రామానాయుడు ఫిలిం స్కూల్‌లో కౌన్సిలింగ్‌ ఫౌండేషన్‌ కోర్సు ! | Sakshi
Sakshi News home page

రామానాయుడు ఫిలిం స్కూల్‌లో కౌన్సిలింగ్‌ ఫౌండేషన్‌ కోర్సు !

Published Wed, May 1 2024 6:32 PM

Free Foundational Course For Mental Well Being Launched In  Rama Naidu Film School

మానవుని దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో సంపాదన పరుగులో మనిషికి మానసిక ప్రశాంతత  దారుణంగా కరువయ్యిందనే చెప్పాలి. అందుకోసం తాను ఏం చేయాలన్నది కూడా స్ప్రుహ లేనంత గందరగోళంలో ఉన్నాడు. దీంతో సమస్యలన్నీ ఒక పెనుభూతంలా కనిపించి ఎదుర్కొనే స్థైర్యం లేక నిసత్తువుగా మారిపోతున్నాడు. విద్యార్థుల నుంచి పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు అందర్ని వేధిస్తున్న సమస్యే ఈ మానసిక అనారోగ్యం.

దీన్ని మెరుగుపరుచుకుని మనల్ని మనం సంసిద్ధం చేసుకునేలా కౌన్సిలింగ్‌ ఇచ్చే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలానే రామానయుడు ఫిల్మ్‌ స్కూల్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషన్, ముదిత ట్రైబ్ ఫౌండేషన్‌ల సహకారంతో రామా నాయుడు ఫిల్మ్ స్కూల్‌  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నో కాస్ట్‌ ఫౌండేషన్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పర్సన్-టు-పర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సెలింగ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఆయా వ్యక్తులు సహ కౌన్సిలర్‌లుగా మారి తమ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే స్థాయికి చేరేలా ఈ కోర్సుని రూపొందించారు.

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్‌ నో కాస్ట్‌ ఫౌండేషన్‌ కోర్సు రామానాయుడు ఫిలిం స్కూల్‌లో ఇవాళ మే 1 నుంచి ప్రారంభమై మే 6, 2024 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజుల ఫౌండేషన్‌ కోర్సు కోసం సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్‌ల డిమాండ్‌ ఎక్కువయ్యిందని గ్లోబల్‌ వెల్ఫేర్ ఫౌండేషకి చెందిన శ్రీనివాసన్‌ లింగేశ్వరన్‌ అన్నారు. ఆ డిమాండ్‌ని తీర్చే ఉద్దేశ్యంతోనే ఈ కోర్సుని రూపొందిచడం జరిగిందని చెప్పారు. 

ఇది  కేవలం కౌన్సిలర్‌ల కొరత సమస్యను పరిష్కరించడమే కాకుండా మానిసిక ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పించేలా ప్రాధాన్యత ఇచ్చేలా చేసి సంపూర్ణ సంక్షేమ  నిబద్ధతకు పెద్ద పీట వేస్తుంది. ఈ మేరకు ముదిత వ్యవస్థాపకురాలు మిహీకా దగ్గుబాటి మాట్లాడుతూ..ఎటువంటి ఖర్చు లేకుండా వారివారీ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా శక్తిమంతంగా చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 

ఇలాంటి కోర్సులు నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయని రామానాయుడు పిల్మ్‌ స్కూల్‌ చైర్మన్‌ డి సురేష్‌ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యాసకులకు ఇద్దరూ ప్రఖ్యాత మనస్తత్వవేత్తలు కౌన్సిలింగ్‌ ద్వారా మాసిక ఆరోగ్యంపై లోతైన అవగాహానను, ఆచరణాత్మక పద్ధతుల గురించి కూలంకషంగా తెలియజేస్తారు. ఈ కోర్సులో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలన్నింటిని నిపుణులు కవర్‌ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే గాక ఇతరులను ప్రభావితం చేసేలా కౌన్సిలర్‌లుగా మారి సంతోషకరమైన సమాజానికి బాటలు వేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ  కోర్సులో జాయిన్‌ అయ్యి ఉజ్వల భవిష్యత్తు దిశగా  ఇవాళ నుంచే తొలి అడుగులు వేద్దాం. 

(చదవండి:  ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!)

 


 

Advertisement
Advertisement