-
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని అనాథ బాలికలు, తల్లిదండ్రులు వదిలేసిన బాలికలు, బాలసదనంలో చదివిన బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాలికలు, పాలిటెక్నిక్ కోర్సులు చదివేందుకు శ్రీదుర్గాభాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్ వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 2024–25 విద్యా సంవత్సరంలో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో 60 సీట్లు, డిప్లమా ఎలక్ట్రికల్స్లో 60సీట్లు, డిప్లమా కంప్యూటర్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, డిప్లమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 60 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో సమర్పించాలని లేదా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్లో సమర్పించాలని కోరారు. వైద్యశిబిరం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదాపురం, తిప్పాపురం గ్రామాల్లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదిర వైద్యాధికారి భవ్యశ్రీ గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కలిపాక, బోదాపురంలో ఇద్దరు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలిములుగు రూరల్: లోక్సభ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురైన అపస్మారక స్థితిలోకి వెళ్లిన పోరిక మధు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదానికి గురైన మధు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఆయన కలెక్టర్, ఎన్నికల అధికారికి సమాచారం అందించి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక సర్వన్కుమార్, సారయ్య, జయరాం, రఘురాం, హట్కర్ సమ్మయ్య, సోమా నాయక్, జయరాం, సునిల్ కుమార్, రాజుకుమార్, ఏళ్ల మధుసూదన్, సమ్మరావు, అజ్మీర రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక క్వారీ పనుల అడ్డగింత పలిమెల: మండలంలో పంకెనలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు గురువారం పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనుషులతో ఇసుకను తీయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఇసుక క్వారీలో పనులు కల్పించాలని పనులను అడ్డుకున్నారు. ఇష్టానుసారంగా బదిలీలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో వివిధ గనుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా నూతన జీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత అందరినీ సమన్వయం చేయాల్సిన అధికారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీనియారిటీ నిబంధనలు పాటించకువండా బదిలీలు చేస్తున్నారని చెప్పారు. ఏరియా వర్క్షాపు నుంచి సింగరేణి ఏరియా ఆస్పత్రి, కేఎల్పీలకు బదిలీ చేస్తున్నారన్నారు. ఏకపక్షంగా బదిలీలు చేయడం సరైనది కాదన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు -
డెంగీ నివారణకు సహకరించాలి
ములుగు: జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగీ వ్యాధి ఆడ ఎడిస్ దోమల వల్ల వస్తుందన్నారు. ఈ దోమలు పగటి పూట కుడతాయన్నారు. డెంగీ వ్యాధి బారిన పడితే తీవ్రమైన వేడితో కూడిన జ్వరం, భరించలేని తలనోప్పి, చర్మం పై దద్దుర్లు రావడంతో పాటు జ్వరం ఆగకుండా మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఉంటుందని తెలిపారు. అదే విధంగా కండరాలు, కీళ్ల నొప్పులు అధికం కావటం వ్యాధి లక్షణాలని తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. దోమలను నియంత్రించడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందుకోసం ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమ డాక్టర్ శ్రీకాంత్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్, పవన్ కుమార్ ,డెమో తిరుపతయ్య, అసిస్టెంట్ మలేరియా అధికారి దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ అధికారి సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య -
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
