-
CM Jagan: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!!
బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం అదిరిన తీరు అదరహో అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అయి ఉండాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా, అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాదానం ఇచ్చారని చెప్పాలి. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాన్ని ఆయన బహిర్గతం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్లో ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా, సంస్కారవంతమైన విమర్శలు, అర్దవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. చంద్రబాబు నాయుడు ఈ మద్య కాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలను వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ తన పరువు పోగొట్టుకుంటున్నారు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్నా, ఆయన తన వైఖరి మార్చుకోవడం లేదు. తాము గతంలో ఏమి చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డిను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు దత్తపుత్రుడుగా పేరొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు సంగతి సరేసరి. ఆయన ఎప్పుడూ స్పీచ్లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటెన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాలను సవ్యమైన బాషలో వివరించారు. తొలిరోజు ఆయన తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ప్రారంభించారు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడకు వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు'. ఎప్పటిమాదిరి నుదుట ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. అక్కడ నుంచి బయల్దేరి వేంపల్లి, వీరపనాయుని పల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు స్వాగతం చెప్పారు. "కొందరైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న బస్తో పాటు పరుగులు తీస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డిను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టింది". కడప లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి వివేకా హత్య కేసు గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి, చిన్నాన్నను ఎవరో చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలందరికి తెలుసునని అన్నారు. 'వివేకాను చంపి, తానే చంపానని చెప్పుకుంటున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు'. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతలను పేర్లు చెప్పకుండానే వారి గురించి మాట్లాడుతూ, 'రాజకీయ స్వార్దంతో తపిస్తున్న నా చెల్లెళ్లు" అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, చెల్లెళ్లు హంతకులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ఆయన చెల్లెళ్లను తప్పు పట్టారు. ఇదంతా నన్ను దెబ్బతీసే రాజకీయం అని కూడా అంటున్నారంటే.. ఇది కలియుగం అని అనుకోవాల్సి వస్తుందని తాత్వికంగా వ్యాఖ్యానించారు. దీంతో.. "వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి షర్మిల, సునీత మద్దతు ఇస్తున్నారన్న అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. అలాగే వారిద్దరు తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అవడం, చంద్రబాబు చెప్పినట్లు చేయడం వంటి విషయాలను ఆయన వివరించారు. 'తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ద్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబందించినవారు ఉన్నారని గుర్తించి, దానని కప్పిపుచ్చేందుకు వెంటనే వైఎస్సార్సీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు'. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని ఆయన అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు." చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ నలభై ఐదేళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని, వివేకా బతికి ఉంటే శత్రువుగా చూస్తారని, ఆయన చనిపోగానే కొత్త రాగం అందుకుంటారని, ఎన్.టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనవారు, చనిపోయిన తర్వాత ఎన్.టీ రామారావు శవాన్ని లాగేసుకున్నారని, దండలు వేసి, విగ్రహాలు పెట్టారని.. సీఎం ఎద్దేవ చేశారు. చంద్రబాబు గుణగణాలను ఆయా సందర్భాలలో వివరిస్తూ.. చంద్రబాబు నిత్యం అబద్ధాలు, మోసాలపై ఆధారపడి రాజకీయాలను చేస్తారని అని ఆయన ద్వజమెత్తారు. 2014 తెలుగుదేశం మానిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రస్తావించి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ రుణమాఫి తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. టీడీపీ మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా గుర్తు చేశారు. 2014లో ఏ మూడు పార్టీల కూటమి అయితే పోటీచేసి ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కూడా అదే కూటమి పోటీలో ఉందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లపడి పొత్తు పెట్టుకున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవ చేశారు. 2014లోచంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రజలకు చూపిస్తూ, అందులో ఉన్న రుణమాఫీ, నిరుద్యోగ బృతి తదితర హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. వీరు ముగ్గురు మళ్లీ మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు హామీలలోని డొల్లతనాన్ని వివరిస్తూ.., తాను ఏభైఎనిమిది నెలల్లో అమలు చేసిన వాగ్దానాల గురించి వివరించారు. ప్రత్యేకించి ఇళ్లవద్దకే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వృద్దాప్య పెన్షన్, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర స్కీములను తాను అమలు చేశానని ప్రజలకు తెలియచేశారు. దిశ యాప్తో సహా పాలనతో తీసుకు వచ్చిన సంస్కరణలను, పేదలకు ఇళ్ల స్థలాలు మొదలైనవాటితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను కూడా తెలియచేశారు.17 మెడికల్ కాలేజీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం, కడప తదితర జిల్లాలలో వస్తున్న పరిశ్రమలు మొదలైనవాటి గురించ కూడా వివరించారు. "దుష్టచతుష్టయంలో బాగంగా ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 ల పాత్రను విమర్శిస్తూ, ఈనాడు రాస్తున్న రోత రాతలు చూశాక 'ఛీ' అని పారేస్తానని" ఆయన చెప్పారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదాకానీ, ఇతరత్రా కొత్త హామీ ఏదైనా సాధించారా అని మూడు పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ మూడు పార్టీల కూటమిని అభివృద్ది నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. 'ఎప్పటి మాదిరి మళ్లీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని వీరు ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవద్దని' వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే తమ కంటిని తమ వేలుతోనే పొడుచుకున్నట్లేనని, ఇప్పుడు అమలు అవుతున్న స్కీములు రద్దు అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. 'ఒక మాటలోచెప్పాలంటే ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్' అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు. "ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ గంటల తరబడి ఆలస్యం అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి వైఎస్ జగన్మోహన్రెడ్డిను 'సీఎం.., సీఎం..' అంటూ శుభాకాంక్షలు చెప్పిన తీరు కచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్గానే ఉంది. ఇది వైఎస్సార్సీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటే, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి మరింత కంగారు పుట్టిస్తుంది". ఇదే రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన సభలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభతో పోల్చితే చాలా తక్కువ వచ్చినట్లు చెప్పక తప్పదు. చంద్రబాబు స్పీచ్లో కొత్త విషయం ఏమీ ఉండడం లేదు. ఒక అపనమ్మకం కనిపిస్తుంది. అందుకే భయపడి మొదటిసారి కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అర్ధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల గురించి ప్రస్తావించడానికి ఆయన వెనుకాడుతున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటి లేని అంశాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదాహరణంగా వివరిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం దూషణలకే పరిమితం అవుతున్నారు. "ఒక పరిశీలకుడు అన్నట్లు చంద్రబాబు ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు". క్రెడిబిలిటి ఆయనకు లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఆ ఇబ్బంది లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా పేదల బవిష్యత్తు కోసం అంతా అండగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు సభలను చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, చంద్రబాబు సభలలో ఆ స్పూర్తి కొరవడినట్లు అనిపిస్తుంది'. చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ వల్లో, ఏమో తెలియదు కానీ, 2019లో మాదిరి తొలి దశలో కాకుండా, ఈసారి నాలుగో దశకు ఎన్నికల తేదీలు వచ్చాయి. అంటే సుమారు నెల రోజులు ఆలస్యంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 'చంద్రబాబు తాను, కూటమి పక్షాలు సర్దుకోవడానికి ఈ టైమ్ అవసరం అని భావిస్తుంటే, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఈ టైమ్ను తనకు అనుకూలంగా మలచుకుని బస్ యాత్రను పెట్టుకుని జనంలోకి మరింత చొచ్చుకువెళ్లగలిగారు. తద్వారా జనంలో తనకు ఉన్న పట్టు ఏమిటో చూపించగలుగుతున్నారు'. దీని ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం మరోసారి రావచ్చన్న అబిప్రాయం కలుగుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబులోని చీకటి కోణమే ఇది!
"తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని సమీకరీస్తున్న వైనం, వడ్డీకి అప్పులు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాతే ఎన్నికలలో ధన వ్యయం విపరీతంగా పెంచేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలోను గెలవవలసిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు ఓటర్లకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారన్నది ఆరోపణ కాదు.. వాస్తవం అని చాలామంది నమ్ముతారు." 1996లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికలో కొందరు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచవద్దని సూచించినా, చంద్రబాబు రిస్క్ తీసుకోలేమని చెప్పి స్వీట్ బాక్స్ తో సహా డబ్బులు పంపిణీ చేశారని ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న అప్పటి మంత్రి ఒకరు చెప్పారు. ఆ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన దండు శివరామరాజు మాట్లాడుతూ ఈ డబ్బు ఖర్చేమిటి? అయ్యబాబోయ్ .. ఉప ఎన్నికలో ఈ రకంగా వ్యయం చేస్తే, జనరల్ ఎన్నికలో నా పరిస్థితి ఏమిటి? ఈ స్థాయిలో డబ్బు చంద్రబాబు ఇస్తారో, ఇవ్వరో తెలియదు.. అని స్వయంగా నాతోనే అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా ఎన్నికల మేనేజ్మెంట్లో సిద్దహస్తుడని చెబుతుంది. దొరకకుండా స్కామ్లు చేయడంలో కూడా చంద్రబాబు దిట్టే అని అంతా నమ్ముతారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తాను టెక్నికల్గా, లీగల్గా దొరకనని చెబుతుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ స్థాయిలో డబ్బు రావడం కష్టం కనుక ఎన్నికల సమయంలో డబ్బు పోగు చేయడానికి రకరకాల మార్గాలను ఆయన ఎంచుకుంటారు. అందులో ఒకటి తన మద్దతుదారులైన బడా పెట్టుబడి దారుల నుంచి డబ్బు సమీకరించడం, అందులో అత్యధిక భాగం నల్లధనం అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. అమెరికా వంటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులలో టీడీపీ మద్దతుదారులు, సామాజికంగా టీడీపీపై ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బు హవాలా ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో ధనం పోగు చేస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో పవర్లో ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐల నుంచి కూడా తిరిగి ఇచ్చివేసే ప్రాతిపదికన డబ్బు తీసుకున్నారని, ఓటమి ఎదురవడంతో వారిలో పలువురికి తిరిగి ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంటుంది. దీనిలో నిజం ఉందో, లేదో తెలియదు కాని టీడీపీ వర్గాలే ఈ విషయాలపై చర్చించుకుంటాయి. మరో కొత్త మార్గం ఏమిటంటే తనను నమ్మిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతల నుంచి డబ్బు వచ్చేలా చూసుకోవడం. అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ద్వారా నల్లధనం పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తుంటారని అంటారు. దీనిని నిర్ధారణ చేస్తూ మీడియాలో కథనం వచ్చింది. నారాయణ తనకు తెలిసిన వ్యాపారులు, మార్వాడీల నుంచి ఐదు రూపాయల వడ్డీకి రుణం రూపేణా డబ్బు స్వీకరించారట. సుమారు 600 కోట్ల రూపాయల మేర ఇలా జమచేసి, దానిని రహస్య స్థలానికి తరలించారట. 2014లో సైతం నారాయణ తన కాలేజీ సిబ్బందిని, విద్యార్దులను ఎన్నికల ప్రచారానికి, డబ్బు పంపిణీకి వాడుకున్నారు. 2019 లో రెండు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పి 300 కోట్లు పోగుచేశారట. ఈసారి అది ఐదు రూపాయల వడ్డీగా మార్చి వ్యాపారులను ఆకర్షించే యత్నం చేశారట. మీడియాలో వచ్చిన ఈ కథనాలను ఆయన ఎందువల్లో ఖండించలేదు. 2014లో నారాయణ పెట్టిన ఖర్చులకు ప్రతిఫలంగానే ఆయనను మంత్రిగా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చంద్రబాబు చూసుకున్నారని అంటారు. చంద్రబాబు, నారాయణలు అమరావతి రాజధాని భూ స్కామ్లో కూడా నిందితులుగా కూడా ఉన్నారు. రాజధాని గ్రామాలలో 58 ఎకరాలను నారాయణ తన బినామీల ద్వారా కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే, ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆర్ధిక వనరులను కూడా భారీగా సమకూర్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కథనం ప్రకారం చంద్రబాబు తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ను కూడా నల్లధనం మార్పిడికి బాగానే వాడుకున్నారని మీడియాలో ప్రచారం అయింది. దీని ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో రోహిత్ 13 సినిమాలు తీశారు. అంతకు ముందు మూడు, నాలుగు సినిమాలకే పరిమితం అయ్యారు. 2019 తర్వాత దాదాపు సినిమాలు తీయలేదట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల పైగా వ్యయం చూపించారట. నిజానికి ఆ సినిమాలకు నాలుగైదు కోట్లకు మించి వ్యయం కాదని సినీరంగ ప్రముఖులు చెబుతుంటారు. అంటే ఆ మేర నల్లధనానికి లెక్కలు తయారు చేయడానికి ఈ సినిమాలను అడ్డుపెట్టుకున్నారన్నది అభియోగంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదమూడు సినిమాలు తీసిన వ్యక్తి, ఈ ఐదేళ్లలో ఒక్క సినిమా కూడా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న. ఇందులో నిజం ఉంటే మాత్రం ఆందోళనకరమైనదే. అవినీతికి సినిమాల ముసుగు వేస్తున్నారని అర్ధం అవుతుంది. ఈసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలతో విపరీత ప్రచారం చేయిస్తూ, గెలుస్తామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నిధుల వసూళ్ల కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విడత ఎన్నికలు టీడీపీకి చావో, రేవో తేల్చేవిగా అంతా అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీలను తనవెంటబెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. బీజేపీతో కాపురం చేస్తున్న జనసేన అక్కడనుంచి లేచి వచ్చేలా చేయగలిగారు. కాంగ్రెస్తో పరోక్ష స్నేహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు సాయం చేయడం కోసం పోటీ నుంచే తప్పుకున్న సంగతి తెలిసిందే. సీపీఐ ఏపీ శాఖ ఎప్పటి నుంచో టీడీపీకి తోకగా మారింది. ఇక బీజేపీని కూడా కాకా పట్టడానికి ఢిల్లీ వెళ్లి నానా పాట్లు పడ్డారు. బీజేపీ పెద్దలు రకరకాల షరతులు పెట్టడంతో చంద్రబాబు షాక్కు గురయ్యారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వైపు ధన సమీకరణ, మరోవైపు ఆయా రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష ఎత్తుల వ్యూహాలతో చంద్రబాబు రాజకీయం సాగిస్తున్నారు. అయినా సఫలం అవుతానన్న నమ్మకం రాక ఆయన బెంబేలెత్తిపోతున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పక్కా ప్లాన్తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మరాఠీ. ఆయన చెబుతున్నవి వింటుంటే చరిత్రలోకి మనం వెళ్లిపోతున్నాం అనిపిస్తుంది. తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు తనదైన భాషలో చెబుతూ , దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు అనేక మంది కాంగ్రెస్ వారిని ఆయన ఏకిపారేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా విమర్శలు చేసినా, ఈసారి ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీపైనే దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అది దర్పణం పడుతుందనిపిస్తుంది. మరో మూడు , నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. శాసనసభ సమావేశాలలో ఆయన ఉపన్యాసం ఇవ్వడం ఎప్పుడూ జరిగేదే కాని, ఈసారి చేసిన ప్రసంగానికి నేపధ్యం వచ్చే ఎన్నికలే అని వేరే చెప్పనవసరం లేదు. ఈ టరమ్ కు అసెంబ్లీలో ఇదే చివరి స్పీచ్ కావచ్చు. అందుకే ఆయన కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదునైన విమర్శలతో ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రెండు ఉప ఎన్నికలలో బిజెపి గెలవడం, ఒక ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలవడానికి చాలా కష్టపడాల్సిరావడం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణలో బిజెపి బాగా పుంజుకుంటుందని చాలామంది భావించారు. కాని కర్నాటక శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం, తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆశించిన రీతిలో క్యాడర్ ను తయారు చేసుకోలేకపోవడం, పార్టీలో చోటు చేసుకున్న విబేధాలు తదితర కారణాలతో బిజెపి వెనుకబడిపోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. అదే టైమ్ లో కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలకు జోష్ పెరిగింది. అంతవరకు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినా, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీనిని గమనించిన కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతి పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి పురోగతి సాధించింది వివరించడంతో పాటు అసలు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని ఆయన సూత్రీకరించారు. ఇందుకోసం 1956లో ఉమ్మడి ఎపి రాష్ట్రం ఏర్పాటుకు ముందునుంచి జరిగిన ఆయా రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో తెలియచేశారు. చరిత్రను ఎవరు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసినవారిలో కెసిఆర్ ఒకరు. తెలంగాణను తెచ్చిందెవరు అన్నది పక్కనబెడితే, తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, దానికి నెహ్రూ నిర్ణయమే కారణమని ఆయన స్పష్టం చేశారు. 1956కి ముందు ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. అంటే తెలంగాణ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలలో రాష్ట్రం ఉండేది. తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశం దేశవ్యాప్తంగా బలీయంగా వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలోకాని, తెలంగాణలో కాని తెలుగువారంతా ఒకటికావాలన్న ఆకాంక్ష ఉండేది. తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన మాట నిజం. జవహర్ లాల్ నెహ్రూ ఆశ్చర్యంగా ఒకసారి తెలంగాణకు అనుకూలంగా, మరోసారి సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ప్రసంగాలు చేశారు. హైదరాబాద్ శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఓకే చేశారు. ఆంధ్ర శాసనసభతో పాటు, తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయాల ఆధారంగా ఉమ్మడి ఎపి ఏర్పడింది. తదుపరి ఎన్నో పరిణామాలు, 1969 లో ఉద్యమం రావడం, కాని 1972 నాటికి అది పూర్తిగా తగ్గిపోవడం, టిపిఎస్ పక్షాన గెలిచిన ఎంపీలంతా కాంగ్రెస్లో కలిసిపోవడం వంటివి జరిగాయి. అయినా కొందరిలో తెలంగాణ ఆకాంక్ష పోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా వారు దానిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. కాందరు నేతలు ఆ నినాదాన్ని తమ పదవీ రాజకీయాలకు వాడుకున్నది కూడా వాస్తవం. కెసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీలో తెలంగాణ డిమాండ్ చేయలేదు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి మంత్రి పదవి ఇచ్చి , 1999 ఎన్నికలలో తిరిగి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఉప సభాపతి పదవి ఇచ్చి అవమానించారన్న భావన ఆయనలో ఏర్పడి, తెలంగాణ మేధావులతో, ప్రత్యేక రాష్ట్ర వాదులతో ఆయన సమావేశాలు జరిపి ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ నినాదాన్ని వదులుకోని మాట నిజం. అప్పడప్పుడు ఆశ, నిరాశలు ఎదురైనా , అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి ఆయన తెలంగాణ తెచ్చిన సారధిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి కూడా అయి తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఉంది. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించి ఆమె తెలంగాణను వ్యతిరేకించారని చెప్పారు. అందులో వాస్తవం లేకపోలేదు. కాని అదే సమయంలో ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి మాట్లాడకపోవడం వ్యూహాత్మకం అనుకోవాలి. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో ఇదే శాసనసభలో సోనియాగాంధీని ఆయన ప్రశంసించారు. కాని ఇప్పుడు ఆ ఊసే ఎత్తినట్లు కనిపించలేదు. తెలుగుదేశం పాలన, చంద్రబాబు టైమ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం తదితర అంశాలను ఆయన చెబుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం గమనించవలసిన అంశమే. వైఎస్ అభిమానులను ఆయన దూరం చేసుకోదలచుకోలేదని అర్ధం అవుతుంది. వైఎస్ కుమారుడు జగన్ ను కాంగ్రెస్ వేదించిన సన్నివేశాన్ని వివరించి, ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణలో అయినా పార్టీని నిలబెట్టుకోవాలని మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తప్ప చిత్తశుద్ది లేదని కెసిఆర్ వాదించారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు అంటే పొక్లెయినర్తో గోకుడు, అవుతలపడుడు. ఇక కాంగ్రెసోళ్లు కాల్వంటూ గెల్కుడు, ఇడ్సిపెట్టుడు అంటూ నాటి నీటిపారుదల ప్రాజెక్టులపై ఎద్దేవ చేశారు. అయితే ఎనభై వేల కోట్లు వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తన ప్రసంగంలో అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలంగాణ తలసరి ఆదాయం 3.12 లక్షల రూపాయలుగా ఉన్న విషయం వాస్తవమే అయినా, పొరుగు రాష్ట్రంతో పోల్చుకోవడం సరికాకపోవచ్చు. ఎందుకంటే పొరుగు రాష్ట్రానికి హైదరాబాద్ వంటి నగరం లేదన్న సంగతి మర్చిపోకూడదు. తన ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, దళిత బంధు, తదితర సంక్షేమ పధకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించి మళ్లీ వచ్చే ఎన్నికలలో గెలిచేది తామేనని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ద్వారా ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోను, పార్టీ క్యాడర్ లోను ఒక ధీమా కల్పించే యత్నం చేశారు. ఇంతవరకు ఆయన సఫలీకతృతమైనట్లే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
ఏది సంస్కృతి? ఏది విశ్వాసం?
ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన పేరు కొనసాగించాలని కోరవచ్చు. కాని అతిగా ప్రభుత్వంపై, జగన్పై విమర్శలు చేయడం ద్వారా తమ పాత చరిత్ర అంతటినీ ప్రజల ముందుకు మరోసారి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఇక విశ్వాసం మాటకు వస్తే.. తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు బాలకృష్ణ ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి తండ్రిని పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది?! ఏపీలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సి టీగా మార్చడంపై ఎన్.టి.ఆర్. కుమారుడు, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆశ్చ ర్యకరంగా ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్ని చూస్తే అసలు ఎన్.టి.ఆర్. పట్ల విశ్వాసం ఉండవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికా? తెలుగుదేశం వారికా? అన్న ప్రశ్న వస్తుంది. ఒక్కసారి బాల కృష్ణ ట్వీట్ను పూర్తిగా చూద్దాం. ‘‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్.టి.ఆర్. అన్నది ఒక పేరు కాదు. అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు మార్చారు. కొడుకు గద్దె ఎక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కడ మహనీయుడి భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు. పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’.. ఇది ఆయన ట్వీట్. ఎంత అర్థరహితంగా ఉంది! ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించివేసినందుకు, ఆయనపై చెప్పులు వేసినందుకు టీడీపీ నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోతే పోయె, బాధపడినట్లు అయినా ఎక్కడైనా చెప్పారా! ఎన్.టి. రామారావు హృదయ విదారకంగా అందరి ముందు విలపించినప్పుడు; తనను తన పిల్లలు, అల్లుళ్లు కలిసి దారుణంగా అవమానించారని కుమిలిపోయినప్పుడు వీరంతా అధికారం లాగేసుకున్నామని పకపకా నవ్వుకున్నారే... అదేనా సంస్కృతి! ఎన్.టి.ఆర్. వేదనతో మరణించినప్పుడు ఆయన అభిమా నులు బాధపడ్డారు కాని ఆయన కుటుంబంగా భావించేవారిలో కొంతమంది లక్ష్మీపార్వతి వర్గంతో గొడవ పడడానికే ప్రాధాన్యం ఇచ్చారు! ఆమెపై రకరకాల వదంతులు సృష్టించే పనిలో పడ్డారు! చివరికి అక్కడ కూడా చెప్పులు విసురుకున్నారు. ఇదా తెలుగు జాతి సంస్కృతి? తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారని పరోక్షంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఎయిర్పోర్టు పేరు వ్యవహారం కేంద్రం పరిధి లోనిది. పోనీ బాలకృష్ణ చేసిన విమర్శ కరెక్టే అను కున్నా, 2014 నుంచి నాలుగేళ్లపాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే.. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర విమాన యాన శాఖ మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఎందుకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మి నల్కు ఎన్.టి.ఆర్.పేరు పెట్టలేదు? అంటే వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేనట్లే కదా! పోనీ విజయవాడ విమానాశ్రయానికి అయినా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు? రాజధాని ప్రాంతానికి ఎన్.టి.ఆర్. సిటీ అని పేరు పెట్టాలని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఏమి చేశారు? బుచ్చయ్య చౌదరిపైనే ఫైర్ అయ్యారు తప్ప ఎన్.టి.ఆర్. పేరు పెట్టారా? రామోజీ ఆదేశాల మేరకు చంద్రబాబు అమరావతి అనే పేరు పెట్టారు. అంటే రామోజీకి ఇచ్చిన విలువ ఎన్.టి.ఆర్.కు చంద్రబాబు ఇవ్వలేదనే కదా? ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా 1995 ప్రాంతంలో ‘ఈనాడు’ దారుణమైన కార్టూన్లు వేస్తే బాలకృష్ణ కాని, ఆయన సోదరులు కాని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నించారా? తనను తన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్. వివాహమాడితే ఆయనతో తగాదా పెట్టుకున్నది ఎవరు? అధికారం వచ్చాక లక్ష్మీపార్వతితో ఆదరణగా ఉన్నట్లు నటించింది ఎవరు? ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆమెను ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టించుకున్నారా? ఆమె ఉంటున్న ఇంటి నుంచి ఆమెను తరిమేశారే! మరి ఇదంతా తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని అనుకోవాలా? ‘‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఎన్.టి.రామారావు టీడీపీని స్థాపించి ప్రజలలో తిరుగు తున్నప్పుడు కాంగ్రెస్ వారిని ‘కుక్కమూతి పిందెలు’ అని విమ ర్శించేవారు. విశేషమేమిటంటే అప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో మంత్రిగా ఉండేవారు. ఎన్.టి.ఆర్. తన అల్లుడు మినహా మిగిలిన కాంగ్రెస్ వారికి ఆ తిట్టు వర్తిస్తుందని చెప్పలేదు. పోనీ బాలకృష్ణ చెప్పినట్లు చేరిన పార్టీలోనే ఉండడమే విశ్వాసం అయితే, తొలుత అది వర్తించవలసింది చంద్రబాబుకే కదా! రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ను కాదని, తన ఓటమి తర్వాత మామ ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు కదా. మరి దానిని బాలకృష్ణ ఏమని అంటారు? ఆ మాటకు వస్తే తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి ఆయనను పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది? అప్పుడు కుక్కలు వెక్కి రించలేదా? వాటి ముందు తెలుగుదేశం నేతలు ఎవరూ తలదించు కుని సిగ్గు లేకుండా బతకలేదా? తన సోదరి పురందేశ్వరి కాంగ్రెస్లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవులు అలంకరించారే... తదుపరి ఆమె బీజేపీలో ఎలా చేరారు? దీనిని విశ్వాసమే అంటారా? తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి, ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామిని చేశారే... తీరా చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటిని పరాభవించి బయటకు పంపేశారే... మరి బాలకృష్ణకు విశ్వాసం ఏమైంది? ఎన్.టి.ఆర్. పట్ల అందరికీ గౌరవం ఉంది. పేరు మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ తన కారణాన్ని వివరించారు. తమకు ఎన్.టి.ఆర్. అవసరం లేదని, ఆయనకు విలువలు లేవని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, జగన్ చాలా పద్ధతిగా మాట్లాడారు. తనకు ఎంతో గౌరవం ఉంది కనుకే ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టానని అన్నారు. అలా పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ కనీసం స్వాగతించలేక పోయారే? నిజానికి ఎన్.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ప్రత్యర్ధులు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు అయితే ఎన్.టి.ఆర్.తో అసలు సంబంధమే లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే మొత్తం జాతి అంతా తల్లకిందులవుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారే మరి చంద్రబాబు టైమ్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్.టి.ఆర్. పేరు పెట్టలేదా? రాజీవ్ పేరు మార్చినప్పుడు దేశానికి అంతటికీ అవమానం జరిగినట్లు అను కోవాలా? తెలం గాణలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినప్పుడు టీడీపీ వారు, బాలకృష్ట వంటి వారు కనీసం నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తు న్నారు. ఆ మాటకు వస్తే కాకాని వెంకటరత్నం పేరుతో ఉన్న మెడికల్ కాలేజీని యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆయన పేరును ఎన్.టి.ఆర్. ఎందుకు తొలగించారు? తెలుగుదేశం వారికి ఎన్.టి.ఆర్.పేరును వాడుకునే అర్హత లేద న్నది వాస్తవం. ఎన్.టి.ఆర్. తన అల్లుడు చంద్రబాబు నాయుడును దూషిస్తూ, ‘ద్రోహి, ఔరంగజేబు కన్నా నీచం’ అని అన్నారు. అలా తన తండ్రి దూషణలకు గురైన చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడుగా, విధేయుడుగా బాలకృష్ణ వ్యవహరించడం ఏమి సంస్కృతి అన్నదానికి ముందుగా ఆయన వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఎదుటివారిపై వ్యాఖ్యలు చేస్తే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement