ఇజ్రాయెల్‌లో మనోళ్లు సేఫ్‌ | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో మనోళ్లు సేఫ్‌

Published Mon, Apr 15 2024 1:25 AM

- - Sakshi

తాము క్షేమమేనంటూ ఇంటికి సమాచారమిస్తున్న తెలంగాణ వాళ్లు

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధం ఆగినట్లు వార్తలు

అయినప్పటికీ ఇక్కడున్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పశ్చిమాసియాలో ని ఇజ్రాయెల్‌–ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన తెలంగాణవాసులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇజ్రాయెల్‌లో పనిచేస్తు న్న నిజామాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్లు చేసి తమ క్షేమసమాచారాన్ని అందించారు. అయినప్పటికీ వరుసగా చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడున్న వారిలో ఆందోళన నెలకొంది.

ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్‌ 185 డ్రోన్లు, 110 బాలిస్టిక్‌ మిస్సైల్స్‌, 36 క్రూయీజ్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. మధ్యధరా సముద్రంలోని యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, జోర్డాన్‌ దళాలు అడ్డుకుంటున్నాయి. అదేవిధంగా ఐరన్‌ డోమ్‌, ఐరన్‌ బీమ్‌(లేజర్‌ టెక్నాలజీ)లతో ఆయా మిసైల్స్‌ను ఇజ్రాయెల్‌ తమ భూ భాగంలో పడకుండా అడ్డుకుంటోంది. దాదాపు 95 శాతం మిసైల్స్‌ను ఇజ్రాయెల్‌ నిర్వీర్యం చేసింది. అయితే శనివారం 17 మంది భారతీయులు ఉన్న సౌకను ఇరాన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

దీంతో అలజడి నెలకొంది. ఇజ్రాయెల్‌లో సుమారు 25వేల మంది భారతీయులు ఉండగా, వెయ్యి మంది వరకు తెలంగాణ వారున్నారు. వీరిలో ఎక్కువగా ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలవారున్నారు. టెల్‌అవీవ్‌ నగరంలో మనవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటికే అక్కడి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక భారత ప్రభు త్వం సైతం ఇజ్రాయెల్‌, ఇరాన్‌లకు వెళ్లొద్దని నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి యుద్ధం ఆగినట్లు, యుద్ధ వాతావరరణం సమసిపోయినట్లు వార్తలు వస్తున్నా యి. ఇప్పటివరకు మనవాళ్లు సేఫ్‌గా ఉన్నారు. దీంతో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ కొంతమేర తగ్గింది.

Advertisement
Advertisement