Sakshi News home page

చంద్రబాబు, ప్రశాంత్‌ కిశోర్‌ గుట్టు విప్పిన మమతా బెనర్జీ

Published Wed, Apr 17 2024 5:41 PM

Bengal Cm Mamata Banerjee Key Comments On Prashant Kishor And Chandrababu - Sakshi

పీకే ఇప్పుడు చేస్తోంది బాబు ఊడిగం

ప్రశాంత్‌ కిషోర్‌ అసలు రంగు బయటపెట్టిన మమతా బెనర్జీ

చంద్రబాబు కోసం పీకే పని చేస్తోన్నట్టు నాకు తెలుసు

పీకే ఎజెండా కేవలం తెలుగుదేశం కోసమే

సర్వేలు చేయడు కానీ.. ఉత్తుత్తి మాటలు చెప్పడంలో పీకే దిట్ట

సాక్షి, అమరావతి: ప్రశాంత్‌కిశోర్‌పై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. ప్రశాంత్‌ కిశోర్‌ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని చేయకున్నా.. చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్‌కిశోర్‌ తెర వెనక పనిచేస్తున్నారని.. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్‌కిశోర్‌కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయన్నారు. "బెంగాల్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ టీఎంసీ కోసం పనిచేయడం లేదన్నారు" మమతా. ప్రశాంత్‌ కిశోర్‌ తక్షణ కర్తవ్యం చంద్రబాబు, మోదీనేనని తెలిపారు.

డామిట్‌ కథ అడ్డం తిరిగింది

పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహ­కర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ  చేశాడు ప్రశాంత్‌ కిషోర్‌. ఐప్యాక్‌ సంస్థ నుంచి తప్పుకుని.. బీహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశాడు పీకే. తొలుత బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్‌తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్‌లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ప్రశాంత్‌ కిశోర్‌ కుండబద్ధలు కొడితే.. అక్కడ తేడా కొట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది.

వివాదాల పీకే

సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలకు సలహాలతో అప్పట్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ కిషోర్‌.. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా నేలకు దిగివచ్చాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న సంబంధాలన్ని తెగిపోవడంతో తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుడు కావాలనుకున్న కల కాస్తా చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులకు ఆశపడి పొలిటికల్‌ బ్రోకర్‌గా మారాడన్న ఆరోపణలు ఢిల్లీలో వెల్లువెత్తాయి.

కరకట్ట ఇంట్లో ప్యాకేజీ చర్చలు

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు విసిరిన ప్యాకేజీకి పీకే పడిపోయాడని తెలుగుదేశంలో ప్రచారం ఉంది. ప్రత్యేక విమానంలో ప్రశాంత్‌ కిషోర్‌ను విజయవాడకు తీసుకువచ్చిన లోకేష్‌.. నేరుగా కరకట్ట ఇంట్లో మీటింగ్‌ పెట్టించాడు. ఆ సమావేశంలో ఏం జరిగిందో కానీ.. ఏపీలో కూటమి గెలుస్తుందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు పీకే. తన వ్యాఖ్యలకు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కానీ, లాజిక్‌ గానీ చూపించకుండా.. తన పాత బ్రాండ్‌ను వాడుకుని ప్రచారం చేసుకునే పనిలో పడ్డాడు. అయితే విశ్వసనీయత కోల్పోవడంతో పీకే మాటలు ఎవరూ పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి.

"నోటు" మాటలు

ప్యాకేజీ ఎంత ముట్టిందో గానీ, బాకా ఊదడంలో పీకే ముందుంటున్నాడు. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్‌ కిషోర్‌ అసలు రంగును పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టడం.. పీకే వ్యాఖ్యల డొల్లతనం బయటపడ్డట్టయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement