దేశ ప్రజల భవిష్యత్‌ కోసమే ఇండియా కూటమి | Sakshi
Sakshi News home page

దేశ ప్రజల భవిష్యత్‌ కోసమే ఇండియా కూటమి

Published Fri, May 3 2024 5:17 AM

India alliance is for the future of the people of the country

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నడిగూడెం: దేశ ప్రజల భవిష్యత్‌ కోసమే ఇండియా కూటమి ఏర్పాటు అయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో కోదాడ ఎమ్యెల్యే పద్మావతి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిలతో కలిసి నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకమని, బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో దేశ ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు.

బీజేపీ సర్కార్‌ మతపరంగా ప్రజలను విభజించి పాలిస్తోందన్నారు. మోదీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచారన్నారు. దీంతో ప్రజలకు భారంగా మారిందన్నారు. దేశంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఈ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కూడా చేసిందేమీ లేదని, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీ మనుగడలేకుండా పోతుందని అన్నారు. కేసీఆర్‌ పాలనలో అధికార దుర్వినియోగం జరిగిందని, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, పోలీసు శాఖను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం అర్హులైన పేదలందరికీ ఇళ్లు, రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్యెల్యే వేనేపల్లి చందర్‌రావు ఈ సభలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement