నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ | Sakshi
Sakshi News home page

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

Published Tue, Mar 19 2024 6:28 AM

BJP Central Election Committee to meet on 19 march 2024 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ తోపాటు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు.

సీఈసీ భేటీలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పది రాష్ట్రాలకు చెందిన కోర్‌ కమిటీ నేతలతో జేపీ నడ్డా, అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది.

Advertisement
Advertisement