సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదిత శాతం పెంచాలని ఎన్నికలసంఘం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫామ్ ‘అభిబస్’ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఈమేరకు సంస్థ సీఈఓ లెనిన్ కోడూరు, సీఓఓ రోహిత్ శర్మ మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ABHIVOTE కూపన్ కోడ్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. దీంతోపాటు రూ.100 క్యాష్బ్యాక్ కూడా పొందే వీలుంది’ అని చెప్పారు.
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ గతంలో ఓటర్లకు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది.