Sakshi News home page

ఉఠో..బేటీ .. సుల్తానా.!

Published Wed, Apr 17 2024 1:55 AM

 రిమ్స్‌ మార్చురీలో తన కుమార్తె సుల్తానా మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న తల్లి - Sakshi

కడప అర్బన్‌ : ఉఠో బేటీ సుల్తానా... అంటూ తన కుమార్తె మృతదేహాన్ని పట్టుకుని తల్లి షమీరా బోరున విలపించిన దృశ్యం అందరిని కంట పెట్టించింది. రంజాన్‌ పండుగకు ఇంటికి వచ్చి అందరితో సరదాగా గడిపిన షమ్మా సుల్తానా (22) ఇంటి నుంచి వచ్చిన 24 గంటల్లోపే విగతజీవిగా మారడంతో తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు షమీరా, హఫీజ్‌లకు షమ్మా సుల్తానా ఏకై క కుమార్తె. ఆమె కన్నా చిన్నవాడైన కుమారుడు ఉన్నాడు.

తండ్రి హఫీజ్‌ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్‌లో ఉన్నారు. ఆయనతో కుటుంబ సభ్యులంతా ఫోన్‌ ద్వారా సరదాగా మాట్లాడి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. హాయిగా పండుగ చేసుకున్నారు. పండుగ తరువాత సోమవారం కదిరి నుంచి వైవీయూకు సుల్తానా వచ్చింది. మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో వైవీయూలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్‌, కడప రూరల్‌ సీఐ నాగరాజు, సిబ్బంది సమగ్రంగా విచారిస్తున్నారు.

సుల్తానా ఆత్మహత్యపై న్యాయ విచారణ జరపాలి
కడప ఎడ్యుకేషన్‌ : యోగివేమన విశ్వ విద్యాలయంలో మంగళవారం పీజీ విద్యార్థిని సుల్తానా ఆత్మహత్య సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని రాయలసీమ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మల్లెల జగదీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కో కన్వీనర్‌ ఎంఆర్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు రిమ్స్‌లో మృతదేహాన్ని సందర్శించి విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులెవరో తేల్చి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థిని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement