Sakshi News home page

BCCI: శ్రేయస్‌ అయ్యర్‌కు దెబ్బ మీద దెబ్బ! మరో షాక్‌..

Published Wed, Apr 17 2024 3:56 PM

BCCI Punishes Shreyas Iyer After KKR Breach IPL Code of Conduct Vs RR - Sakshi

ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మరో షాక్‌ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్‌ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌ మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అయ్యర్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

అయితే, లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్తాన్‌ రాయల్స్‌ జోస్‌ బట్లర్‌ వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి.. కేకేఆర్‌ రాజస్తాన్‌ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు.

కొంప ముంచి స్లో ఓవర్‌ రేటు
కానీ స్లో ఓవర్‌ రేటు కేకేఆర్‌ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్‌ సర్కిల్‌ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్‌ మొదటి బంతికే సిక్సర్‌ బాదాడు. 

ఓటమితో పాటు మరో షాక్‌ కూడా
అనంతరం మూడు బంతుల్లో విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా.. చివరి బంతికి సింగిల్‌ తీసి రాజస్తాన్‌ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే స్లో ఓవర్‌ రేటు కారణంగా కేకేఆర్‌ మ్యాచ్‌ ఓడిపోగా.. నిర్ణీత సమయంలో బౌలింగ్‌ పూర్తి చేయనందున కోల్‌కతా సారథి శ్రేయస్‌ అయ్యర్‌కు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది.

ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్‌తో సరిపెట్టినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: ఈసారి టైటిల్‌ సన్‌రైజర్స్‌దే!.. రిక్కీ పాంటింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement