లిక్కర్‌ స్కాంలో కవిత.. ఎన్నికల వేళ ట్విస్ట్‌ ఇచ్చిన అనురాగ్‌ ఠాకూర్‌ | Anurag Thakur Sensational Comments Over KCR And MLC Kavitha In Delhi Liquor Policy Scam Case - Sakshi
Sakshi News home page

కొంచెం ఓపిక పట్టండి.. లిక్కర్‌ స్కాంలో కవితపై ఠాకూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Sat, Nov 4 2023 4:46 PM

Anurag Thakur Sensational Comments Over KCR And MLC Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్‌లోని కత్రియ హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రికెట్‌ వరల్డ్‌కప్‌ జరుగుతోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నన్ను బ్యాట్స్‌మెన్‌గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఎంతో దోచుకుంది. భారీగా అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్‌ సచివాలయంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. 

ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బు..
మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘేల్‌కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్క్‌ అవుట్‌ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే ఎంతోమంది మరణించారు. పార్లమెంట్‌లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. 

లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ తప్పదు..
పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్‌లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్. కాళేశ్వరం రూ. 80వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అయితే, కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ కోసమే కేఏ పాల్‌ పోటీచేయడం లేదా? రేవంత్‌రెడ్డి

Advertisement
Advertisement