Glass Symbol To Pasupuleti Sudhakar Kavali Seat, Kavya Is Worried About Votes | Sakshi
Sakshi News home page

గ్లాసుతో సైకిల్‌కు గుబులు

Published Tue, Apr 30 2024 10:40 AM

Glass symbol to Pasupuleti Sudhakar Kavali Seat

కావలిలో పసుపులేటి సుధాకర్‌కు గాజు గుర్తు కేటాయింపు

టీడీపీ రెబల్‌గా,స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో..

ఓట్లు చీలుతాయనే ఆందోళనలో కావ్య  

వరుస షాకులతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి కావలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రెబల్‌ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్‌ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటీలో ఆయన ఉండటంతో ఓట్లు భారీగా చీలుతాయనే ఆందోళనతో ఉన్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తాజా పరిణామం అశనిపాతంలా పరిణమించింది. సుధాకర్‌కు అనూహ్యంగా జనసేన గాజు గ్లాస్‌ గుర్తు లభించడంతో కావ్య శిబిరం ఒక్కసారిగా డీలాపడిపోయింది.

కావలి: టీడీపీ రెబల్‌గా, స్వతంత్య్ర అభ్యర్థిగా కావలి నుంచి రంగంలోకి దిగిన పసుపులేటి సుధాకర్‌కు ఎన్నికల కమిషన్‌ గ్లాస్‌ గుర్తును కేటాయించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఓట్లు భారీగా చీలిపోతాయనే భయంతో కావ్య శిబిరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది.   

బీసీల ప్రతినిధిగా రాజకీయాల్లోకి.. 
బీసీల ప్రతినిధిగా.. పీఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్‌ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గ్లాస్‌ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం రాష్ట్ర పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించుకొని కావలిలో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ కోసం పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో సుధాకర్‌ తన వర్గీయులతో నిరసన ప్రదర్శనలతో పాటు రాజమహేంద్రవరంలో ర్యాలీలను చేపట్టారు. దీంతో కావలి టీడీపీ టికెట్‌ సుధాకర్‌కేనని అందరూ భావించారు. అప్పటి వరకు కావలి ఇన్‌చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సైతం సుధాకర్‌ అభ్యరి్థత్వాన్ని బలపర్చారు.   

రెబల్‌గా పోటీకి సై.. 
ఈ తరుణంలో కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో కావలి టికెట్‌ను దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు, కేడర్‌ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో కంగుతిన్న పసుపులేటి సుధాకర్‌ కావలిలో రెబల్‌గా పోటీ చేసేందుకు డిసైడయ్యారు. ట్రస్ట్‌ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, టీడీపీ, జనసేన కేడర్‌ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని బరిలోకి దిగారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు సైతం పసుపులేటికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధాకర్‌కు గ్లాస్‌ గుర్తు కేటాయించడంతో ఆయన వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.    

భగ్గుమంటున్న కావ్య 
పసుపులేటి సుధాకర్‌కు గ్లాస్‌ గుర్తు కేటాయించడంతో కావ్య కృష్ణారెడ్డికి మైండ్‌ బ్లాౖకైంది. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పసుపులేటిపై తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై ఎనిమిది కేసులున్నాయని, 420 అంటూ నోరుపారేసుకున్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పసుపులేటి సుధాకర్‌ ఇద్దరూ కలిసి తనపై పోటీకి దిగారని ఆరోపించారు.    

రామనారాయణరెడ్డికి గ్లాస్‌ గుర్తు 
ఆత్మకూరు: అదేంది.. రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారా.. ఈ మతలబేమిటబ్బాననే సందేహం కలగక మానదు. అయితే దీన్ని కేటాయించింది ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి కాదండోయ్‌. అక్కడే స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో నిలిచిన ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించడంతో ఓట్లు ఎక్కడ చీలుతాయోననే ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. 

గ్లాసుతో సైకిల్‌కు గుబులు  
 

Advertisement
Advertisement