యువనేత జైత్రయాత్ర! | Sakshi
Sakshi News home page

యువనేత జైత్రయాత్ర!

Published Thu, Apr 25 2024 3:40 PM

Sakshi Guest Column On CM YS Jagan Memantha Siddham Yatra

అభిప్రాయం

పట్టుదల, దీక్షా దక్షతలు కలిగిన యువనేత జగన్‌ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర 23 జిల్లాల గుండా సాగి ఏప్రిల్‌ 24న శ్రీకాకుళం జిల్లాలో దిగ్వి జయంగా ముగిసింది. ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోడ్‌షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి. యువ నేతకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డప్పటికీ వెరవ లేదు. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం జగన్‌ తనయాత్ర కొనసాగించారు. 

తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసినా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసినా, ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినా, ఎన్నికల ప్రచారం కోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేసినా... వీటన్నింటిలోనూ ఒక ఆర్ధ్రత, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయ మేళ వింపు, కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అను భూతి కనిపిస్తున్నాయి. ఫలితంగా మే 13న జరగ బోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుండి 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ, మరో పక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్సార్‌ సీపీలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదు. దీంతో బస్సు యాత్ర ఆపేందుకు కుటిల యత్నాలు చేశారు. ముఖ్య మంత్రిపై దాడిచేస్తే బస్సు యాత్రకు బ్రేక్‌ వేయవచ్చన్న దుర్బుద్ధితో వారు చేసిన ప్రయ త్నాలకు జగన్‌ వెరవలేదు. ఈ క్రమంలోనే దత్తపుత్రుడి చరిష్మా తగ్గిందని భావించిన పసుపు నేత చిరంజీవి అనే ముఖాన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డారు.

అన్నింటికంటే మిన్నగా బస్సుయాత్ర మొదలైనప్పటి నుండి వలంటీర్ల వ్యవస్థ మీద విషం చిమ్మడం ద్వారా జగన్‌ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెర తీశారు. అయితే అదికాస్తా తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో పాలుబోని పరిస్థితి నెలకొంది. దురదృష్టవశాత్తూ వలంటీర్‌గా పనిచేస్తున్న గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ ప్రాణాలు తీసు కునేలా పచ్చ బ్యాచ్‌ బరితెగించింది. వలంటీర్ల వ్యవస్థ మీద చేయకూడని ఆరోపణలు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే తాము కూడా వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. మరో అడుగు ముందుకేసి వారి గౌరవ వేతనం రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు పెంచుతామంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. 

అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని ప్రజలు ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటు న్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్‌ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్ర బాబు... తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పు డున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ముస్లిమ్‌ల రిజర్వేషన్‌పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుఃస్థితిలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఉన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ అనక పోవడమూ గమనార్హం. ఇలా చెప్పు కుంటూ పోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి జిమ్మిక్కులూ, అబ ద్ధాలూ, కుయుక్తులూ, విషప్రచారాలూ చాలానే ఉన్నాయి.

ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో అవకాశవాద రాజకీయాలు ఒకవైపు, చిత్తశుద్ధి – అంకిత భావంతో కూడిన రాజకీయాలు ఇంకోవైపు ఉన్నాయని సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారు. పేదలు – పెత్తందార్ల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోందని ప్రతిపక్ష కూటమి చర్యలు మరోసారి రుజువు చేశాయి. ముఖ్యమంత్రి జగన్‌ తాను ఇప్పటివరకూ ప్రజలకోసం చేసిన పనులూ, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు. అలా ఆయన ప్రజల మనసులు గెలుచుకోగలిగారు. ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూల మంత్రంగా మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

డా‘‘ పూనూరు గౌతమ్‌ రెడ్డి 
వ్యాసకర్త వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌
కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455

Advertisement

తప్పక చదవండి

Advertisement