-
కాటన్ సేవలు చిరస్మరణీయం
ధవళేశ్వరం: ఆనకట్ట నిర్మాణం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు కొనియాడారు. కాటన్ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కాటన్ దొర ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మాణం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. డెల్టా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీరంగం బాలరాజు, మోర్త పావనమూర్తి, గునిపే అశోక్, ఒంటెద్దు కృష్ణ, మిరప రమేష్, ముత్యాల జాన్, నంబూరి రవి, గూటం రాజు, పందెళ్ల భానుప్రసాద్ పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో... ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బ్యారేజ్ సెంటర్లో కాటన్ జయంతి ఘనంగా నిర్వహించారు. గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ ఆర్.సతీష్ కుమార్, ఎస్ఈ జి.శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈఈ ఆర్.కాశీవిశ్వేశ్వరరావు, డీఈ యు.రమేష్, ఏఈ అద్దంకి సాయిరామ్ పాల్గొన్నారు. కాటన్ విగ్రహానికి ధాన్యాభిషేకం కడియం: దుళ్ల గ్రామానికి చెందిన ఆదర్శ రైతు అవార్డు గ్రహీత సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) బుధవారం కాటన్ విగ్రహానికి ధాన్యాభిషేకం చేశారు. తన ఇంటి ముందు ప్రతిష్ఠించిన కాటన్ విగ్రహానికి గ్రామస్తులు, స్థానిక రైతులతో కలిసి నివాళులర్పించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ధాన్యం, నదీ జలాలతో అభిషేకించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోకల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్లు దూడల నాగేశ్వరరావు, చిట్టూరి అమ్మిరాజు, గుర్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఘనంగా అపర భగీరథుడి జయంత్యుత్సవం -
ఏలేరులో అడుగంటిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: వేసవి ధాటికి ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమేపీ అడుగంటుతున్నాయి. దీంతో దిగువ ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున రోజురోజుకూ నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 68.95 మీటర్లు, 24,11 టీఎంసీలకు గాను 3.81 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 54 వేల ఎకరాలకు రాబోయే రోజుల్లో సాగు నీరందని పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. దీంతో పాటు దిగువ ఏలేరు కాలువలో నీటి సరాఫరా నిలిపివేయడంతో పశువులు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పశువులతో పాటు, సమీప గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ిఫిల్టర్ బెడ్ ద్వారా పలు గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. నీటి నిల్వలు తగ్గితే ఫిల్టర్ బెడ్ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయినా, విశాఖపట్నానికి నీటిని తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులో నీటిని మోటార్ల సాయంతో పది పైపుల ద్వారా విశాఖపట్నానికి 140 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఖరీఫ్పై అనుమానాలు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో పాటు, వరిసాగు పూర్తి కావడంతో ఏలేరు కాలువకు నీటి సరాఫరా నిలిపివేశారు. ప్రస్తుత నీటి నిల్వల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖరీఫ్ సాగుపై ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిని బట్టే ఆయకట్టులో సాగు ఆధారపడి ఉంటుంది. అలాంటిది నీటి నిల్వల తగ్గుదలతో రైతులు నిరాశ చెందుతున్నారు. వరుణుడు కరుణించి దయ చూపాలని రైతులు కోరుకుంటున్నారు. ఆందోళనలో రైతాంగం ఖరీఫ్పై అనుమానాలు -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
దేవరపల్లి: విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ అమరావతి బస్సు గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దేవరపల్లి ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. పాల ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి రావులపాలెం: జాతీయ రహదారిపై ఈతకోట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన అజ్జరపు రాజారావు (60) స్థానికంగా ఉన్న ఒక ప్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఫ్యాక్టరీకి సమీపంలో రోడ్డు పక్కన సైకిల్తో నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో రావులపాలెం వైపు వస్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి అతడిని ఢీకొంది. లారీ వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు హెచ్సీ వైకుంఠరావు తెలిపారు. 19న చదరంగం పోటీలు రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్ర చెస్, జిల్లా చదరంగం అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పిడింగొయ్యిలోని ఫ్యూచర్కిడ్స్ గ్లోబల్ స్కూల్లో ఈ నెల 19వ తేదీన రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా చదరంగం అసోషియేషన్ సెక్రటరీ జీవీ కుమార్ బుధవారం తెలిపారు. పోటీలో గెలుపొందిన మొదటి 25 మంది విజేతలకు రూ.లక్ష నగదును విభజించి అందజేస్తామన్నారు. ఆసక్తి కల క్రీడాకారులు తమ పేర్లను శుక్రవారంలోపు ఏపీచెస్ఓఆర్జీ అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 62812 50967 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
వైస్ ఎంపీపీ ఇంటిపై దాడికి యత్నం
గోపాలపురం: వైఎస్సార్ సీపీకి చెందిన వైస్ ఎంపీపీ వంగా నారాయణమ్మ ఇంటిపై మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. రాత్రి సుమారు 11 గంట సమయంలో జగన్నాథపురంలోని నారాయణమ్మ ఇంటి వద్దకు టీడీపీకి చెందిన సుమారు 20 మంది కార్యకర్తలు మద్యం తాగి వచ్చారు. ఆమెను దుర్భాషలాడుతూ కులం పేరుతో తిడుతూ బీభత్సం సృష్టించారు. వెంటనే నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి టీడీపీ అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ, ఏలూరు ఇన్చార్జి డీఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ జి.జగదీష్ జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగ్ను పరిశీలించారు. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైస్ ఎంపీపీ నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ సమస్యాత్మక గ్రామాలలో పోలీసు పికెటింగ్ కొనసాగుతుందన్నారు. ఆయన వెంట కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు, దేవరపల్లి సీఐ కె.బాలసురేష్, ఎస్సై కర్రి సతీష్ కుమార్ ఉన్నారు. మద్యం తాగి టీడీపీ కార్యకర్తల వీరంగం పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం -
సివిల్స్ సాధించడమే లక్ష్యం
మామిడికుదురు: సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని మామిడికుదురు గ్రామానికి చెందిన లిఖితపూడి హరిసత్య రామమోహన్ అన్నాడు. ఈ విద్యార్థి ఏపీఆర్జేసీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మంగళవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. రామమోహన్ ఎంఈసీ విభాగంలో 150 మార్కులకు 140 సాధించాడని తండ్రి, పీఈటీ రమేష్ బుధవారం తెలిపారు. తల్లి సునీత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ ఇంటర్లో ఎంపీసీ చదువుతానని, అనంతరం ఐఐటీ ద్వారా సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళతానన్నాడు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రామమోహన్ 600 మార్కులకు 585 సాధించాడు. పది కాసుల బంగారం చోరీ నిడదవోలు: పట్టణ శివారు బసివిరెడ్డిపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. వివరాల్లోకి వెళితే.. బసివిరెడ్డిపేటకు చెందిన కవితరపు మోహనరావు తన కుటుంబ సభ్యులతో మంగళవారం ఊటీ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దుండగులు ఆ ఇంటి ప్రధాన ద్వారం గడియను ఇనుప రాడ్డుతో పెకిలించి తాళం తీసేశారు. బెడ్రూమ్లోని బీరువాను బద్దలుగొట్టి మూడు కాసుల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు అపహరించుకుపోయారు. కాగా.. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని ఇరుగుపొరుగు వారు గమనించి, యజమాని మోహనరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఊటీ నుంచి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగిన విషయం నిర్ధారణ అయ్యింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నుల పండువగా వీరేశ్వరుని గ్రామోత్సవం
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు బుధవారం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. శైవాగమ పద్ధతిలో రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామశర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాములు, అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గ్రామంలోని వృద్ధ గౌతమీ తీరంలో స్వామివారికి త్రిశూల స్నానం వైభవంగా జరిపారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బహుకరించిన రథంపై సాయంత్రం స్వామి, అమ్మవార్లను ఆశీనులు చేసి, గ్రామోత్సవం నిర్వహించారు. కాగా.. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల కోసం ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలంకరణ ఆకట్టుకుంది. ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
కాకినాడ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులకు మొదటి జాబితా సీట్లను ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించామని జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు తెలిపారు. మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతో మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ద్రాక్షారామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం బాలురకు, కాకినాడ సాంబమూర్తి నగర్లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం బాలికలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. ఆయా విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే సమాచారం అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఇతర సమాచారం కోసం జి.దేవి 63040,97747, వి.ప్రసాద్బాబు 94404 99016 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఆహా.. ఆవకాయ
లరాయవరం: తెలుగు వారి లోగిళ్లు.. పచ్చళ్లకు కూడళ్లు అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పచ్చళ్లలో రాజు లాంటి ఆవకాయ గురించి ఎవ్వరికీ కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇంటింటా సుపరిచితమైన ఆవకాయపై ముఖ్యంగా తెలుగు వారికి పేటెంట్ ఉందని చెప్పవచ్చు. దీనిని పేదల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని తింటారు. సీజన్ వచ్చేసింది వేసవి వచ్చిందంటేనే పచ్చళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలో మామిడికాయ ముక్కలను వేస్తారు. అప్పటి నుంచే మామిడికాయలు తినడం ప్రారంభమవుతుంది. మామిడికాయలు పెరిగి పెద్దవై, పీచు కట్టిన తర్వాత పచ్చడి కాయలను కోసి అమ్మకాలు చేస్తారు. మామిడికాయ పచ్చడిని రకరకాలుగా పెట్టుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ, అల్లం ఆవ, మెంతి ఆవ ఇలా రకరకాలు ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాల్లో సీజన్ వచ్చిందంటే చాలు పెద్ద జాడీల నిండా పచ్చళ్లను సిద్ధం చేసుకుంటారు. ప్రతి రోజూ అన్నంలో కూరలతో పాటు పచ్చడిని కలుపుకొని తింటారు. అలాగే కూలీలు, ఇతర పనులకు వెళ్లే వారి క్యారియర్లో ఆవకాయ పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది. కత్తెర సీజన్ ప్రారంభానికి ముందే.. ప్రస్తుత సీజన్లో ప్రతి కుటుంబం తమ శక్తికి తగ్గట్టు ఆవకాయ, మాగాయ పచ్చళ్లు తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. సాధారణంగా కత్తెర సీజన్ ప్రారంభం కాకముందే వీటిని పూర్తి చేస్తారు. దేశవాళీ, సూదలు, రసాలు, సువర్ణరేఖ, కొత్తపల్లి కొబ్బరి, హైదర్ సాహెబ్ తదితర రకాల మామిడికాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. సాధారణ రకాల 100 కాయలు రూ.2,000 నుంచి 2,500 వరకూ, నాణ్యమైన రకాలైన హైదర్ సాహెబ్, కొత్తపల్లి కొబ్బరి వంటివి 100 కాయలను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నారు. పచ్చడి పట్టే మామిడి కాయలను ముక్కలుగా కొడుతూ కొందరు ఉపాధి పొందుతున్నారు. ఇందుకోసం ఒక్కో మామిడికాయకు రూ.2 చొప్పున తీసుకుంటున్నారు. మరికొన్ని కారణాలు గతంతో పోలిస్తే పచ్చళ్లు పట్టుకునే వారి సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోంది. ప్రజల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటుగా అంగట్లో పలు రకాల రెడీమేడ్ పచ్చళ్లు దొర కడం దీనికి కారణమని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్ వంటి వ్యాధు లు రావడంతో వైద్యుల సలహా మేరకు పచ్చడి తినడాన్ని చాలా మంది తగ్గిస్తున్నారు. పచ్చళ్ల తయారీ కేంద్రాల నుంచి నేరుగా మార్కెట్లోకి అందుబాటులోనికి వస్తున్నాయి. దీంతో అవసరమైన సమయంలో తమకు కావాల్సిన పచ్చడిని ఒక్కో ప్యాకెట్/బాటిల్ పచ్చడిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఆవకాయ పచ్చడి పచ్చడి తయారీలో మహిళల నిమగ్నం మార్కెట్లో మామిడికాయలకు డిమాండ్ పెరిగిన ఇతర వస్తువుల ధరలు పచ్చళ్లకు ధరాఘాతం మామిడికాయలతో పాటు పచ్చడి పట్టడానికి వినియోగించే గానుగ నూనె, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి ధరలు బాగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పచ్చడి పెట్టడం భారంగా మారుతుంది. కుంచుడు ముక్కలతో పచ్చడి పెట్టాలంటే దాదాపుగా రూ.2 వేలు ఖర్చవుతుంది. పెరిగిన ధరల కారణంగా పచ్చళ్లను పట్టుకునే పరిస్థితి లేదని పలువురు సాధారణ, మధ్య తరగతి వారు వాపోతున్నారు. అయినా పెరిగిన ధరలను తట్టుకోలేక తక్కువ పరిమాణంలో పట్టుకుంటున్నారు. -
జట్టు కూలీల మృతదేహాలకు పోస్టుమార్టం
పి.గన్నవరం: రాజవరం – పొదలాడ రోడ్డులో ఊడిమూడి గ్రామం వద్ద మంగళవారం రాత్రి ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో చనిపోయిన నలుగురు జట్టు కూలీల మృతదేహాలకు బుధవారం కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ట్రాక్టర్లో ధాన్యం బస్తాలు లోడు చేసి, పగ్గం కడుతుండగా వెనుకనుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు కూలీలు గాయపడ్డాడు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50, ఆదిమూలంవారి పాలేనికి చెందిన చిలకలపూడి మణిబాబు (30) మృత దేహాలకు కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, నగరం ఎస్సైలు బి.శివకృష్ణ, చిరంజీవి, రాజేష్, సురేష్లు శవ పంచనామా చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భోరున విలపించారు. జి.పెదపూడి, ఆదిమూలం వారిపాలెం గ్రామా ల్లో విషాధ చాయలు అలము కున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిలకలపూడి సురేష్, జి.పెదపూడికి చెందిన మట్టా శ్రీనివాస్, బొరుసు వేణుగోపాల్, నానీలు అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ప్రశాంత కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను పలువురు పరామర్శించారు. ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అమలాపురం రూరల్: నలుగురు జట్టు కూలీలు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కె. సత్తి బాబు, సీఐటీయూసీ జిల్లా కార్యదర్శి నూకల బలరాం కోరారు. ఈ మేరకు బుధవారం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి, కిమ్స్ హస్పిటల్లో వైద్యం పొందుతున్న బాధితులను పరామర్శించారు. చిలకలపూడి నాని, బొరుసు నాని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదానికి ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కాలం చెల్లిన బస్సులను నేటికీ ఆర్టీసీ నడుపుతోందని విమర్శించారు. గన్నవరం నుంచి రావులపాలెం వెళ్లే రోడ్డు నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయన్నారు. రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణికులకు రేడియేషన్స్ బిట్స్ (చీకటిలో కనబడే ఇండికేటర్లు) సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
రాజానగరం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర స్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను ఈనెల 17, 18 తేదీలలో గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ కళాశాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తీర్పు భద్రం.. భవిత గోప్యం
బుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్ ముమ్మిడివరం: శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజిలో డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ అనంతరం ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ వద్ద భద్రతా చర్యలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షుశుక్లా పరిశీలించారు. ఇంజినీరింగ్ కశాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో నియోజకవర్గాల వారీగా వాహనాలలో పోలింగ్ సిబ్బంది తీసుకుని వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామగ్రి స్వీకరణ స్ట్రాంగ్ రూమ్లో భద్రతా ఏర్పాట్ల ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. అయా రిటర్నింగ్ అధికారుల పరిశీలన అనంతరం అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, పోలింగ్ సామగ్రిని పోలింగ్ సిబ్బంది ద్వారా స్వీకరించి వారికి కేటాయించిన స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా స్ట్రాంగ్రూమ్లకు సీల్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రివెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జి.కేశవరెడ్డి, జీవీవీ సత్యనారాయణ, ఏ.శ్రీరామచంద్రమూర్తి, డీవీఎస్ ఎల్లారావు, వి.మదన్మెహన్రావు, ఎస్.సుధాకర్, ఏఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. ● ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు ● లెక్కలతో పార్టీల కుస్తీ ● మహిళలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటింగ్తో అధికార పార్టీలో ధీమా ● జిల్లాలో అర్ధ రాత్రి వరకు పోలింగ్ ● తెల్లవారు జామున స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు సాక్షి అమలాపురం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లపై ఇప్పుడు అందరి దృష్టి. స్వారత్రిక ఎన్నికల ఓటింగ్ పూర్తవడంతో అభ్యర్థుల జాతకాలను ఈవీఎంలు తేల్చనున్నాయి. వారి రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల అనుకున్న నాటి నుంచి సోమవారం రాత్రి పోలింగ్ ముగిసే వరకు వ్యయప్రయాలకు లోనై... తమ శక్తి యుక్తులన్నింటినీ ధారబోసి తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితం కోసం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు ఈవీఎంలలో తమకు పడిన ఓట్లపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ గడపాల్సిందే. మరోవైపు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరాయి. నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల సంగ్రామంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలోకి చేరింది. పోలింగ్ ముగిసినా అభ్యర్థులలో హైరానా తగ్గలేదు. పట్టణాలలో వార్డులు, గ్రామాల వారీగా తమకు పడిన ఓటింగ్పై లెక్కల తీసేపనిలో బీజీగా ఉన్నారు. పురుషులు, మహిళలు, యువత, వృద్ధులు, కూలాలు, మతాల వారీగా తమకు పడిన అనుకూల ఓటింగ్పై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామాలు, మండలాల వారీగా లెక్కలు వేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు, మెజార్టీలపై అంచనాలకు వస్తున్నారు. మహిళా ఓటింగ్ పెరగడం ప్రతి పక్ష టీడీపీ, జనసేన పార్టీలలో గుబులు రేపుతోంది. వీరితోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మరీ ముఖ్యంగా పింఛన్దారులు పెద్ద ఎత్తున ఓటింగ్కు వచ్చారు. ఉత్సాహంగా ఓటు వేశారు. ఇవన్నీ తమకు ప్రతికూలంగా మారుతాయని వారు భయపడుతున్నారు. గ్రామీణ ఓటరు పోటెత్తడంతో అధికార పార్టీ అభ్యర్థులలో గెలుపుపై ధీమా పెంచింది. స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో ఆలస్యమైంది. అంచనాలకు మించి ఓటర్లు రావడం, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో ఈవీఎంలను చేర్చడం సోమవారం రాత్రి కుదరలేదు. పోలింగ్ పూర్తయిన తరువాత కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరులో ఉన్న శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీకి ఈవీఎంలు చేర్చారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి విధుల నుంచి బయటకు వచ్చేసరికి పోలింగ్ సిబ్బందికి తెల్లవారింది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈవీఎంల తరలింపు చోటు చేసుకుంది. ఓటింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తినా ఓటింగ్కు సమయం సరిపోలేదు. మధ్యాహ్న సమయంలో ఎండ కారణంగా ఓటింగ్కు దూరంగా ఉన్న ఓటర్లు సాయంత్రం పోటెత్తారు. దీంతో ఆరు గంటల సమయంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వరుసలో నిలుచున్న వారికి కూపన్లు ఇచ్చి అధికారులు ఓటింగ్కు అనుమతి ఇచ్చారు. ఓటర్లు అధికంగా ఉన్నచోట ఓటింగ్ రాత్రి పద కొండు గంటల వరకు సాగింది. జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వినియోగించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరాయి. పోలింగ్ ముగిసిన తరువాత సెక్టార్ల వారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామగ్రి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్నాయి. ఇక్కడ మూడంచల భద్రతను కల్పించారు. పార్లమెంట్ పరిధిలో 83.84 శాతం పోలింగ్ : ఓటువేసిన 12,84,008 మంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం నిర్వహించిన పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,31,410 మంది ఓటర్లు ఉండగా, 12,84,008 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 83.84 శాతంగా నమోదయ్యింది. గత ఎన్నికలతో సమానంగా ఓటింగ్ పడింది. పార్లమెంట్ పరిధిలో పురుషుల ఓట్లు 7,59,104 కాగా, 6,44,189 మంది (84.86 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7,72,285 మంది మహిళా ఓట్లకు గాను 6,39,808 మంది (82.84 శాతం) ఓటు వేశారు. పార్లమెంట్ పరిధిలో పురుషులు కన్నా మహిళా ఓట్లు అధికంగా ఉన్నా ఓటింగ్లో మాత్రం పురుషులు అధికంగా పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ పరిధిలో ఇతర ఓట్లు 21 మంది కాగా 11 మంది (52.38 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఓట్లు వేసిన నియోజకవర్గం కొత్తపేటలో 2,14,975 మంది ఓట్లు వేయగా, ఓటింగ్ శాతం మండపేటలో 87.06 శాతం (1,91,959 ఓట్లు) నమోదయ్యింది. సోషల్ మీడియాలో కవ్విస్తే కఠిన చర్యలు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఎస్పీ శ్రీధర్ అమలాపురం టౌన్: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిన నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియా ఆధారంగా పోస్టింగ్లతో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా లేని పోని అలజడులు సృష్టించినా, ప్రోత్సహించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్ర పరిచినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆ స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ శ్రీధర్ మంగళవారం మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెలుగా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న రెచ్చగొట్టే ప్రచారాలపై ఎస్పీ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఓటింగ్ జరిగింది ఇలా.. నియోజకవర్గం మొత్తం ఓటు వేసిన ఓటు వేసిన ఓటు వేసిన మొత్తం ఓటింగ్ ఓటింగ్ పురుషులు మహిళలు ఇతరులు ఓటర్లు శాతం రామచంద్రపురం 2,03,207 87,429 86,487 1 1,73,917 85.59 ముమ్మిడివరం 2,45,296 1,03,951 1,01,212 0 2,05,163 83.64 అమలాపురం 2,13,508 89,007 86,837 1 1,75,845 82.36 రాజోలు 1,97,920 77,351 79,048 1 1,56,400 79.02 పి.గన్నవరం 1,98,602 84,467 81,279 3 1,65,749 83.46 కొత్తపేట 2,52,383 1,07,762 1,07,210 3 2,14,975 85.18 మండపేట 2,20,494 94,222 97,735 2 1,91,959 87.06 -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
కిర్లంపూడి: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. మండల పరిధి వేలంకలోని పోలింగ్ బూత్లో సోమవారం వైఎస్సార్ సీపీ కార్యకర్త అడబాల శ్రీనుపై దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం మండలం, పవర గ్రామంలో ఉన్న ట్రినిటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి తోట నరసింహం ఆసుపత్రికి పరామర్శించారు. జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల సచివాలయాల కన్వీనర్ జోకా శ్రీను, దోమాల గంగాధర్ పలువురు ఉన్నారు. -
కిటకిటలాడిన రైల్వే స్టేషన్
సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వచ్చిన ప్రయాణికులు ఆయా ప్రాంతాలకు మంగళవారం తిరుగు ప్రయాణం అయ్యారు. దాంతో మంగళవారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి అనేక మంది కాకినాడ జిల్లాలో వివిధ గ్రామాలకు తరలి వచ్చారు. ఓట్లు వేసి అందరూ ఒకేసారి మంగళవారం ఆయా ప్రాంతాలు చేరుకోవడానికి సిద్ధం అయ్యారు. అయితే రిజర్వేషన్ టిక్కెట్లు లభించక పోవడంతో అనేక మంది సాధారణ టిక్కెట్లు తీసుకొని రిజర్వేషన్ బోగీలలోకి ఎక్కారు. దాంతో రిజర్వేషన్ చేయించుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీటీలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నా తమ సీట్లలోకి ఇతరులు వచ్చారని రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు కనిపించలేదని రిజర్వేషన్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ బోగీలలో కిక్కిరిసి ప్రయాణం చేశారు. తిరుగు ప్రయాణాలతో రద్దీ రిజర్వేషన్ బోగీలోనూ సాధారణ ప్రయాణికులు -
రత్నగిరికి కల్యాణశోభ
ఫ 18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఫ 24 వరకూ నిర్వహణ ఫ 19వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం అన్నవరం: సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారికి ఎడమ భాగాన లక్ష్మీదేవి అంశగా దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున శంకరుడు ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే దివ్యధామం ఈ హరిహర క్షేత్రం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విఖ్యాతం. కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు రత్నగిరిపై సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11.030 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై గత నెల 28వ తేదీన పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన అన్నవరం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించారు. నిత్య కల్యాణాలు రద్దు కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈఓ కె.రామచంద్ర మోహన్ గడచిన వారం రోజుల్లో రెండుసార్లు సమావేశమై ఏర్పాట్లు పురోగతిపై చర్చించారు. కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 19వ తేదీన జరిగే స్వామివారి కల్యాణం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ సత్యదేవుని నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి తిరిగి ఈ కల్యాణాలు నిర్వహిస్తారు. సీతారాములే పెళ్లి పెద్దలు భద్రాద్రి రాముని కల్యాణోత్సవం తరువాత తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక సత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్ర పాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సత్యదేవుని కల్యాణోత్సవాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూండటం ఇక్కడి సంప్రదాయం. ఇదీ కల్యాణోత్సవాల క్రమం ఫ మే 18: వైశాఖ శుద్ధ దశమి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధానాలయంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులుగా అలంకరిస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఫ మే 19: వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం రాత్రి 9 నుంచి 11.30 గంటల వరకూ రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఫ మే 20: వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం నిర్వహిస్తారు. ఫ మే 21: వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అనివేటి మండపంలో పండిత సదస్యం నిర్వహిస్తారు. ఫ మే 22: వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొండ దిగువన దేవస్థానం గార్డెన్స్లో సత్యదేవుని వనవిహారోత్సవం. ఫ మే 23: వైశాఖ పౌర్ణమి గురువారం ఉదయం 8.30 గంటలకు పంపా నదిలో స్వామివారి శ్రీచక్రస్నాన మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన కార్యక్రమాలు. ఫ మే 24: వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం రాత్రి 7 గంటలకు నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రత్యేక ఆకర్షణగా రథోత్సవం సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వామివారికి రూ.1.04 కోట్ల వ్యయంతో భారీ టేకు రథంపై నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ రథంపై రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథాన్ని ఇప్పటికే గత నెల 26న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆ రథానికి రంగులు వేసే కార్యక్రమంతో పాటు, ఆరు చక్రాలకు పట్టీలు, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు, ముందు భాగంలో రెండు గుర్రాలు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెల 16వ తేదీకల్లా పూర్తి చేసి, ఆ రోజు ఉదయం 9 గంటలకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ వేయనున్నారు. దీనికోసం రథం ఉన్న పంపా సత్రం గేట్లు తొలగించి ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. పంపా సత్రం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా సత్యదేవుని తొలి పావంచా వద్దకు తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ పంపా సత్రానికి తీసుకుని వస్తారు. రథాలను లాగడంలో అనుభవం కలిగిన ధవళేశ్వరానికి చెందిన నిపుణులను ఈ రథోత్సవానికి తీసుకుని వస్తున్నామని అధికారులు తెలిపారు. -
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
● తెల్లారిన కూలీల బతుకులు ● ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ ● రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ● ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన ● మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన ● న్యాయం చేయాలంటూ రహదారిపై ఆందోళన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురేష్కు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కార్మికుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్ష్మి, కుమారులు నాగరాజు, సురేష్, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్టీవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : జెడ్పీ చైర్మన్ విప్పర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉండి, ఆదుకుంటామని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. మృతుల కుటుంబాలను మంగళవారం రాత్రి ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరగైన వైద్య సేవలందించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సూచించారు. -
వైభవంగా చండీహోమం
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు శైవాగమ పద్ధతి లో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల, అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. మంగళవారం ఆలయంలో ఉదయం గవ్యాంతం, చండీహోమం, కళా హోమాలు, అభిషేకాలు తదితర పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వార్లను ప్రత్యేక పూలతో అలంకరించి నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం సదస్యం, సభా పూజ, పండిత సత్కారం నిర్వహించారు. పండిత సదస్యంకు జిల్లాలో పలు ఆలయా ల్లో పనిచేస్తున్న వేద పండితులు హాజరవడంతో వేద ఘోషతో మురమళ్ల క్షేత్రం మార్మోగింది. ఈ ఉత్సవాలలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సావాల సందర్భంగా ఆలయ ఆవరణలో పచ్చిపూల అలంకరణ, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, గవ్యాంతం, కళాన్యాసములు, పూర్ణాహుతి, వసంతోత్సవం, వృద్ధ గౌతమీ తీరంలో త్రిశూల స్నానం, స్వామి వారిని అమ్మవారిని రథంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహణ, రాత్రి పుష్పోత్సవం, పవళింపు సేవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఘనంగా వీరేశ్వరుని బ్రహ్మోత్సవాలు -
సీబీఎస్ఈ ఫలితాలలో అగ్రగామిగా నిలిచిన శ్రీ షిర్డీసాయి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీబీఎస్ఈ 10, 12 వ తరగతి ఫలితాలలో శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీ విద్య మంగళవారం వెల్లడించారు. 10వ తరగతిలో బీవీఆర్ సాహితి 500 మార్కులకుగాను 484 మార్కులతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా, జె.సుహాస్సాయి 479 మార్కులతో ద్వితీయ స్థానం, ఎ.రేణుసాయిశ్రీ 478 మార్కులతో తృతీయ స్థానం సాధించారన్నారు. ఈ పరీక్షలకు 82 మంది హాజరుకాగా వారిలో 22 మంది 90 శాతం పైగా మార్కులు, 63 మంది విద్యార్థులు 80 శాతం పైగా మార్కులతో డిస్టింక్షన్లో ఉతీర్ణులయ్యారన్నారు. తమ కళాశాలలో 12వ తరగతి విద్యార్థిని కె.శ్రీలాస్య 500 మార్కులకుగాను 489 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా, 485 మార్కులతో జి.శ్రీవిద్య ద్వితీయ స్థానం, 481 మార్కులతో బి.లక్ష్మణనాయుడు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. 12వ తరగతిలో మొత్తం 300 మంది విద్యార్థులు హాజరుకాగా 45 మంది 90 శాతం పైగా మార్కులు సాధించగా, 216 మంది 80 శాతం పైగా మార్కులతో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారన్నారు. బోర్డు ఫలితాలలోనే కాక సీబీఎస్ఈ ఫలితాలలోను తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇంతటి ప్రతిభ చూపిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయ అధ్యాపక బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి.శ్రీవిద్య, ప్రిన్సిపాల్ జేఎస్వీ.ప్రసాదరెడ్డిలు లక్ష్యా, దీక్షా, డ్యాఫ్నీ డీన్లను అభినందించారు. 18న జాబ్మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 18వ తేదీన ప్రముఖ ఎల్అండ్టీ సంస్థ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.వేణుగోపాలవర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఐటీఐ ఉత్తీర్ణులైన ఫిట్టర్, ఎలక్రీషియన్, డ్రాఫ్ట్, సివిల్, వెల్డర్, ప్లంబర్, వైర్మెన్, కార్పెంటరీ ట్రేడ్ విద్యార్థులు అర్హులని, దాదాపుగా 1,600 ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎంపికై న విద్యార్థులకు మూడు నెలల శిక్షణ ఉంటుందని, శిక్షణ అనంతరం ఏపీ, తెలంగాణ, చైన్నె, బెంగళూరు రాష్ట్రాల్లో నియమిస్తారని, ఆసక్తి గలవారు ఉదయం 9గంటల్లోపు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. -
తమ పార్టీ వ్యక్తినే కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో జనసేన కార్యకర్త రేకపల్లి నాగరాజును ఆ పార్టీ కార్యకర్తలే కిడ్నాప్ చేశారు. సోమవారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు ముందుగా వేసే విషయంలో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రేకపల్లి నాగరాజును తోసేశారు. వాగ్వాదం జరిగింది. దీంతో నాగరాజు వ్యతిరేక వర్గమయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తుల బంధువులు అయిన గూడపల్లి, కేశనపల్లి గ్రామాలకు చెందిన జనసేన యువకులు నాగరాజును సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసినట్టు నాగరాజుతండ్రి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు గురయిన నాగరాజు దొరికాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు -
పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
రూ.1.50 లక్షల ఆస్తినష్టం అంబాజీపేట: గంగలకుర్రులో మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు పడి కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి రూ.1.50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సానబోయిన రామకృష్ణకు చెందిన శ్రీలక్ష్మీ దుర్గా క్వాయర్ ఇండస్ట్రీకి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. విద్యుత్ వైర్లపై కొబ్బరి ఆకు పడటంతో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు చెలరేగి కొబ్బరి పీచు దగ్ధమైంది. ఎగుమతికి సిద్ధంగా ఉన్న పీచు అగ్నికి ఆహుతి కావడంతో రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు రామకృష్ణ తెలిపారు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి అమలాపురం అగ్నిమాపక దళాధికారి కె.మురళీ కొండబాబు తన సిబ్బందితో చేరుకుని మంటలను ఆర్పివేశారు. -
హత్య కేసు నిందితులపై హత్యాయత్నం
అమలాపురం టౌన్: తన భార్యను హత్య చేశారన్న అక్కసుతో పాత కక్షను దృష్టిలో పెట్టుకుని భర్త ఓ కుటుంబంపై మంగళవారం ఉదయం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలో మెయిన్ రోడ్డుపై జరిగిన ఈ హత్యాయత్న ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. అమలాపురం రూరల్ మండలం సమనన గ్రామానికి చెందిన కోండ్రు కోటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో తన భార్యను హత్య చేసిన ఆ కుటుంబంలోని ఇంటి యజమాని, ఇద్దరు కొడుకులు, అల్లుడు, అల్లుడు కుమార్తె అయిదేళ్ల చిన్నారిపై కోండ్రు కోటేశ్వరరావు ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. పట్టణ సీఐ కె.కృష్టోఫర్ కథనం ప్రకారం...సమనస గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోండ్రు కోటేశ్వరరావు, మంగం బాలయోగి కుటుంబాల మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయి. దీంతో కోటేశ్వరరావు భార్యను అమలాపురం ఎన్టీఆర్ మార్గ్లో 2012 సంవత్సరంలో మంగం బాలయోగి కుటంబీకులు హత్య చేశారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ హత్య కేసుకు సంబంధించి మంగం బాలయోగి, అతని ఇద్దరి కుమారులు, అల్లుడు మంగళవారం అమలాపురంలోని కోర్టు వాయిదాకు వచ్చారు. వారితో పాటు బాలయోగి మనమరాలు (కూతురు కుమార్తె) చొప్పెల గుణశ్రీ (5) కూడా ఉంది. తన భార్య హత్య కేసులో కోర్టు వాయిదాకు బాలయోగి కుటుంబీకులు వస్తున్నారన్న సమాచారంపై పాత కక్షతో ప్రతీకార చర్య తీసుకోవాలన్న కోపంతో కోటేశ్వరరావు కత్తితో తన ఆటోలో అమలాపురం వచ్చి మాటు వేశాడు. తొలుత బాలయోగి కుటుంబీకులను ఆటోతో ఢీకొట్టి వారిపై హత్యాయత్నానికి తెగబడ్డాడు. అయితే బాలయోగి కుటుంబీకులు దాదాపు తప్పించుకున్నారు. అయితే వారి కూడా ఉన్న మనమరాలు గుణశ్రీకి కత్తి వేటు పడి తలకు గాయమైంది. ఆ బాలికను తక్షణమే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలయోగి కుమారుడు విజయ్ కూడా దాడిలో స్వల్పంగా గాయపడ్డాడు. నడి రోడ్డుపై కత్తితో దాడికి పాల్పడడం, ఓ చిన్నారిని గాయపరచడంతో స్థానికులు కోటేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. స్థానికుల చేతిలో గాయపడ్డ కోటేశ్వరరావు కూడా స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. కోటేశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రిష్టోఫర్ తెలిపారు. బాలయోగి కుటుంబీకులపైనా కేసు నమోదు కోండ్రు కోటేశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగానే అతడు గాయపడ్డ ఘటనపై కూడా బాలయోగి కుటుంబీకులపై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ కె.కృష్టోఫర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని అమలాపురం డీఎస్పీ ఎం.మహేశ్వరరావు కూడా సందర్శించి పరిశీలించారు. కోటేశ్వరరావును బాలయోగి కుటుంబీకులు కూడా ప్రతిఘటించారన్న సమాచారంపై కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు ఆధారంగా వారిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. ఇరు పక్షాల నుంచి అందిన ఫిర్యాదులపై విచారిస్తున్నామని తెలిపారు. సరిహద్దు వివాదం, పాత కక్షతో ప్రతీకార చర్యకు యత్నం అయిదేళ్ల బాలిక తలకు గాయం... మరో వ్యక్తికి స్వల్ప గాయం దాడి చేసిన వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి -
వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ దాడులు
ఆత్రేయపురం: ఎన్నికల పోలింగ్ ముగిసినా ఇంకా తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి తెగబడడంతో ఆత్రేయపురంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. ఆత్రేయపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వెంకట కృష్ణంరాజు అలియాస్ గోపి, అతని తమ్ముడు భాస్కర విజయ నరసింహరాజు ఓటు వేయడానికి సోమవారం పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు తెలుగుదేశం పార్టీ నేత ముదునూరి బద్రిరాజు కొంతమందితో కలిసి వీరితో ఘర్షణ పడ్డాడు. ఈ నేపథ్యంలో వెంకట కృష్ణంరాజు, అతని తమ్ముడు విజయ్ మంగళవారం ఉదయం గ్రామంలో ఉన్న రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో పోలింగ్ బూత్ వద్ద వీరితో గొడవ పడిన ముదునూరి బద్రిరాజు మరికొంత మందిని తీసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు తలపడ్డాయి. దీంతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇరువర్గాలను చెదరగొట్టే సమయంలో ఎస్ఐ శ్రీనివాస్కు కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తులపై, అల్లర్లకు పాల్పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆత్రేయపురంలో వివాదం సద్దుమణిగింది: డీఎస్పీ కేవీ రమణ ఎన్నికల నేపథ్యంలో ఆత్రేయపురంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య ఏర్పడిన వివాదం సద్దుమణిగిందని డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. ఆత్రేయపురంలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులు వాట్సాప్లో ఒకరిపై ఒకరు చాలెంజ్లు చేసుకోవడంతో వివాదం తలెత్తిందన్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. బెదిరింపులకు భయపడం:ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని , అలాంటి బెదిరింపులకు భయపడేది లేదని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం ఆత్రేయపురంలో వైఎస్సార్ సీపీ నేతలపై జరిగిన దాడి ఘటన తెలుసుకుని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు హద్దులు దాటితే తాము సహించబోమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటామని జూన్ 4 వరకు ఓపికతో ఉండాలని కోరారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి -
పాడి పశువుల సంరక్షణ కోసం
రాజానగరం: గ్రామీణ ప్రాంతాలలో రైతులు పశుసంపదను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. పాడి పశువులు అనారోగ్యానికి గురైతే అన్నదాతలు ఎంతగానో తల్లడిల్లిపోతారనే విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా హైడ్రాలిక్ సిస్టమ్తో కూడిన వైఎస్సార్ సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 108 తరహాలోనే వీటికి కూడా 1962 టోల్ఫ్రీ నంబరును కేటాయించి, రైతన్నల పశుసంపద పరిరక్షణకు చేదోడు వాదోడుగా నిలిచారు. 2022 మే 19న ప్రారంభమైన ఈ ఉచిత సర్వీసు ద్వారా నియోజకవర్గంలో ఇంతవరకు 4,085 పాడి పశువులకు వైద్య సేవలందించారు. ● మీనీ గోకులం (ఆరు పశువులకు సరిపడేలా షెడ్డు నిర్మించుకునేందుకు) పథకం ద్వారా యూనిట్కి రూ. ఒక లక్ష 40 వేలు చొప్పున రూ. ఒక కోటి 80 వేల వ్యయంతో 72 షెడ్డులను నిర్మించారు. ● పశు నష్టం (ఆవు, గేదె, మేక, గొర్రె) వాటిల్లిన సమయంలో రైతులను ఆదుకునేలా అమలు చేస్తున్న పశు నష్ట పరిహార పథకం (దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనవసరం లేదు) ద్వారా 405 మంది రైతులకు రూ. కోటి 21 లక్షల 50 వేలు పరిహారంగా అందజేశారు. ● కేవలం రూ.340 ప్రీమియంతో మూడేళ్ల కాలవ్యవధితో కూడిన వైఎస్సార్ పశు బీమా పథకం (ప్రమాదాలలో మరణించిన పశువులకు) ద్వారా 40 మంది రైతులకు రూ.12 లక్షలు బీమా చెల్లించారు. ● ఒక లక్ష 96 వేల పశువులకు, పెంపుడు జంతువులకు గడచిన నాలుగేళ్లలో గాలి కుంటు, హెచ్.ఎస్. దొమ్మ, బ్రూసిల్లా, లింకిస్కిన్ డిసీజెస్, పీపీఆర్ పోండు, షీప్ పాక్స్ వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలతోపాటు నట్టల నివారణకు రూ. 40 లక్షలు ఖర్చు చేశారు. ● ఉచిత కృత్రిమ గర్భధారణ పథకం అమలు ద్వారా రూ. ఒక లక్ష 68 వేలు వెచ్చించారు. ● మేలు రకం పశుగ్రాస విత్తనాల సరఫరాకు రూ. 3.45 లక్షలు ఖర్చు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని తాళ్లరేవు బైపాస్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాళ్లరేవు పరదేశమ్మ వీధికి చెందిన నారాయణరావు బైక్పై వెళుతుండగా కారు బైక్ను ఢీకొని పక్కనే ఉన్న పంట చేలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురితోపాటు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పదేళ్ల కుర్రాడికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికులు హుటాహుటిన వారిని తాళ్లరేవు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు కాలేదని, వివరాలు తెలియరాలేదని కోరంగి పోలీసులు తెలిపారు. -
దాడి కేసు నమోదు
రాయవరం: మండలంలోని కూర్మాపురంలో సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు దాడి కేసు నమోదు చేసినట్లు రాయవరం ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వీరబోయిన వీరవెంకటదుర్గాప్రసాద్ వలంటీర్గా పనిచేసి ఇటీవల రాజీనామా చేశాడు. సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సమయంలో వలంటీర్ బయట వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీకి చెందిన చెక్కు మహేష్ మరో 13 మంది దుర్గాప్రసాద్ వద్దకు వచ్చిన నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడకు ఎందుకు వచ్చావంటూ ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన దుర్గాప్రసాద్ రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
సత్యదేవునికి గొడుగుల సమర్పణ
అన్నవరం: గుడివాడకు చెందిన అమ్మ కనస్ట్రక్షన్స్ అధినేత మాటూరి రంగనాఽథ్, శ్రీవల్లి దంపతులు సత్యదేవుని ఊరేగింపులో వాడే గొడుగులను మంగళవారం స్వామివారికి సమర్పించారు. వీటిని ప్రతి రోజు స్వామివారి ఊరేగింపులో ఉపయోగించాలని దాత దంపతులు కోరినట్లు ఏఈఓ కృష్ణారావు తెలిపారు. సెల్ఫోన్ షాపులో అగ్నిప్రమాదం కాజులూరు: మండల కేంద్రమైన కాజులూరులో మంగళవారం ఒక సెల్ఫోన్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి సర్వం కాలిబూడిదయింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఎదుట ఉన్న బలభద్రుని కామేష్ సెల్ఫోన్ షాపులో తెల్లవారుజామున మంటలు సంభవించాయి. లోపల నుంచి పొగలు వస్తుండటంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి షాపు యజమానికి సమాచారమందించారు. ఆయన హుటాహుటిన వచ్చి షాపు షట్టరు తెరవగా లోపల మంటలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించగా సిబ్బంది వచ్చి మంటల ఆర్పివేశారు. అయితే అప్పటికే షాపులోని సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, జిరాక్స్ మెషీన్లతో పాటు ఖరీదైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఆస్తి నష్టం సుమారు రూ.15 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బోటు తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడలో ఉన్న ఉమ్మిడి విజయ్కుమార్కు చెందిన బోట్ల తయారీ కేంద్రంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైబర్ షీట్లు, బోటు తయారీ పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.7లక్షల నష్టం వాటిల్లినట్టు విజయ్కుమార్ తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement