భారత ఫ్రీస్టయిల్‌ రెజ్లర్లకు నిరాశ  | Sakshi
Sakshi News home page

భారత ఫ్రీస్టయిల్‌ రెజ్లర్లకు నిరాశ 

Published Sat, Apr 20 2024 4:00 AM

Disappointment for Indian freestyle wrestlers - Sakshi

ఒక్క విభాగంలోనూ లభించని ఒలింపిక్‌ బెర్త్‌  

బిషె్కక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రెజ్లింగ్‌ టోర్నీలో తొలి రోజు భారత పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. అందుబాటులో ఉన్న ఆరు వెయిట్‌ కేటగిరీల (57, 65, 74, 86, 97, 125 కేజీలు) నుంచి ఒక్క విభాగంలోనూ భారత రెజ్లర్‌కు ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు కాలేదు. ప్రతి వెయిట్‌ కేటగిరీలో ఫైనల్‌ చేరిన ఇద్దరికి ఒలింపిక్‌ బెర్త్‌లు లభిస్తాయి. 57 కేజీల విభాగంలో అమన్‌ సెహ్రావత్‌కు త్రుటిలో ఒలింపిక్‌ బెర్త్‌ చేజారింది.

సెమీఫైనల్లో అమన్‌ 0–10తో గులోమ్‌జన్‌ అబ్దుల్లాయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు అమన్‌ తొలి రౌండ్‌లో 10–0తో యెరాసిల్‌ ముఖాతరూలీ (కజకిస్తాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 11–1తో కిమ్‌ సంగ్‌వన్‌ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత ఇతర రెజ్లర్లు జైదీప్‌ (74 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో... దీపక్‌ (97 కేజీలు) తొలి రౌండ్‌లో... సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యారు.  

దీపక్, సుజీత్‌ ఆలస్యంగా... 
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం 
బౌట్‌లో ఓడిపోయిన దీపక్‌ పూనియా (86 కేజీలు), సుజీత్‌ కలాకల్‌ (65 కేజీలు) ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి ఎంట్రీలు పంపించినా దురదృష్టం వారిని వెంటాడింది. రష్యాలో ఈనెల 2 నుంచి 15 వరకు శిక్షణ పొందిన దీపక్, సుజీత్‌ 16న దుబాయ్‌ మీదుగా కిర్గిస్తాన్‌ రాజధాని బిషె్కక్‌ చేరుకోవాలనుకున్నారు.

అయితే దుబాయ్‌లో అనూహ్య వరదల కారణంగా వీరిద్దరు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. పలు విమానాలు రద్దు కావడం... మరికొన్ని ఆలస్యంగా నడవడంతో దీపక్, సుజీత్‌ శుక్రవారం తప్పనిసరిగా హాజరుకావాల్సిన వెయింగ్‌ కార్యక్రమానికి సమ యా నికి చేరుకోలేకపోయారు. 

దాంతో దీపక్, సుజీత్‌ ఈ టోర్నీలో బరిలోకి దిగలేకపోయారు. మే నెలలో టర్కీలో వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ రూపంలో భారత రెజ్లర్లకు పారిస్‌ బెర్త్‌లు సంపాదించే అవకాశం మిగిలి ఉంది. శనివారం మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు), అన్షు (57 కేజీలు), మాన్సి (62 కేజీలు), నిషా (68 కేజీలు), రీతిక (76 కేజీలు) బరిలో ఉన్నారు.  

Advertisement
Advertisement