IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. గాయంపై అప్‌డేట్‌ ఇచ్చిన జడేజా | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. గాయంపై అప్‌డేట్‌ ఇచ్చిన జడేజా

Published Thu, Feb 8 2024 10:58 AM

IND vs ENG: Ravindra Jadeja gives injury update - Sakshi

వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్‌ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరమయ్యారు. తొలి టెస్టులో తొడకండరాలు పట్టేయడంతో వారిద్దరూ వైజాగ్‌ టెస్టుకు అందుబాటులో లేరు.

కాగా రాహుల్‌, జడ్డూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్నారు. తమ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జడేజా తన గాయం గురించి అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తన గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాన‌ని ఓ ఫోటో షేర్‌ చేస్తూ సోష‌ల్‌మీడియా వేదికగా జడ్డూ తెలిపాడు.

‘నా ఆరోగ్యం మెరుగుపడుతోంది’ అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఆ జట్టులో రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. 

కాగా ఉప్పల్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో జడ్డూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 ప‌రుగుల‌తో జ‌ట్టుకు భారీ స్కోర్ అందించిన అత‌డు ఆ త‌ర్వాత‌ బంతితోనూ చెల‌రేగి మూడు కీల‌క‌ వికెట్లు తీశాడు. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: #Sachin Dhas: తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్‌ దాస్‌?

Advertisement
Advertisement