అలెర్ట్‌, కోవిడ్‌-19 అడ్వాన్స్‌ విత్‌డ్రాపై ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం?! | EPFO Withdrawal Covid Advance Facility, See More Details Inside - Sakshi
Sakshi News home page

చందాదారులకు ముఖ్యగమనిక..కోవిడ్‌-19 అడ్వాన్స్‌ విత్‌డ్రాపై ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం?!

Published Wed, Dec 27 2023 9:17 AM

Epfo Withdrawal Covid Advance Facility - Sakshi

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మనీ విత్‌ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 వ్యాప‍్తి సమయంలో చందాదారుల ఆరోగ్య అవసరాల్ని తీర్చేలా కోవిడ్‌ అడ్వాన్స్‌ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌ఓ త్వరలో తొలగించనుంది. దీంతో కోవిడ్‌ అడ్వాన్స్‌ పేరుతో రిటైర్‌మెంట్‌ సేవింగ్‌ ఫండ్‌ను ఉపసంహరించుకోవడం అసాధ్యం.

వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత అధికారులు అనధికారికంగా వెల్లడించారు.

కోవిడ్‌ అడ్వాన్స్‌ పేరుతో 
ఇందులో ప్రముఖంగా భారత్‌లో తొలిసారి కరోనా విజృంభణ మొదలైన సమయంలో ఈపీఎఫ్‌ఓ మనీ విత్‌ డ్రాలో మార్పులు చేసింది. చేసిన మార్పులకు అనుగుణంగా చందారులు కరోనా చికిత్సతో పాటు సంబంధిత అనారోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు వీలుగా కోవిడ్ అడ్వాన్స్‌ ఆప్షన్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌లో ఉన్న కొంత మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. అవసరాల్ని తీర్చుకోవచ్చు. 

ప్రాణాల్ని కాపాడింది
ఈ నిర్ణయం సబ్‌స్క్రైబర్లు కోవిడ్‌ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహాయ పడింది. పలువురు కోవిడ్‌కు చికిత్స చేయించుకుని ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. అయితే సుమారు ఏడెనిమిది నెలల క్రితం కోవిడ్‌-19పై వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) విధించిన పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయంతో 
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటనతో ఈపీఎఫ్‌ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రీటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ నుంచి కోవిడ్‌ అడ్వాన్స్‌ తీసుకునే సదుపాయన్ని తొలగించనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, సాఫ్ట్‌వేర్‌లో నాన్ రిఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ నిబంధనను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా చందాదారులు ఇకపై దరఖాస్తు చేసుకోలేరని అధికారి తెలిపారు.

ఈ పని ఎప్పుడో చేయాల్సింది
కాగా, కొవిడ్ అడ్వాన్స్‌ పేరుతో తీసుకున్న నగదుతో అనవసరైమన కొనుగోళ్లు, ఇతర అవసరాలకు వినియోగించుకునే వారికి ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని అంటున్నారు. రిటైర్మెంట్ పొదుపు నుంచి కోవిడ్‌ అడ్వాన్స్‌ పేరుతో తీసుకున్న నగదును ఆరోగ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని తెలిసినప్పటికీ కోవిడ్ ఉపసంహరణను ముగించడానికి వారికి ఇంత సమయం పట్టిందని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు.  


  
ఏ ఏడాది ఎంత విత్‌డ్రా చేశారంటే
ఈపీఎఫ్‌ 2020-21లో 6.92 మిలియన్ల మంది చందాదారులకు రూ .17,106.17 కోట్లు, 2021-22 లో 9.16 మిలియన్ల లబ్ధిదారులకు రూ .19,126.29 కోట్లు, 2022-2023లో 6.20 మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ .11,843.23 కోట్ల నగదను అందించింది.  

4 రోజుల్లో 6లక్షలు విత్‌డ్రా
మార్చి 28, 2020 నుండి కోవిడ్ అడ్వాన్స్ నిబంధన అమల్లోకి వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2020) నాలుగు రోజుల్లో 33 మంది లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 6 లక్షల్ని విత్‌ డ్రా చేసుకున్నారు. 


కోవిడ్‌ అడ్వాన్స్‌ రూ.48,075 కోట్లు 
2022-23 ఈపీఎఫ్‌ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 నుండి మూడు ఆర్థిక సంవత్సరాల్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు కోవిడ్ అడ్వాన్స్‌ పొందారు. ఈ మొత్తం విలువ రూ .48,075.75 కోట్లు.

Advertisement
Advertisement