ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా?
Published
Wed, May 3 2023 2:48 PM
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు!
కార్డుదారులు తమ ఆధార్కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది.
ఇలా వెరిఫై చేయండి
కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.