ములుగు: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్ చంద్ర, డీఎస్పీ రవీందర్లతో కలిసి జిల్లాలోని విత్తన, ఎరువులు, పురుగు మందుల షాపు డీలర్లతో విత్తన చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎక్కవగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి రైతులకు కల్తీ విత్తనాలు అమ్మి మోసం చేస్తే సహించేది లేదన్నారు. విత్తన డీలర్లతో సమన్వయంగా పనిచేస్తూ నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా కాకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామ స్థా యిలో రైతులకు నాణ్యమైన విత్తనాలపై రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపటాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విస్తృత తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. డీలర్లు విత్తన చట్టానికి లోబడి వ్యాపారం నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్ విధిగా నమోదు చేయాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతీ మందుకు, విత్తనాలకు, పురుగు మందులకు రశీదు అందించాలన్నారు. వ్యాపారులు విత్తనాల అమ్మకాల్లో కల్తీ, కాల పరిమితి లేని విత్తనాల అమ్మకంతో పాటు తదితర నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యాపారులతో పాటు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ శ్రీపాల్, ఏటూరునాగారం ఏడీ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలి ములుగు రూరల్: వరంగల్–ఖమ్మం–నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పని సరిగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలు, నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఇతర ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం నియమ నిబంధనలు ఉంటాయని వివరించారు. అభ్యర్థులు జిల్లాలో ప్రచారం నిర్వహించాలనుకుంటే ఆర్డీఓ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేయాల్సి వస్తే 1950లో సంప్రదించాలని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 6,587 మంది పురుషులు, 3,712 మంది మహిళలు మొత్తంగా 10,299 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. జిల్లాలో 7 సెక్టార్లు, 7 రూట్లలో విభజించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును తప్పని సరిగా లెక్క చూపాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉందని వివరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి’
హన్మకొండ: ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏల సొమ్ము వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ డీఏల విడుదలపై చర్చించాలని పేర్కొన్నారు. ఒకేచోట 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అన్ని కేడర్ల నాన్ గెజిటెడ్ ఉద్యోగులను సాధారణ బదిలీలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ రెమ్యునషన్ సమానంగా ఇవ్వలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకై నా సమానంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
కాళోజీ సెంటర్: వరంగల్–ఖమ్మం–నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ లోకేష్కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, నిర్వహణపై ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 65 జంబో బాక్సులు, 48 పెద్ద బాక్సులు రెడీగా ఉన్నాయని తెలిపారు. -
కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలి
ములుగు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాజీమార్గం ద్వారా కేసు పరిష్కరించుకునేలా ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. న్యాయ సలహాలు, సూచనల కోసమైనా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి తగిన సహాయం పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రాములు, పరకాల సబ్జైల్ సూపరింటెండెంట్ ప్రభాకర్, ఎకై ్సజ్ సీఐలు సుధీర్కుమార్, బండారి కుమార్, ఎస్సైలు అశోక్, షేక్మస్తాన్, డీడబ్ల్యూఓ స్వర్ణలత, డీసీపీఓ ఓంకార్, సీడీపీఓ స్వామి, వరంగల్ డీపీఓ రాధ, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ -
మేమే గెలుస్తాం
పైకి గాంభీర్యం.. లోపల ఆందోళన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ పైకి గాంభీర్యంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఆందోళననతోనే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. నిన్నటి వరకు భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు ఐదు నెలల వ్యవధిలోనే మారారు అనేది ఎంత వరకు నిజం అనేది బీఆర్ఎస్ నాయకులు అంచనా వేయలేకపోతున్నారు. అయితే తమ తమ ప్రాంతాల్లో ఎంత వరకు మెజార్టీ వస్తుందనే అంచనాలు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికలకు పదిరోజుల ముందు వరకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కలిసి రావడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే టీపీసీసీ నుంచి ఆదేశాలు రావడంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, నాయకులు తమ ప్రాంతాల్లో మెజార్టీ చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తమ ఎన్నికల అంత కష్టపడలేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మెజార్టీ ప్రమాణికం కానుంది. మెజార్టీ వస్తుందా.. లేదా.. వస్తే ఎంత వస్తుంది.. రాకపోతే హైకమాండ్కు ఏం సమాధానం చెప్పుకోవాలి.. అనే మీమాంసలో పడ్డారు.సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో.. ప్రసుత్తం ఫలితాలపై నాయకులు అంచనాలు వేస్తున్నారు. మేమే గెలుస్తామంటే.. మేమే గెలుస్తాం అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు, ప్రజాప్రతినిధులు, నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారుగా ప్రకటనలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులు, నాయకులు మాత్రం పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ఒకింత ఆందోళన చెందుతున్నారు. గెలుపు మాదే అంటున్న కాంగ్రెస్ మమబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి న అభ్యర్థులతో పాటు ఆయా పార్టీలకు చెందిన నా యకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కలకు ముందురోజు కాంగ్రెస్ ఇన్చార్జ్ తుమ్మ ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో గెలుపు లాంఛనమే అని, మెజార్టీ కోసమే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల తర్వాత అభ్యర్థి బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్రెడ్డి విలేకరుల సమావేశం లో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు రాకముందే.. గెలిచేది నేనే అంటూ బలరాంనాయక్ చెప్పారు. ఇందుకు సహకరించిన ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా కాంగ్రెస్లోని ఏ నాయకుడిని పలరించినా... బలరాంనాయక్ విజయం తధ్యమంటూ చెబుతున్నారు. బీఆర్ఎస్ ధీమా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఉద్యమకాలం నాటి నాయకుడిని తలపించింది. మానుకోటలో కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం పెరిగింది. అదే స్థాయిలో నాయకులు చమటోడ్చారు. ఎన్నికల తర్వాత అభ్యర్థి మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సత్యవతిరాథోడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలు కారు గుర్తుపై ఓట్లు వేశారు. పార్లమెంట్ పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని ప్రకటించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ కూడా విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ గెలుపు పక్కా అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఇలా ఎవరికి వారుగా రెండు పార్టీల నాయకులు గెలుపు మాదే అనే ధైర్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమా వారిది పక్కా గెలుస్తామంటున్న కాంగ్రెస్ నేతలు మాదే విజయం అంటున్న బీఆర్ఎస్ నాయకులు లోలోపల ఆందోళన.. పైకి గాంభీర్యం ప్రదర్శన -
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండి అమ్జద్పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని మధనపల్లి, జగ్గన్నపేట, జంగాలపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి పది రోజులు గడిచినా నిర్వాహకులు కాంటాలు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓకు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, నారాయణసింగ్, రమేష్, శ్రీనివాస్, వెంకటయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక క్వారీ పరిశీలన
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఏటూరు వద్ద రైతుల పట్టా భూముల్లో గోదావరిలో ఉన్న ఇసుక క్వారీని రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. గోదావరిలోని పట్టా భూముల్లో ఇసుకను తియ్యడానికి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తవ్వకాలు జరిపే భూములు తమవని రెవెన్యూ అధికారులకు తెలుపడంతో రెవెన్యూ అధికారులు ఆర్ఐ గణేశ్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. అనుమతులు లేకుండా గోదావరిలో జేసీబీలతో తవ్వకాలు జరపడంతో పాటు, రోడ్డు పనులు కూడా చేపట్టినట్లు గుర్తించారు. అనుమతి పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందించిన తర్వాతే పనులు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించినట్లు గణేశ్ తెలిపారు. -
రోడ్లపై లారీలు పార్కింగ్ చేస్తే చర్యలు
ఏటూరునాగారం: ఇసుక లారీలను ఎక్కడైన రోడ్లపై పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మహేష్ గీతె బాబాసాహెబ్ హెచ్చరించారు. మండల పరిధిలోని ఇసుక లారీల డ్రైవర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని లారీల డ్రైవర్లు ఎక్కడైనా రోడ్ల పక్కన, రోడ్లపై లారీలను, ఇతర వాహనాలను నిలపరాదని తెలిపారు. ఏదైనా వాహనం చెడిపోతే దానికి పార్కింగ్ లైట్స్, వాహనదారులు గుర్తు పట్టే విధంగా గుర్తులు, మార్కింగ్ చేసి ఉంచాలన్నారు. లారీల డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్సులను రద్దు చేసి వాహనం సీజ్ చేస్తామన్నారు. ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. లారీల డ్రైవర్లు తమవంతు బాధ్యతగా పోలీసులు ఇచ్చిన సూచనలను పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్, లారీల డ్రైవర్లు పాల్గొన్నారు.ఏఎస్పీ మహేష్ గీతె బాబాసాహెబ్ -
మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం
ములుగు రూరల్: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కష్టపడిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఎన్నికల మాదిరిగానే రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని గెలిపించేందకు ప్రతీ కార్యకర్త, నాయకుడు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, ఏనుగు రవీందర్రెడ్డి, కృష్ణాకర్, నాగరాజు, మల్లేష్, వెంకన్న, సునీల్, రాజ్కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూంకు చేరిన ఈవీఎంలు
ములుగు: పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఈవీఎంలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్జేసీ స్ట్రాంగ్ రూంకు తరలింపు ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో భద్రపరిచామన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రిసెప్షన్ కేంద్రాన్ని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి పోలీసు భద్రత మధ్య వాహనాల్లో ఈవీఎంలను తరలించినట్లు వెల్లడించారు. పెరిగిన ఓటింగ్ శాతం సోమవారం రాత్రి 11:30గంటల వరకు నియోజకవర్గంలోని 307పోలింగ్ కేంద్రాల్లో 68.20 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయానికి అన్ని రకాల ప్రక్రియలు పూర్తి అయ్యేసరికి ఓటింగ్ శాతం 69.66గా నమోదు అయ్యింది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ పరిధిలో 65.94 శాతం పోలింగ్ నమోదు కాగా గతం కంటే ఈ సారి 3.72 శాతం ఎక్కువగా నమోదు అయ్యింది. మొత్తం 2,33,191 మంది ఓటర్లకు గానూ 1,62,443 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 83,337 మంది మహిళలు, 79,097 మంది పురుషులు, 9 మంది ఇతరులు ఉన్నారు. రామవరంలో అత్యధికంగా 92శాతం, కొడిశాల, పందెంలో 91 శాతం, చింతగూడెంలో 90శాతం, అంకంపల్లి నర్సాపూర్, నర్సిగూడెంలో 88 శాతం ఓటింగ్ నమోదయ్యింది. చిన్న గ్రామాలు ఓటింగ్ నమోదులో ఆదర్శంగా నిలిచాయి. పట్టణాల్లో 65 నుంచి 70శాతమే.. ములుగు, కమలాపురం, మంగపేట, ఏటూరునాగారం వంటి పట్టణాల్లో పోలింగ్ శాతం 65 నుంచి 70శాతం దాటలేదు. ఓటింగ్ శాతం పెరగడంలో ప్రోత్సాహాన్ని అందించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందనలు తెలిపారు. ఎన్నికల సమాచారాన్ని ప్రచార మాద్యమాల ద్వారా ప్రజలకు అందించిన మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గతంకంటే పెరిగిన ఓటింగ్ శాతం రామవరంలో అత్యధికంగా పోలింగ్ -
ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా
● బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మహబూబాబాద్: తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయన్నారు. కేసీఆర్ సీఎంగా లేని లోటు ప్రజలకు ఇప్పుడు అర్థమై బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని చెప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తులం బంగారం లాంటి బంగారు మాటలే మిగిలాయే తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని జరగలేదన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఎన్నికలు ముఖ్యం కాదని, ప్రజల శ్రేయస్సే ముఖ్యమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, చిట్యాల జనార్దన్, కన్నా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవం
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వగ్రామం కాటారం మండలంలోని ధన్వాడలో దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా కొనసాగింది. మంత్రి శ్రీధర్బాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య వార్షిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతితో పూజలకు సమాప్తం పలికారు. శ్రీధర్బాబు ఆహ్వానం మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు విజయరమణారావు, ప్రేమ్సాగర్రావు, మాక్కన్సింగ్ రాజ్ఠాకూర్, గండ్ర సత్యనారాయణరావు, గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. ఈ సందర్బంగా పండితులు ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి శ్రీధర్బాబు అతిథులకు శేషవస్త్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద ట్రస్టు చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు, ఐఎన్టీయూసీ వైస్ చైర్మన్ జనక్ప్రసాద్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాశ్రెడ్డి, ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, బాన్సోడ రాణిబాయి, మల్హల్రావు తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి డిప్యూటీ సీఎం భూపాలపల్లి రూరల్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆహ్వనించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు డిప్యూటీ సీఎంను సన్మానించిన అనంతరం సెల్ఫీలు దిగారు. ఆయన ధన్వాడలోని దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో క్యాంపు కార్యాలయానికి వచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాంనర్సింహారెడ్డి, స్థానిక నాయకులు, క్యాత రాజు సాంబమూర్తి, పుప్పాల రాజేందర్ తదితరులు ఉన్నారు.హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
మహబూబాబాద్ రూరల్: కేంద్రంలో ఇండియా కూటమి అధికారం దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మానుకోటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ మానుకోట అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, తప్పకుండా కేంద్ర మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమికే అధికారం దక్కుతుందన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు గడువు కంటే ముందే రైతుల ఖాతాల్లో జమ చేశామనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మహబూబాబాద్ జిల్లాను తీసివేస్తామని చెప్పలేదన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, నాయకులు అంజయ్య, ఉదయ్చందర్, యాదవరెడ్డి, దస్రునాయక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రామిరెడ్డి, ప్రభాకర్, వెంకన్న, వెంకటేశ్వర్లు, రమేష్, సీతారాంరెడ్డి, సతీష్, వెంకటరెడ్డి, కౌన్సిలర్లు హరిసింగ్, శ్రీను, నాయకులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో బలరాంనాయక్ గెలుపు ఖాయం ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ -
భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి
చిట్యాల: ప్రజలు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని యోగా గురు, మండలాధీశ్వర్ విశాఖపట్నం లలిత గాయత్రి మాతాజీ అన్నారు. మండల పరిధిలోని జూకల్లో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ మాలధారణ కార్యక్రమానికి ఆమె మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందేందుకు భక్తిని అలవర్చుకోవాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే దేశంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతున్నానని వివరించారు. గ్రామంలో యోగా సాధనలో గురూజీ సాయిరెడ్డి స్వామి ఆదర్శమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి 23 ఏళ్లుగా ఆంజనేయ దీక్ష మాలతో నిత్యం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. యోగా, మెడిటేషన్, న్యాచోరోపతి, శరీర త్రీకరణశుద్ధీతో అమ్మవారి సంకల్పంతో చేస్తామన్నారు. హిందూధర్మం కోసం పని చేస్తున్న సాయిరెడ్డి స్వామికి శ్రీశ్రీ సాయిరెడ్డి ఆనంద సరస్వతి స్వామి పేరుతో నామకరణం చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే జూకల్ హనుమాన్ సేవా సమితిని.. శ్రీ హనుమాన్ గాయత్రి పీఠంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. -
71.85 % ఓటింగ్
● మానుకోట పార్లమెంట్ పరిధిలో ఓటర్లు 15,32,366 ● ఓటు హక్కు వినియోగించుకున్నవారు 11,01,030 ● మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువ మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. మానుకోట సెగ్మెంట్లో 71.85శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,32,366 మంది ఓటర్లు ఉండగా.. 11,01,030మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 5,42,304మంది, మహిళా ఓటర్లు 5,58,678 మంది, ఇతరులు 48 మంది ఓటు వేశా రు. మొత్తంగా మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. భద్రాచలంలో తక్కువ.. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అధికశాతం పోలింగ్ నమోదు కాగా.. భద్రాచలంలో తక్కువశాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా నర్సంపేట తర్వాత డోర్నకల్ నియోజకవర్గంలో అధిక శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. అభ్యర్థుల్లో టెన్షన్.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కంపు ఉండగా.. అప్పటి వరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పదు. ఈవీఎంల్లో వారి భవిత్యం ఉండగా.. వాటిని జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. వచ్చే 4న ఈ పాఠశాలలోనే కౌంటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వారీగా ఓటర్లు, ఓటింగ్ శాతం నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఓటువేసిన వారు పోలింగ్ శాతం డోర్నకల్ 2,22,906 1,68,053 75.39 మానుకోట 2,58,850 1,84,410 71.24 నర్సంపేట 2,35,849 1,80,659 76.60 ములుగు 2,33,191 1,62,443 69.66 పినపాక 2,03,790 1,41,432 69.40 ఇల్లెందు 2,25,097 1,58,650 70.48 భద్రాచలం 1,52,683 1,05,383 69.02 మొత్తం 15,32,366 11,01,030 71.85 -
ఉత్సాహంగా ఓటేశారు..
ఏటూరునాగారం/ములుగు: తొలిసారి ఓటుహక్కు వచ్చిన యువత ఈ ఎన్నికల్లో ఉత్సాహంగా తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ములుగు మండలకేంద్రానికి చెందిన బైకాని నవనీత శ్రీకాకుళంలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. ఇటీవల ఆమెకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. దీంతో సుమారు 15గంటల ప్రయాణించి వచ్చి జిల్లాకేంద్రంలోని 133వ పోలింగ్ కేంద్రంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంది. అందుబాటులో ఉండి ఓటు వేయని వారికి నవనీత ఆదర్శంగా నిలిచింది. ఏటూరునాగారానికి చెందిన విశాల్ అలాగే మండల పరిధిలోని ఎక్కెల గ్రామానికి చెందిన నవీనా, అక్షిత పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. -
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ శాతం
నియోజకవర్గం 9గంటలు 11గంటలు 1గంటలు 3గంటలు 5గంటలు 6గంటలు డోర్నకల్ 14.6 33.33 53.71 64.51 70.86 74.38 మహబూబాబాద్ 11.65 30.95 47.52 58.71 67.19 75.13 నర్సంపేట 11.2 28.5 43.6 62.3 73.01 75.60 ములుగు 10.38 29.79 50.66 61.23 67.92 68.20 పినపాక 11.95 32 49.82 60.68 65.91 66.00 ఇల్లెందు 11.9 30.3 47.58 61.86 69.11 70.55 భద్రాచలం 12.07 30.1 49.54 60.58 64.72 68.85 మొత్తం 11.96 30.71 48.91 61.41 68.4 70.68 -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
కన్నాయిగూడెం: ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన సోమవారం తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అలాగే మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైద్యులు పోలింగ్ కేంద్రాల వద్ద అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి వచ్చిన ఓ గర్భిణికి డీఎంహెచ్ఓ వైద్యం అందించి పౌష్టికాహారం తీసుకోవాలని పలు సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో అలసత్వం చేయొద్దని వైద్యాధికారులకు సూచించారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్ తగ్గకుండా గ్లూకోజ్ వాటర్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్యూఓ నర్సింహారావు, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్, మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.ఆశ కార్యకర్తలకు టీఏ, డీఏ ఇవ్వాలి ములుగు రూరల్: ఎన్నికల విధులు నిర్వహించిన ఆశ కార్యకర్తలకు టీఏ, డీఏ చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షులు రత్నం రాజేందర్, గుండబోయిన రవిగౌడ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఆశ కార్యకర్తలు మెడికల్ క్యాంపులు నిర్వహించారని తెలిపారు. ఆశ కార్యకర్తలకు టీఏ, డీఏ రూ.500 చెల్లించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్యను వారు కోరారు. అలాగే ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగంపై ఆశ కార్యకర్తలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటు శాతం పెంచేందుకు పాటుపడుతున్నారని వివరించారు. మధుకుమార్కు మెరుగైన వైద్యం అందించాలి ములుగు: వెంకటాపురం(ఎం) మండలం బూర్గుపేట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు పోరిక మధుకుమార్కు మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోరిక శ్రావణ్కుమార్, అజ్మీరా రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి భద్రాచలానికి వెళ్లిన మధుకుమార్ బ్రేయిన్ స్ట్రోక్కు గురై కోమాలోకి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం హైదరా బాద్లోని బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిభూపాలపల్లి రూరల్: భూపాలపల్లి డివిజన్ పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో 33 కేవీ ఫీడర్, 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆరు స్తంభాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు నెలకొరిగాయి. 23 ఇన్సులేటర్లు దెబ్బతినగా, 10 లైన్లు తెగి కింద పడ్డాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి అన్ని ప్రాంతాల్లో సరఫరా పునరుద్దరించామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మ ల్చూర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అందించడానికి కృషిచేసిన ఉద్యోగులకు సిబ్బందికి ఎస్ఈ అభినందనలు తెలిపారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్వయంగా కార్పొరేట్ కార్యాలయం నుంచి లోడ్, విద్యుత్ సరఫరా మానిటరింగ్ చేస్తూ ప్రతి సర్కిల్లో అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారన్నారు. ప్రతీ సర్కిల్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంబంధిత సమస్యలకు, ఫిర్యాదులు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబరు 1800 425 0028 కు లేదా 1912కు ఫోన్ చేయాలని సూచించారు. -
ఆ నాలుగు మండలాల్లో ముందే..
● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 74శాతం పోలింగ్ సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి మానుకోట జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల, ములుగు నియోకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4గంటలకు ముగింశారు. కాగా ఎప్పుడు పోలింగ్లో వెనకబడి ఉండే ఈ ప్రాంతాల్లో 74శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఓటరు చైతన్య, అవగాహన కార్యక్రమాలు, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో నమోదైన పోలింగ్శాతం మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్శాతం కొత్తగూడ 23,460 17,126 73 గంగారం 9,041 7,395 82 బయ్యారం 38,092 26,530 69 గార్ల 30,399 21,603 72 -
గాలివాన బీభత్సం
మంగపేట: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. భారీగాలులకు వర్షం తోడుకావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నేటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చీకట్లో సెల్ఫోన్ లైట్లు వేసుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని సరిచూసుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు సైతం బలమైన గాలి, వర్షానికి నేలమట్టమయ్యాయి. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్నికల సిబ్బంది -
పోలింగ్ కేంద్రాల తనిఖీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా అడిషనల్ ఎస్పీ సదానందం ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని కోరారు. భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అనుమానితులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల బూత్లకు 200ల మీటర్ల దూరంలోనే ఉండాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి సౌకర్యం కల్పించాలి ములుగు రూరల్: మండల పరిధిలోని ఇంచర్ల శివారు రామస్వామి గుట్ట సమీపంలో ఉన్న హనుమాన్ గుడి వద్ద నీటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ఆదివారం హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో గుడి వద్ద నీటి సౌకర్యం కల్పించాలని, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హనుమాన్ మాలాధారణ భక్తులు గుడి వద్ద నీరు లేక పోవడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గుడి వద్ద నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వృద్ధులకు సన్మానం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదాపురం చర్చిలో మదర్స్ డే సందర్భంగా వృద్ధ మహిళలను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ లూకా చేతుల మీదుగా మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ అంటే ఇష్టం ఉండని వారు ఉండరని తెలిపారు. అమ్మప్రేమ ముందు ఏది పనికి రాదన్నారు. ఈ కార్యక్రమంలో కంగాల రామయ్య, మహేష్, విక్టోరియా, కౌసల్య, నాగమ్మ, కుమారి, రుతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫొటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థికసాయం వెంకటాపురం(కె): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫొటోగ్రాఫర్ సాంబయ్య కుటుంబానికి వెంకటాపురం ఫొటో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో రూ.17 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆదివారం సాంబయ్య దశదినకర్మకు వెంకటాపురం ఫొటోగ్రాఫర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో చంద్రకళ, రాగం సాంబశివరావు, మూటూరి సతీష్, బంద రవి, ప్రసాద్, సాయి, నర్సింహారావు తదితరులు ఉన్నారు. వైభవంగా ఆరాధనోత్సవాలు హన్మకొండ కల్చరల్ : శ్రీమత్ భగవద్రామానుజాచార్యులు, శ్రీభగవత్ ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో ఆరాధనోత్సవాలు నిర్వహించారు. బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులు ఆచార్యుల వారి చిత్రపటాలను అలంకరించి పూజలు చేసిన అనంతరం ఆలయం నుంచి రాగన్న ధర్వాజ చిన్నకొవెల వరకు పాదయాత్రతో ఊరేగింపు నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేష్బాబు అందించిన మామిడిపండ్లను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగిళ్ల షణ్ముఖఅవధాని, లంకాశివకుమారఫణిశర్మ, రాకేశ్శర్మ, గంగు మణికంఠశర్మ, మేఘనాథచార్యులు, వేంకటరమణాచార్యులు, శ్రీవర్ధనాచార్యులు, మేఘనాధాచార్యులు, రఘుకిరణాచార్యులు, తనుగుల రత్నాకర్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు
ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాం. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేశాం. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత. వేసే ఓటు భవిష్యత్ను నిర్ణయించేలా ఉండాలి. పోలీసు బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశాం. ప్రజలు సహకరించాలి. – ఇలా త్రిపాఠి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి●
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement