Top Workplaces In India: దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే.. లింక్డ్ఇన్ నివేదిక
Published
Tue, Apr 23 2024 3:06 PM
దేశంలో 25 అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ సంస్థ విడుదల చేసింది. అందులో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందువరుసలో నిలిచింది.
గత కొద్దికాలంగా టాప్లో నిలుస్తున్న టీసీఎస్ సంస్థ ఈసారీ తన సత్తా చాటుకుంది. దాంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా లింక్డ్ఇన్ టీసీఎస్కు ఈస్థానం కల్పించింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో టెక్ కంపెనీలే ఉండడంతో వాటి హవా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.
ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే..
ఈ జాబితాను తయారుచేసేందుకు సంస్థ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది.
కెరియర్ గ్రోత్
నైపుణ్యాభివృద్ధి
సంస్థ స్థిరత్వం
అవకాశాలు
ఉద్యోగుల సంతృప్తి
వైవిధ్యం
ఉద్యోగుల విద్యార్హతలు
దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలు
టాప్-15 మధ్యశ్రేణి కంపెనీల జాబితానూ లింక్డ్ఇన్ విడుదల చేసింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సేవలందిస్తున్న లెంత్రా.ఏఐ సంస్థ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మేక్మైట్రిప్, నైకా, డ్రీమ్11 సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి.