IPL 2023: చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్
Published
Thu, May 18 2023 8:56 AM
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన పంజాబ్.. ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తప్పనిసారిగా గెలవాల్సిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి చవిచూసింది.
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగల్గింది. లివింగ్స్టోన్(94) అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేపోయాడు. ఇక కీలక మ్యాచ్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్సీ శిఖర్ ధావన్ స్పందించాడు. ఓటమికి కారణం తమ చెత్త బౌలింగే అని గబ్బర్ తెలిపాడు.
"కీలక మ్యాచ్లో ఓటమి పాలవ్వడం చాలా బాధగా ఉంది. మొదటి ఆరు ఓవర్ల(పవర్ప్లే)లో మేం బాగా బౌలింగ్ చేయలేదు. తొలుత పిచ్పై బంతి అద్బుతంగా స్వింగ్ అయింది. అటువంటి సమయంలో మా పేసర్లు వికెట్లు సాధించడంలో విఫలమయ్యారు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులనైనా కట్టడి చేసి ఉంటే బాగుండేది.
ఈ మ్యాచ్లోనే కాకుండా ప్రతీ మ్యాచ్లోనే మేం ఇంతే. పవర్ప్లేలో కనీసం 50-60 మధ్య పరుగులు సమర్పించుకుంటున్నాం. అయితే ఈ మ్యాచ్లో మేము చాలా క్లోజ్గా వెళ్లి ఓడిపోయాం. ఆఖరి ఓవర్లో నోబాల్ తర్వాత మళ్లీ మా ఆశలు చిగురించాయి. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. లివింగ్ స్టోన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
బ్యాటింగ్లో కూడా మాకు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ మెయిడిన్, రెండో ఓవర్లో నేను ఔటయ్యాను. దాదాపు పవర్ప్లే మేమ 12 బంతులు వరకు వృథా చేశాము. ఇక ఆఖరి ఓవర్లో స్పిన్నర్తో బౌలింగ్ చేయంచాలన్న నా నిర్ణయం విఫలమైంది. అంతకు ముందు ఫాస్ట్బౌలర్లకు ఒకే ఓవర్లో 18-20 పరుగులు రాబట్టారు. కాబట్టి నేను స్పిన్నర్తో ముందుకు వెళ్లాను అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధావన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పంజాబ్ కొంపముంచిన ధావన్ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే?