లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు.. | Enforcement Directorate Ask Apple To Access To Arvind Kejriwal Iphone, Questioning For 5 Hours Daily- Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు.. సీఎం కేజ్రీవాల్‌ ఐఫోన్‌ చుట్టూ దర్యాప్తు

Published Sun, Mar 31 2024 5:08 PM

Enforcement Directorate Ask Apple To Access To Arvind Kejriwal Iphone - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌ ఉపయోగించిన ఐఫోన్‌ను పరిశీలించనుంది. ఇందుకోసం ఐఫోన్‌ లాక్‌ను ఓపెన్‌ చేయించుందుకు ఈడీ అధికారులు ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ కంపెనీని ఆశ్రయించనున్నారు.  

పలు నివేదికల ప్రకారం..  లిక్కర్‌ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో నాలుగు ఫోన్‌లను జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్‌లు స్విచ్ఛాప్‌ చేసి ఉన్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్‌ల పాస్‌వర్డ్‌లను చెప్పేందుకు కేజ్రీవాల్‌  ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ ఫోన్‌ లాక్‌లను ఓపెన్‌ చేయించేందుకు యాపిల్‌ సంస్థను సంప్రదించనున్నట్లు సమాచారం.  

విచారణకు సహకరించని కేజ్రీవాల్‌
గత గురువారం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ‘కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌ను వెల్లడించలేదు. అతను సహకరించకపోతే, మేం ఆ ఫోన్‌లను (సాంకేతికంగా) తెరవాల్సి ఉంటుంది. మేం అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి, కేజ్రీవాల్‌ రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్‌ 1వరకు పొడిగించింది. రేపటితో  కేజ్రీవాల్‌ ఈడీ రిమాండ్‌ ముగియనుంది. 

కేజ్రీవాల్‌ ఐఫోన్‌ చుట్టూ దర్యాప్తు
ఈలోపే కేజ్రీవాల్‌ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆధారాల్ని సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. కేజ్రీవాల్‌ ఐఫోన్‌ పాస్‌వర్డ్‌లను ఓపెన్‌ చేసి ఆధారాల్ని సేకరించేందుకు యాపిల్‌ సంస్థను ఆశ్రయించింది. ఫోన్‌లో ఆప్ ‘ఎన్నికల వ్యూహం’ ఎన్నికలకు ముందు పొత్తుల వివరాలను ఈడీ గోప్యంగా ఉంచనుంది. 

Advertisement
Advertisement