Aadhaar Update: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన
Published
Fri, Aug 18 2023 6:04 PM
ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ షేర్ చేయమని ఏదైనా వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్లు వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) హెచ్చిరికలు జారీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆధునిక కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ అప్డేట్ కోసం ఈ-మెయిల్ లేదా వాట్సాప్ మెజెజ్ రోపంలో సందేశాలు పంపదని, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని తెలియజేసింది.
ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఆధార్ అప్డేట్లో భాగంగా ఎవరూ తమ వివరాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపకూడదు.
ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటితే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుమార్లు వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. దీనికి చివరి గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు గడువు లోపల చేసుకోవచ్చు.