ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. నవంబర్ నెలలో రానున్న దీపావళి నాటికి ఇవి రికార్డ్ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. 10 గ్రాముల పసిడి రూ.61,000 లను తాకుతుందని, కేజీ వెండి రూ. 75,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా, దేశీయంగా బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల వాతావరణం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంచనాకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
కారణాలివే..
ప్రపంచంలోని పలు దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి సానుకూల ప్రకటన, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోలు, ఫిజికల్ డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి దారితీస్తాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు.
కెడియా ప్రకారం, ఈ దీపావళికి బంగారం ధరలు రూ. 61,000 నుంచి రూ. 61,500, వెండి ధరలు రూ. 75,000 నుంచి రూ. 76,000 స్థాయిలను తాకవచ్చు. గత సంవత్సరం దీపావళి నుంచి బంగారం ధరలు 17 శాతానికిపైగా పెరిగాయి. అలాగే వెండి ధరలు 23 శాతానికి మించి పెరిగాయి.