Sakshi News home page

మోదీ అనుకూల వ్యాఖ్యలు: ‘ఐర్లాండ్‌లో భారత రాయబారిని వెంటనే తొలగించాలి’

Published Wed, Apr 17 2024 10:10 AM

India envoy to Ireland slams on Congress party says sack him - Sakshi

ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. అఖిలేష్‌ విమర్శలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైం రమేష్‌ స్పందించారు. అఖిలేష్‌ చేసిన వ్యాఖ్యలు చేయటం వృతిపరంగా ఆయన అవమానకరమైన ప్రవర్తనకు నిదర్శనం అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

‘భారత ప్రభుత్వాన్ని సమర్థించటం ఊహించినదే. కానీ, ఒక రాయబారి ప్రతిపక్ష పార్టీలపై బహిరంగంగా ఇలా విమర్శలు చేయటం సరికాదు. ఆయనది వృత్తిపరంగా చాలా అవమానకరమై ప్రవర్తన. రాయబారిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదించదగినవి కాదు. ఆయన సర్వీసు నియమాలను ఉల్లంఘించారు. వెంటనే  రాయబారి పదవి నుంచి తొలగించాలి’ అని జైరాం రమేష్‌ మండిపడ్డారు.

అఖిలేష్‌ మిశ్రా కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. ఐర్లాండ్‌లోని ఓ దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయంలో ‘మోదీకి  అపూర్వమైన ప్రజాదరణ ఉంది’ అనే శీర్షికపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.

‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ పొందారు. దానికి మోదీ  వ్యక్తిగత స్వాభావంతో పాటు పరిపాలనలో చూపించే సమగ్రత, స్థిరమైన అభివృద్ధిపై నాయకత్వమే కారణం. మోదీ  రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని లక్షలాది  ప్రజలకు మోదీ వ్యక్తిగత జీవితం ఎంతో  స్ఫూర్తిదాయకం. ఒకే కుటుంబానికి చెందిన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమే మోదీకి పెరుగుతన్న ప్రజాదరణ వెనక ఉన్న ప్రధానమైన అంశం’ అని అఖిలేష్‌ మిశ్రా అన్నారు.  

‘సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్‌లో అవినీతిని అంతం చేయటంలో విజయం సాధించింది. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా దృఢమైనది. 80 శాతం హిందూ మెజార్టీ ఉ‍న్న భారతదేశాన్ని  కొందరు మూస పద్దతులతో తప్పదారి పట్టిస్తున్నారు’ అని అఖిలేష్‌ మిశ్రా తెలిపారు. ఇక.. ‘అత్యంత పక్షపాతంతో ప్రధాని మోదీ, భారత ప్రజాస్వామ్యం, చట్టం అమలు చేస్తున్న సంస్థలపై విమర్శలు చేస్తున్నారు’ అని డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement