విశ్వాసపరీక్షలో నెగ్గిన సైనీ | Sakshi
Sakshi News home page

విశ్వాసపరీక్షలో నెగ్గిన సైనీ

Published Thu, Mar 14 2024 6:37 AM

Haryana CM Nayab Saini wins trust vote - Sakshi

చండీగఢ్‌: ఖట్టర్‌ రాజీనామాతో హరియాణా సీఎం కుర్చీపై కూర్చున్న నాయబ్‌ సింగ్‌ సైనీ బుధవారం అసెంబ్లీ చేపట్టిన విశ్వాస పరీక్షలో గెలిచారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనే స్వయంగా విశ్వాస పరీక్షకు గవర్నర్‌ను అభ్యరి్ధంచి శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగేలా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక సంకీర్ణ ప్రభుత్వం నుంచి జననాయక్‌ జనతాపారీ్ట(జేజేపీ) వైదొలగడం, సీఎంగా ఖట్టర్‌ రాజీనామా చేయడం, నూతన సీఎంగా సైనీ ప్రమాణం చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్షలో పాల్గొనకుండా 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు జేజేపీ విప్‌ జారీచేసింది.

అయినాసరే ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. కానీ తీరా బలపరీక్షపై ఓటింగ్‌ జరిగే సమయానికి బయటకు వెళ్లిపోయారు. విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు. రెండుగంటల చర్చ తర్వాత తీర్మానంపై ఓటింగ్‌ను స్పీకర్‌ అనుమతించారు. మూజువాణి ఓటుతో తీర్మానం నెగ్గింది. 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది సొంత ఎమ్మెల్యేల బలముంది. మరో ఏడుగురు మద్దతు పలికారు. బుధవారం 12 మంది సభకు రాకపోవడంతో సభలో సభ్యుల సంఖ్య 78కి, మెజారిటీ మార్కు 40కి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్‌ బలపరీక్షలో నెగ్గడం లాంఛనమైంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement