త్వరలో మా గృహ ప్రవేశం  | Sakshi
Sakshi News home page

త్వరలో మా గృహ ప్రవేశం 

Published Wed, Apr 3 2024 5:33 AM

Jagan Mohan Reddy is implementing the navaratnalu scheme in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

త్వరలో మా గృహ ప్రవేశం 
రెక్కాడితేగాని డొక్కాడని మాకు గూడు కల్పించిన దేవుడు సీఎం జగన్‌. మాది పేద కుటుంబం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీనివాస కాలనీ తండాలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. మేము కూలి పనులకు వెళ్తేనే పూట గడిచేది. కొన్నేళ్ల క్రితం నా భర్త స్వామినాయక్‌కు ప్రమాదం వల్ల రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేని పరిస్థితి ఏర్పడి మంచానికే పరిమితమయ్యారు. ఈ స్థితిలో నా కూలి డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఒక రోజు పని ఉంటే రెండో రోజు దొరికేది కాదు. అటువంటప్పుడు ఒక పూట పస్తులతోనే పడుకునే వాళ్లం. గత ప్రభుత్వంలో నా భర్తకు దివ్యాంగ పింఛను కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగ పింఛను మంజూరు చేశారు. మా పెద్దబ్బాయి దత్తసాయి నాయక్‌ పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం, రెండో అబ్బాయి పవన్‌నాయక్‌  మన్నెం పుల్లా రెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తుండడంతో వారి చదువులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కూలి డబ్బుల్లో అధిక భాగం ఇంటి అద్దెకే సరిపోయేది. ఈ ప్రభుత్వం వచ్చాక నా పేరుతోనే ఆదర్శనగర్‌ జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాలు ఇల్లు కూడా నిర్మించి మా సొంతింటి కల నెరవేర్చారు. త్వరలో గృహ ప్రవేశం చేయబోతున్నాం. నాకు ఆసరా, సున్నా వడ్డీ ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌ కు మేమంతా రుణపడి ఉంటాం.  
    – రామావత్‌ సరితాబాయి, పిడుగురాళ్ల  (షేక్‌ మస్తాన్‌వలి, విలేకరి, పిడుగురాళ్ల)  

మా బతుకుల్లో ఎంతో మార్పు 
మాది పేద కుటుంబం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. మాది ఏలూరు జిల్లా మండవల్లి గ్రామం. నా వయసు 38 ఏళ్లు. నా కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు కావలసిన పుస్తకాలు, యూనిఫాం, స్కూలు బ్యాగు, షూస్‌ వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో చదువు భారం పూర్తిగా తప్పింది.

ఆసరా ద్వారా రూ.15 వేలు లబ్ధి చేకూరింది. నా భర్త కాలికి గాయం కావడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యానికి రూ.80 వేలు ప్రభుత్వం అందించింది. మా అత్తకు ప్రతి నెలా ఒకటో తారీఖునే రూ.3 వేల వృద్ధాప్య పింఛన్‌ అందుతోంది. జగనన్న పాలన స్వర్ణయుగం. మాకు ఏ చీకూ చింతా లేదు. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం అందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ ఆయనే సీఎం అయితేనే మాలాంటి పేదలు హాయిగా బతుకుతారు.      – చిగురిపాటి ప్రశాంతి, మండవల్లి (భోగాది వీరాంజనేయులు, విలేకరి, మండవల్లి) 

పెద్దన్నలా ఆదుకున్నారు 
మాది పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లాలోని పెనుగొండ మా ఊరు. చాలా ఏళ్ల కిందటే నా భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు, సోదరులపై ఆధారపడి జీవిస్తున్నా. ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్న నన్ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దన్నలా ఆదుకున్నారు. మాకు ఇంటి స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించారు. మా సొంతింటి కల సాకారమైంది. వైఎస్సార్‌ ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ రూ.37,600 నా ఖాతాలో జమ చేశారు. నా కుమార్తెకు జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15 వేలు లబ్ధి చేకూరుతోంది. వితంతు పింఛను సొమ్ము రూ.3 వేల వంతున ప్రతి నెలా అందుతోంది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాం. – కొమ్మోజు అనంతలక్ష్మి, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా  గుర్రాల శ్రీనివాసరావు, విలేకరి, పెనుగొండ) 

Advertisement
Advertisement