-
● నేటి నుంచే బ్రహ్మోత్సవాలు
నరసన్నపేట: స్థానిక పెద్దపేటలో 150 ఏళ్ల కిందట వెలసిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివా రం ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతంలో ఎంతో గుర్తింపు కలిగిన వేంకటేశ్వర స్వామి ఆలయం ఇది. 1876లో పొట్నూరు వంశీకులు ఈ ఆల యాన్ని నిర్మించారు. 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్టీ ప్రతినిధి పి.కృష్ణప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం విశ్వక్సేన పూజ భగత్ పుణ్యాహవచనం, పరిషత్ విజ్ఞాపన, రుత్విక్ వరణం, రక్షా సూత్రాధారణ తదితర పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. అనంతరం యాగశాల ప్రతిష్ట చేపడతారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హంస వాహనసేవ, తిరుచ్చీ సేవ, ధ్వజావరోహణం, ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వార్షిక కల్యాణం నిర్వహిస్తారు. 20న శేష వాహన సేవ, 21న అశ్వవాహన సేవ, 22న హనుమంత వాహన సేవ, 23న గరుడ వాహన సేవ, 24న సింహ వాహన సేవ, 26న గజ వాహన సేవ, 27న సూర్య ప్రభ వాహన సేవలు నిర్వహిస్తామని అర్చ కులు కృష్ణమాచార్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధి జగదీష్ బాబు తెలిపారు. వీటితో పాటు రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు తెలిపారు. -
● ముగిసిన బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కా మన్ ఎంట్రన్స్ టెస్ట్ –2024(ఏపీఈఏపీ సెట్) కొనసాగుతోంది. గురు, శుక్రవారాల్లో నిర్వహించిన బైపీ సీ స్ట్రీం పరీక్షలు ముగిశాయి. శనివారం నుంచి ఎంపీసీ స్ట్రీం పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం హాజరు పరిశీలిస్తే చిలకపాలెం శివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 204 కి 190, రెండు షిఫ్టులో 205 కి 190, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 180 కి 160, రెండో షిఫ్టులో 180 కి 167, టెక్కలి ఐతం కళాశాలలో మొదటి షిఫ్టులో 300 కి 289, రెండో షిప్టులో 304 కి 278, నరసన్నపేట కోర్ టెక్నాలజీస్ ఆన్లైన్ కేంద్రంలో మొదటి షిఫ్టులో 330 కి 303, రెండో షిఫ్టులో 330కి 307 మంది హాజరయ్యా రు. రెండో రోజు శుక్రవారం 2033కి 1884 మంది హాజరు కాగా, 149 మంది గైర్హాజరయ్యారు. రెండు రోజుల్లో బైపీసీ స్ట్రీంలో 4060 మందికి 3,753 మంది హాజరు కాగా, 307 గైర్హాజరయ్యారు. శనివారం నుంచి ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు పరీక్షలు కొనసాగుతాయి. -
● ‘శారీరక వ్యాయామం అవసరం’
అరసవల్లి: ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం వ్యాయామం చేయాలని జిల్లా వైద్యారోగ్య శా ఖాధికారి డాక్టర్ బి.మీనాక్షి తెలియజేశారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థాని క కార్యాలయం వద్ద నుంచి బయల్దేరిన ర్యాలీని ఆ మె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ నేటి సమాజంలో 18 ఏళ్లు నిండిన వారికి సైతం రక్తపోటు (బీపీ) సుమారు 25 శాతం మందిలో కనిపిస్తోందని, నిత్యం వ్యాయామం లేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోతుందని వివరించారు. బీపీ ని యంత్రణలో ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ తమ ఆరో గ్యం కోసం తామే వ్యాయామాన్ని నిత్య కృత్యం చేసుకునేలా అవగాహన కల్పిస్తూ నినాదా లు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికా రి డాక్టర్ ఈశ్వరి, మాస్మాడియా అధికారి పైడి వెంకటరమణ వైద్యులు సుజాత, శ్రీదేవి పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రత పరిశీలన
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన జిల్లా ఎనిమి ది నియోజక వర్గాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతను కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శుక్రవారం పర్యవేక్షించారు. 18 స్ట్రాంగ్ రూమ్లకు ఏర్పాటు చేసిన మూడంచల భద్రతపై సమీక్షించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారం, విజిటర్స్ వివరాలు పరిశీలించారు. పూర్తిస్థాయి భద్రత కల్పించినట్లు చెప్పారు. భద్రత సిబ్బంది విధులు నిరంతరం అప్రమత్తంగా నిర్వహించాల ని సూచించారు. నిరంతర నిఘా కొనసాగుతుందని వివరించారు. సీసీ కెమెరాలను పొలిటికల్ పార్టీ జనరల్ ఏజెంట్లు పరిశీలించే వెసులు బాటు కల్పించారు. -
చైతన్యం నింపాడు
యువతలో చాలా సంతోషంగా ఉంది.. ఐఎఫ్ఎస్కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2018 నుంచి నేను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. దీంతో పాటు అనేక ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 2024 ఏప్రిల్ 25న ఇంటర్వ్యూ జరిగింది. మే 8న ఫలితాలు వెలువడ్డాయి. 83వ ర్యాంకు సాధించాను.ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తాను. – సింగూరు కృష్ణచైతన్య ● యూపీఎస్సీ పరీక్షల్లో మెరిసిన శ్రీకాకుళం కుర్రాడు ● 83వ ర్యాంకు సాధించిన సింగూరు కృష్ణచైతన్య ● ఐఎఫ్ఎస్కు ఎంపికైన యువకుడు ● ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ బడిలోనే ● కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడుకావడంతో మరింత ముందుకు -
No Headline
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయిలో శ్రీకాకుళం కుర్రాడు మెరిశాడు. యూపీఎస్సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. జిల్లాలోని సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేటకు చెందిన సింగూరు కృష్ణచైతన్య యూపీఎస్సీ ఫలితాల్లో 83వ ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై శభాష్ అనిపించాడు. కృష్ణచైతన్య ప్రస్తుతం ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్లో విశాఖపట్నంలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు టాక్స్ అసిస్టెంట్గా, పోస్టల్ అసిస్టెంట్గా, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఇలా అనేక ఉద్యోగాలకు సైతం ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ బడిలోనే.. సింగూరు కృష్ణచైతన్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ బడిలోనే సాగింది. 1996 జూన్ 21వ తేదీన జన్మించిన కృష్ణచైతన్య ఎల్ఎన్పేట మండలం తురకపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. 6 నుంచి 8వ తరగతి వరకు ఆమదాలవలసలోని సెంటాన్స్ స్కూల్లో, 9,10 తరగతులు శ్రీకాకుళంలోని భా ష్యం స్కూల్లో చదువుకున్నాడు. పదో తరగతిలో 572 మార్కులు, విశాఖపట్నం శ్రీచైతన్య కాలేజ్లో చదువుకుని ఇంటర్మీడియెట్లో 972 మార్కులు సాధించి శభాష్ అనిపించాడు. అనంతరం జేఎన్టీయూ విజయనగరంలో బీటెక్ (మెకానికల్) పూర్తిచేశాడు. వివిధ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను అభ్యసించాడు. కుటుంబ నేపథ్యం ఇది.. సింగూరు కృష్ణచైతన్య స్వస్థలం సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేట గ్రామం. ప్రస్తుతం ఆమదాలవలస మండలం పూజారిపేటలో నివాసం ఉంటున్నారు. తండ్రి సింగూరు రంగనాయకులు సెకండరీ గ్రేడ్ టీచర్గా (సరుబుజ్జిలి మండలం పకీరుసాహెబ్పేట ప్రాథమిక పాఠశాలలో) పనిచేస్తుండగా, తల్లి మీనాకుమారి గృహిణి. కృష్ణచైతన్యకు 2023 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. భార్య బొడ్డేపల్లి రమ్య గార మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నిలదొక్కుకుంటూ చదువుకోవడం ఉత్తమం.. చాలా మంది యూపీఎస్సీకి సన్నద్ధమవుతుంటారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. రెండు మూ డు సార్లు సీరియస్గా చదవాలి. ఆ తర్వాత సివిల్స్ అనుకుని కాలయాపన చేయకుండా.. సెంట్రల్ జాబ్స్ అనేకం ఉన్నాయి. వాటిని కూడా రాస్తుండాలని కృష్ణచైతన్య చెబుతున్నారు. ఆ జాబ్స్ చేస్తూ ఇంటికి ఆర్థికంగా బాసటగా ఉంటూ యూపీఎస్సీకి సన్నద్ధమవుతూ రాస్తుండాలని, దీంతో మనపై ఎలాంటి ఒత్తిడి ఉండదని సూచించారు. అటు ఫ్యామిలీని, ఇటు ఉద్యోగాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే.. చదువుకోవడం ఉత్తమమని ఆయన అన్నారు. -
● నేటి నుంచి ఆకాశవాణిలో లలితారెడ్డి ప్రసంగాలు
జి.సిగడాం: స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న లలితారెడ్డి ఆకాశ వాణిలో ప్రసంగాలు చేయనున్నారు. ఈ నెల 18, 20, 21 తేదీల్లో ఆకాశవాణిలో (ప్రసారభారతి) విశాఖపట్నం కేంద్రం నుంచి చింతన కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాయోజిత అంశాలపై ఉదయం 6.30 గంటలకు ప్రసంగం చేయనున్నారని సంబంధిత అధికారులు శుక్రవారం ఆమెకు సమాచారం అందజేశారు. లలితారెడ్డి గత ఏడాది జనవరిలో సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సావిత్రీబాయి పూలే అవార్డు పొందారు. సమాజ శ్రేయస్సుకు విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈమె హరివిల్లు, కవితా పుష్పమాలికలు, లలితాకథా సాగరం పుస్తకాలను కూడా రచించారు. ఆకాశవాణిలో ప్రసంగాలు చేసే అవకాశం రావడంపై ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు, కేజీబీవీ ప్రిన్సిపాల్ దాసరి ఉషారత్నకుమారి, తెలుగు రచయితల వేదిక అధ్యక్షలు, కార్యదర్శులు, ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్వీ రమణమూర్తి, వాండ్రంగి కొండలరావులు ఆమెను అభినందించారు. -
ఆయుష్షు తీరినా.. ఆపద్బాంధవుడై నిలిచాడు
శ్రీకాకుళం రూరల్: జెమ్స్ ఆస్పత్రిలో మరోసారి అవయవదానం జరిగింది. జెమ్స్ వైద్యులు ఆ వివరాలను వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం అజ్రామ్ గ్రామానికి చెందిన ఎం.లక్ష్మణరావు (42) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 14వ తేదీన ఇంటికి సమీపంలో కొబ్బరిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు పడిపోయాడు. పక్కనే ఉన్న బిల్డింగ్పై తల బలంగా ఢీకొట్టడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్డెడ్ కావడంతో బతికే చాన్స్ లేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వెంటనే ఆస్పత్రిలో అవయవాలను వేరు చేసి కిడ్నీ, లివర్ అవయవాలను విశాఖపట్నంకు తరలించారు. మృతునికి భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు పిల్లలు కామరాజు, రమణమ్మ ఉన్నారు. -
