విజయవాడలో విషాదం.. డాక్టర్‌ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ.. | Sakshi
Sakshi News home page

విజయవాడలో విషాదం.. డాక్టర్‌ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..

Published Tue, Apr 30 2024 12:43 PM

Orthopedic doctor family deceased In vijayawada

ఎన్టీఆర్‌, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివిన శ్రీనివాస్‌.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో  ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెష‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.

మంగళవారం ఉదయం గురునానక్‌ నగర్‌లోని ఇంట్లో శ్రీనివాస్‌ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్‌ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది.  దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్‌ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతులు 

  • డాక్టర్ శ్రీనివాస్ (40), 
  • ఉషారాణి (36), 
  • శైలజ (9), 
  • శ్రీహాన్(5), 
  • శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)

ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అ‍న్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్‌ బాక్స్‌లో డాక్టర్‌ శ్రీనివాస్‌ పేరిట ఒక లెటర్‌ దొరికింది. దీంతో ఇది సూసైడ్‌ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్‌ తానూ ఆత్మహత్యకు పాల్పడి   ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.

శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.
:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు 

Advertisement
Advertisement