికెట్ల ధరలు.. చుక్కలు చూపిస్తున్న తినుబండారాల రేట్లతో హాళ్లవైపు వెళ్లాలంటేనే సామాన్యులు జంకే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా థియేటర్ల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. పదేళ్లలో ఎంత తేడా.. ఒక్క నెల్లూరులోనే గతంతో పోలిస్తే థియేటర్ల సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. గతంలో ఎంతో పేరుమోసిన థియేటర్లను తొలగించి వాటి స్థానంలో షాపింగ్ మాళ్లు, కల్యాణ మండపాలను నిర్మించారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని రెయిన్ స్క్వేర్లో నాలుగు.. ఎంజీబీ మాల్లో ఐదు.. ఎమ్ – 1లో మూడు.. సిరిలో నాలుగు స్క్రీన్లు ఉండగా, లీలామహల్, కొత్తహాల్ సింగిల్ స్క్రీన్లు.. మొత్తం 18 ఉన్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, కోట, రాపూరు, పొదలకూరు, కోవూరు, వింజమూరులో రెండు చొప్పున, కావలిలో ఐదు, కందుకూరులో మూడు, గూడూరు, సూళ్లూరుపేటలో నాలుగు చొప్పున, బుచ్చిరెడ్డిపాళెంలో మూడు, విడవలూరు, ఇందుకూరుపేట, నారాయణరెడ్డిపేటలో ఒక్కో థియేటర్ చొప్పున మొత్తం 38 ఉన్నాయి. జిల్లాలో 2014లో 94 థియేటర్లు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 56కు పతనమైంది. ఆందోళనలో యాజమాన్యాలు మల్టీప్లెక్సులతో పోలిస్తే తమ పరిస్థితి దారుణంగా మారిందని సింగిల్ స్క్రీన్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసేందుకే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని, పెద్ద హీరో సినిమా విడుదలైన రెండు రోజుల వరకే తమ వద్దకు వస్తున్నారని పేర్కొంటున్నారు. మిగిలిన సమయాల్లో విద్యుత్ బిల్లులకు సైతం నగదు రావడంలేదని, రానున్న రోజుల్లో ఇదే తీరు కొనసాగితే తమ పరిస్థితి సైతం హైదరాబాద్ మాదిరిగా తయారవుతుందని చెప్తున్నారు. ఐపీఎల్కే ఓటు ఐపీఎల్ మ్యాచ్లను స్నేహితులతో కలిసి నెల రోజులుగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఉత్కంఠభరితంగా మ్యాచ్లు సాగుతుండటంతో జట్లతో సంబంధం లేకుండా రోజూ వీక్షిస్తున్నాం. గతంలో నెల్లో నాలుగు సినిమాలైనా చూసేవాడ్ని. ప్రస్తుతం ఆ ఆసక్తే లేదు. – వంశీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కోవూరు పెద్ద హీరోల సినిమాలు రాలేదు వేసవి సెలవులొచ్చాయంటే పెద్ద హీరోల సినిమాలు కనీసం రెండైనా విడుదలయ్యేవి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితే లేదు. థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లకపోవడానికి ఇదీ ఓ కారణమే. – వాసు, స్టిక్కరింగ్ దుకాణ నిర్వాహకుడు డబ్బు ఆదా అవుతోంది థియేటర్లలో విడుదలైన చిత్రాలు హిట్టయినా.. ఫ్లాపైనా 20 నుంచి 30 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇలా చూడటం ద్వారా డబ్బు ఆదా అవుతోంది. ఈ కారణంగా హాళ్లకు పెద్దగా వెళ్లడంలేదు. – శివకుమార్, స్టోన్హౌస్పేటమూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది వెండితెర పరిస్థితి. అసలే ఓటీటీతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న థియేటర్లకు తాజాగా ఎన్నికలు.. ఐపీఎల్ మ్యాచ్లు అశనిపాతంలా పరిణమించాయి. విడుదలయ్యే చిత్రాల్లేక.. ఉన్న సినిమాలను చూసే నాథుడు లేక దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. ఈ పరిణామాలతో హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ల నిర్వాహకులు తమ థియేటర్లను పది రోజుల పాటు మూసేసేందుకు నిర్ణయించుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా, పైకి మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం వెయ్యి ఖర్చవుతుంది కుటుంబసభ్యులతో కలిసి సినిమాకు వెళ్దామంటే రూ.వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. తినుబండారాల ధరలు చుక్కలను చూపిస్తుండటంతో అటు వైపు వెళ్లాలంటేనే భయంగా ఉంది. – ఇమ్మానుయెల్, పడుగుపాడు -
శస్త్ర చికిత్సలను పెంచాలి
నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో గల జనరల్ సర్జరీ విభాగంలో శస్త్ర చికిత్సలను పెంచడంతో పాటు రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆదేశించారు. ఆస్పత్రిలోని జనరల్ సర్జరీ విభాగంలో హెచ్ఓడీలు, డాక్టర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిస్క్ కేసులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపొద్దని.. వీటిని చాలెంజ్గా తీసుకొని చికిత్సను అందించాలని కోరారు. ఆపరేషన్ అనంతరం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీలోనే వీటిని చేయాలని చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవలను పెంచాలని.. వైద్యులు సమయపాలనను పాటించాలని కోరారు. డాక్టర్లు కాలేషాబాషా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
టీబీ సోకకుండా వ్యాక్సిన్
నెల్లూరు(అర్బన్): టీబీని నిర్మూలించాలనే లక్ష్యంతో వ్యాక్సిన్ను వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎంపిక చేసిన వాటిలో తొలి దశలో నెల్లూరు జిల్లా ఉండటం విశేషం. జిల్లాలో వ్యాక్సిన్ను గురువారం నుంచి వేయనున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎంపిక చేసిన వారికే తొలి దశలో టీకాను అందజేయనున్నారు. 18 ఏళ్లు నిండి షుగర్ వ్యాధితో బాధపడేవారు.. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్మై) 18 కన్నా తక్కువ ఉన్నవారు.. 60 ఏళ్లు నిండిన వారు.. టీబీ కోసం ఇప్పటికే మందులు వాడి కోలుకున్న వారు.. టీబీతో వైద్యం చేయించుకుంటున్న వారందరికీ వ్యాక్సిన్ను వేయనున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులకు సైతం వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి టీబీ వ్యాధిని 2025 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ టీకాను వేయనున్నారు. ఎవరెవరికి టీకాలు వేయాలనే అంశమై వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సర్వే చేసి జాబితాను రూపొందించారు. జిల్లాలోని 667 సచివాలయాల పరిధిలో నర్సింగ్ సిబ్బంది ఈ వ్యాక్సిన్ను ప్రతి గురువారం వేయనున్నారు. ఇప్పటికే మూడు లక్షల డోసుల టీకాలు నెల్లూరు చేరుకోగా, వీటిని అన్ని పీహెచ్సీల పరిధిలో పంపిణీ చేశారు. ఈ విషయమై జిల్లా క్షయ నివారణాధికారి ఖాదర్వలీ మాట్లాడారు. నోడల్ అధికారుల ఆధ్వర్యంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను క్షయరహిత నెల్లూరుగా మారుస్తామని తెలిపారు. నేటి నుంచి ప్రారంభం తొలి దశలో జిల్లా ఎంపిక మూడు లక్షల డోసుల టీకా రాక -
పొగాకు ధరల పరుగు..
డీసీపల్లిలో 910 పొగాకు బేళ్ల విక్రయం ● సరాసరిన రూ.238 వద్ద కొనుగోళ్లు ● కిలో గరిష్ట ధర రూ.300 ● 130 మిలియన్ కిలోలకు అనుమతి ● ఇప్పటికే 42 మిలియన్ కిలోల కొనుగోళ్లు పూర్తి ● వరుసగా మూడో ఏడాదీ రైతులకు లాభాల పంట ● ఎకరానికి రూ.లక్ష లాభంప్లాట్ఫారం పేరు పొగాకు / సరాసరి ధర మిలియన్ల కిలోలు కందుకూరు – 1 5.06 రూ.240.12 కందుకూరు – 2 4.65 రూ.241.04 కలిగిరి 2.81 రూ.239.73 డీసీపల్లి 4.05 రూ.243.12 చీమకుర్తి: పొగాకు రైతుల పంట పండింది. వరుసగా మూడో ఏడాదీ పొగాకుకు ఆశించిన ధర కంటే ఎక్కువగా రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పొగాకు కొనుగోళ్లు ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రారంభం కాగా, మొదటి రోజే కిలో పొగాకు ధర రూ.230 పలికింది. గరిష్ట ధర కిలో రూ.300 వరకు, సరాసరి ధర రూ.238.78 పలికిందని పొగాకు బోర్డు అధికారులు ధ్రువీకరించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలు ఉండగా, వీటి పరిధిలో ఈ ఏడాది 72 వేల హెక్టార్లలో పొగాకును రైతులు సాగు చేశారు. 130 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 వేలం కేంద్రాల్లో 42 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. బ్రైట్ కలర్ పొగాకే కాకుండా పచ్చ, మాడు రంగులో ఉన్న పొగాకు కిలో ధర సరాసరిన రూ.250 పలుకుతోంది. దీంతో రైతుల వద్ద నాణ్యమైన పొగాకుతో పాటు మాడు, పచ్చ వంటి లోగ్రేడ్ పొగాకు కూడా మిగలకుండా బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. వరుసగా మూ డో ఏడాదీ పొగాకు రైతులు లాభాల బాట పట్టారు. నాలుగు వేల హెక్టార్లలో సాగు అదనం జిల్లాలోని కందుకూరులో రెండు, డీసీపల్లి, కలిగిరిలో వేలం కేంద్రాలున్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో 2022 – 23 పొగాకు సీజన్లో వేలంలో రికార్డు ధరలొచ్చాయి. కిలో పొగాకుకు సరాసరిన రూ.214 వరకు పలికింది. ఈ నేపథ్యంలో 2023 – 24లోనూ పొగాకు భారీగా సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే రెండు జిల్లాల్లోని 11 వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 72 వేల హెక్టార్లలో పొగాకు పంట సాగైంది. 2022 – 23లో 68 వేల హెక్టార్లలో సాగైతే, ప్రస్తుతం ఇది 72 వేల హెక్టార్లకు పెరిగింది. ఎకరాకు రూ.లక్షపైనే లాభం ఈ ఏడాది 72 వేల హెక్టార్లలో 23,930 బ్యారన్ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకును సాగు చేశారని అంచనా. ఒక్కో రైతు తన సొంత బ్యారన్తో పాటు మరో రెండు, మూడు బ్యారన్లను అద్దెకు తీసుకొని పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం ఒక్కో ఎకరానికి రూ.లక్షకు తగ్గకుండా లాభాలొస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. నాణ్యత బాగుండటంతో లాభాలపై రైతులు మరింత ఆశలు పెట్టుకున్నారు. క్యూరింగ్లో దాదాపు 70 శాతం పొగాకు బ్రైట్ గ్రేడ్ దిగుబడి వస్తుండగా, 20 శాతం వరకు లోగ్రేడ్, మిగిలినవి ఇతర గ్రేడ్లు వస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగాకు సాగు రైతులకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సీజన్లో ప్రారంభ దశలోనే మంచి ధరలు రావడంతో రైతులు లాభాల బాట పడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు స్థానికంగా వ్యాపారులు పోటీ పడుతుండటం రైతులకు కలిసొస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నాణ్యత మెరుగ్గా ఉండటంతో ఈ సీజన్లో ప్రారంభ ధర రూ.230 పలకగా, అత్యధికంగా రూ.300 వరకు చేరింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రీజియన్ పరిధిలో ప్రస్తుతం 42 మిలియన్ కిలోల కొనుగోళ్లు పూర్తయ్యాయి. గత రెండు సీజన్లలో రైతులకు మంచి రేట్లు రావడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం నాలుగు వేల హెక్టార్లు పెరిగింది. సరాసరి ధర రూ.238.78 పలికింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో కిలో పొగాకు సరాసరి ధర రూ.238.78 పలికింది. కనిష్ట ధర రూ.205.. గరిష్ట ధర రూ.300, ప్రారంభ ధర రూ.230 పలికింది. 