-
వైభవంగా లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు గురువారం ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనానికి ఉభయదారులుగా గుద్దిటి నారాయణప్ప, బండ్లపల్లి వెంకటజయప్రకాష్, అంబటి సతీష్కుమార్, కట్టా భాగ్యమ్మ అండ్ సన్స్, అన్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున, నీలయ్యగారి ఫణికుమార్, షర్మిల, జింకా చిన్న కంబయ్య, కోటం కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కుమారుడు కోటం రవీంద్రనాథ్ కుటుంబ సభ్యులు, సుందరేషన్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చంద్రప్రభ వాహనానికి ఉభయదాతలుగా రామాయణం వెంకటేశ్వరప్రసాద్, కీ.శే.గోపాల కృష్ణయ్య కుమారులు, గుద్దిటి నారాయణప్ప, సౌందర్యలహరి, పంచాంగం సరసాదత్తమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వారికి ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు స్వాగతం పలికారు. వారిచేత స్వామికి పూజలు చేయించారు. సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాల ఊరేగింపుకు ఆలయ కమిటీ ఛైర్మన్ దాసెట్టి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు. నేడు సర్వభూపాల, సింహ వాహనాల్లో... లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు సర్వభూపాల వాహనం, సాయంత్రం 6 గంటలకు సింహ వాహనంపై చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగిన స్వామివారు -
22న అరుణాచలానికి ఆర్టీసీ బస్సు సర్వీసు
ధర్మవరం అర్బన్: పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన అరుణాచలం గిరి ప్రదర్శన, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని ఆర్టీసీ డీఎం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 23న పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానుపోను చార్జీలు రూ.1400 మాత్రమేనని తెలిపారు. బస్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్లో గాని, ఆన్లైన్లోగాని సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 6303151302, 9959225859 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి వేరుశనగకు రిజిస్ట్రేషన్పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్లో సాగు చేయడానికి అవసరమైన సబ్సిడీ విత్తన వేరుశనగకు రైతులు శుక్రవారం నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2,44,763 హెక్టార్లు కాగా వేరుశనగ విస్తీర్ణం 1,74,910 హెక్టార్లు. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసుకొనడానికి 1,00,443 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇందులో వేరుశనగ 97,886 క్వింటాళ్లు, కందులు 1500 క్వింటాళ్లు, రాగులు 300 క్వింటాళ్లు, పెసలు 200 క్వింటాళ్లు, ఉలవలు 300 క్వింటాళ్లు, అలసంద 100 క్వింటాళ్లు, కొర్ర 20 క్వింటాళ్లు, జీలుగ 138 క్వింటాళ్లు సరఫరా చేయడానికి అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ఇవన్నీ 40 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఎరువులు కూడా... ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా 14,875 టన్నులు, డీఏపీ 5969 టన్నులు, ఎంఓపీ 1151 టన్నులు, కాంప్లెక్స్ 1456 టన్నులు, ఎస్ఎస్పీ 2821 టన్నులు, మొత్తం 39,378 టన్నులు ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. క్వింటా చింతపండు రూ.16 వేలుహిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.16 వేలు ధర పలికింది. మార్కెట్కు గురువారం 1,200 క్వింటాళ్ల సరుకు రాగా, ఈ–నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.16 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.11 వేల ప్రకారం ధర పలికిందన్నారు. అలాగే ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.8,500, కనిష్టంగా రూ.4 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి. ఇక బోటు రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.3 వేలు, కనిష్టంగా రూ.2,500 ప్రకారం పలికింది. పలు రైళ్లకు అదనపు కోచ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్లను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యాప్తంగా దాదాపు 28 ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదనంగా స్లీపర్, 3 ఏసీ కోచ్లను జత చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గుత్తి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నర్సాపూర్–ధర్మవరం (17247/48) ఎక్స్ప్రెస్ రైళ్లు, అదేవిధంగా గుంతకల్లు జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నర్సాపూర్–హుబ్లీ (17225/26) అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల 21 వరకూ అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం
సోమందేపల్లి: మండలంలోని గుడిపల్లి పార్రిశామిక వాడలో ఉన్న కియా అనుబంధ ఎస్ఎల్ఏపీ పరిశ్రమంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. గురువారం కంపెనీ ముఖ్య ప్రతినిధులు ఎస్ఎల్ఏపీ పరిశ్రమకు చేరుకుని పరిశీలించారు. కియా కార్లకు సంబంధించిన హెడ్ లైట్లు, గ్లాసులు ఈ పరిశ్రమలో తయారవుతాయి. వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు ఎగిసిపడి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఘటనలో విలువైన యంత్రాలు కాలి బూడిదయ్యాయి. దీంతో దాదాపు రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేశారు. కాగా, పరిశ్రమను ఆగమేఘాలపై పునరుద్ధరించి గురువారం నుంచి యథావిధిగా పనులు చేపట్టారు. ఎంత పని‘జేస్తి’వయ్యా!పెద్దపప్పూరు: ఎన్నికల ముందు వరకు వచ్చేది తమ ప్రభుత్వమే అని మీసాలు మెలివేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెరగడం, మళ్లీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని తేలిపోవడంతో గ్రామాల్లో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, పెద్దపప్పూరు, చిన్నపప్పూరు తదితర గ్రామాల్లో పచ్చ మూకలు చేసిన రగడ అంతా ఇంతా కాదు. అంతటితో ఆగకుండా ఈ నెల 14న తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైకి రాళ్లు, టపాసులతో వీరంతా దాడి చేశారు. ఈ అరాచక కాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోననే భయంతో అనారోగ్యం నాటకమాడి హైదరాబాద్లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు. దాడులకు తమను ఉసిగొల్పిన నేత ఒక్కసారిగా మాయమవడంతో మండలంలోని ఆ పార్టీ గూండాలు నేడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కొండలు, గుట్టలు, పొలాల బాట పట్టి తమ బంధువుల ద్వారా అన్న పానీయాలను తెప్పించుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. -
ఎస్పీ అమిత్ బర్దర్ సస్పెన్షన్
అనంతపురం/తాడిపత్రి: ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఎస్పీ అమిత్బర్దర్పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పాటు ఆయనపై శాఖాపరమైన విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీకృష్ణను కూడా ఈసీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణలను అదుపు చేయడంలో వీరు విఫలమైనట్లు ఈసీ గుర్తించింది. ఘర్షణలను ముందే పసిగట్టి అరికట్టలేదనే నిర్ణయానికి వచ్చి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అలాగే,తాడిపత్రి లో జరిగిన ఘటనలపై నమోదైన ప్రతి కేసుపై విచారించేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. సస్పెన్షన్ వేటు పడిన తొలి ఎస్పీ.. జిల్లా పోలీసు చరిత్రలో గతంలో ఎన్నడూ ఓ ఎస్పీ సస్పెండ్ కాలేదు. తొలిసారిగా అలా వేటు పడిన ఎస్పీ అమిత్ బర్దర్ కావడం గమనార్హం. ఎన్నికల ముందు ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ అన్బురాజన్ను ఈసీ బదిలీ చేసింది. అనంతరం అమిత్ బర్దర్కు ఆ బాధ్యతలు అప్పగించింది. అనతి కాలంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. ఫలితాల ప్రకటన తర్వాత భద్రత కల్పించండి కాగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జిల్లావ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈసీ దిశానిర్దేశం చేసింది. జూన్ 4న కౌంటింగ్ తరువాత తాడిపత్రిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా నియంత్రించడానికి కేంద్ర బలగాల కంపెనీలను అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ బలగాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. టీడీపీ నాయకుల వల్లే బలి.. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో కవ్వింపు చర్యలకు దిగారు. పచ్చ మూకలతో కలిసి ప్రశాంత పట్టణంలో హింస రాజేశారు. ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైనే దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఎస్పీ సస్పెండ్కు గురి కావడం గమనార్హం. గత నెల 5న ఎస్పీగా అమిత్ బర్దర్ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నాయకుల హింసాత్మక వైఖరి కారణంగా కేవలం 40 రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లయింది. అడిషనల్ ఎస్పీ రామకృష్ణపై చర్యలేవీ..? కాగా, తాడిపత్రిలో హింసాత్మక ఘటనలకు పరోక్షంగా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ కారణమయ్యారని ఏకంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఆయన మద్దతుతోనే పచ్చ మూకలు రెచ్చిపోయారని కూడా విమర్శించారు. ఎన్నికల సంఘానికి ఆధార సహితంగా లేఖ కూడా రాశారు. అలాంటి ఏఎస్పీ రామకృష్ణపై మాత్రం ఈసీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీకృష్ణపైనా వేటు పట్టణంలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం -
No Headline
కదిరి: సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. అయితే ఫలితాల కోసం జూన్ 4వ తేదీ ఎప్పుడొస్తుందా? అని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఈ పార్టీ .. ఆ పార్టీ అనే తేడా లేకుండా భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. కోడి పందేలు, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఎన్నికల ఫలితాలు, మెజార్టీపై భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. కొందరైతే 1కి మూడు రెట్ల పందెం కాస్తున్నారు. అంటే రూ. లక్షకు రూ.3 లక్షలు చొప్పున బెట్టింగ్లు వేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఫలానా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఫలానా మండలంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఇలా పలు రకాలుగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఆస్తులు తాకట్టు పెట్టిమరీ... జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కొందరు ఎన్నికల బెట్టింగ్లకు చేతిలో డబ్బు లేకపోయినా వారి ఆస్తులను తాకట్టు పెట్టి మరీ పందెం కాస్తున్నారు. ● కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన ఒక నాయకుడు తనకున్న ఆరెకరాల భూమిని బెట్టింగ్కు తాకట్టు పెట్టాడు. కదిరికి చెందిన మరో నాయకుడు తన కారును పందెంలో వేశాడు. ● పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలానికి చెందిన 8 మంది ఒక బృందంగా ఏర్పడి రూ.3 కోట్లకు పైగా బెట్టింగ్లు వేశారు. ● ధర్మవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డికి జిల్లాలో అందరి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని ఒక పట్టు చీరల వ్యాపారి రూ.50 లక్షలు బెట్టింగ్ వేశాడు. ● ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని హిందూపురానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగుళూరులో తనకున్న అపార్ట్మెంట్ను బెట్టింగ్లో పెట్టాడు. ● మడకశిరలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒకరు బెంగుళూరుకు చెందిన ఒక బిల్డర్తో రూ.35 లక్షలు బెట్టింగ్ వేశాడు. ● హిందూపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఓడిపోతాడని జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పందేలు వేశారు. ఎన్నికల్లో గెలుపుపై కొందరు.. మెజార్టీపై మరికొందరు జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్ టీడీపీలో ఉంటూ వైఎస్సార్సీపీ పక్షాన కొందరు పందాలు శ్రీసత్యసాయి జిల్లాలో 7 ఎమ్మెల్యే స్థానాలకుగాను టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వస్తాయని గోరంట్లలో ఆ పార్టీకే చెందిన ఒక నాయకుడు రూ.75 లక్షలు బెట్టింగ్ వేశాడు. మహిళలు ఎక్కువ శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారని, వారంతా జగన్కే ఓటు వేశారని ఆయన బహిరంగంగా చెబుతున్నాడు. ఎందుకిలా చెబుతున్నారని సొంత పార్టీ నాయకులు అడుగుతుంటే తాను బెట్టింగ్ వేసిన విషయం బయట పెట్టడంతో పాటు జూన్ 4న ఓటమిని తట్టుకోవడానికి మన పార్టీవారంతా ‘సిద్ధం’గా ఉండాలని చెబుతున్నాడు. కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్నికలకు మునుపు టీడీపీలో చేరిన ఓ నాయకుడు కదిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మగ్బుల్ గెలుస్తాడని పందెం వేశాడు. ఈ విషయం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్కు తెలిస్తే కోప్పడతాడని ముందే గ్రహించి ఎవరికీ అనుమానం రాకుండా వైఎస్సార్సీపీలో ఉన్న ఆయన బిజినెస్ పార్టనర్ చేతికి రూ.50 లక్షల డబ్బులిచ్చి ఆయన ద్వారా మగ్బుల్ గెలుస్తాడని బెట్టింగ్ కాశాడు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
హిందూపురం/లేపాక్షి/హిందూపురం టౌన్: జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఆయా స్ట్రాంగ్ రూములకు చేర్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు తెలిపారు. గురువారం మండల పరిధిలోని బిట్ కళాశాల, లేపాక్షి చోళ సముద్రం వద్దనున్న డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూముల వద్ద ప్రస్తుత పరిస్థితులు, భద్రతా చర్యలు, విధులు నిర్వర్తిస్తున్న వారి పనితీరును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియను రెండు కేంద్రాల్లో చేపట్టినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను ఉంచి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గంటల పాటు రక్షణగా ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చి, భద్రత వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో డీఎస్పీ స్థాయి అధికారులు, ఇతర పోలీస్, ఉద్యోగ సిబ్బంది ఆధ్వర్యంలో 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. స్ట్రాంగ్ రూములను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆర్ఓలకు కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఎవరు కూడా అతిక్రమించకూడదన్నారు. కౌంటింగ్ సెంటర్ల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా కౌంటింగ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న వారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్శాఖ నేతృత్వంలో గట్టి బందోబస్తు చేపట్టాలని, చిన్నపాటి అవాంఛనీయ సంఘటనకు కూడా అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూముల తనిఖీలో భాగంగా ఈవీఎం గదులను పరిశీలించి సంబంధిత అధికారులకు సీసీ కెమెరాల పనితీరు, పోలీసు పహారా, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన తర్వాత విజిటర్స్ రిజిస్టర్లో కలెక్టర్ అరుణ్బాబు సంతకం చేశారు. కార్యక్రమంలో హిందూపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి, జేసీ అభిషేక్ కుమార్, పెనుకొండ రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ, కదిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వంశీకృష్ణ, ధర్మవరం రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి, మడకశిర రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్, హిందూపురం డీఎస్పీ కంజక్షన్, సీఐ ఈరన్న, పెనుకొండ తహసీల్దార్ ఉదయ శంకర్, చిలమత్తూర్ తహసీల్దార్ భాగ్యలత, మడకశిర తహసీల్దార్ వెంకటేష్, ఆర్ఐ అమర్, ఎస్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అరుణ్బాబు -
రెచ్చిపోయిన పచ్చమూకలు
పెనుకొండ రూరల్: పోలింగ్ తర్వాత పచ్చ మూకలు రెచ్చిపోయాయి. ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి పెనుకొండ మండలం నాగలూరు పంచాయతీ బండపల్లిలో వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్ కలకందప్పపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్ కలకందప్ప క్రియాశీలకంగా పనిచేశారు. పోలింగ్ రోజున టీడీపీ నేతల దౌర్జన్యాలను అడ్డుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన టీడీపీ నేతలు అతనిపై కక్ష గట్టారు. బుధవారం కలకందప్ప వ్యక్తిగత పనిపై మావటూరుకు వెళ్లి.. సాయంత్రం తిరిగి వస్తుండగా.. టీడీపీ నేతలు రామచంద్రప్ప, గజేంద్ర, ప్రసాద్, రామాంజినప్ప, ప్రభన్న అడ్డుకుని దాడి చేశారు. గ్రామంలో ఉండాలంటే టీడీపీలో చేరాలని, లేకపోతే ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరించారు. దీంతో బాధితుడు కలకందప్ప నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్పై దాడి -
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
సోమందేపల్లి: మండలంలోని గుడిపల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన ఎస్ఎల్ఏపీ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పొగ కారణంగా ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే... ఇటీవల ఎస్ఎల్ఏపీ పరిశ్రమ విస్తరణలో పనులు చేపట్టారు. బుధవారం వెల్డింగ్ పనులు చేస్తుండగా...నిప్పురవ్వలు సమీపంలోని గుజరీ సామగ్రిపై పడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించగా రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ఈ సమయంలో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెనుకొండ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధర్మవరం అర్బన్: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శమీనారాయణస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా గరుడ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రహోత్సవాలకు బ్రహ్మాది దేవతలకు ఆహ్వానం పలుకుతూ అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్ తదితరులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఉభయదారులుగా గజనాణ్యం పట్టుసాలే సంఘం వారు వ్యవహరించారు. -
జిల్లాలో 144 సెక్షన్
● నేటి నుంచి జూన్ 4 వరకూ అమలు ● ఎస్పీ మాధవరెడ్డి వెల్లడి పుట్టపర్తి టౌన్: జిల్లాలో బుధవారం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ అంటే జూన్ 4వ తేదీ వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. హింసాత్మక ఘటనలకు, రెచ్చగొట్టేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా యంత్రాంగం సమష్టి కృషి, రాజకీయ పార్టీ నేతల సహకారం, ప్రజల స్వచ్ఛంద మద్దతుతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పోలింగ్ ముగిసినందున అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, హింసాత్మక సంఘటనలకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో సైతం రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఎక్కడా గుంపులు, గుంపులుగా ఉండకూడదని, అల్లర్లు, ఘర్షణ జోలికి వెళ్లకూడదన్నారు. అనుమతులు లేకుండా ఎక్కడా సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. అయితే పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు మినహాయింపు ఉంటుందన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహరించాలని కోరారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
నేటి నుంచి బీసీజీ వ్యాక్సినేషన్
ప్రశాంతి నిలయం: క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈనెల 16వ తేదీ (గురువారం) నుంచి జిల్లాలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమ నిర్వహణపై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మంజువాణి తన కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్లో భాగంగా 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ టీకా వేస్తారన్నారు. ఈనెల 16న ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ మూడు నెలల పాటు కొనసాగుతుందన్నారు. ప్రతి గురువారం జిల్లాలోని 544 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ చేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సమీక్షలో జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర నాయక్, జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ తిప్పయ్య, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు ● జిల్లా ఆహార భద్రత అధికారి తస్లీం హిందూపురం టౌన్: ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తూ కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారిణి తస్లీం హెచ్చరించారు. బుధవారం ఆమె పట్టణంలోని ‘సరిగమ’, తాడిపత్రి బిర్యాని రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా రెస్టారెంట్లలో వండిన ఆహార పదార్థాలను, వండడానికి సిద్ధం చేసిన పదార్థాలను పరిశీలించారు. కొన్ని పదార్థాల నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా తస్లీం మాట్లాడుతూ, రెస్టారెంట్ నిర్వాహకులు ఆహార భద్రత శాఖ అనుమతులు తీసుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోయినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయించినా ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నేడు ఏపీఈఏపీ సెట్ అనంతపురం: ఏపీ ఈఏపీసెట్ గురువారం జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 29,025 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అనంతపురం జిల్లాలకు సంబంధించి మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 23 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. -
స్ట్రాంగ్రూంలకు పటిష్ట భద్రత
హిందూపురం/హిందూపురం అర్బన్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మ్ర్డ్ రిజర్వుడ్ బలగాలు, సివిల్ పోలీసులను మోహరించామన్నారు. బుధవారం ఆయన హిందూపురం సమీపంలోని ‘బిట్’ కళాశాల, లేపాక్షి సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. స్ట్రాంగ్రూంల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో సంచరించేందుకు ఎవరికీ అనుమతిలేదన్నారు. ఓట్ల లెక్కింపు కోసం జూన్ 4న జిల్లా ఎన్నికల అధికారి, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలు తెరిచి ఈవీఎంలను బయటకు తీస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేసినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మూడంచెల భద్రత... సాయుధ బలగాల పహారా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించిన ఎస్పీ మాధవరెడ్డి -
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి అర్బన్: పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన కురుబ విద్యార్థులకు కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు కనకదాస ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్, అధ్యక్షుడు పూజారి రెడ్డెప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్లో 800 మార్కులపైన, పదో తరగతిలో 450 మార్కులపైన, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారైతే 500 మార్కులపైన సాధించిన వారు అర్హులన్నారు. అలాగే నీట్, జేఈఈలో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకూ పురస్కారాలు అందిస్తామని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 22వ తేదీలోపు హిందూపురం వక్కల బజార్లోని శ్రీనివాస బుక్స్టాల్లో అందజేయాలన్నారు. దరఖాస్తుతో పాటు మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్ జత చేయాలన్నారు. వివరాలకు 8919729330, 9441252569 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఉపాధి ఉత్సాహం
వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు వరంగా మారింది. ఉపాధి కోసం నగరాలకు వెళ్లిన వారంతా కరోనా సంక్షోభంలో స్వగ్రామాలకు రాగా, వారందరికీ అధికారులు ‘ఉపాధి’ కల్పించారు. రోజువారీ కూలి రూ.250 తగ్గకుండా ఇవ్వడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తుండగా, ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాక్షి, పుట్టపర్తి ఉపాధి హామీ పథకం అమలులో మన జిల్లా ప్రత్యేకతను చాటింది. ఐదు నెలల కాలానికి ఉన్నతాధికారులు 50 లక్షల పని దినాలు లక్ష్యం విధించగా, ఇప్పటికే సుమారు 18 లక్షల పని దినాలు పూర్తయ్యాయి. కూలి డబ్బులు కూడా పెండింగు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. రోజూ సగటున లక్ష మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు చాలా మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది బతుకుదెరువు కోసం ఉపాధిహామీ పనుల వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే సుమారు రూ.45 కోట్లు వేతన రూపంలో కూలీలకు చెల్లించారు. ఆపత్కాలంలో అండగా.. కరోనా ముందువరకు గ్రామాల్లో నిరుపేదలు మాత్రమే ఉపాధి హామీ పనులపై ఆధారపడేవారు. మెరుగైన వేతనం కోసం ఇంకొందరు బెంగళూరు, హైదరాబాద్, కేరళ, బళ్లారి తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ కోవిడ్ సంక్షోభంలో అందరూ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఆ తర్వాత కూడా మెట్రోపాలిటన్ సిటీలకు మళ్లీ వెళ్లేందుకు ఇష్టపడలేదు. స్థానికంగానే పనులు చేసుకుంటూ కుటుంబీకులతో కలిసి ఉంటున్నారు. ఇలాంటి వారికి ఉపాధి హామీ పనులు వరంగా మారాయి. ఈక్రమంలో చదువుకున్నవారు సైతం ఉపాధి పనుల కోసం క్యూ కట్టారు. వారిలో పీజీ, డిగ్రీలు పూర్తిచేసిన ఉన్నత విద్యావంతులు ఎందరో ఉన్నారు. ఉపాధి హామీ జాబ్కార్డుల కోసం నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పారదర్శకంగా అమలు.. ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులు కల్పిస్తుండటంతో కూలీలు కూడా ఉత్సాహంగా హాజరు అవుతున్నారు. జిల్లాలో సగటున రోజుకు లక్ష మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. వీరిలో చాలా మంది గతేడాది వంద రోజులు పనులు పూర్తి చేసిన వారు ఉండటం విశేషం. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకం నిధులు తెలుగు తమ్ముళ్లకు ఫలహారంగా మారాయనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోంది. నిరుపేదలకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ వలసలు పూర్తిగా తగ్గించింది. జిల్లాలో లక్ష మందికిపైగా పని ఇప్పటికే 18 లక్షల పని దినాలు పూర్తి వలసలకు అడ్డుకట్ట వేసిన ప్రభుత్వం పెండింగు లేకుండా వేతనాల చెల్లింపు కూలీల ఖాతాల్లో ఇప్పటికే రూ.45 కోట్లు జమ పనుల వద్ద కనీస వసతుల ఏర్పాటు సకాలంలోనే బిల్లులు ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి కల్పించే బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపైనే ఉంది. ప్రతి పంచాయతీలో పని దినాలు పూర్తి చేయాలి. కచ్చితమైన కొలతలు ఇవ్వాలి. రోజు కూలి రూ.250 పైగా పడేలా చూడాల్సిన బాధ్యత కూడా టీఏ, ఎఫ్ఏలదే. బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నాం. – విజయప్రసాద్, పీడీ, డ్వామా -
హత్య కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు
ముదిగుబ్బ: ఓ హత్య కేసులో ముద్దాయిలకు అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ముదిగుబ్బ సీఐ యతీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ముదిగుబ్బ మండలం ఎస్.బండ్లపల్లి గ్రామానికి చెందిన సాకే గంగరాజుతో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తలుపుల మండలం సుబ్బనగుంతపల్లికి చెందిన గుజ్జల గంగప్ప అనుమానించాడు. దీంతో గంగరాజును హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకు తనమిత్రుడు లోమడ ఆంజనేయులు సాయం కోరాడు. అనంతరం గంగరాజుతో స్నేహం చేశాడు. ముందుగానే వేసిన ప్లాన్లో భాగంగా 2016 మార్చి 2వ తేదీన గంగప్ప, అతని మిత్రుడు లోమడ ఆంజనేయులు సాకే గంగరాజు వద్దకు వచ్చారు. మేకలు కొనడానికి ముదిగుబ్బకు వెళ్దామని కోరారు. వారి మాటలు నమ్మిన గంగరాజు వారితో కలిసి బైక్పై బయలుదేరాడు. అయితే గంగరాజును మాటల్లో పెట్టి ముదిగుబ్బ ఓల్డ్ టౌన్ రైల్వే గేటు సమీపంలోని మిల్లు వెనుక వైపు వరకూ తీసుకువెళ్లారు. అక్కడ బైక్ నిలిపి గంగప్ప అతని మిత్రుడు ఆంజనేయులు వెంట తెచ్చుకున్న కొడవళ్లతో గంగరాజును విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయారు. మృతుడి సోదరుడు సాకే వెంగముని ఫిర్యాదు మేరకు అప్పటి ముదిగుబ్బ ఎస్ఐ జయా నాయక్, నల్లమాడ సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసు విచారించిన అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శోభారాణి బుధవారం తీర్పు వెలువరించారు. ముద్దాయిలు గుజ్జల గంగప్ప, లోమడ ఆంజనేయులు జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ముద్దాయిలకు శిక్షపడే విధంగా కేసు దర్యాప్తు చేసిన అధికారులు శివరాముడు, జయా నాయక్, ప్రస్తుత ముదిగుబ్బ సీఐ యతీంద్ర, ఏఎస్ఐ వెంకటగిరి, హెచ్సీ గంగాధర్లను ఎస్పీ మాధవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
‘కూటమి’ నేత మట్టి దందా
ధర్మవరం: అందరూ ఎన్నికల హడావుడిలో ఉంటే.. ధర్మవరం మండలానికి చెందిన ఓ కూటమి నాయకుడు మట్టి దందాలో మునిగిపోయాడు. మండలంలోని ముచ్చురామి గ్రామం వద్ద జాతీయ రహదారికి సమీపంలో వెంచర్ వేసిన సదరు నాయకుడు.. ఇటీవలే భూమిని చదును చేశాడు. అయితే ఎగుడుదిగుడుగా ఉండటంతో సమీపంలో ఉన్న వంకలోని మట్టి తరలిస్తున్నాడు. రాత్రీపగలు తేడాలేకుండా జేసీబీ యంత్రాలు ఉపయోగించి టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకెళ్తున్నాడు. సమీప పొలాల రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... సదరు నేత అవేమీ పట్టించుకోవడం లేదు. వంకలోని మట్టిని తరలించడం వల్ల సమీపంలోని వ్యవసాయ బోరు బావుల్లో నీటి మట్టం తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా... రెవెన్యూ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా స్పందించి వంకలోని మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వంకలోని మట్టిని యంత్రాలతో తరలింపు చోద్యం చూస్తున్న అధికారులు -
టీబీ డ్యాంలో 3.4 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర డ్యాంలో బుధవారం నాటికి 3.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం సామర్థ్యం 1,633 అడుగులు కాగా, 1,577.59 అడుగుల మేర నీరు నిలిచి ఉంది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో లేదు. గత ఏడాది ఇదే సమయానికి 3.44 టీఎంసీల నీరు నిల్వతో 1,868 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 215 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండింది. అక్కమాంబ ఆలయంలో చోరీకళ్యాణదుర్గం రూరల్: పట్టణ సమీపంలో వెలసిన మహిమాన్విత అక్కమాంబ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఏడాది ఉగాది నాడు అత్యంత వైభవంగా అక్కమాంబ జాతర నిర్వహించారు. అప్పటి నుంచి ఆలయ హుండీని లెక్కింపు చేపట్టలేదు. ఈ క్రమంలో గురువారం హుండీలోని భక్తుల కానుకలను లెక్కించేందుకు ఆలయ కమిటీ సభ్యులు సిద్ధమయ్యారు. ఇంతలో మంగళవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులోని కానుకలను అపహరించుకెళ్లారు. ఆలయంలోని సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇంటి దొంగల పనిగానే పలువురు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. వ్యక్తి అనుమానాస్పద మృతి గుంతకల్లు టౌన్: స్థానిక అంకాలమ్మ గుడి వీధికి చెందిన బోయ ప్రసాద్ (40) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. వివరాలు... బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ప్రసాద్కు భార్య కవిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రైనా ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. బుధవారం ఉదయం పొలం పనులకు వెళుతున్న వ్యవసాయ కూలీలు నల్లరేగడి పొలంలో పడి ఉన్న ప్రసాద్ మృతదేహాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి గొంతుపై ఉన్న రక్తపు గాట్లు, ముక్కులో నుంచి రక్తం కారడాన్ని బట్టి హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడి తండ్రి లక్ష్మణ్ణ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మమ్నల్నే ప్రశ్నిస్తావా?● వైఎస్సార్సీపీ కార్యకరపై దాడి చేసిన టీడీపీ నేతలు గుంతకల్లు: రయ్యిమంటూ వీధిలో ద్విచక్ర, వాహనాలు నడుపుతూ స్థానికులను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రశ్నించిన ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. వివరాలు... మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన పలువురు ఫుల్గా మద్యం సేవించి ఐదారు ద్విచక్ర వాహనాల్లో చక్కర్లు కొడుతూ 17వ వార్డులోని నామాల్సేట్ కల్యాణమంటపం సమీపంలో ఉన్న నాగలయ్య కట్ట వీధికి చేరుకున్నారు. మద్యం మత్తులో కేకలు వేస్తూ ద్విచక్ర వాహనాలను ఇష్టానుసారంగా రైజ్ చేస్తుండడంతో భారీ శబ్ధం వెలువడింది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్త బేల్దారి శివ వారిని అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇలా చేయడం సబబు కాదని హితవు పలికారు. మమ్నల్నే ప్రశ్నిస్తావా? అంటూ పచ్చమూకలోని సూరి, గోవిందు, హరి, కిషోర్, తేజు తదితరులు శివ మీద విరుచుకుపడ్డారు. సిద్ధంగా ఉంచుకున్న ఇనుప రాడ్లతో కింద పడేసి కొట్టారు. శివ అరుపులకు చుట్టుపక్కల ఇళ్లలోని వారు నిద్రలేచి రావడం గమనించిన పచ్చమూక అక్కడి నుంచి ఉడాయించింది. తీవ్ర రక్తగాయాలతో ఉన్న శివను వెంటనే వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు కేవీ వాసు, ఇతరులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఒకరి కోసం వచ్చి మరొకరిపై దాడి? పచ్చమూక ప్రణాళిక ప్రకారం ఇనుప రాడ్లతో వీధిలో తిరగడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్కు రెండు రోజుల ముందు 17వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు డబ్బుతో పాటు మద్యం పంపిణీ చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక 13వ తేదీ జరిగిన పోలింగ్లో టీడీపీకి వ్యతిరేకంగా వార్డు ప్రజలు ఓటు వేశారన్న అనుమానాలు కూడా తోడయ్యాయి. దీనికి కారకులైన వారిని లక్ష్యంగా చేసుకుని దాడికి టీడీపీ నేతలు పథకం రచించినట్లుగా తెలుస్తోంది. -
వేసవి దుక్కులు.. లాభాలు దక్కు
అనంతపురం అగ్రికల్చర్: ‘దున్నకుండా సాగుచేస్తే.. కొయ్యకుండా పోతుంది!’ అనేది తెలుగు నానుడి. ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే. విత్తేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. దుక్కి చేయకుండా వదిలేయడంవల్ల భూమి చీడపీడలకు ఆవాసంగా మారి సత్తువ కోల్పోతుంది. ముడి పోషకాల లోపం ఏర్పడి, తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సి వస్తుంది. అందుకే.. రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాలని ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ నారాయణస్వామి సూచిస్తున్నారు. జూన్ నుంచి ఖరీప్–2024 ‘ముంగారు’ మొదలు కానుండటంతో ఇటీవల కురిసిన వర్షాల ఆధారంగా వేసవి దుక్కులు మొదలు పెట్టాలంటున్నారు. మెట్ట పొలాలు అధికంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం లాభసాటి కావాలంటే లోతుగా దుక్కి చేయడం, నేల, నీటి సంరక్షణకు వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా ‘కాంటూరి’ సేద్యం పనులు చేసుకోవాలని సూచించారు. రాగల నాలుగు రోజులూ ఆకాశం మేఘావృతమై మోస్తరు నుంచి తేలికపాటి వర్షసూచన ఉందన్నారు. 75 శాతం వర్షాధారం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం పంట భూమిలో 75 శాతం విస్తీర్ణంలో రైతులు కేవలం వర్షాలపై (మెట్ట సేద్యం) ఆధారపడి సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఎర్ర, చల్కా నేలలు ఉన్నాయి. నైరుతీ ప్రభావంతో కురిసే వర్షాలపై ఉమ్మడి జిల్లా పరిధిలో 7 లక్షల నుంచి 8 లక్షల హెక్టార్ల ఖరీఫ్ ఆధారపడి ఉంది. రుతుపవనాలు నిర్ణీత సమయం కన్నా ముందుగా, లేకుంటే ఆలస్యం కావడం.... త్వరగా నిష్క్రమించడం, తక్కువ వర్షాలు కురవడం, అనిశ్చితి వర్షాలు, పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఏర్పడటం, ఒక్కోసారి విరామం లేకుండా అతివృష్టి సంభవించడం లాంటివి వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వర్షం కురిసినా అందులో 10 నుంచి 20 శాతం మాత్రమే భూమిలోకి ఇంకిపోయి మిగతాది ప్రవాహం, ఒరవడి రూపంలో కొట్టుకెళ్లి వృథా అవుతుంటాయి. ఇలా ప్రవాహం రూపంలో వెళ్లే వర్షపునీటితో పాటు భూమిపై సారవంతమైన పొర కొట్టుకుపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి క్రమంగా భూమి ఉత్పాదకశక్తి కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. లోదుక్కులతో విస్తృత ప్రయోజనాలు.. వేసవిలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని పొలాల్లో వాలుకు అడ్డంగా ఎర్ర నేలలో ఒక మీటరు, నల్లరేగళ్లలో రెండు మీటర్లు చొప్పున లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీన్నే కాంటూరు సేద్యం అంటారు. భూమిలో గట్టిపొరను కదలించడం ద్వారా పంటలకు కీడు చేసే పురుగులు చాలా వరకు కోశస్థ దశలోనే నశిస్తాయి. పంట కాలంలో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి బాగా తగ్గుతుంది. నేల ఎండుతూ... ఆరుతూ ఉంటే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అలాగే వర్షపు నీరు ఎక్కడిక్కడ ఇంకిపోయి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. బెట్ట ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది. కలుపు సమస్య బాగా తగ్గిపోతుంది. అంతేకాక గాలిలో నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని వర్షపు నీటితో పాటు నేలకు అందడం ద్వారా భూసారం పెరుగుతుంది. విత్తనం వేయడానికి ముందు రెండు సార్లు నేలను బాగా దుక్కి చేసుకుంటే పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. నేల, నీటి సంరక్షణకు వేసవి దుక్కులు, కాంటూరు సేద్యపు పనులు ఇలా వాలుకు అడ్డంగా కాంటూరి సేద్యం పనులు చేసుకోండి వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా చేయాలి ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు బి.సహదేవరెడ్డి, డాక్టర్ నారాయణస్వామి సూచనలు -
సామాన్యుడిలా ఈరలక్కప్ప
గుడిబండ: మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించినప్పటి నుంచి రోజూ జనసందోహం మధ్య బిజీబిజీగా గడుపుతూ వచ్చిన ఈరలక్కప్ప బుధవారం ఓ సామాన్యుడిలా మారిపోయారు. ఎన్నికల పోలింగ్ ముగియడంతో స్థానికులు, పార్టీ కార్యకర్తలతో సరదాగా గడుపుతున్నారు. బుధవారం ఉదయం గుడిబండలోని ఓ టీ బంక్ వద్దకు చేరుకుని అందరిలో తానూ ఒక్కడినంటూ కలిసి పోయి తేనీరు సేవించారు. ఈ సందర్భంగా ఆయన వెంట జెడ్పీటీసీ భూతరాజు, పార్టీ మండల కన్వీనర్ డీఎల్ యంజారేగౌడు, సర్పంచ్ కరుణాకర్గౌడు, వైఎస్సార్సీపీ నాయకులు బీహెచ్ రాయుడు, నాగరాజు, రమేష్, తిప్పేస్వామి తదితరులు ఉన్నారు. -
‘వేసవి’ దొంగలతో జాగ్రత్త
బత్తలపల్లి: వేసవి అంటే కేవలం ఉక్కపోత, వడదెబ్బే కాదు... దొంగతనాలు కూడా ఉంటాయి. జనం హాయిగా ఆరు బయటనో, మిద్దైపెనో నిద్రపోతుంటే దొంగలు ఎంచక్కా బీరువాలు తెరిచి సొత్తుతో ఉడాయిస్తుంటారు. వేసవిలో విహారయాత్రలు, తీర్థ యాత్రలకు, ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగుతారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉంటే చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చునని పోలీసులు అంటున్నారు. ఈ అంశంపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఇంతకు పోలీసులు చెబుతున్నదేమిటో పరిశీలిద్దామా.... ● ఇంటి కిటికీలు మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయో, లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ● దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు. ● ఆరు బయట, మిద్దెలపై నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసుకోవాలి. ● బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదు. ఇంట్లో పడుకున్నా కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదు. ● వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టేయాలి. ఇంట్లో ఎలాంటి అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. అలసత్వం ప్రదర్శించరాదు. ● అపరిచిత వ్యక్తుల వాహనాల్లో ప్రయాణించరాదు. ● దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలపాలి. ● రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవడం మంచిది. ● అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలి. ● ఇంట్లోని బంగారు నగలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం. చోరీల నియంత్రణకు చర్యలు వేసవిలో చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాటు చేశాం. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నాం. ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. – పి.శ్రీనివాసులు, ఎస్ఐ, బత్తలపల్లి అప్రమత్తతతో చోరీలకు అడ్డుకట్ట ప్రజలకు పోలీసుల సూచనలు -
మతిస్థిమితం లేని వ్యక్తి హత్య
హిందూపురం అర్బన్: మతి స్థిమితం లేని వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన ఘటన హిందూపురంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని దొడ్డబళ్లాపురానికి చెందిన సెల్వకుమార్ (54) మతి స్థిమితం లేక బాధపడుతున్నాడు. దీంతో ఆయనను అన్న శివకుమార్ పిలుచుకొచ్చి మూడేళ్ల క్రితం పరిగి మండలం మోదా గేట్ వద్ద ఉన్న సదానంద వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అప్పటి నుంచి వృద్ధాశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న సెల్వకుమార్ను ఆదివారం ఓ వ్యక్తి వచ్చి బయటకు పిలుచుకెళ్లాడు. ఆ తర్వాత సెల్వకుమార్ ఆచూకీ లేకుండా పోయింది. బుధవారం హిందూపురంలోని పరిగి రోడ్డు మోతుకపల్లి వద్ద ఉన్న అక్కమ్మగుడి సమీపంలో సెల్వకుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాయితో మోది హతమార్చినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యపామిడి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పామిడిలోని తలవాలకట్ట వీధికి చెందిన కట్టుబడి నబీరసూల్ కుమారుడు అలీబాషా (26) బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన షహీనాతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. తన అవసరాలకు మించి అప్పులు చేసిన అలీబాషా.... వాటిని తీర్చే మార్గం కానరాక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షహీన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి బలవన్మరణం బుక్కరాయసముద్రం: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లికి చెందిన సెంగల వెంకట్రాముడు (5) వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తనకున్న 6 ఎకరాల్లో పంటల సాగుకు, కుమార్తెల పెళ్లిలకు దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చే మార్గం కానరాక మానసిక వేదనకు లోనైన ఆయన మంగళవారం రాత్రి తోటలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ముంగారుకు సన్నద్ధం
పుట్టపర్తి అర్బన్: రెండు, మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంగారు సేద్యానికి రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు విత్తన పంపిణీ ఏర్పాట్లపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. రైతులకు అవసరమైన విత్తన వేరుశనగ, కందులు, పచ్చిరొట్ట విత్తనాలు, పెసలు, అలసంద, రాగులు, సజ్జ, మొక్కజొన్న తదితర వాటిని రాయితీతో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఈనెల 13న పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విత్తన సన్నాహక చర్యలపై దృష్టి సారించారు. కొందరు జూన్ రెండు, మూడో వారంలోనే ముందస్తుగా వేరుశనగ సాగు చేసే అవకాశం ఉన్నందున వారికి విత్తనం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బోర్లకింద భూముల్లో ముందస్తుగా.. ప్రభుత్వం అమలు చేసిన ‘జలకళ’ పథకంతో వందలాది మంది రైతులు బోర్లకు మోటర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో 450 మంది రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భూములు దున్ని విత్తనానికి సిద్ధం చేశారు. ఆశాజనకంగా వర్షాలు.. జిల్లాలో సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.30 లక్షల హెక్టార్లు కాగా, గత ఏడాది వర్షాభావ పరిస్థితులవల్ల సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే రబీలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ సారి నైరుతీ రుతుపవనాలు గత ఏడాది కంటే ముందుగానే వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఉత్సాహంగా పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ సారి ఖరీఫ్ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. త్వరలో రిజిస్ట్రేషన్లు.. ఖరీఫ్లో వేరుశనగ సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకోసం త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తాం. అలాట్మెంట్, సేల్స్ ప్రైసెస్, సబ్సిడీ, పంపిణీ మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. – సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో చల్లబడిన వాతావరణం సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు అవకాశం త్వరలో సబ్సిడీ వేరుశనగకు రిజిస్ట్రేషన్లు -
కిట్టయ్య మనసు బంగారం
పెద్దపప్పూరు: పుట్టింది నిరుపేద కుటుంబంలోనే అయినా తనకున్నంతలో మూగజీవాల ఆకలి దప్పికలు తీరుస్తున్నాడు కిట్టయ్య. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ సేవ కొనసాగిస్తూ వస్తున్నాడు. కిట్టయ్య రాక కోసం ఎదురుచూపు.. నార్పల మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన కిట్టయ్య రాక కోసం ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని మూగజీవాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అరటి చెట్లకు సపోర్టుగా పెట్టే కట్టెల విక్రయంతో జీవనం సాగిస్తున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ 8 కిలోల బెల్లం అన్నం, వ్యాపారుల నుంచి సేకరించిన వివిధ రకాల పండ్లు, బ్రెడ్డును తన సొంత ఆటోలో వేసుకుని కుమారులు సాయికుమార్, గిరీష్ కుమార్తో కలసి ముచ్చుకోట అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఇలా రోజూ రెండు పూటలా క్రమం తప్పకుండా అటవీ ప్రాంతానికి చేరుకుని ఆటో హారన్ కొట్టగానే ఎక్కడున్న కోతులు ఒక్కసారిగా అక్కడకు చేరుకుంటాయి. కిట్టయ్య అందించే ఆహారాన్ని కడుపార తిన్న తర్వాత నీటి తొట్లలో ఉన్న నీరు తాగి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుంటాయి. నీటి తొట్లను సైతం దాతల సహకారంతో కిట్టయ్యనే ఏర్పాటు చేశాడు. రెండు పూటలా ఓ డ్రమ్ము నీటిని తీసుకెల్లి తొట్లను నింపుతుంటాడు. అటుగా వెళుతున్న వారు కిట్టయ్య సేవ చూసి అభినందిస్తున్నారు. -
హోరాహోరీగా ‘ఏసీఎల్ –2’
అనంతపురం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనంతపురం క్రికెట్ లీగ్ –2 హోరాహోరీగా సాగుతోంది. బుధవారం దినేష్ గ్రానైట్స్, యునైటెడ్ చాంపియన్ క్రికెట్ క్లబ్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచి దినేష్ జట్టు బ్యాటింగ్ చేసింది. 18.5 ఓవర్లలో 144 పరుగులు వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని బ్యాటర్ ఆష్రఫ్ 47 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. యునైటెడ్ జట్టు బౌలర్ రాజకుల్లాయప్ప నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యునైటెడ్ జట్టు 17.5 ఓవర్లలో 118 పరుగుల వద్ద చతికిలబడింది. జట్టులో అర్జున్టెండూల్కర్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆష్రఫ్కు ప్రకటించారు. అలాగే అనంత రైజింగ్ స్టార్, ఇండియన్ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ స్టార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేష్ వర్మ 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 37 పరుగులు, బి. ప్రశాంత్ 46 బంతుల్లో 52 పరుగులు, ఎంకే దత్తారెడ్డి 23 బంతుల్లో 33 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియన్ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించి ఓటమి పాలైంది. -
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. దరఖాస్తులకు జూన్ 14 వరకూ అవకాశం కల్పించారు. రూ.1,000 అపరాధ రుసుంతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 3,000 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో జూలై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతపురం కేఎస్ఎన్ డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ● ఒక్కో సబ్జెక్టుకు రూ.1000, రెండు సబ్జెక్టులు రూ.3,000, మూడు సబ్జెక్టులు ఆపైన ఫెయిల్ అయి ఉంటే రూ.4,000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం ఉత్తీర్ణులై, మూడో సంవత్సరంలో పరీక్షలు రాయకుండా ఉంటే రూ.3,000 అదనంగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ● 1994–95 విద్యా సంవత్సరం నుంచి 2014–15 విద్యా సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● 2008–09 విద్యా సంవత్సరం నుంచి రాయలసీమ వర్సిటీ ఏర్పాటు కావడంతో అప్పటి వరకు ఎస్కేయూ పరిధిలో చదువుకున్న కర్నూలు జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ● విద్యార్థులు గతంలో పరీక్ష రాసిన హాల్టికెట్ గానీ, మార్క్స్కార్డు గానీ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఎంతోమందికి ఊరట.. గతంలో అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేని వారు, బ్యాక్లాగ్స్ (ఫెయిల్ అయినవారు) ఉన్నవారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని ఇటీవలే ఎస్కేయూ ఉన్నతాధికారులు తీసుకున్నారు. డిగ్రీ ఫెయిల్ అయి పట్టా పొందలేని పరిస్థితుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యే సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా, వాటిన్నింటినీ రాయడానికి వీలు కల్పించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement