Sakshi News home page

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ

Published Wed, Apr 17 2024 9:57 AM

HPE Started The Deployment Of Its MadeInIndia Servers With The Help Of VVDN Tech - Sakshi

హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ (హెచ్‌పీఈ) తాజాగా దేశవ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సర్వర్లను మనేసర్‌లోని వీవీడీఎన్‌ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తయారుచేసినట్లు చెప్పింది.

గత ఏడాది జూలైలో హెచ్‌పీఈ, వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో మేక్ ఇన్ ఇండియా ప్రణాళికలను వెల్లడించింది. అందులో భాగంగా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సర్వర్‌లను తయారుచేస్తామని హామీ ఇచ్చింది. దాంతో అలా హామీ ఇచ్చిన ఏడాదికాలంలోపే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న ఐదు ఏళ్లలో భారత్‌లో సుమారు 1 బిలియన్ డాలర్ల(రూ.8300 కోట్లు) విలువైన హైవాల్యూమ్ సర్వర్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

హెచ్‌పీఈ సర్వర్లు ఐటీ పరిశ్రమ అంతటా పనిభారాన్ని తగ్గిస్తూ విస్తృత శ్రేణి అప్లికేషన్‌ల కోసం ఉపయోగపడుతాయని కంపెనీ తెలిపింది. వీవీడీఎన్‌ టెక్నాలజీ హెచ్‌పీఈ తయారుచేస్తున్న సర్వర్‌ మదర్‌బోర్డులను రూపొందించడానికి పూర్తి స్థాయి సర్ఫేస్‌ మౌంట్ టెక్నాలజీ (ఎస్‌ఎంటీ)ని అందిస్తున్నట్లు తెలిసింది. ప్రాసెసర్‌లు, మెమరీలు, డిస్క్‌లు, డ్రైవ్‌లతో సర్వర్ మదర్‌బోర్డులను తయారు చేయడానికి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)కి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అవసరం అవుతుంది.

ఇదీ చదవండి: కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే..

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎస్‌ఐ) పథకం ద్వారా విదేశీ కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని హెచ్‌పీఈ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సోమ్ సత్సంగి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ)కి అభినందనలు తెలియజేశారు.

Advertisement
Advertisement