130 మిలియన్ కిలోలను కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించగా, ఇప్పటి వరకు 42 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ఆగస్ట్ వరకు కొనసాగనున్నాయి. – లక్ష్మణ్రావు, ఆర్ఎం, టుబాకో బోర్డు, ఒంగోలు మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 910 బేళ్లను బుధవారం విక్రయించారని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 963 బేళ్లు రాగా, వీటిలో 910 విక్రయమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని తెలిపారు. వేలంలో 11,15,242 కిలోల పొగాకును విక్రయించగా, రూ.31,75,4751 మేర వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.299.. కనిష్ట ధర రూ.205.. సగటు ధర రూ.275.55గా నమోదైందని చెప్పారు. వేలంలో 18 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.300 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.300 లభించింది. సాధారణ క్లస్టర్కు చెందిన రైతులు 455 బేళ్లను తీసుకురాగా, 433 విక్రయమయ్యాయి. 22 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి మహేష్కుమార్ మాట్లాడారు. కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.300.. కనిష్ట ధర రూ.205.. సరాసరిగా రూ.270.08 లభించిందని వివరించారు. వేలంలో 14 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. -
వీఎస్యూ కళాశాల ప్రిన్సిపల్గా విజయ
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) కళాశాల నూతన ప్రిన్సిపల్గా విజయ బాధ్యతలను బుధవారం స్వీకరించారు. అందరి సహకారంతో వీఎస్యూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కాకుటూరులోని వీఎస్యూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలను తెలియజేశారు. పది సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్ల విడుదల నెల్లూరు(అర్బన్): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఆన్లైన్లో ప్రభుత్వం విడుదల చేసిందని డీఈఓ రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ ద్వారా bse.ap.gov.in నుంచి హాల్టికెట్లను పొందవచ్చని చెప్పారు. ఇదే వెబ్సైట్ ద్వారా స్ట్రీమ్, జిల్లా, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని ఉపయోగించి నేరుగా సైతం హాల్టికెట్లను పొందవచ్చని పేర్కొన్నారు. లక్ష మందికి పనులే ధ్యేయంపొదలకూరు: జిల్లాలో ఉపాధి హామీ పనులకు రోజూ లక్ష మంది హాజరుకావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని డ్వామా పీడీ వెంకట్రావు పేర్కొన్నారు. మండలంలోని పొదలకూరు పంచాయతీ చిట్టేపల్లిలో ఉపాధి పనులను బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాకు 60 లక్షల పనిదినాలను కేటాయించగా, ఏప్రిల్ నాటికి 15 లక్షల మేర పూర్తి చేశామని వివరించారు. కనీస వేతనంగా ఈ ఏడాది రూ.300ను నిర్ణయించారని.. కూలీలు చేసిన పనుల కొలతలు సక్రమంగా వస్తేనే ఈ మొత్తం గిట్టుబాటవుతుందని చెప్పారు. జిల్లాలో రోజుకు 70 వేల మంది కూలీలు పనులకు హాజరవుతుండగా, ఎన్నికల సందర్భంగా ఇది 51 వేలకు తగ్గిందన్నారు. కూలీల సంఖ్యను పెంచేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నెలాఖరు నాటికి లక్ష మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఏపీఓ మధుసూదన్, టీఏలు సాయి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 6.784 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 220, పిన్నేరువాగుకు ఐదు, లోలెవల్ కాలువకు 70 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. -
పోలింగ్ శాతంలో స్వీప్
నెల్లూరు(దర్గామిట్ట): కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలతో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే ఈసారి పెరిగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆధ్వర్యంలో జిల్లాలో ముమ్మరంగా చేపట్టిన ఓటరు అవగాహన (స్వీప్) కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. ప్రతి గ్రామంలో విస్తృత అవగాహన నోడల్ అధికారులను ప్రత్యేకంగా నియమించి స్వీప్ కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ చేపట్టారు. ఓటు వినియోగం, ఆవశ్యకత, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై ర్యాలీలు.. ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన వాహనాల ద్వారా ప్రచారం చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యంపై విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలు, మానవహారాల ద్వారా ప్రజల్లో అవగాహన ఏర్పడింది. జిల్లా స్థాయి అధికారులు, ప్రముఖులతో ప్రారంభించిన ఓటరు సెల్ఫీ బూత్లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఓటరు సహాయ కేంద్రాలు సైతం పోలింగ్ శాతం పెంపునకు దోహదపడ్డాయి. యువత కోసం మోడల్ పోలింగ్ కేంద్రం.. దివ్యాంగ ఉద్యోగులతో నడిచే పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది ఓటర్లను ఆకర్షించారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి మహిళలకు ఘన స్వాగతం పలికేలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. 79.63 శాతం పోలింగ్ నమోదు 2019 ఎన్నికల్లో జిల్లాలో 76.91 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం 2.72 శాతం పెరిగి 79.63గా నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 2.72 శాతం అధికం సత్ఫలితాలిచ్చిన జిల్లా అధికారుల చర్యలు ఓటరు సహాయ కేంద్రాలతో సౌలభ్యం మహిళా ఓటింగే అధికం నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటింగ్ భారీగా నమోదైంది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్ల ఇదే సీన్ నడిచింది. జిల్లాలో 7,84,219 మంది మహిళలు.. 7,63,894 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవూరు నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ 5791 మేర అధికంగా నమోదైంది. ఉదయగిరి నియోజకవర్గంలో పురుషులు ఎక్కువగా 853 మంది ఓటేశారు. ఆత్మకూరులో 2120 మంది, నెల్లూరు సిటీలో 2891 మంది, నెల్లూరు రూరల్లో 4308 మంది, సర్వేపల్లిలో 2689 మేర అత్యధిక మహిళా ఓటింగ్ నమోదైంది. మహిళా ఓటర్ల తీర్పే గెలుపోటములను శాసించనుంది. ఓట్లు తగ్గినా పెరిగిన పోలింగ్ శాతం నెల్లూరు(దర్గామిట్ట): గత ఎన్నికలతో పోలిస్తే కావలిలో ఓటర్ల సంఖ్య ఈసారి తగ్గింది. అయితే పోలింగ్ 6.84 శాతం మేర పెరగడం విశేషం. గత ఎన్నికల్లో 2,55,371 మంది ఓటర్లకు గానూ 76.19 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి 2,38,553 మంది ఓటర్లకు గానూ 83.03 శాతం పోలింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళలు 2224 మంది అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
జిల్లాలో 4.10 లక్షల జాబ్కార్డులు
ఉపాధితో గ్రామాల్లో ఖుషీఖుషీ ● ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పనిదినాలే లక్ష్యం ● గతేడాది ఖర్చు చేసిన మొత్తం రూ.484 కోట్లు ● కూలీలకు చెల్లించిన నగదు రూ.310 కోట్లు ● 28,894 మందికి 100 రోజుల పనులు ఉపాధి పనులకు హాజరైన కూలీలుసంవత్సరం కల్పించిన పనిదినాలు 2019 – 20 79 లక్షలు 2020 – 21 1.10 కోట్లు 2021 – 22 1.29 కోట్లు 2022 – 23 1.06 కోట్లు 2023 – 24 1.19 కోట్లు కూలీల సంఖ్యను పెంచుతాంఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పనిదినాల లక్ష్యాన్ని కేటాయించారు. దీన్ని పూర్తి చేసిన అనంతరం ఈ సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం రోజుకు 60 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వీరి సంఖ్యను పెంచేలా చర్యలు చేపడుతున్నాం. కూలీలకు సంబంఽధించిన వేతనాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నాం. – వెంకట్రావ్, డ్వామా పీడీ నెల్లూరు(పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు పనులు కల్పి స్తూ వేతనాలను సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో పనులు జోరుగా జరుగుతున్నాయి. వాస్తవానికి 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్ల పనిదినాల లక్ష్యానికి గానూ మార్చి 31 నాటికి 119.73 కోట్ల మేర పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల కోసం రూ.484 కోట్లను ఖర్చు చేశారు. కూలిలకే రూ.310 కోట్లు ఉపాధి పనులకు హాజరైన కూలీలకు సుమారు రూ.310 కోట్లను చెల్లించారు. రోజు వారీ వేతనంగా రూ.259.38ను అందించారు. గతంతో పోలిస్తే ఈ మొత్తం అధికం కావడం విశేషం. చెల్లింపులను వారి ఖాతాలకు జమచేస్తున్నారు. పనుల పర్యవేక్షణకు క్లస్టర్ ఏపీడీలు, ప్రతి మండలంలో ఏపీఓ, ఈసీ, టీఏలు, బీఎఫ్టీలు, ఎఫ్ఏలు అందుబాటులో ఉన్నారు. కూలీలు చేసిన పనుల వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేందుకు వీలుగా కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతి మండలంలో అందుబాటులో ఉన్నారు. 60 లక్షల పనిదినాలు లక్ష్యం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించారు. కూలీలకు రోజుకు రూ.269 వేతనం వచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన అనంతరం మరో 50 లక్షల పనిదినాలను ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉందని డ్వామా అధికారులు తెలిపారు. గడిచిన కొన్నేళ్లలో ఇలా.. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 28,894 మందికి 100 రోజుల పనిదినాలను కల్పించారు. 2020 – 21లో 19,527 మందికి.. 2021 – 22లో 22,627 మందికి.. 2022 – 23లో 17,411 మందికి 100 రోజుల పనిదినాలు లభించాయి. జిల్లాలోని 37 మండలాల్లో 4.10 లక్షల జాబ్ కార్డులు కలిగిన కూలీలున్నారు. జిల్లాలోని రాపూరు, కలువాయి, సైదాపురం, ఉదయగిరి, మర్రిపాడు, వరికుంటపాడు, వింజమూరు, సీతారామపురం, జలదంకి, బోగోలు, గుడ్లూరు, ఉలవపాడు తదితర మండలాల్లో ఉపాధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రోజూ 60 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. సాధారణంగా జిల్లాలో వ్యవసాయ పనులు అధికంగా జరిగే రోజుల్లో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవి తక్కువగా ఉండటంతో ఉపాధి పనులకు కూలీలు అధికంగా హాజరవుతున్నారు. -
కోవిడ్ సమయంలోనూ ఆపన్నహస్తం
కోవిడ్ సమయంలో పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, మాళ్లు ఇలా అన్నీ మూతపడ్డాయి. పనుల్లేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బయటకొస్తే కోవిడ్ బారినపడతామనే భయంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి కూలీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కూలీలను ఉపాధి పనులు ఆదుకున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కూలీలకు పనులను కల్పించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో 1.10 కోట్ల పనిదినాలను కల్పించగా, కూలీలకు వేతనంగా రూ.220 కోట్లకుపైగా మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గూడూరురూరల్: ఎన్నికల కోడ్ జూన్ 4వ తేదీ వరకు అమల్లో ఉన్నందున గూడూరు సబ్ డివిజన్లో సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలను నిషేధించినట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని టవర్క్లాక్ సెంటర్ వద్ద బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ముగిసినా ఫలితాలు వెలువడే వరకు 144 సెక్షన్తోపాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తుగా పోలీసు అనుమతి తప్పనిసరి అన్నారు. అలాగే ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా చిల్లకూరులో జరిగిన ఘటనకు సంబంధించి విచారణ మొదలెట్టామని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
మనుబోలు: రైల్లోంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మనుబోలు మండలం కొమ్మలపూడి, మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల మేరకు కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని 148/1–3 కిలోమీటర్ వద్ద అప్ లైన్ ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతను బ్లూ కలర్ కాటన్ జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవచ్చని భావిస్తున్నారు. రైల్వే ఎస్సై హరిచందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement