-
Yevam Review: యేవమ్ మూవీ ఎలా ఉందంటే..?
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వికారాబాద్ చెందిన సౌమ్య(చాందిని చౌదరి) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదిస్తుంది. తను ఆ జాబ్ చేయడం తండ్రి, సోదరుడికి అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా సౌమ్య ఉద్యోగాన్ని వదులుకోదు. తన పై అధికారి అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు ఎనలేని అభిమానం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొనే పోలీసు వృత్తిని ఎంచుకుంటుంది. సౌమ్య ఉద్యోగంలోకి చేరిన కొద్ది రోజులకే వికారాబాద్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. యుగంధర్(వశిష్ట సింహ) అనే ఓ వ్యక్తి హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి..హత్యలు చేస్తుంటాడు. ఈ కేసును సౌమ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అభికి సమాచారం యుగంధర్ని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యుగంధర్ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? అసలు ఎవరీ యుగంధర్? హీరోల పేర్లు చెప్పి ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు? అభికి యుగంధర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసును సౌమ్య ఎలా డీల్ చేసింది? చిత్రానికి యేవమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సైకో థ్రిల్లర్ని, స్ల్పిట్ పర్సనాలిటీ కలిపి కథగా మార్చుకున్నాడు దర్శకుడు ప్రకాష్ దంతులూరి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉన్నా.. తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. డిఫరెంట్ స్క్రీన్ప్లేతో మాయ చేసేందుకు ప్రయత్నించాడు. కథ ప్రారంభంలోనే యుగంధర్ నైజం ఏంటో అర్థమైపోతుంది. అఘరెడ్డి బెడ్ సీన్తో కథను ప్రారంభించి.. ఆ తర్వాత స్టోరీని వికారాబాద్ పోలీసు స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అభి, సౌమ్య పాత్రల పరిచయం..వారి నేపథ్యం చాలా సింపుల్గా, రొటీన్గా ఉంటుంది. ప్రభాస్ పేరు చెప్పి ఓ అమ్మాయిని ట్రాప్ చేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా యుగంధర్ వరుసగా హీరోలను పేర్లు చెబుతూ అమ్మాయిలను ట్రాప్లోకి దించడం బోర్ కొట్టిస్తుంది.మరోవైపు అభి-సౌమ్యల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. అసలు సౌమ్య అభిలో ఏం చూసి ఇష్టపడిందనే పాయింట్ని బలంగా చూపించలేకపోయారు. సైకోని పట్టుకునేందుకు సౌమ్య ఇచ్చే సలహాలు కూడా సింపుల్గానే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పటికే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రేక్షకుడికి ఇంటర్వెల్ బ్యాంగ్ షాకిస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఊహకందేలా సాగుంది. సైకో పక్కన తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం.. అతని కవ్వింపు చర్యలు అవన్నీ రొటీన్ సైకో థ్రిల్లర్స్లాగే ఉంటాయి. సౌమ్య సైకోని ఎలా పట్టుకొంది? ఎలా గుర్తించింది? అనేది మరింత బలంగా చూపిస్తే బాగుండేది. అక్కడ రివీల్ చేసే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోలేదు. తెలంగాణ ఒగ్గు కథ పాటతో ఓ ప్రధాన సన్నివేశాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్. స్క్రీన్ప్లే మాదిరి కథను కూడా ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. తొలిసారి చాందిని పోలీసులు పాత్రను పోషించి మెప్పించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు. అభిగా భరత్ రాజ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఆ పాత్రలో తెలిసిన నటుడైతే బాగుండేది. కానిస్టేబుల్గా గోపరాజు రమణ తో పాటు మిగిలిన నటీనటులతో తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
‘హరోం హర’ మూవీ రివ్యూ
టైటిల్: హరోం హరనటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులునిర్మాత : సుమంత్ జి నాయుడురచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారకసంగీతం: చైతన్ భరద్వాజ్ఎడిటర్ : రవితేజ గిరిజాలవిడుదల తేది: జూన్ 14, 2024వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఉంటాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హరోం హర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. (Harom Hara Review) ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని కొంతమంది దుర్మార్గులు తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను హింసించడం.. అక్కడకు హీరో సాధారణ వ్యక్తిలా వచ్చి వారిని అంతమొందించి ప్రజలకు విముక్తి కలిగించడం.. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. హరోం హర మూవీ లైన్ కూడా ఇదే. కేజీయఫ్, పుష్ప సినిమాల మాదిరి హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. (Harom Hara Review)సినిమా ప్రారంభం మొదలుకొని క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం.. పుష్ప, కేజీయఫ్, ఛత్రపతి సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక విలన్లు చేసే అరాచకాలు చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. కేజీయఫ్ స్టైల్లో పళని(సునీల్) హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథను ప్రారంభిస్తాడు. తమ్మిరెడ్డి, శరత్ పరిచయ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. హీరో ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది. హీరోయిన్తో లవ్ట్రాక్ నడిపిస్తూనే.. ఊర్లో తమ్మిరెడ్డి మనుషుల ఆగడాలను చూపిస్తారు. అయితే అటు లవ్ ట్రాక్తో పాటు రొట్టకొట్టుడు విలనిజం బోర్ కొట్టిస్తుంది. హీరో గన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యేవరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని ఫైట్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక హీరో తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం.. యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నీరసంగా సాగుతుంది. కేజీయఫ్, విక్రమ్ మాదిరి యాక్షన్స్ సీన్స్ వస్తుంటాయి కానీ ఎక్కడా ఆకట్టుకోలేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, అమితాబ్ అంటూ పేర్లు పెట్టి కొత్త తుపాకులను అమ్మడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (Harom Hara Movie Review) ఇక చివర్లో జ్యోతిలక్ష్మి(హీరో ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద గన్)తో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా నేపథ్యంతో పాటు పాత్రలను తిర్చిదిద్దిన విధానం.. పలికించిన భాష, యాస అన్ని పుష్స సినిమాను గుర్తు చేసేలా ఉంటాయి. మాస్ యాక్షన్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సుబ్రమణ్యం పాత్రలు సుధీర్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో సుధీర్ నటించలేదు. యాక్షన్ సీన్స్లో చించేశాడు. మాళవిక శర్మ తెరపై కనిపించేదే కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. పోలీసు ఆఫీసర్గా అక్షర గౌడ తన పాత్ర పరిధిమేర నటించింది. సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ పళనిస్వామిగా సునీల్, విలన్లుగా రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. (Harom Hara Movie Review) హీరో తండ్రిగా నటించిన జయప్రకాశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యూజిక్ షాప్ మూర్తినటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులునిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటిరచన & దర్శకత్వం: శివ పాలడుగు సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగంఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డివిడుదల తేది: జూన్ 14, 2024‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథేంటంటే.. పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన మూర్తి(అజయ్ ఘోష్)..అదే గ్రామంలో మ్యూజిక్ షాప్ రన్ చేస్తుంటాడు. వయసు 52 యేళ్లు. మొదటి నుంచి మ్యూజిక్ షాప్ లోనే పని చేయడంతో...లాభాలు లేకున్నా...అదే పని చేస్తుంటాడు. భార్య జయ(ఆమని) ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముతూ..ఇద్దరి కూతుళ్ళని చదివిస్తుంది. మ్యూజిక్ షాప్ అమ్మి..మొబైల్ షాప్ పెట్టాలని జయ కోరిక.ఈ వయసులో కొత్త పని నేర్చుకునే కంటే...30 ఏళ్లుగా పని చేస్తున్న మ్యూజిక్ లోనే కొత్తగా ట్రై చేయాలని మూర్తి కోరిక. ఓ బర్త్డే పార్టీలో ఆయన పాటలు మిక్స్ చేసి ప్లే చేసిన విధానం అందరికి నచ్చి..డీజే అవ్వొచ్చు కదా అని సలహా ఇస్తారు. డీజే అయితే తనకు నచ్చిన పని చేస్తూనే బాగా డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చని..ఆన్లైన్లో డీజే కోర్స్ గురించి తెలుసుకుంటుంటాడు.మరో వైపు అమెరికా నుంచి తిరిగి ఇండియా కి వచ్చిన అంజన( చాందినీ చౌదరి) కి డీజే నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంటుంది. అది ఆమె తండ్రి(భానుచందర్) కి నచ్చదు. తండ్రి అనుమతి తో డీజే అవ్వాలనుకుంటుంది. ఓ సందర్భంలో మూర్తిని కలిసిన అంజనా....మ్యూజిక్ పై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి డీజే నేర్పించాలనుకుంటుంది. అంజనాని గురువుగా భావించిన మూర్తి..ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని డీజే వాయించడం పూర్తిగా నేర్చుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మూర్తి డీజే అవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకు? అంజన, మూర్తి మధ్య ఉన్న సంబంధాన్ని సమాజంతో పాటు కుటుంబ సభ్యులు ఎలా తప్పుపట్టారు? అంజనా తండ్రి ముర్తిపై ఎందుకు కేస్ పెట్టాడు? డీజే అవ్వడం కోసం హైదరాబాద్ కి వచ్చిన మూర్తికి ఎదురైన కష్టాలు ఏంటి? ఫేమస్ డీజే డెవిల్(అమిత్ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? చివరకు 52 ఏళ్ల మ్యూజిక్ షాప్ మూర్తి.. ఫేమస్ డీజే మూర్తిగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథల్లో పెద్దగా ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా..తెరపై చూడాలనిపిస్తుంది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథ కూడా అంతే. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే కాస్త ఆలోచిస్తే..ఇంటర్వెల్ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఈజీగా అంచనా వేయ్యొచ్చు. అయినా కూడా తెరపై చూడాలనిపిస్తుంది. అలా అని ఈ కథ కొత్తదేమి కాదు. చాలా రోటీన్, సింపుల్ కథే. హీరో ఒకటి సాధించాలనుకుంటాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే కష్టాలు..వాటిని అధిగమించి చివరకు విజయం సాధించడం.. ఇదే మ్యూజిక్ షాప్ మూర్తి కథ.అయితే ఈ సినిమాలో హీరోకి 52 ఏళ్లు. ఆ వయసులో తన గోల్ని నెరవేర్చుకోవడమే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అనేది చాలా ఎమోషనల్గా తెరపై చూపించాడు దర్శకుడు శివ పాలడుగు. కథనం రొటీన్గా సాగించినా.. ఎమోషన్ బాగా పండించి.. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ కథకి హీరోగా అజయ్ ఘోష్ని ఎంచుకోవడమే దర్శకుడి మొదటి విజయం. ఓ యంగ్ హీరోని పెట్టి ఈ కథ చెబితే.. రొటీన్గా అనిపించేంది. కానీ వయసు మీద పడిన వ్యక్తి కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఓ పది నిమిషాల తర్వాత కథనం ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే నేర్చుకోవడం కోసం చేసే అతను సాధన చూపించారు. ఓ ఎమోషనల్ సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండాఫ్ మరింత ఎమోషనల్గా సాగుతూనే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. డీజే అవ్వడానికి మూర్తి పడే కష్టాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీక్లైమాక్స్ కన్నిళ్లను తెప్పిస్తాయి. క్లైమాక్స్ బాగున్నా..ఎందుకో కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ఓవరాల్గా మ్యూజిక్ షాప్ మూర్తి జర్నీ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తుంది. ‘మొదటి ప్రయత్నానికే విజయం సాధించాలి..అది అవ్వకపోతే వదిలేసి..వేరే పని చేసుకోవాలి’అని ఆలోచించే నేటితరం యువతకి మూర్తి కథ ఆదర్శం అవుతుంది.ఎవరెలా చేశారంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందరిని మెప్పిస్తున్న అజయ్ ఘోష్ ఇందులో లీడ్ రోల్ చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాభై ఏళ్లు పైబడిన మధ్యతరగతి వ్యక్తి మూర్తి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఒక్క పక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించాడు. టైటిల్ సాంగ్కి స్టైప్పులేసి ఆకట్టుకున్నాడు. ఇక అంజనా పాత్రకి చాందిని చౌదరి న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించిన గురువు పాత్ర తనది. ఆమె పాత్ర చెప్పే కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్య జయగా ఆమని చక్కగా నటించింది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నానితో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. పవన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
Rakshana Review: పాయల్ రాజ్పుత్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది?
టైటిల్: రక్షణనటీనటులు: పాయల్ రాజ్పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులునిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్దర్శక-నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్సంగీతం: మహతి సాగర్సినిమాటోగ్రఫీ: అనిల్ బండారిఎడిటర్: గ్యారి బి హెచ్విడుదల తేది: జూన్ 7, 2024ఆర్ఎక్స్ 100, ‘మంగళవారం’సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పాయల్ రాజ్పుత్. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘రక్షణ’. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా..పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. మంచి అంచనాలతో నేడు(జూన్ 7)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్లో పెడతాడు. దీంతో కిరణ్కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి. ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్కి ఆ సైకో కిల్లర్కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. నగరంలో వరుస హత్యలు జరగడం.. ఆ హత్యల వెనుక ఓ కిల్లర్ ఉండడం.. అతన్ని పట్టుకునేందుకు హీరో/హీరోయిన్ రంగంలోని దిగడం..తన తెలివితేటలన్నీ ఉపయోగించి చివరకు ఆ సైకో కిల్లర్ని అంతమొందించడం.. సైకో థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలన్నీ ఇంచుమించు ఒకే మూసలో సాగుతాయి. దీంటో హత్యలు జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో/హీరోయిన్ ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘రక్షణ’ విషయంలో ఇది కొంతవరకే సఫలం అయింది. సైకో కిల్లర్.. అతని నేపథ్యం ఉత్కంఠభరితంగా ఉన్నా.. కథానాయికా చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉండదు. ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్తో పాయల్ పాత్రను పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంటనే తన ప్లాష్బ్యాక్లోకి వెళ్లి.. స్నేహితురాలి హత్యను చూపించి..అసలు కథను ప్రారంభించారు. సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు చూపించకుండా కథపై ఆసక్తిని పెంచాడు. ఆ తర్వాత వెంటనే అర్జున్ పాత్రని చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేశాడు. ఫస్టాఫ్ అంతా అర్జున్, కిరణ్ల చుట్టే తిరుగుతుంది. అర్జున్ పట్టుకునేందుకు కిరణ్ చేసే ప్రయత్నం మెప్పించదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత..అసలు అతను ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సైకో కిల్లర్ ప్లాష్బ్యాక్ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు పెరెంట్స్ని ఆలోచింపజేస్తుంది. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై కూడా దర్శకుడు ఓ మంచి సందేశాన్ని అందించాడు. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై గ్లామర్గా కనిపించిన పాయల్.. ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. ఏసీపీ కిరణ్ పాత్రలో ఒదిగిపోయింది. హీరో స్థాయిలో యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. తెరపై సరికొత్త పాయల్ని చూస్తారు. బిగ్బాస్ ఫేం మానస్ తొలిసారి నెగెటివ్ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్ అరుణ్ పాత్రకి మానస్ పూర్తి న్యాయం చేశాడు. రామ్ పాత్రకి రోషన్ బాగా సెట్ అయ్యాడు. రాజీవ్ కనకాల, శివన్నారాయణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. మహతి సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల టెన్షన్ పెట్టాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత ఒక్కరే కావడంతో సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ నచ్చుతుంది. -
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్హ్యాండెడ్గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్తో పాటు ఎమోషనల్గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్లోని మరో యాంగిల్ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5 -
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ
టైటిల్: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్కు గణేష్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్ అయిన గణేష్..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ (ప్రిన్స్ యావర్) గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్ ఓ గణేశ్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్(వెన్నెల కిశోర్) కారణంగా రుద్రా గ్యాంగ్తో పాటు గణేష్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్ చివరకు ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్తో హిలేరిస్గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్ రెడ్డి ట్రాక్.. మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్, డైమండ్ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డైమండ్గా వెన్నెల కిశోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్ గ్యాంగ్కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్ నడిపే లవ్ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్లో స్వామిజీ(రంజగన్)ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్ క్లైమాక్స్ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. డ్యాన్స్తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. ఇక జబర్థస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్గా వెన్నెల కిశోర్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
Gam Gam Ganesha X Review: ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే..
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూగా గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు నేడు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గం..గం..గణేశా ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేద్దాం. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్లో గం..గం..గణేశాకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ అని అంటున్నారు. #GamGamGanesha 🏆🏆🏆🏆 A Proper Commercial Thriller Package from Anand deverkonda 👌Entertaining First Half and Thrilling Second Half with good Climax works big time 💥 Emmanuel , Krishna Chaitanya was best in their roles 🔥#GGG pic.twitter.com/HgfRVL9RTm— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 31, 2024 ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ గం..గం..గణేశా. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ ఉంది. సెకండాఫ్ థ్రిల్లింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ బాగుంది. ఇమ్మాన్యుయేల్, కృష్ణ చైతన్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GamGamGanesha A Complete Fun Entertainer 🏆@ananddeverkonda Steals The Show With His Brilliant Performance 👏Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & CharacterisationsMusic & Cinematography Are Of Top Notch Quality 👌 pic.twitter.com/rGmF8sM5uw— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024 గం..గం..గణేశా ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. ఆనంద్ దేవరకొండ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ ఉదయ్ నెరేటివ్ స్టైల్తో పాటు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#GamGamGanesha is a 'Sit-back and Relax' fun Crime Comedy. Situational comedy works superbly & Vennala Kishore Track was 🤣. BGM 🔥Despite its known story, Kudos to @udaybommisetty for his brilliant execution! @ananddeverkonda HIT Streak continues! ✌️ pic.twitter.com/GqiSbcLxf0— The Creative Shelf (@tcsblogs) May 31, 2024 గం గం గణేశా మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫన్ క్రైమ్ కామెడీ. వెన్నెల కిషోర్ సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి కథనాన్ని నడించిన తీరు బాగుంది. ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. #GamGamGanesha Day 🔥UK reviews bagunavi 😍Another BB loading............#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9— Mahesh (@starmahesh10) May 31, 2024#GamGamGaneshaReview:Simple story but missing content.Comedy is ok in some scenes.#AnandDeverakonda trying his best in plots but this time it's not up to the mark, #Immanuel #VennalaKishore are big plus.He always trying new appreciate for that.#GamGamGanesha#GangsOfGodavari pic.twitter.com/ko7QQYNZmg— MJ Cartels (@Mjcartels) May 31, 2024#GamGamGanesha Premiere Review from UK 🇬🇧 pic.twitter.com/f6W0Hn9LFu— Anonymous (@__GirDhar) May 31, 2024Positive reviews every where another hit loading ❤️🔥Congrats @ananddeverkonda anna #GamGamGanesha pic.twitter.com/hSHsbL4fcN— sashanth (@sashant39979304) May 31, 2024#GamGamGaneshaReviewPositives: • Situational Comedy 😂• Vennala Kishore Track 🤩• Characters & Characterisations 💥• Engaging Screenplay 💯• Decent Twists 🤗• Superb BGM 🥵Negatives: • Artificial First 15mins • Weak Villain Characterization• Few Acting &… pic.twitter.com/ozh13EbQ8z— Movies4u Official (@Movies4u_Officl) May 31, 2024 -
Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
టైటిల్: లవ్ మీనటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులునిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డిదర్శకుడు: అరుణ్ భీమవరపుసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్విడుదల తేది: మే 25, 2024దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్)అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్కి చెబుతుండగా.. అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే.. బేస్మెంట్ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్గా తీర్చిదిద్దినా..ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్ బ్యాక్ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్లెస్గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్టైన్మెంట్ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించొచ్చు. ఎవరెలా చేశారంటే.. అశీష్ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. సీన్కి తగ్గట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్ లెన్త్ రోల్ తనది. సంయుక్త మీనన్ ఒకే ఒక్క షాట్లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టైటిల్: C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) నటీనటులు: అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా నిర్మాణ సంస్థ: SSCM ప్రొడక్షన్స్దర్శకుడు: కృష్ణ అన్నంసంగీతం: ఆర్ఆర్ ధృవన్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటర్: సత్య గిడుతూర్విడుదల తేది: మే 24, 2024ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక చాలా కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన తాజా చిత్రం ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ నేడు (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సిద్ధు(విశ్వంత్)కి దెయ్యాలు అంటే చాలా భయం. ఓ సారి అమ్మానాన్నలు ఊరికి వెళ్లడంతో ఒంటరిగానే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఒంటరిగా డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి సిద్ధు మరింత బయపడిపోతాడు. సినిమాలోని దెయ్యం బయటకు వచ్చి తనను చంపేస్తుందని బయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలోనే అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ భయాన్ని పుట్టిస్తుంది. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ కిడ్నాపులు చేస్తుంటుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా..ఆమె దొరకదు. అలా తప్పించుకుంటూ చిరవకు విశ్వంత్ కోసం వచ్చి, అతని ఇంట్లోనే ఉంటుంది. విశ్వంత్కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? చివరకు పోలీసులు ఏం చేశారు? అన్నది కథ.ఎలా ఉందంటే.. హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమానే ఈ C.D. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఈ కథంతా ఒకే చోట జరుగుతుంది. దీంతో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లు మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి కానీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను భయపెట్టడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇల్లాజికల్గా అనిపిస్తాయి కానీ అవి ఎందుకు పెట్టారనేది చివర్లో తెలుస్తుంది. ఇంటర్వెల్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఇక ద్వితియార్థంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. ఆదా వర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. రక్ష పాత్రలో ఆమె ఒదిగిపోయింది. చూపుల్తోనే అందరిని భయపెట్టేసింది. యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పోలీస్ ఆఫీసర్గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతిక విషయాలకొస్తే..ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్ఆర్ ధృవన్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘డర్టీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: డర్టీ ఫెల్లోనటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులునిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: జి.యస్. బాబుదర్శకత్వం: ఆడారి మూర్తి సాయిసంగీతం: డాక్టర్. సతీష్ కుమార్.పి.సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్. ఎడిటర్ : జేపీవిడుదల తేది: మే 24, 2024ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మాఫియా డాన్ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్మెంట్స్ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్గా ఉండొచ్చని శంకర్ నారాయణ కుట్ర చేస్తాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు? మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాఫీయా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా యాడ్ చేయడంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అయితే ప్లాష్బ్యాక్ సీన్లు మాత్రం కాస్త గందరగోళానికి గురి చేస్తాయి. కథ ప్రస్తుతం జరుగుతుందా లేదా ప్లాష్ బ్యాక్ చెబుతున్నారా అనేది కొన్ని చోట్ల అర్థం కాదు. అలాగే కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. ఫస్టాఫ్లో కథనం చాలా ఫాస్ట్గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్ సాంగ్... హీరోయిన్లతో రొమాన్స్ అన్ని యూత్ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో మాఫియా డాన్ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. అయితే అతను మాఫియా డాన్గా ఎలా ఎదిగాడనేది చూపించకుండా.. డైరెక్ట్గా డాన్గానే చూపించడంతో ఆ పాత్రకు అనవసరపు ఎలివేషన్స్ ఇచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్లో జేపీ ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్ మూవీ. స్క్రీన్ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సిద్దు, డర్టీ ఫెల్లో పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్లోనూ అదరగొట్టేశాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్ మెప్పించాడు. ఇక నాగి నీడు చాలా రోజుల తరువాత అందరినీ లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ మూడు పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందరూ తమ పరిధి మేరకు నటించారు.సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. డాక్టర్. సతీష్ కుమార్.పి సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్తో పాటు మరో పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా ఎక్కువగా ఔట్డోర్స్లోనే షూట్ చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
టైటిల్: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్ఎడిటర్ : అఖిల్ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్ సినిమా మాదిరి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్ విజయ్) ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్టైనింగ్ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్గా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీప్ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎంటర్టైన్ కావడానికి వీకెండ్లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.ఈగోస్తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్ విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘మిరల్’ మూవీ రివ్యూ
టైటిల్: మిరల్నటీనటులు: భరత్, వాణి భోజన్, కే.ఎస్ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్కుమార్, కావ్య అరివుమణి తదితరులునిర్మాణ సంస్థ: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీనిర్మాత: సీహెచ్ సతీష్ దర్శకుడు: ఎం శక్తివేల్సంగీతం: ప్రసాద్ ఎస్ఎన్సినిమాటోగ్రఫీ:సురేష్ బాలాఎడిటర్: కలైవానన్ ఆర్ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో భరత్. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తమిళ్లో 2022లోనే విడుదలై మంచి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత అదేపేరుతో తెలుగులో విడుదల చేశారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ని ఇటీవల విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(మే 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సివిల్ ఇంజనీరింగ్ హరి(భరత్), రమ(వాణి భోజన్)లది ప్రేమ వివాహం. ఓ అపరిచితుడు ముసుగు వేసుకొని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమకు కల వస్తుంది. అదే నిజం అవుతుందని రమ భయపడుతుంది. ఇదే సమయంలో హరి ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటాడు. జాతకంలో దోషం ఉందని రమ తల్లి చెప్పడంతో తమ స్వస్థలంలో ఉన్న కులదైవానికి పూజలు చేయాలని ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. స్నేహితుడు ఆనంద్ ఫ్యామిలీని కూడా అక్కడకు రప్పిస్తాడు హరి. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్యమైన పని కోసం అర్థరాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా నిజంగానే ముసుగు వేసుకున్న వ్యక్తి హరి ఫ్యామిలీపై దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడు? రమ కలలోకి ముసుగు వేసుకుంటున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హరి ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?హారర్, సస్పెన్స్ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. అయితే కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ భయపెట్టే విధంగా ఉంటేనే.. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు ఎం శక్తివేల్ కూడా ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మిరల్ కథను రాసుకున్నాడు. అయితే రాసుకున్న పాయింట్ని తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. సస్పెన్స్ పేరుతో అసలు కథను దాచి.. అనవసరపు సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగదీశాడు. కేవలం భయపెట్టడానికే కొన్ని సీన్లను రాసుకున్నాడు కానీ.. అసలు కథని ఆ సీన్లకి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే సెకండాఫ్లో అసలు మ్యాటర్ రివీల్ అయిన తర్వాత కథపై ఆసక్తిపెరుగుతంది. ప్రారంభం నుంచి ప్రీక్లైమాక్స్ వరకు సినిమాపై ఉన్న ఓ అభిప్రాయం.. ఆ తర్వాత మారిపోతుంది. ప్రేక్షకుడు ఊహకందని విధంగా చివరి 20 నిమిషాల కథనం సాగుతుంది. అయితే ఈ సస్పెన్స్, థ్రిల్లర్కి హారర్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం.. దానికి గల కారణం కూడా అంత కన్విన్సింగ్ అనిపించదు. చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యారు. కొన్ని సీన్లకు సరైన ముగింపే ఉండదు. ఇక ఈ సినిమాకు మరో ప్రధానమైన లోపం డబ్బింగ్. కొన్ని సన్నివేశాల్లో అక్కడ జరుగుతున్న దానికి.. చెప్పే డైలాగ్స్కి సంబంధమే ఉండడు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. కొన్ని చోట్ల సన్నివేశాలకు సంబంధం లేకుండా బీజీఎం ఉంటుంది. సెకండాఫ్లో మాత్రం కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హరి పాత్రలో భరత్ జీవించేశాడు. మంచి భర్తగా, బాధ్యతాయుత కుటుంబ పెద్దగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమగా వాణి భోజన్ చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా నటించిన కేఎస్ రవికుమార్.. తనకున్న నటనానుభవంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. మీరాకృష్ణన్, రాజ్కుమార్, కావ్య అరివుమణితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
The Marvels Movie Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మార్వెల్కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ. ఎలా ఉందంటేమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్ను పవర్ ఫుల్ విలన్గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు. ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. -
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్లో కథంతా సీరియస్ మూడ్లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి. -
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ
టైటిల్: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్ గణేష్(అల్లరి నరేశ్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్బ్యాక్.. క్లైమాక్స్లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్బ్యాక్.. క్లైమాక్స్లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్గాను నడిపించలేకఓ యాక్షన్ సీన్తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్ హీరో రేంజ్లో బిల్డప్ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్ మూడ్లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్గా అనిపించదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘శబరి’ మూవీ రివ్యూ
టైటిల్: శబరినటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బేబీ నివేక్ష తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్రచన-దర్శకత్వం: అనిల్ కాట్జ్సంగీతం: గోపి సుందర్సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిఎడిటర్: ధర్మేంద్ర కాకరాలవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్లో సింగిల్గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది. అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. శబరిలోనూ ఆ రెండు ఉన్నాయి. కానీ డైరెక్టర్ కథను డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టు అల్లుకున్న కథ.. రాసుకున్న స్క్రీన్ప్లే అంతగా అకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి చేసే పొరాటం ఆకట్టుకుంటుంది.సిటీలో ఓ మెంటల్ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని వచ్చి ఇద్దరిని చంపి, సంజన కోసం వెతికె సీన్తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత కథను రెండేళ్ల ముందుకు తీసుకెళ్లాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటెల్డ్గా చూపించడంతో కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సింపుల్గా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ సూర్య గురించి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం మళ్లీ రొటీన్గానే సాగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ కాస్త థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. లాజిక్స్పై దృష్టిపెట్టి స్క్రీన్ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్గా గణేష్ వెంకట్రామన్ చక్కగా నటించాడు. లాయర్గా శశాంక్, పోలీసు అధికారి శంకర్గా మధుసూధన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. కానీ అవి గుర్తించుకునేలా ఉండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వంనటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటిసంగీతం: రీఎడిటర్: శశాంక్ వుప్పుటూరివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘పారిజాత పర్వం’ కథేంటంటే?చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్గాను, ఇటు కమెడియన్గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్: తెప్పసముద్రంనటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలునిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్సంగీతం: : పి.ఆర్ సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లిఎడిటర్: సాయిబాబు తలారివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘తెప్పసముద్రం’ కథేంటంటే..తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది.చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది. రొటీన్ లవ్స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ
టైటిల్: మెర్సీ కిల్లింగ్ నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు. నిర్మాణ సంస్థ: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల దర్శకత్వం: వెంకటరమణ ఎస్ సినిమాటోగ్రఫీ: అమర్.జి సంగీతం: ఎం.ఎల్.రాజ ఎడిటర్: కపిల్ బల్ల విడుదల తేది: ఏప్రిల్ 12, 2024 కథేంటంటే.. స్వేచ్ఛ (హారిక) ఓ అనాథ అమ్మాయి. తన తల్లిదండ్రులు ఎవరనేది తెలియక.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక.. తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె మహేశ్(పార్వతీశం) భారతి (ఐశ్వర్య)లను కలుసుకుంటుంది. వాళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం అదించారు? పెరెంట్స్ కోసం వెతుకున్న స్వేచ్ఛకు రామకృష్ణమ్ రాజు(సాయి కుమార్) ఎలా పరిచయం అయ్యాడు? ఆయన నేపథ్యం ఏంటి? రామకృష్ణమ్ రాజు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు స్వేచ్ఛ తన పేరెంట్స్ని కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒడిగిపోయింది. అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కుమార్ కు ఈ సినిమా మరో ప్రస్థానం అని చెప్పవచ్చు. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. బసవరాజు పాత్రలో రామరాజు బాగా నటించాడు, అలాగే జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఎలా ఉందంటే.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు వెంకటరమణ ఎస్. ఇలాంటి సబ్జెక్ట్స్ని డీల్ చేయడం కొందరికే సాధ్యం. ఆ విషయంలో దర్శకుడు వెంకటరమరణ కొంతమేర సఫలం అయ్యాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్ కొంతమేర సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం వేగంగా సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్గా ఉంటుంది. జి.అమర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, సాంగ్స్, కాకినాడ లోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా సహజంగా చూపించారు. ఎం.ఎల్.రాజా సంగీతం బాగుంది. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా మెర్సీ కిల్లింగ్ సినిమాను నిర్మించారు. -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. గుడ్నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ
టైటిల్: మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రచన, దర్శకత్వం: చిదంబరం సంగీతం: సుశీన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్ విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమ్మల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కథేంటంటే.. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్ బాయ్స్ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే.. మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కొడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథంతా సింపుల్గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్గా సాగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించిన తర్వాత సుభాష్పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్ అవుతుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్కు ఢోకా లేదు కానీ..
‘ది ఫాబెల్మ్యాన్స్’ డైరెక్టర్తో ఎమిలీ బ్లంట్ కొత్త మూవీ!
ఆ వీడియోపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరోయిన్
పెరగనున్న చక్కెర ధర
స్టీరింగ్ పట్టిన యంత్రుడు!
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
నడిరోడ్డులో ఈ బిల్డప్ అవసరమా? ఇంకెక్కడా చోటే లేదా బాస్?! వైరల్ వీడియో
డెరివేటివ్స్లో ట్రేడింగ్ వద్దు
మహీంద్రా XUV 700 పై భారీ డిస్కౌంట్
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్
Advertisement