‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’ | Sakshi
Sakshi News home page

సీఈఓ డీప్‌ఫేక్‌ పోస్టులు వైరల్‌.. వివరణ ఇచ్చిన ఎన్‌ఎస్‌ఈ

Published Thu, Apr 11 2024 1:22 PM

Deepfake Audio And Video Clips Viral With CEO Chauhan and NSE logo - Sakshi

డీప్‌ఫేక్‌.. ఇటీవల చాలామంది నుంచి వినిపిస్తున్న పదం. ఈ టెక్నాలజీ వాస్తవానికి, కల్పనకు మధ్య తేడాను చెరిపేస్తోంది. క్రియేటివిటీ పేరుతో బోగస్‌ అంశాలను, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడానికి దీన్ని వాడుతున్నారు. సినీ స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులతోపాటు స్టాక్‌మార్కెట్‌ ప్రముఖులు సైతం ఈ టెక్నాలజీ అరాచకానికి బలవుతున్నారు. ప్రముఖుల ఫేస్‌, వాయిస్‌తో ‘ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభాలు సొంతం చేసుకోండి’ అంటూ డీప్‌ఫేక్‌ వీడియోలు వెలుస్తున్నాయి. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ సైతం దీని బారినపడ్డారు. 

చౌహాన్‌ స్టాక్స్‌ సిఫార్సు చేస్తున్నట్లు, ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు కొన్ని డీప్‌ఫేక్‌ వీడియోలు, ఆడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ‘కొన్ని మీడియాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఆడియోల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రతి సమాచారాన్ని, అప్‌డేట్లను సంబంధిత వెబ్‌సైట్‌లో తెలియజేస్తాం. స్టాక్‌లకు సంబంధించి ఎలాంటి సిఫార్సులు సంస్థ చేయదు. ఈమేరకు ఇన్వెస్టర్లు, రిటైలర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. నకిలీ వీడియోలు, ఇతర మాధ్యమాల నుంచి వచ్చే పెట్టుబడి సలహాలు అనుసరించొద్దు’ అని ఎన్‌ఎస్‌ఈ వివరించింది. 

ఇదీ చదవండి: మస్క్‌ భారత పర్యటనకు డేట్‌ ఫిక్స్‌.. ఏం జరగబోతుందంటే..

ఎన్నికల సమయంలోనూ..

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల స్వరాన్ని, ముఖాన్ని అనుకరించి డీప్‌ఫేక్స్‌ను వ్యాప్తిచేసే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు పలుమార్లు హెచ్చిరించిన విషయం తెలిసిందే. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మాటలను వక్రీకరించి ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు. డీప్‌ఫేక్‌కు సంబంధించిన ప్రమాదాలను నివారించేలా నిబంధనలు రూపొందించాలని నిపుణులు కోరుతున్నారు.

Advertisement
Advertisement