జిల్లాకు కొత్తగా 8 బస్సులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాకు కొత్తగా 8 అల్ట్రా డీలక్స్ బస్సులు వచ్చాయని జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. శ్రీకాకుళం ఒకటో డిపోకు ఒక బస్సు, టెక్కలి డిపోకు 4 బస్సులు, పలాస డిపోకు 3 అల్ట్రా డీలక్స్ బస్సులు వచ్చాయని తెలిపారు. పాతబస్సుల స్థానంలో ఈ కొత్తబస్సులు వచ్చాయని తెలిపారు. అలాగే అద్దె బస్సులకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయని, ఆగస్టు నాటికి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బస్సులను కూడా పంపించడం జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని డిపోలకు బస్సు లు చేరిపోయాయన్నారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం దూరప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మళ్లీ వారి ప్రాంతాలకు వెళ్లేందుకు గత మూడు రోజులుగా కాంప్లెక్స్ ప్రయాణికులతో రద్దీమయంగా కనిపించిందని, ఈ రద్దీకి అనుగుణంగా బస్సులు వేసి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూశామని తెలిపారు. జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ -
బీఆర్ఏయూలో క్యాంపస్ ఇంటర్వ్యూల నిర్వహణ
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం దివీస్ ల్యాబొరేటరీ సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు కెమిస్ట్రీ సబ్జెక్టుగా ఉన్న బీఎస్సీ డిగ్రీ విద్యార్థులు, ఎంఎస్సీ, బి.ఫార్మశీ, బీటెక్ కెమికల్ పూర్తి చేసిన, చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు హాజరయ్యా రు. ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగించారు. 351 మంది విద్యార్థులు ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. హెచ్ఆర్ మేనేజర్ రాజేష్, కంపెనీ ప్రతినిధి పూర్ణ ఆధ్వర్యంలోని సిబ్బంది ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ధ్రువీకరణ పత్రా ల పరిశీలన అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 20 రోజుల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా జాబితా విడుదల చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు విద్యార్హత బట్టి కల్పించనున్నట్లు తెలిపారు. ప్లేస్మెంట్ అధికారి సాగర్ పాల్గొన్నారు. సీబీఎస్ఈ సిలబస్పై శిక్షణ రణస్థలం: రానున్న విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఎంపికైన పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సీబీఎస్ఈ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే తర్ఫీదు పొందిన డీఆర్పీలతో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయని తెలిపా రు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ఎంపికై న 70 పాఠశాలల ఉపాధ్యాయులు వచ్చారు. కేజీబీవీ, ఆద ర్శపాఠశాలతో పాటు కొన్ని ప్రభుత్వ పాఠశాల లకు సీబీఎస్ఈ కేటాయించారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓ రాకోటి విజయకుమార్, రాష్ట్ర పరిశీలనాధికారి ఎస్వీడీ రమణ, రాష్ట్ర మానిటరింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. ఖరీఫ్కు సమాయత్తం రణస్థలం: ఖరీఫ్కు రైతులకు అవసరమైన సర్టి ఫై చేసిన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఏడీఏ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి ఆర్బీకే సిబ్బందితో సమావేశమయ్యారు. పచ్చిరొట్ట విత్తనాల కు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా క్షేత్ర స్థాయి లో చూడాలని సిబ్బందికి అదేశించారు. జీలు గు, కట్టేజనుము విత్తనాలు 50శాతం రాయి తీపై అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతన్నలను ఖరీఫ్కు సమాయత్తం చేయాలని తెలియజేశారు. సమావేశంలో ఏడీఏ వి.శ్రీనివాసరావు, ఏవోలు డి.విజయభాస్కర్, బి.బాబ్జి, ల్యాబ్ ఏఓ జి.సుహాసిని తదితరులు ఉన్నారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను డాక్టర్ ఎస్.ఉదయ్భాస్కర్ శుక్రవారం విడుదల చేశారు. అన్ని డిగ్రీ కోర్సుల్లో 1146 మంది పరీక్షకు హాజరు కాగా, 629 మంది ఉత్తీర్ణత సాధించారు. 54.89 శాతం ఫలితాలు నమోదయ్యాయి. కోర్సుల వారీ పరిశీలిస్తే బీఏలో 51 కి 36, బీఎస్సీలో 1020కి 548, బీబీఏలో 1కి1, బీసీఏలో 1కి1, బీకాం ఒకేషనల్లో 37 కి 18, బీకాం జనరల్లో 36 కి 25 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు 15 రోజుల్లో చేసుకోవాలని సూచించారు. ఫలితాలు జ్ఞాన భూమిలో ఉంచినట్లు తెలిపారు. మార్కుల జాబితాలు విద్యార్థులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
● రైతు నిజాయతీ
పొందూరు: దొరికిన సొత్తును ఎలా వెనకేసుకోవాలో అని ఆలోచించే వారున్న ఈ రోజుల్లో ఓ రైతు తన నిజాయితీని చాటుకున్నారు. మండలంలోని పిల్లలవలస గ్రామానికి చెందిన పైడి సూర్యనారాయణ పొందూరు బ్యాంకులో పద్దు పెట్టిన 27 గ్రాముల బంగారం గురువారం విడిపించుకున్నా రు. తన గ్రామానికి వస్తున్న సమయంలో బంగారం, 4 వేలు నగదుతో కూడిన మూటను ఒడ్డున పెట్టి కొలనులో స్నానానికి దిగారు. ఆ సమయంలో ఓ కుక్క బంగారం మూటను తీసుకుని వెళ్లిపోయింది. సూర్యనారాయణతో పాటు చుట్టు పక్కల ఉన్నవారు కుక్కను వెంబడించారు. కానీ ఆ కుక్క తప్పించుకుని వెళ్లిపోగా మూట కనిపించలేదు. ఇదంతా గురువారం జరిగింది. శుక్రవారం అదే గ్రామానికి చెందిన రైతు త్రినాథరావుకు ఆ మూట దొరకగా సూర్యనారాయణకు అందజేశారు. దీంతో గ్రామస్తులు రైతును అభినందించారు. -
నైపుణ్య శిక్షణ.. కొలువుల సాధన
చాలా ఉపయోగకరం నేను పద్మావతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాను. ఎలాంటి అదనపు ఫీజు లేకుండా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. చాలా ప్రయోజనకరంగా ఉంది. నా లాంటి పేదింటి పిల్లలు బయటకు వెళ్లి అధికంగా డబ్బులు వెచ్చించి ఇలాంటి శిక్షణ పొంద లేరు. అలాంటిది ఉచితంగా డిగ్రీ చదువుతో పాటు శిక్షణ అందిస్తున్నారు. – కంచరి వాసంతి, విద్యార్థిని ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది నేను పద్మావతిలో డిగ్రీ చదు వుకున్నా. ఈ శిక్షణ పొందా ను. పట్టాతో పాటు ఉద్యో గం కూడా వచ్చింది. సులువుగా ఉద్యోగం పొందాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టు అయ్యాను. ఇప్పుడు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నా. మూడేళ్లవుతోంది. – దాసరి యమున, బోరుబద్ర నరసన్నపేట: యువతలో చక్కటి ప్రతిభ పాటవాలు ఉన్నా సరైన దారిలో వెళ్లడం తెలీక ఉద్యోగం పొందలేక పోతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారిలో 15 శా తం మందే కొలువులు పొందుతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి పట్టా చేతికి వచ్చే సరికి తగిన నైపుణ్య శిక్షణ కూడా పొందితే అందరూ కొలువులు పొందవచ్చని భావించిన ప్రభుత్వం ఏపీ రాష్ట్ర నైపు ణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ నైపుణ్య శిక్షణా కేంద్రాలు(ఈఎస్సీ) ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 31 కేంద్రాలను ఎంపిక చేసి డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఏటా రెండు బ్యాచ్లుగా మూడు నె లల పాటు శిక్షణ ఇస్తారు. ఒక్కో బ్యాచ్లో 50 నుంచి వంద మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. ఉచితంగా ఈ శిక్షణ కల్పిస్తున్నారు. అలాగే శిక్షణ పూర్తయిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సర్టిఫికె ట్లు ఇస్తోంది. దీనికి అవసరమైన ల్యాప్టాప్లు, టీ వీ, ట్యాబ్లు సరఫరా చేస్తోంది. ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగం పొందే విధంగా నైపుణ్యత శిక్షణ అందిస్తోంది. విద్యార్థులు చదువులు పూ ర్తి చేసి బయటకు రాగానే అవకాశాలు అందిపుచ్చు కునేలా ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుండటంతో ఏటా ఉద్యోగ నియామకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు. ఇందులో ఆప్టిట్యూడ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వూ స్కిల్స్, ఆన్లైన్ క్యాంపస్ ఇంటర్వూ శిక్షణపై కూడా శిక్షణ అందిస్తున్నాయి. శిక్షణలు వినియోగించుకుంటున్న డిగ్రీ విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా శిక్షణ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు జిల్లాలో 31 కళాశాలల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు -
ఏపీఎల్కు మకరాంపురం క్రికెటర్ ఎంపిక
కంచిలి: మండలంలోని మకరాంపురం గ్రామానికి చెందిన బెందాళం సాత్విక్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టో ర్నమెంట్లో ఆడటానికి ఎంపికై నట్లు తండ్రి భోగేశ్వరరావు తెలిపారు. ఆయన ఈ మేరకు స్థానిక విలేకర్లతో శుక్రవారం మాట్లాడారు. సాత్విక్ను ఇటీవల నిర్వహించిన వేలం పాట లో గోదావరి లైన్స్ జట్టు లక్షా 60వేలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సాత్విక్ ఏడో తరగతి వరకు కంచిలిలో ఒక ప్రైవేటు పాఠశాలలోను, ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఆంధ్రా క్రికెట్ అకాడమీకి ఎంపిక కావడంతో వారే చదివించారని, డిగ్రీ సోంపేటలో ఒక ప్రైవేటు కళాశాలలో పూర్తిచేశాడన్నారు. ఇక అండర్–14లో రెండేళ్లు, అండర్–16లో ఒక సంవత్సరం, అండర్–19లో ఒక సంవత్సరం ఆడినట్లు తండ్రి భోగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం సీనియర్ జట్టు కు సైతం ఆడుతున్నట్లు తెలి పారు. గత రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో గోదావరి టైటాన్స్ జట్టుకు ఆడిన సాత్విక్ ఈ ఏడాది ఉత్తరాంధ్ర లైన్స్ జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ అయినప్పటికీ లెఫ్ ఆర్మ్ స్పిన్ వేసి ఆల్రౌండర్గా గుర్తింపు సాధించాడు. సాత్విక్ ఎంపికపై స్థానిక క్రీడాకారులు అంతా అభినందనలు తెలిపారు. -
సిద్ధ వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సయాటికా జాయింట్ పెయిన్స్, పెరాలసిస్ వెర్టికో, నరాల వాపు లు వంటి వ్యాధులకు సిద్ధ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేశారు. శ్రీకాకుళం నగరంలో చిన్న బజార్ రోడ్డులోని ఓ ప్రైవేటు కల్యాణ మండ పంలో శుక్రవారం అరసవల్లి ట్రస్ట్ బోర్డ్ సభ్యు లు మండవల్లి రవి ఆధ్వర్యంలో సిద్ధ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ జగదీష్ శ్రీనాథ్ రితిక్ అధిక సంఖ్యలో రోగులకు చికిత్స చేశారు. ఈ సందర్భంగా మండవల్లి రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ పద్ధతుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, ఈ వైద్యం అందించేందుకు మరో నెల రోజుల్లో మరొకసారి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సౌజన్యంతో భారీ ఎత్తున త్వరలో సిద్ధ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. -
బాలికల గురుకులాల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశానికి కౌన్సెలింగ్
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికలు గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఎచ్చెర్ల బాలికల అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాల లో శుక్రవారం ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ఆన్లైన్ ద్వారా మెరిట్ ఆ ధారంగా ప్రవేశాలు నిర్వహించగా, ఖాళీ సీట్లకు నే రుగా ప్రవేశాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఎచ్చెర్ల, పెద్దపాడు, తామరాపల్లి, నందిగాం, మందస, పాతపట్నం, వంగర, భామిని గురుకులాల్లో ప్రవేశాలు నిర్వహించారు. అన్ని గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉండగా, నందిగాం, భామినిల్లో ఆర్ట్స్ గ్రూపులు హెచ్ఈసీ, సీఈసీ నిర్వహిస్తున్నారు. ఎనిమిది గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ 180, ఎస్టీ 29, బీసీ 46, ఓసీ ఏడు, ఇతర సీట్లు 27 మొత్తం 295 సీట్లకు ప్రవేశాలు కల్పించారు. జిల్లా అంబేడ్కర్ గురుకులాల కోఆర్డినేటర్ బాలాజీ, ప్రిన్సిపాళ్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం సీట్లు ఉంటే రిజర్వేషన్ల మార్పు ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియెట్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు కోఆర్డినేటర్ తెలిపారు. -
కొత్త కర్ర చెరువులో ఆక్రమణల తొలగింపు
నరసన్నపేట: మేజరు పంచాయతీ పరిధిలోని సంత సమీపంలో ఉన్న కొత్త కర్ర చెరువులో ఆక్రమణలకు ప్రయత్నించగా పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం అడ్డుకున్నారు. సర్వే నంబర్ 44 లో ఉన్న చెరువులో ఇప్పటికే కొంత మేర ఆక్రమణలకు గురి కాగా తాజాగా ఒకరు ఇంటి నిర్మాణం కోసం మట్టి వేశారు. ఎలాంటి అనుమతులు లేకపోవడం, చెరు వు గర్భం కావడంతో మట్టి పోసిన విషయాన్ని గమనించిన పంచాయతీ సిబ్బంది అదికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సవర చిన్నారావు, వీఆర్ఓ అఖిల, సర్వే యర్ శరణ్య, వీఆర్ఏ బండి రామారావు వెళ్లి కొలతలు వేసి చెరువులో వేసిన మట్టిని జేసీబీతో తొల గించారు. చెరువులో ఆక్రమణలకు పాల్పడవద్దని ఈఓ చిన్నారావు హెచ్చరించారు. -
విజయదుర్గమ్మకు ప్రత్యేక అలంకరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక నానుబాలవీధిలో వేంచేసిన విజయదుర్గా దేవి ఆలయంలో ఫల్గుణమాస శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. టీడీపీ బెదిరింపులపై ఫిర్యాదు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ నాయకులను బెదిరిస్తున్నారని కాశీబుగ్గ పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటలకు కాశీబుగ్గ స్టేషన్కు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు బెదిరింపులకు సంబంధించి ఆధారాల తో కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదును ఎస్ఐ పారినాయుడుకు అందించారు. ఫిర్యా దు చేసిన వారిలో వైఎస్సార్ సీపీ ముఖ్యనాయకులు బోర కృష్ణారావు, డబ్బీరు భవానీశంకర్, పీవీ సతీష్, మల్లా సురేష్బాబు, శంకర్పండా, తూముల శ్రీనివాసరావు, సనపల సింహాచలం, రోణంకి శ్రీనివాసరావు, పోతనపల్లి హరిప్రసాద్, పెంట రత్నాకర్, కొంచాడ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. అందుబాటులోకి రెండు లిఫ్ట్లుకాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్లో ఉన్న ఎలక్ట్రికల్ లిఫ్ట్లు ఎట్టకేలకు పనిచేస్తున్నాయి. స్టేషన్కు ప్రారంభంలో ఉన్న లిఫ్ట్ పనిచేస్తుండగా రెండో నంబర్ ఫ్లాట్ఫాంలో ఉన్న లిఫ్ట్ ఇటీవల పాడైంది. తరచూ మరమ్మతులు చేస్తున్నప్పటికీ ఇ బ్బందిగా మారడంతో సంబంధిత అధికారులు విచ్చేసి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కారు అద్దెకు తెచ్చి.. తాకట్టు పెట్టి శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని ఇటీవలే రామలక్ష్మణ కూడలి సమీపంలోని ఫుడ్ కోర్టు యాజమాన్యంపై దాడికి పాల్పడిన కె.శేఖర్ అనే వ్య క్తిపై మరో కేసు నమోదైనట్లు పోలీసులు తెలి పారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. శేఖర్ విశాఖపట్నంలోని ఎస్కెఎంఎల్ పేరు గల కార్ల కంపెనీకి వెళ్లి ఓ కారును అద్దెకు తీసుకున్నాడు. అద్దె చెల్లించడంలో జాప్యం చేయడంతో వారికి అనుమానం వచ్చి శేఖర్ను సంప్రదించారు. అయితే అతను కారుకు ఉండే జీ పీఎస్ ట్రాకర్ను తొలగించాడు. దీంతో బా ధితులు రెండో పట్టణ పోలీసులను శుక్రవారం ఆశ్రయించారు. ఈ విషయం సీఐ ఉమామహేశ్వరరావు వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి విషయం వచ్చిందని, విచారణ చేస్తున్నామన్నారు. శేఖర్పై 2023లోనే రౌడీషీట్ ఉండటం, శుక్రవారం రెండో పట్టణ సీఐ నిర్వహించిన కౌన్సిలింగ్కు కూడా గైర్హాజరవ్వడం విశేషం. -
యువకుడి దారుణ హత్య
శ్రీకాకుళం ౖక్రైమ్ : జిల్లా కేంద్రంలోని గూనపాలెంలో గురువారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. మేడపై తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతుకోసి పారిపోయారు. రెండేళ్ల కిందట ఇదే ప్రాంతంలో గొడ్డలితో ఓ వ్యక్తిని చంపడం అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే. ఒకటో పట్టణ పోలీసులు, మృతుని భార్య, స్థానికులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. పురపాలక శాఖలో పారిశుద్ధ్య ఒప్పంద కార్మికునిగా పనిచేస్తున్న సీరా సురేష్ (33)కు తిరుమల అనే మహిళతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 13 ఏళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. సురేష్ భార్య తిరుమల నగరంలోని ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 20న వారి పెళ్లి రోజు కావడంతో గురువారం సా యంత్రం భార్య, పిల్లలతో కలిసి సురేష్ షాపింగ్ కోసం బయటకు వెళ్లి అన్నీ కొనుక్కుని ఇంటికి తిరిగి వచ్చారు. ఫోన్ వచ్చిందంటూ.. అంతా ఇంటికొచ్చి తిన్నాక పది గంటలకు సురేష్కు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లాడని మళ్లీ 11.15కు ఇంటికి వచ్చాడని, తిరిగి మళ్లీ ఫోన్ వచ్చిందంటూ బయటకు వెళ్లిపోయాడని మృతుడి భార్య చెబుతున్నారు. రాత్రి రోజూలాగానే ఎదురింటిలో నివ సిస్తున్న రుప్పా చంద్రశేఖర్ మేడ మీద (ఒక గది ఉంది) ఆరుబయట పిల్లలతో కలిసి నిద్రించడానికి తిరుమల వెళ్లారు. మధ్యలో అర్ధరాత్రి 12.15కు వాష్రూమ్ కోసం దిగి చూసే సరికి కుక్కలు అరవడం, ఇద్దరు వ్యక్తులు అటుగా తిరగడం తిరుమల చూశారు. అప్పటికీ తన భర్త సురేష్ రాకపోవడంతో నిద్రపోయారు. మళ్లీ రాత్రి 1:45 ప్రాంతంలో మెలకువ రావడంతో అలా లేచి చూసేసరికి కొద్ది దూరంలో భర్త రక్తపు మడుగులో కనిపించడంతో నిశ్చేష్టురాలినైపోయానని ఆమె తెలిపారు. తేరుకుని అన్నా, వదినా అంటూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు చూసేసరికి .. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ బలివాడ గణేష్ ఘటనా స్థలికి వెంటనే చేరుకున్నారు. సీఐ లెంక సన్యాసినాయుడు, క్లూస్ టీమ్ కూడా చేరి హత్య జరిగిన ప్రదేశాన్ని, చుట్టు పక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుని శవాన్ని పరిశీలించగా గొంతు, మెడ కత్తితో కోసి ఉండటం, కడుపులో మూడు కత్తిపోట్లు, చేతికి గాయమై ఉండడం కనిపించింది. అనుమానాలు అనేకం.. మృతుడు సురేష్ 80 ఫీట్ రోడ్డు సమీప ఎస్బీఐ కాలనీలో మరో వివాహితతో గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మహిళకు భర్త, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె కూడా హోటల్లోనే పనిచేస్తుంది. అంతేకాక భార్య తిరుమలతో మనస్పర్థల కారణంగా ఈ ఏ డాది జనవరిలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని సీఐ సన్యాసినాయుడు పేర్కొన్నారు. మృతుని భార్య తిరుమల తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పడం గమనార్హం. శ్రీకాకుళం పరిధి గూనపాలెంలో ఘటన మృతుడు పారిశుద్ధ్య ఒప్పంద కార్మికుడు మేడపై నిద్రిస్తుండగా గొంతు కోసి చంపేసిన వైనం -
వరకట్న వేధింపు కేసులో ఇద్దరికి జైలుశిక్ష
హిరమండలం: వరకట్న వేధింపుల కేసులో భర్త, అత్తలకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సోంపేట సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి ఎస్ఐ జి.నారాయణస్వామి అందించిన వివరాలిలా ఉన్నాయి. తంప గ్రామానికి చెందిన పెంటల హారతి అనే వివాహిత 2020 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. భర్త బోయితి తిరుమలరావు, అత్త లిమ్మమ్మ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పుట్టింటి వారి ఫి ర్యాదులతో కేసు నమోదు చేసిన పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ కేసు నమోదు చేశారు. నిందితులపై అభియోగాలు మోపుతూ కేసు వేశారు. పలుమార్లు విచారణ కొనసాగింది. శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి టి.భాస్కరరావు తీర్పు చెప్పారు. భర్త తిరుపతిరావుతో పాటు అత్త లిమ్మమ్మలకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. బాధితుల తరఫున పీపీ కె.వెంకటరావు వాదించారు. హిరమండలం ఎస్ఐ నారాయణస్వామి నిందితులను హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. -
దేవుడి సొమ్ముకే శఠగోపం
● జిల్లాలో వరుస ఘటనలతో చర్చల్లోకి దేవదాయ శాఖ ● వెలుగులోకి సింగుపురంలో హుండీ అక్రమాలు, గుడివీధిలో నకిలీ రశీదులుఅరసవల్లి: జిల్లాలో దేవదాయ శాఖ తర చూ చర్చల్లోకి వస్తోంది. దేవుడి మొక్కుబడులన్నా, ఆలయ ఆదాయమన్నా, ఏమా త్రం ఖాతరు చేయకుండా కొందరు దేవదాయ శాఖ ఉద్యోగులు దోచేస్తున్నారు. ఆఖరికి దొంగ లెక్కలు రాసేస్తూ, నకిలీ రశీదు పుస్తకాలు, నకిలీ దర్శన టిక్కెట్లు సైతం విక్రయించేసి స్వామి ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో ఒకవైపు వ రుసగా పలు ఆలయాలల్లో దొంగలు పడి హుండీలు బద్దలుగొట్టి విగ్రహాలపై ఆభరణాలను కొట్టేస్తుంటే, మరోవైపు ఆ సంబంధిత శాఖకు చెందిన అధికార సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం మండలం సింగుపురం కొండపై హటకేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నతాధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా హుండీని తెరిచేసి లెక్కించేసి కొంత నగదును మాత్రమే రికార్డులకు ఎక్కించేశారు అక్కడి ఈఓ వెంకటరమణ. ఆయ నే దేవదాయ శాఖలో శ్రీకాకుళం డివిజన్కు ఇన్స్పెక్టర్గా కూడా పనిచేస్తుండడం గమనార్హం. గత నెల 24న జరిగిన ఈ అనధికార హుండీ తెరిపించే ఘటనపై దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత స్పందించి విధుల నుంచి వెంకటరమణను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తదుపరి చర్యలపై స్పందన లేకుండా పోయింది. ఇక ఇలాంటి వ్యవహారమే జిల్లా కేంద్రంలోని గుడివీధిలో శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి వారి ఆలయ ఉపాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చెందిన భూముల విషయంలోనూ చోటుచేసుకుంది. ఇక్కడి ఆలయ భూముల నుంచి రావాల్సిన వార్షిక శిస్తు లు రూ.2,20,400 నగదును నకిలీ రశీదులతో ఇక్కడి రెగ్యులర్ అటెండర్ వి.సతీష్ నొక్కేశాడు. ఈ వ్యవహారం ఈ నెల 7న వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడి ఈఓ ఎం.సుకన్య వెంటనే స్పందించి అ టెండర్ సతీష్ను ఏకంగా ఉద్యోగం నుంచే తొలిగించి వన్టౌన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. అయితే సింగుపురం కొండ పై జరిగిన వ్యవహారంలో ఈఓను సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుని ఊరుకున్నారే తప్ప తదుపరి చ ర్యలేవీ చేపట్టకపోవడంపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా వరుస ఘటనలు జిల్లా దేవదాయ శాఖలో చోటుచేసుకుంటున్నా అధికారుల స్పందనలో జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు సింగుపురం కొండపై జరిగిన అక్రమ అనఽధికారిక వ్యవహారంపై వెంటనే ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించాను. సంబంఽధిత ఈఓ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ సుజాత ఆదేశాలను అమలు చేశాం. అయితే దీనిపై విచారణాధికారిని నియమించేలా డిప్యూటీ కమిషనర్ నుంచే ఆదేశాలు రావాల్సి ఉంది. విచారణలో నిజానిజాలు తేలనున్నాయి. అలాగే గుడివీధి వ్యవహారంలో పోలీసులు సతీష్పై కేసు నమోదు చేశారు. దీనిపై కూడా లోతైన విచారణ జరుగనుంది. – బీఆర్వీవీ ప్రసాద్ పట్నాయక్, జిల్లా దేవదాయ శాఖాధికారి -
‘శ్రీరాములు’ సేవలు ఆదర్శనీయం
వజ్రపుకొత్తూరు రూరల్: గిరిజనోద్యమ నాయకులు కామ్రేడ్ బమ్మిడి శ్రీరాములు ఉద్యమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని పలువురు వక్తలు కొనియాడారు. మండలం నగరంపల్లిలో శుక్రవారం సీపీఎం నాయకులు నెయ్యిల మోహనరావు అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.తులసీదాస్, అఖిల భారత కార్మిక సంఘ నాయకులు దడాల సుబ్బారావుతో పాటు పలువురు నాయకు లు మాట్లాడారు. శ్రీరాములు విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారని కమ్యూనిస్టు సిద్ధాంతాలను విశ్వసిస్తూ సుమారు 70 ఏళ్ల పాటు అనేక ఉద్యమాలు చేసి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని అన్నారు. గిరిజన, రైతుల పక్షాన నిలు స్తూ పోరాటంలో అజ్ఞాతవాసం చేశారని గుర్తు చేశా రు. ముందుగా శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లతో నివాళులర్పించారు. కళాకారులు శిష్టు మనోజ్, ఎన్.చంద్రయ్య, టి.వైకుంఠరావు పాడిన పాటలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహన్రావు, సీపీఎం నాయకులు బమ్మిడి ఆనందరావు, పీఎంసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు బి.మోహన్రావు, పి.పాపారావు, మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాం చౌదరి, మన్యం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, కార్మిక సంఘ నాయకులు టి.తిరుపతిరావు, వైద్యులు తెప్పల ఆనందరావు, ప్రజా సంఘాల నాయకులు వాసుదేవరావు, కుసుమ, బి.రామకృష్ణ, అరుణ్కుమార్, పైల చక్రవర్తి, అభిమానులు తదితరులు ఉన్నారు. -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్ల తరలింపు
టెక్కలి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన పో స్టల్ బ్యాలెట్ పోలింగ్కు సంబంధించిన పత్రాలను గురువారం స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరచిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఆర్ఓ నూరుల్ ఖమర్ పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో సురక్షితంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. టెక్కలి నియోజకవర్గంలో సుమారు 3044 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
పకడ్బందీగా కౌంటింగ్కు ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: విధి నిర్వహణలో అంకిత భావం, అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ము గిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి ఆయన ఆర్ఓలు, పలువురు నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, అలాగే, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ టీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ఎంపిక, వారికి వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్ల ప్లాన్ పక్కాగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్ర తి టేబుల్లో మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉండేలా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి, ఏజెంట్లకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, శివాని కాలేజీలోని కౌంటింగ్ కేంద్రా ల వద్ద ముందస్తు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.గణపతి రావు, ఆర్వోలు నూరుల్ కమర్, భరత్ నాయక్, సీహెచ్ రంగయ్య, లక్ష్మణ మూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, సీపీఓ ప్రసన్న లక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్య కిరణ్, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్న కేశవరావు, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డీఎంహెచ్ఓ బి.మీనాక్షి, సర్వ శిక్ష పీఓ ఆర్.జయ ప్రకాశ్, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావు తదితర అధికారులు హాజరయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ -
టీడీపీ మూకల దాష్టీకం
కోటబొమ్మాళి: నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురం గ్రామానికి చెందిన తోట మల్లేసుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ దాడి చేసి కొట్టినట్లు గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిన్నవెంటాపురం పోలింగ్బూత్ ఏజెంట్గా తోట మల్లేసు కుమారుడు మాధవరావు ఉన్నారని, ఆ కోపంతో గురువారం సాయంత్రం గ్రామంలో ఎండలవారాల పండగ జరుగుతుండగా పాతప ట్నం గ్రామదేవత గుడి వద్ద మల్లేసుపై మారణాయుధాలతో దాడిచేశారని తెలిపారు. దీంతో మల్లేసు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మల్లేసును కోటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి వైజాగ్ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహమ్మద్ అలి తెలిపారు. ఓటమి భయంతోనే.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడు లు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అన్నెపు రామారావు, రోణంకి మల్లయ్య, నూక సత్యరాజు, కాల్ల సంజీవరావు, చింతాడ అనిరుద్రుడు, పట్నాన శ్రీనివాస్, ఎస్.వినోద్, అనపాన బాలకృష్ణ, కవిటి రామ రాజు తదితరులు తెలిపారు. దాడిలో గాయపడిన మల్లేసు కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్ తండ్రిపై దాడి పరిస్థితి విషమం విశాఖ కేజీహెచ్కు తరలింపు -
బాధితులకు మంత్రి ధర్మాన పరామర్శ
శ్రీకాకుళం రూరల్: చాపురం పంచాయతీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇటీవల ఎన్నికల సమయంలో కొంతమంది టీడీపీ సానుభూతిపరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో గాయపడిన వారిని మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం పరామర్శించారు. అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. విపక్ష పార్టీల దౌర్జన్యాలకు అంతూపంతూ లేకుండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ నాయకుల ఆగడాల కారణంగా ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు ఉద్రిక్తలకు దారి తీశాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement