భారీ గాలులు, నేలకూలిన బొప్పాయి
హోసూరు వార్తలు..క్యాంటర్ బోల్తా, ముగ్గురు మృతిచిక్కబళ్లాపురం: క్యాంటర్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చిక్కబళ్లాపురం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు...కోలారు జిల్లా చిక్కతిరుపతి నుంచి మంచేనహళ్లికి కాంపౌండ్ రాళ్లను క్యాంటర్లో తీసుకెళ్తుండగా చిక్క సమీపంలోని కనంలో ఓవర్ లోడ్ కారణంగా క్యాంటర్ బోల్తాపడింది. డ్రైవర్, రవి, క్యాబిన్లో ఉన్న మరో వ్యక్తి బాబాజాన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే క్యాంటర్ వెనుక రాళ్లపై కూర్చొని వస్తున్న ముత్తణ్ణ, అఫ్జల్, చాంద్బాషాలు అక్కడికక్కడే మృతి చెందారు. సిమెంట్ దిమ్మెలు వారిపై పడటంతో ప్రాణాలు కోల్పోయారు. చిక్కబళ్లాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అభివృద్ధి పనుల్ని పూర్తిచేయాలి హోసూరు: క్రిష్ణగిరి జిల్లాలో ఎన్నికలకు ముందు నిలిచిపోయిన అభివృద్ధి పనులను యథావిధిగా ప్రారంభించాలని కలెక్టర్ శరయు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్రిష్ణగిరి కలెక్టరేట్లో అధికారులతో సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ వసతులు, గ్రంథాలయాల ఏర్పాటు, భవన నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ పనులు, వంతెనల ఏర్పాటు, హోసూరు కార్పొరేషన్ పరిధిలో భూగర్భ మురికి కాలువల పనులు చేపట్టాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ సాధన కురల్, అదనపు కలెక్టర్ వందనా కార్గ్, కమిషనర్ స్నేహ, సబ్కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. తాగునీటిలో మురుగునీరు హోసూరు: హోసూరు పారిశ్రామిక ప్రాంతమైన చిన్న యలసగిరి ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపుల వద్ద మురికి నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో తాగునీటిలో మురుగునీరు కలిసి వస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వలస వచ్చిన కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో నివాసముంటున్నారు. ఈ ప్రాంతంలో కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి పైపులు అక్కడక్కడా పగిలిపోవడంతో పాటు వాటి చుట్టూ ప్లాస్టిక్ చెత్త, మురుగునీరు పేరుకుపోయిందన్నారు. వాటిని శుభ్రం చేసి సురక్షిత మంచి నీటిని అందజేయాలని డిమాండ్ చేశారు.
ప్రేమించి పెళ్లాడి.. ఆత్మహత్య కెలమంగలం: ప్రేమించి పెళ్లి చేసుకొన్న దంపతుల మధ్య గొడవలు జరిగి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన డెంకణీకోట వద్ద చోటుచేసుకొంది. వివరాల మేరకు అంచెట్టి సమీపంలోని సీంగోటై గ్రామానికి చెందిన కూలికార్మికుడు సేతు, అదే ప్రాంతానికి చెందిన పవిత్ర (18)ని ప్రేమించి గత ఏడాది క్రితం పెళ్లి చేసుకొన్నాడు. కానీ వారు తరచూ పోట్లాట పడేవారు. దీంతో విరక్తి చెందిన పవిత్ర ఆదివారం పురుగుల మందు తాగింది, గమనించిన స్థానికులు డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫలితంలేక సోమవారం రాత్రి మృతి చెందింది. పెళ్లి జరిగి ఏడాది మాత్రమే కావడంతో హోసూరు సబ్ కలెక్టర్ ప్రియాంక విచారణ చేపట్టారు.
ఆలయాల్లో నగలు చోరీ క్రిష్ణగిరి: జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఆలయాల తలుపులు బద్దలగొట్టి నగలను దోచుకెళ్లిన ఘటనపై మత్తూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. మత్తూరు సమీపంలోని చిన్నఆలహళ్లి గ్రామంలోని మురుగన్ ఆలయంలో షణ్ముగం అర్చకులుగా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆలయంలో పూజలు ముగించుకొని తాళాలు వేసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం ఆలయం వద్దకెళ్లిన ఇతనికి తాళాలు పగులగొట్టిన విషయం కంటబడింది. మూలవిరాట్కు అలంకరించిన రూ. 60 వేలు విలువ చేసే నగలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్లు తెలిసింది. అదే విధంగా అదే ప్రాంతంలోని గ్రామదేవత కాళియమ్మ ఆలయంలో తాళిబొట్టును దోచుకెళ్లినట్లు స్థానిక ప్రజలు మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య క్రిష్ణగిరి: అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన నాగరసంబట్టి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... క్రిష్ణగిరి జిల్లా నాగరసంబట్టి సమీపంలోని తట్టకల్ గ్రామానికి చెందిన మునిస్వామి భార్య నాగవేణి (25)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. కొద్ది రోజులుగా నాగవేణి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. చికిత్సలు చేయించినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనపై నాగరసంబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బైక్ ప్రమాదంలో కార్మికుడు మృతి కెలమంగలం: ద్విచక్రవాహనం నుంచి కిందపడిన కార్మికుడు తీవ్ర గాయాలై మరణించాడు, ఈ ఘటన డెంకణీకోట వద్ద జరిగింది. వివరాల మేరకు అంచెట్టి సమీపంలోని పారండపల్లి గ్రామానికి చెందిన మారస్వామి (40). సోమవారం సాయంత్రం బైక్ మీద వెళ్తూ గేరెట్టి వద్ద కిందపడ్డాడు. తీవ్ర గాయాలేర్పడిన ఇతన్ని స్థానికులు చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేశారు.
బేకరి, హోటళ్లలో అధికారుల తనిఖీలు హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలోని బేకరి, హోటళ్లు, వాణిజ్య కాంప్లెక్స్లలో పారిశుద్ద శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనపరుచుకొని జరిమానా విధించారు. పట్టణంలోని ఎంజీ రోడ్డు, బాగలూరు రోడ్డు, రాయకోట రోడ్డు, ఆవలపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో పాస్టిక్ కవర్ల వినియోగిస్తున్నారని, పారిశుద్ద శాఖాధికారులకు సమాచారం అందింది. ఆ మేరకు అధికారులు ప్రకాష్ రమేష్, ఉదయ్కుమార్, గిరి తదితరుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 30 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కెలమంగలం: అంచెట్టి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం వీచిన భారీ గాలులకు బొప్పాయి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. క్రిష్ణగిరి జిల్లా వ్యాప్తంగా భారీ గాలులు వీస్తుండగా గత రెండు రోజులుగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అంచెట్టి సమీపంలోని తక్కట్టి, అర్థగల్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో అర్థకల్ గ్రామానికి చెందిన రైతు సిద్ధరాజ్కు చెందిన ఎకరంలో నాటిన సుమారు 400 బొప్పాయి చెట్లు నేలకొరిగాయి, తోట మొత్తం దెబ్బతింది. అలాగే పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్, అక్కడ వేసిన షెడ్లు ఎగిరిపోయాయి. దెబ్బతిన్న బొప్పాయి చెట్లకు తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు.