Sakshi News home page

Lok sabha elections 2024: ఒక్క ఓటు కోసం 39 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌..

Published Thu, Mar 28 2024 6:27 AM

Lok sabha elections 2024: Polling officials to trek 39 km for lone voter in Arunachal village - Sakshi

ఈటానగర్‌: ప్రజాస్వామ్యం మామూలు వ్యక్తిని సైతం మెహమాన్‌ను చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 44 ఏళ్ల సొకేలా తయాంగ్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అంజ్వా జిల్లాలోని మారుమూలన ఉన్న మలోగాం ఆమె గ్రామం. హయులియాంగ్‌ అసెంబ్లీతోపాటు, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈస్ట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి ఆ గ్రామం వస్తుంది. అక్కడ ఎన్నికలు మొదటి ఫేజ్‌లో జరగనున్నాయి. ఇంతకీ ఆమె మెహమాన్‌ ఎందుకయ్యారంటే.. ఆ ఊరులో ఓటరు ఆమె ఒక్కరే.

ఆమె కోసం పోలింగ్‌ సిబ్బంది అంతా.. ఎన్నికలు జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ కంటే ఒకరోజు ముందు.. అంటే ఏప్రిల్‌ 18న 39 కిలోమీటర్ల ఎత్తు కొండలు ఎక్కాల్సి ఉంటుంది. చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో తయాంగ్‌ కోసం తాత్కాలికంగా ఓ పోలింగ్‌ బూత్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. మలోగామ్‌లో ఇంకొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వారిలో ఎవరూ ఓటు కోసం నమోదు చేసుకోలేదు. దీంతో వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కలేదు.

ఒక్కరికోసం బూత్‌ ఎందుకని.. సమీపంలోని ఏదైనా పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయాల్సిందిగా అధికారులు ఆమెను కోరారు. కానీ అందుకు తయాంగ్‌ అంగీకరించలేదు. దీంతో ఆమె ఓటు కోసం అధికారులు, భద్రతా సిబ్బంది, పోర్టర్‌లతో సహా పోలింగ్‌ బృందం హయులియాంగ్‌ నుంచి అనూహ్య వాతావరణం మధ్య ప్రమాదకరమైన భూభాగం గుండా కష్టతరమైన ప్రయాణం చేయనుంది.

హయులియాంగ్‌ నుంచి మలోగామ్‌కి కాలి నడకన వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. పోలింగ్‌ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్‌ తెరచి ఉంటుంది. ‘‘నేను మా గ్రామంలో చాలా అరుదుగా ఉంటాను. ఏదైనా పని ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలో మాలోగాం వస్తుంటా. మిగతా సమయంలో మాకు వ్యవసాయ భూములు ఉన్న లోహిత్‌ జిల్లాలోని వక్రోలో ఉంటాను. ఏప్రిల్‌ 18 సాయంత్రంలోగా ఇంటికి చేరుకుని ఓటు వేస్తా’’ అని చెబుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement