Reliance Jio Launches Jio Bharat Phone at Rs 999 With New Plan - Sakshi
Sakshi News home page

Jio Bharat Phone: జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్‌, సరికొత్త ప్లాన్‌ కూడా

Published Mon, Jul 3 2023 6:13 PM

Reliance Jio launches Jio Bharat phone at Rs 999 with new plan - Sakshi

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జియో 2 జీ ముక్త్‌ భారత్‌  విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ  జియో భారత్‌ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే  అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్‌తో  పాటు కొత్త రూ. 123 ప్లాన్‌ ప్రకటించింది.  ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఇన్-క్లాస్  జియో 4జీ నెట్‌వర్క్ తొలి 10 లక్షల జియో భారత్‌ ఫోన్‌ల  బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని,  కొత్త జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో అడుగు అని  రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ప్రతీ భారతీయుడికి, ఇంటర్నెట్‌, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్‌ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని  నిరూపించాం. ఇకపై టెక్కాలజీ  కొంతమంది ప్రత్యేక హక్కుగా మిగలబోదు  అని ఆకాష్  ఒక ప్రకటనలో తెలిపారు.

1.77-అంగుళాల QVGA TFT స్క్రీన్‌, 1000mAh రిమూవబుల్‌  బ్యాటరీ  ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో JioCinema, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు,  హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్  టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే   ప్రముఖ ఉచిత సంగీత యాప్  JioSaavn, JioPayని కలిగి ఉంది.

Advertisement
Advertisement