అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్‌పోర్ట్‌ లేకుండానే ఢాకాకి | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్‌పోర్ట్‌ లేకుండానే ఢాకాకి

Published Sat, Jan 13 2024 11:51 AM

Fliers Stuck Inside Plane For Hours After Guwahati Flight Lands In Dhaka - Sakshi

వాతావారణ పరిస్థితులు  విమాన ప్రయాణాలకు చాలా కీలకం. దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ  ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణీకులు కూడా ఇ‍బ్బందులు పడతారు.  తాజాగా  ఇండిగో విమానం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొంది. దీంతో ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ప్రయాణీకులు అనూహ్యంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ల్యాండ్‌ అయ్యారు. 

ఇండిగో ఎయిల్‌లైన్స్‌కు చెందిన 6ఈ 5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. కానీ అక్కడి వాతావరణం, పొగమంచు కారణంగా గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ కష్టంగా మారింది.  దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లిచి  ఢాకాలో  అత్యవసరంగా  ల్యాండింగ్‌ చేశారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది.

అయితే  ఈవిషయంపై ముంబై యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సూరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. విమానంలో ఉన్న తామంతా  పాస్‌పోర్ట్‌ లేకుండానే దేశ సరిహద్దులు దాటాం అంటూ  ఎక్స్‌లో రాసుకొచ్చారు.  ఈ విమానంలో  ప్రయాణిస్తున్న గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో  ఢాకాలో ల్యాండ్‌ అయ్యామని తెలిపారు.  178 మంది ప్రయాణికులతో 9 గంటలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌహతి తిరిగి వెళ్లడానికి మరొక సిబ్బంది కోసం నాలుగు గంటలకు పైగా వేచి  ఉన్నాం,  దయచేసి  వేగంగా  స్పందించండి  మరో ప్రయాణికుడు ట్విటర్‌ ద్వారా వేడుకున్నారు.

దీంతో దీనిపై అసౌకర్యానికి  చింతిస్తున్నామంటూ ఇండిగో స్పందించింది.  ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని మళ్లించామని, ప్రయాణీకులకు వీలైనంత మేర సాయం చేస్తున్నాం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం, ఇండిగో విమానం శుక్రవారం రాత్రి 8.20 గంటలకు ముంబై నుండి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు గౌహతిలో దిగాల్సి ఉంది.

Advertisement
Advertisement