Sakshi News home page

‘ఎక్స్‌’లో ఫీచర్లకోసం రుసుము.. ఎందుకంటే..

Published Wed, Apr 17 2024 9:02 AM

Elon Musk Confirmed That New Unverified Users Of X Will Pay Fee For Features - Sakshi

ప్రపంచ దిగ్గజ టెక్‌ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌(ట్విటర్‌)’ నకిలీ ఖాతాల నియంత్రణకు, అనవసర బాట్స్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగా కొత్త వినియోగదారులకు కొద్ది మొత్తంలో రుసుము విధించనున్నట్లు తెలిసింది.

ఎక్స్‌ ఫ్లాట్‌ఫామ్‌లో కొత్తగా నమోదవుతున్న వినియోగదార్లు ఇకపై లైక్‌, పోస్ట్‌, బుక్‌మార్క్‌, రిప్లయ్‌ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఇతరుల ఖాతాలను ఫాలో అవ్వడం, ఎక్స్‌లో పోస్ట్‌లు చూడడం వంటివాటికి ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పాయి. 

నకిలీ ఖాతాలు, బాట్స్‌ నియంత్రణకు ఇదొక్కటే మార్గమని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త వినియోగదార్లు మూడు నెలల తర్వాత ఎక్స్‌లోని అన్ని సదుపాయాలను ఉచితంగా పొందొచ్చని ఎక్స్‌ అధినేత ఎలొన్‌ మస్క్‌ తెలిపారు. కొత్త నిబంధనలు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనా లేదంటే ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఎక్స్‌ ధ్రువీకరణ చేసుకోని కొత్త వినియోగదార్లకు తమ ఖాతాపై ‘ప్రత్యేక ఫీచర్లు కావాలంటే కొంత రుసుము చెల్లించాలనే’ డైలాగ్‌ బాక్స్‌ కనిపిస్తుంది. దానిక్లిక్‌ చేసి పేమెంట్‌ పూర్తి చేసి ప్రీమియం సదుపాయాలు వినియోగించుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.?

గతేడాది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చర్చ సందర్భంగా ఎలొన్‌మస్క్‌ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లోని బాట్‌ను నియంత్రించడానికి కొద్దిమొత్తంగా రుసుము చెల్లించాల్సి రావొచ్చని చెప్పారు. ఈనేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొత్త వినియోగదారులకు రుసుము విధించే విధానాన్ని న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్నారు. అయితే ఎక్స్‌లో ఏమేరకు బాట్‌లను కట్టడిచేశారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

Advertisement
Advertisement