వేలంలో రూ.9.14 కోట్లకు అమ్ముడైన 'డొనాల్డ్ ట్రంప్' కారు ఇదే..
Published
Sat, Feb 3 2024 8:57 PM
ఇటీవల బారెట్ జాక్సన్ నిర్వహించిన వేలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఉపయోగించిన 'లంబోర్ఘిని డయాబ్లో వీటీ' కారు ఏకంగా 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీంతో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన డయాబ్లో కారుగా ఇది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
1997లో 'డొనాల్డ్ ట్రంప్' కొనుగోలు చేసిన లంబోర్ఘిని కంపెనీకి చెందిన 'డయాబ్లో వీటీ' ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన, ప్రజాదరణ పొందిన కారు. ఈ కారుని ట్రంప్ తనకోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నారు. బ్లూ లే మాన్స్ అనే ఒక స్పెషల్ కలర్ షేడ్లో కనిపించే ఈ కారు అమెరికాలో అమ్ముడైన 132 కార్లలో ఒకటి.
ట్రంప్ అభ్యర్థన మేరకు కంపెనీ ఆ కారు డోర్ మీద ట్రంప్ 1997 డయాబ్లో అనే నేమ్ ప్లేట్ కూడా ఫిక్స్ చేసింది. ఇది డ్యూయల్-టోన్ క్రీమ్/బ్లాక్ ఫినిషింగ్ పొంది ఉండటం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కారుని ట్రంప్ 2002లో ఈ కారును విక్రయించారు. ఆ తరువాత ఈ కారు 2016లో eBayలో అమ్మకానికి కనిపించింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఎంతమంది చేతులు మారిందనే విషయం స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే తాజాగా ఈ కారు 1.1 మిలియన్ డాలర్లకు (రూ. 9.14 కోట్లు) అమ్ముడైంది.
2016 వరకు ఈ కారు 14655 కిమీ ప్రయాణించినట్లు, ఇప్పుడు వేలానికి వచ్చే సమయానికి ఓడోమీటర్లో 15431 కిమీ ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంటే 2016 తరువాత దీని ఎక్కువ ఉపయోగించలేదని తెలుస్తోంది.
లంబోర్ఘిని డయాబ్లో
లంబోర్ఘిని కంపెనీకి చెందిన డయాబ్లో మంచి డిజైన్ కలిగి శక్తివంతమైన 5.7 లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 492 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి కేవలం 4.1 సెకన్లలో గంటకు 60mph వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 235 కిమీ వరకు ఉంది.