చైనాకు యాపిల్‌ షాక్‌.. 5 లక్షల జాబ్స్‌ మనకే..! | Sakshi
Sakshi News home page

చైనాకు యాపిల్‌ షాక్‌.. 5 లక్షల జాబ్స్‌ మనకే..!

Published Thu, Apr 11 2024 7:56 PM

apple to employ 5 lakh people in india in next 3 years - Sakshi

ప్రీమియం ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ యాపిల్ చైనాకు షాక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమ చైనా ఆధారిత సప్లయి చైన్‌లో సగభాగాన్ని భారత్‌కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 

స్థానిక విలువ జోడింపుపై దృష్టి సారించిన యాపిల్.. దేశీయ విలువ జోడింపును 11-12 శాతం నుంచి 15-18 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌గా, ఆర్‌అండ్‌డీ  హబ్‌గా ఎదుగుతున్న భారత్‌ ప్రాముఖ్యతకు అనుగుణంగా యాపిల్‌ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, దేశంలో స్థానిక విలువ జోడింపు 14 శాతంగా ఉంది. ఇది చైనాకు చెందిన 41 శాతం కంటే చాలా తక్కువ.

యాపిల్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. తయారీ, రిటైల్ రెండింటిపైనా దృష్టి సారించింది. దేశంలో మొదట్లో పాత ఐఫోన్ మోడల్‌లు అసెంబుల్ చేయగా, ఇప్పుడు ఐఫోన్ 15 మోడళ్లను కూడా తయారు చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 14 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి.

యాపిల్‌ కంపెనీ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ అనే రెండు ప్రధాన తయారీ భాగస్వాములను కలిగి ఉంది. వీటి ద్వారా వరుసగా 67 శాతం, 17 శాతం ఐఫోన్‌లు అసెంబుల్‌ అవుతున్నాయి. అదనంగా కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న టాట్ గ్రూప్ 6 శాతం ఐఫోన్లను అసెంబుల్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేస్తున్న ఏడు ఐఫోన్‌లలో ఒకటి ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్‌ అవుతోంది.

Advertisement
Advertisement