శివాజీనగర: హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల వ్యవహారంలో బాధితురాలిని కిడ్నాప్ చేశారన్న కేసులో ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ బెయిల్ పిటిషన్పై బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. బెయిలుపై మీ వైఖరేమిటో చెప్పాలని సిట్కు నోటీసులు జారీచేసింది. రేవణ్ణ తరఫు న్యాయవాది సీవీ నాగేశ్ వాదన వినిపిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరారు. సిట్ న్యాయవాది వాదిస్తూ నిందితుడు పోలీస్ల స్వాధీనంలో ఉన్నపుడు బెయిల్ ఎలా సాధ్యమని, విచారణ సాగదని పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్య ముమ్మరంగా వాదనలు సాగాయి. జడ్జి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
వైద్య పరీక్షలు
బనశంకరి: రేవణ్ణకు మంగళవారం బౌరింగ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా బాగా లేదని చెప్పడంతో ఆయనను సిట్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేసి ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు.