మూడేళ్ల క్రితం వివాహం.. పట్టపగలే భార్యపై భర్త హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

మూడేళ్ల క్రితం వివాహం.. పట్టపగలే భార్యపై భర్త హత్యాయత్నం

Published Thu, Nov 23 2023 12:48 AM

- - Sakshi

చెళ్లకెరె రూరల్‌: పట్టణంలోని కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌ ముందు పట్టపగలే ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాలూకాలోని చెన్నమ్మనాగతిహళ్లి గ్రామానికి చెందిన కుమారస్వామి అనే 27 ఏళ్ల యువకుడికి, 25 ఏళ్ల వయస్సుగల ఆశాకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది.

వారికి ఇంకా సంతానం కాలేదు. గత ఏడాది కాలంగా దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవలు కావడం వల్ల దంపతులు వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో భార్య ఆశా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమైపె కోపంతో భర్త కుమార్‌ ఆమెను అంతమొందించాలని కక్ష పెంచుకున్నాడు. బుధవారం కోర్టు వాయిదాకు హాజరు కావడానికి ఒంటరిగా వచ్చిన భార్య ఆశా బస్సు దిగి బస్టాండ్‌ నుంచి బయటకు వచ్చింది.

బస్టాండ్‌ వద్దే మాటు వేసిన భర్త
ఆ వెంటనే అప్పటికే అక్కడ కొత్త కొడవలిని కొనుగోలు చేసి మాటు వేసి ఉన్న భర్త కుమారస్వామి నడి బజారులోనే కొడవలితో ఆమైపె దాడి చేసి తల, మెడపై నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన స్థానికులు భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కుమార్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

తక్షణమే ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు రక్తగాయాలతో విలవిల్లాడుతున్న క్షతగాత్రురాలిని అంబులెన్స్‌లో తాలూకా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందింపజేశారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వైద్యులు ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఇలాంటి నీచ కృత్యానికి పాల్పడిన భర్తకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు ఒత్తిడి చేశారు. స్థలానికి డీఎస్పీ టీబీ రాజన్న, ఇతర అధికారులు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై చెళ్లకెరె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement