-
పెన్డ్రైవ్ మూలమూలనా శోధన
బనశంకరి/ మైసూరు: హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ నగ్న వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అన్ని పార్టీల నాయకులు ఇందులో ఇరుక్కుపోతున్నారు. వీడియోల లీకేజీ వ్యవహారంలో హాసన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్గౌడ ఆప్తుని ఇంట్లో 10 కి పైగా పెన్డ్రైవ్లతో పాటు ముఖ్యమైన ఆధారాలు లభించాయి. బెంగళూరు, హాసన్తో పాటు అనేక ప్రాంతాల్లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. 7 పెన్డ్రైవ్లు, 6 హార్డ్డిస్క్లు, 4 ల్యాప్టాప్లు, మూడు డెస్క్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల స్టోరేజీని సేకరించి పరిశీలిస్తున్నారు. పెన్డ్రైవ్లు, కంప్యూటర్లలో ఉన్న వీడియోలను పరిశీలిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వీడియోలను పెన్డ్రైవ్ ల్యాప్టాప్, డెస్క్టాప్కు కాపీ చేసిన తరువాత ఇతరులకు పంపించారనే ఆరోపణ ఉంది. అందులో ప్రీతమ్గౌడ సన్నిహితులైన క్వాలిటీబార్ శరత్, పునీత్, హెచ్పీ కిరణ్, కాంగ్రెస్ కార్యకర్త పుట్టరాజు, నవీన్గౌడ, కారు డ్రైవరు కార్తీక్, శశి, చేతన్గౌడల ఇళ్లలో సోదాలు చేపట్టారు. మరోవైపు బెంగళూరుకు ఏ క్షణమైనా రావచ్చు అనుకున్న ఎంపీ ప్రజ్వల్ ఆచూకీ లేడు. ప్రజ్వల్ ఎక్కడున్నాడో తెలియదు: జీటీ విదేశాలకు వెళ్లిన ఎంపీ ప్రజ్వల్ ఇప్పటివరకు ఎవరికి అందుబాటులోకి రాలేదని జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ అన్నారు. గురువారం నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజ్వల్ రేవణ్ణతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడున్నాడో తెలియరాలేదని, 196 దేశాల్లో బ్లూకార్నర్ నోటీసు జారీ చేసిన సిట్ అధికారులే ఆయన ఆచూకీ కనుగొనాలని కోరారు. పెన్డ్రైవ్లను తయారు చేసింది, అప్లోడ్ చేసింది చైన్నె, మలేసియాలో అని తెలుస్తోందని, అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీతో జేడీఎస్ మైత్రి విడదీయలేనిదని చెప్పారు. రేవణ్ణకు మరో కేసులో బెయిలు మహిళపై లైంగిక దాడి కేసులో హెచ్డీ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. బెంగళూరు 42వ ఏసీఎంఎం కోర్టులో రేవణ్ణ బెయిలు అర్జీపై గురువారం విచారణ సాగింది. ఆయనకు బెయిల్ ఇవ్వరాదని సిట్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కోర్టు ఇరుపక్షాల వాదనలను ఆలకించి బెయిలు మంజూరు చేసింది. హాసన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆప్తుల ఇళ్లలో సిట్ సోదాలు పెద్దసంఖ్యలో పెన్డ్రైవ్లు, హార్డ్డిస్కులు సీజ్ తిమింగలాన్ని మింగేస్తా: కుమార మింగే కాలం వచ్చినప్పుడు పెద్ద తిమింగలాన్నే మింగేస్తానని జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పరోక్షంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై మండిపడ్డారు. అశ్లీల వీడియోల వెనుక ఉన్న తిమింగలం డీకేశి అని కుమార తరచూ ఆరోపిస్తున్నారు. గురువారం మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రజ్వల్ ఎంపీగా అయ్యాక తమకు అందుబాటులో లేకుండా పోయాడన్నారు. ఇక విదేశాల్లో ఉంటే తనతో ఎలా మాట్లాడతాడని ప్రశ్నించారు. ప్రజ్వల్ కేసులో ప్రభుత్వానికి నిజాలు అవసరం లేదని, జేడీఎస్, దేవెగౌడ కుటుంబ మర్యాదను పాడు చేస్తే చాలనుకుంటోందని విమర్శించారు. సిట్ తనిఖీ సరిగ్గా జరగడం లేదని, న్యాయవాది దేవరాజేగౌడను కేసు నమోదు అయిన నెల రోజుల తర్వాత ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికారుల బదిలీల అవినీతిపై ఆధారాల పెన్డ్రైవ్ను ఇస్తాను, విచారణకు సిద్ధమా అని అన్నారు. -
చెరువు స్నానం.. తీసింది ప్రాణం
సాక్షి, బళ్లారి: హాసన్ జిల్లా ఆలూరు తాలూకా కదాళ పంచాయతీ పరిధిలోని ముత్తిగి గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గురువారం స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. వివరాలు.. విశ్వ, పృథ్వీ, సాత్విక్, జీవన్ అనే నలుగురు స్నేహితుడు, వీరందరూ 8 నుంచి 10 ఏళ్ల లోపువారే. సమీపంలోని తురగనహళ్లి తిమ్మనహళ్లిలో చెరువులో ఈతకు వెళ్లారు. చెరువు లోతుగా ఉన్నచోట బాలలు మునిగిపోయారు. బాలలు ఎంతసేపయినా ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా గట్టు మీద చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది చెరువులో రబ్బరు బోట్లతో గాలింపు సాగించారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. రాత్రి పొద్దుపోయాక మరో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కంటికి దీపంలా పెంచుకుంటున్న చిన్నారులను అలా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు బాలల తుదిశ్వాస హాసన్ జిల్లా ఆలూరు తాలూకాలో ఘోరం -
అభ్యర్థి గెలుపే అభివృద్ధికి మలుపు
సాక్షి,బళ్లారి: ఈశాన్య పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న అమరనాథ్ పాటిల్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లాలోని సండూరు నియోజకవర్గంలో అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి గెలుపొందితేనే పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాఽధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడూ నెరవేర్చడం లేదన్నారు. పట్టభద్రుల విషయంలో కూడా ఇదే ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో పట్టభద్రుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ నాయకుడు కే.ఎస్ దివాకర్, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. -
31 నుంచి ముంగారు ప్రవేశం
యశవంతపుర: భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. ఈ నెల 31 నుంచి ముంగారు వానలు ప్రారంభం కానున్నట్లు ఐఎండి ఒక ప్రకటనలో తెలిపింది. ● ఈ నెల 19 నుంచి నైరుతీ ముంగారుగా మారి దక్షిణ అండమాన్, బంగాళాఖాతం, నికోబార్ ద్వీపాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ● 31వ తేదీకి ముందుగానే కేరళలోకి ముంగారు ప్రవేశించే అవకాశం ఉంది. మూడు నాలుగు రోజుల ముందుగానే జూన్ మొదటి వారంలో కర్ణాటకలోకి రుతుపవనాలు చేరుకొంటాయని తెలిపారు. ● జూన్ 7 లేదా 8 నుంచి ముంగారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణశాఖ అధికారులు అంచనా వేశారు. ● ఇక గురువారం ధార్వాడలో భారీ వర్షం కురిసింది. బెంగళూరులో ఆకాశం మేఘావృతమై పగటి వెలుతురు బాగా తగ్గిపోయింది. ఊపందుకోనున్న వానలు -
మొబైల్ జామర్తో బతుకు నరకం
బనశంకరి: జైలుకు దగ్గరలో నివసించడం ఎవరికై నా ఇబ్బందే. పలు రకాల ఇబ్బందులు వస్తుంటాయి. ఇదే మాదిరిగా రాజధానిలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చుట్టుపక్కల ఉండే భువనేశ్వరి లేఔట్, నాగనాథపుర గ్రామస్తులు గురువారం జైలు సర్కిల్ వద్ద ధర్నా చేశారు. జైలులో జామర్ వల్ల ప్రస్తుత జీవనంలో అతి ముఖ్యమైన మొబైల్ఫోన్ పనిచేయకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రాణమే పోయింది ● జైలులో ఖైదీలు సెల్ఫోన్లు వాడినా పనిచేయకుండా మొబైల్ జామర్లను అమర్చారు. కానీ అవి జైలు బయట చాలా దూరం వరకూ ప్రభావం చూపుతున్నాయి. ●తమ ప్రాంతంలో ఫోన్లు పనిచేయడం లేదని, చాలా ఇబ్బందికరంగా మారిందని లక్ష్మణ్ అనే వ్యక్తి తెలిపారు. ● బంధువులకు ఫోన్ చేయాలన్నా, ఇంట్లో అనారోగ్య సమస్య తలెత్తితే అంబులెన్స్కు ఫోన్ చేయాలన్నా నెట్వర్క్ లభించడం లేదని గౌరమ్మఅనే మహిళ వాపోయారు. ●క్యాబ్లకు, పోలీసులకు, గ్యాస్ తదితర హెల్ప్లైన్లకు కాల్ చేయాలన్న ఫలితం లేదని శృతి అనే మహిళ తెలిపింది. ●ఒక హృద్రోగికి అమర్చిన ఉపకరణం జామర్ వల్ల పనిచేయక చనిపోయాడని ఒకరు తెలిపారు. ● వర్క్ ఫ్రం హోం చేయడానికి మొబైల్స్, ల్యాప్టాప్లకు నెట్వర్క్ లేక ఉద్యోగులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. దీంతో అద్దె ఇళ్లకు గిరాకీ ఉండడం లేదు. ● తమ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో హైకోర్టు కు వెళతామని ఆందోళనకారులు తెలిపారు. జైలు జామర్లకు వ్యతిరేకంగా జనం ధర్నా పరప్పన అగ్రహార జైలు పరిసర ప్రాంతాలవాసుల ధర్నా -
గాలివానకు ఫట్
బనశంకరి: ఉద్యాననగరి పరిధిలో ఈ నెల 6 నుంచి 12 వరకు కురిసిన గాలీవానలు చెట్లకు ప్రాణాంతకంగా మారాయి. ఆ వారం రోజుల్లో వెయ్యికి పైగా చెట్లు కూలిపోయాయని బీబీఎంపీ తెలిపింది. నైరుతి రుతు పవనాలు ఇంకా రాలేదు కాబట్టి కూలిపోయిన చెట్లను తొలగించడంపై బీబీఎంపీ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. అనూహ్యంగా గత 10 రోజులుగా కురిసిన ఈదురుగాలులతో కూడిన వానలకు బెంగళూరులో అనేక చోట్ల చెట్లు, పెద్ద పెద్ద కొమ్మలు కూలిపోయాయి. కొన్నిచోట్ల కార్లు, బైక్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి, అదృష్టవశాత్తు ఎవరికీ హాని కలగలేదు. వర్షం వచ్చే సమయాలలో చెట్ల కింద ఉండకపోవడం శ్రేయస్కరం. పడిపోయిన చోటే అమ్మకాలు ఈ నేపథ్యంలో రోడ్లలో కూలిపోయిన చెట్లు, కొమ్మలను బీబీఎంపీ పరిధిలోని అటవీశాఖ డిపోలకు తరలించకుండా చెట్లు పడిన స్థలంలోనే ప్రజలకు అమ్మేయడానికి పథకం రూపొందించింది. ఈ మేరకు అటవీ విభాగం అధికారులు బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్కు తెలిపారు. ఇటీవల భారీ గాలులు, వర్షాలకు చెట్లు కూలిపోయాయి, వచ్చి తొలగించాలని అనేకమంది ఫిర్యాదులు చేశారు. 39 బృందాలు రోడ్లు, ఫుట్పాత్లపై పడిపోయిన చెట్లను, కొమ్మలను కత్తిరించారు. ప్రస్తుతం వీటిని అక్కడే ఉంచి విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. తరలించడం సాధ్యం కాదనే.. బీబీఎంపీ అటవీ విభాగం కూలిన చెట్లను కట్ చేసి డిపోలు లేదా డంపింగ్యార్డుల్లో నిల్వచేస్తారు. నగరంలో ఇలాంటి 8 డంపింగ్ యార్డులు ఉన్నాయి. కానీ వారం వ్యవధిలో 1,000 కి పైగా చెట్లు కూలిపోయినప్పుడు వాటిని కత్తిరించి తొలగించడం సాధ్యం కాదని పాలికె అధికారులు చెబుతున్నారు. వాటిని అక్కడే వేలం వేసి అమ్మేయాలని పాలికె తీర్మానించిందని బీబీఎంపీ అటవీశాఖ డిప్యూటీ సంరక్షణాధికారి బీఎల్జీ స్వామి తెలిపారు. నగరవ్యాప్తంగా కూలిపోయిన చెట్లను తొలగించే పని నత్తనడకన సాగుతోందని ఓ పాలికె అధికారి ఒప్పుకున్నారు. చెట్ల కొమ్మలు అడ్డంగా ఉంటూ అవస్థలు పడుతున్నట్లు వాహనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. -
హైవేపై వాహన బీభత్సం
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా అరసు కల్లళ్లి వద్ద వరుసగా నాలుగు వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక బైకిస్టు మరణించాడు. రెండు బస్సులు, రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. మైసూరు–బంట్వాళ రహదారి–275పై అరసు కల్లహళ్లి గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. మైసూరు తాలూకా హోటగళ్లి ఎస్ఆర్ఎస్ కాలనీ నివాసి, కూలీ కార్మికుడు కరియప్ప (40) బైక్ మీద పొరుగూరిలో జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. హుణసూరు డిపోకు చెందిన బస్సు అతన్ని వెనుక నుంచి ఢీ కొట్టి సడన్ బ్రేక్ వేసింది. వెనుకనే వచ్చిన ఇన్నోవా కారు అదుపు కాలేక బస్సును ఢీ కొట్టింది. ఆ వెనుకే మరో బెంజ్ కారు వచ్చి ఇన్నోవాను గుద్దింది. మరో ఆర్టీసీ బస్సు బెంజ్ కారును వెనుక ఢీకొట్టింది. ఇలా వరుసగా వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. బైకిస్టు కరియప్ప తీవ్ర గాయాలతో అక్కడే మరణించారు. వాహనాల్లోని మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై అర్ధగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు ఇతర వాహనదారులు వాపోయారు. వరుసగా నాలుగు వాహనాలు ఢీ ఒక బైకిస్టు దుర్మరణం -
గెలిపిస్తే మండలిలో గళమెత్తుతా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో జూన్ 3న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి అమర్నాథ్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం నగరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పట్టభద్రుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి విధాన పరిషత్(మండలి)లో తన గళం వినిపించి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వ్యక్తి అదృశ్యం బళ్లారి అర్బన్: స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్పగల్ రోడ్డు శివలింగమ్మమఠం సమీపంలో నివాసం ఉండే కాంగ్రెస్ కార్యకర్త, ఆటో డ్రైవర్ మల్లికార్జున అనే 42 ఏళ్ల వయస్సుగల వ్యక్తి కనిపించడం లేదని అతని భార్య మీనా రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీస్స్టేషన్కు లేదా 9480803049, 9980187669 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
చరిత్రాత్మకం.. దశరథ రామాలయం
సాక్షి,బళ్లారి: రామాయణ పురాణాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని గుడ్డదనేరళకెరె గ్రామంలో వెలిసిన దశరథ రామలింగేశ్వరాలయం అత్యంత ప్రాచీనమైనది. తాలూకాలోని దశరథ రామేశ్వర పుణ్యక్షేత్రానికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఇది అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఫుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. దశరథ రామేశ్వర క్షేత్రానికి ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య పుణ్యక్షేత్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని నేటికీ పురాణ కథలు, స్థానిక మహిమ గాధలు చాటి చెబుతున్నాయి. ఈ ఆలయ మహిమను తెలుసుకున్న శ్రీరామ సంస్కృతి పరిశోధన సంస్థానం సంబంధిత బృందం 2017లో ఈ ఆలయాన్ని సందర్శించి చారిత్రాత్మక గుర్తులు, ఆనవాళ్లపై కూడా పరిశోధనలు జరిపింది. దశరథుడు ప్రతిష్టాపించిన శివలింగం ఇక్కడ కొలువుదీరి ఉందని, శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి వెళ్లారన్న సమాచారాన్ని ధృవీకరించుకున్న సదరు బృందం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం శంకుస్థాపనకు దశరథ రామేశ్వరం నుంచి పవిత్ర జలంతో మట్టిని సేకరించి తీసుకెళ్లి రామమందిర కట్టడానికి కూడా వినియోగించారు. దశరథుని వేటతో వెలుగులోకి త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన దశరథ మహారాజు తన సేనతో గొండా ఆరణ్యంలో వేట కోసం సంచరిస్తూ, ఇక్కడ వజ్రగిరికి వచ్చి చేరుకున్నారు. వజ్రగిరి అప్పట్లో చాలా పెద్ద క్రూరమృగాల స్థావరంగా ఉండేది. దశరథ మహారాజు ఒకరోజు వేటాడుతూ వజ్రగిరి సరోవరం వద్దకు వచ్చినప్పుడు క్రూరమృగాలను వేటాడేందుకు కాపు కాచాడు. అయితే అదే సమయానికి సుదూర ప్రాంతం నుంచి పుట్టుకతోనే గుడ్డివారైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని వారిని భుజాల మీద మోసుకుని సంచరిస్తూ వచ్చిన శ్రవణకుమారుడనే రాజకుమారుడు తనకు, తల్లిదండ్రులకు నీటిదప్పిక కావడంతో ఆ సరోవర ప్రాంతంలోనే తమ తల్లిదండ్రులను దింపి, పొరుగున ఉన్న సరోవరంలోని నీటిని తాగి, తల్లిదండ్రులకు నీటిని తేవడానికి నీటిని నింపుకుంటుండగా గలగలా శబ్ధం వచ్చింది. ఈ శబ్ధం విన్న దశరథుడికి ఏదో పెద్ద క్రూరమృగం వచ్చి నీళ్లు తాగుతోందని భ్రమిస్తాడు. దీంతో తక్షణమే అప్రమత్తుడై విల్లును తీసుకుని శబ్ధవేధి విద్యజ్ఞానంతో శబ్ధం వచ్చిన దిక్కుకు గురిపెట్టి బాణాన్ని సంధించాడు. దశరథుడు వదిలిన ఆ బాణం శ్రవణకుమారుడికి తగలడంతో గట్టిగా ఆర్తనాదం చేస్తూ కుప్పకూలిపోతాడు. శ్రవణుడి మరణంతో శాపం కుమారుడి ఆర్తనాదం విన్న వృద్ధ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఏదో ప్రాణాపాయం సంభవించిందని ఆందోళనకు గురవుతున్న వేళ అక్కడికి వచ్చిన దశరథుడు తన వల్ల కలిగిన ఘోర తప్పిదం వల్ల శ్రవణకుమారుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పి ఆవేదన చెందాడు. చేసిన తప్పు, పొరపాటుకు ఎంతో బాధపడుతూ దశరథుడు సరోవరం వద్ద నుంచి తాగునీటిని తీసుకుని శ్రవణకుమారుడి తల్లిదండ్రుల వద్దకు వచ్చి నీటిని అందించి జరిగిన విషయాన్ని వివరించి తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించాలని కోరాడు. అయితే కుమారుడు హతుడయ్యాడని తెలుసుకున్న ఆ అంధ తల్లిదండ్రులు ఆగ్రహంతో కన్నీరుమున్నీరుగా విలపించి దశరథుడిని శపిస్తారు. కుమారుడి వియోగం, బాధ తట్టుకోలేక వారిద్దరూ కూడా అక్కడే ప్రాణాలు వదులుతారు. దశరథుడు శాప విమోచనం కోసం సమీపంలోని గుహలో ఓ శివలింగాన్ని ప్రతిష్టాపించి ఆరాధిస్తాడు. దశరథుడు ప్రతిష్టాపించిన శివలింగాన్ని ఆ తర్వాత శ్రీరాముడు కూడా అటుగా వచ్చినప్పుడు పూజిస్తాడు. అందుకే ఆ పేరు వచ్చింది దశరథుడు, శ్రీరాముడు ఇద్దరూ కలిసి పూజించడం వల్లనే ఈ ఆలయానికి దశరథ రామలింగేశ్వర అని పేరు వచ్చింది. దీనికి ప్రతీకగా నిలిచేలా క్షేత్ర శాసనంలో నేటికీ గుహ ముందున్న పర్వతాన్ని శ్రవణకుమార పర్వతమని భక్తులు పిలుచుకుంటారు. గుహలో ప్రతిష్టాపించిన శివలింగం కొలువై ఉండగా, గుహను అనుకుని ఇక్కడ నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. శ్రవణకుమారుడి సమాధితో పాటు అతడి తల్లిదండ్రుల సమాధులు ఇక్కడ నెలకొన్నాయి. శ్రవణకుమారుడు తల్లిదండ్రులను మోసే కావడితో కూడిన విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దశరథ రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుని పునీతులవుతున్నారు. దశరథుడు, శ్రీరాముడు ఇద్దరూ కలిసి పూజలు చేసినందున ఆ లింగానికి శ్రీదశరథ రామలింగేశ్వర అనే పేరు వచ్చిందని చరిత్ర ఆధారాలు, పురాణ కథలు వెల్లడిస్తున్నాయి. దశరథుడు ప్రతిష్టాపించిన అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం అయోధ్యతో ఈ ఆలయానికి అవినాభావ సంబంధం -
విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీరు తెలంగాణకా?
● కర్ణాటక రైతుల అభ్యంతరం రాయచూరు రూరల్: రాయచూరు ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఆర్టీపీఎస్)లో విద్యుత్ ఉత్పత్తి కోసం నారాయణపుర డ్యాం నుంచి కృష్ణా నదికి 1.25 టీఎంసీ నీరు విడుదల చేస్తే ఆ నీటిని విద్యుత్ ఉత్పత్తి అనంతరం తెలంగాణకు తాగునీటి కోసం వదిలినట్లు అధికారులు చెబుతుండటంపై కర్ణాటక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో నారాయణపూర్ డ్యాం నుంచి కాలువలకు నీరు వదిలితే రైతులు మిరప, పత్తి పంటలను సాగు చేసుకుంటారని కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టినా స్పందించని నీటి పారుదల శాఖాధికారులు ఇప్పుడు మౌనం దాల్చడాన్ని ఖండించారు. నారాయణపుర డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 33.33 టీఎంసీలు కాగా 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. ఆర్టీపీఎస్ కోసం 0.46 టీఎంసీల సామర్థ్యంతో గూర్జాపూర్ బ్యారేజీని నిర్మించినా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
అంజలి కుటుంబానికి పరామర్శ
హుబ్లీ: నగరంలోని వీరాపుర వీధిలో బుధవారం ప్రేమోన్మాది చేతిలో బలైన అంజలి కుటుంబానికి అండగా నిలుస్తామని శిరహట్టి మఠం ఫక్కీర దింగాలేశ్వర స్వామి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన అంజలి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంజలి తల్లి గంగమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆమె నలుగురు ఆడపిల్లలతో జీవిస్తున్నారని, వీరి కుటుంబంలో ఎలాంటి పురుష దిక్కు లేదన్నారు. ప్రభుత్వం ఈ కుటుంబానికి గృహ వసతి, విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని సీఎం సిద్దరామయ్యకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తానని స్వామి అన్నారు. కాగా అంబిగర సమాజ స్వామి కూడా అంజలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత నెలలో హత్యకు గురైన నేహా తండ్రి నిరంజనయ్య హిరేమఠ అంజలి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా రూ.లక్ష పరిహారం అందించారు. ఈ హత్యను ఖండిస్తూ నగరంలో గురువారం కూడా ఆందోళనలు కొనసాగాయి. -
వర్షంతో బస్టాండ్ జలమయం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలో బుధవారం సాయంత్రం గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నీరు చొరబడి బస్టాండ్ జలమయంగా మారింది. భారీ వర్షానికి వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రధాన వీధులు, బస్టాండ్ పూర్తిగా జలమయమై గంట పాటు ట్రాఫిక్ నిలిచి పోయింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఈ భారీ వర్షం కారణంగా పలు ఇళ్లలోకి నీరు చేరగా, కొన్ని ఇళ్లలోని ధాన్యం గింజల బస్తాలు సైతం తడిసిపోయాయి. భారీ వర్షం కురవడంతో కొట్టూరు నగరం చల్లబడింది. -
పంట నష్టపరిహారం అందించండి
హొసపేటె: జిల్లాలో ఫేజ్–1 నుంచి ఫేజ్–9 వరకు వచ్చిన డేటాను, పంట నష్టపరిహారం సొమ్మును వెంటనే సక్రమంగా అందించాలని అదనపు జిల్లాధికారిణి అనురాధ అధికారులను ఆదేశించారు. 2023–24లో వర్షాకాలంలో కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఇటీవల నిర్వహించిన వీడియో ఇంటరాక్షన్ తర్వాత జిల్లా పరిపాలన భవన్లోని కేస్వాన్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో పంట నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియపై ఆమె చర్చించారు. జిల్లాలో కొంత మంది రైతుల ఖాతాలకు పంట నష్టపరిహారం సొమ్ము ఎందుకు చెల్లించలేదనే సాంకేతిక కారణాలపై ఇప్పటికే వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులకు సమాచారం పంపినందున సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో కరువు కారణంగా పంటనష్టం సర్వే డేటా సమాచారం ఆధారంగా ఐడీ ఉన్న రైతులకు, రెండో దశలో జిల్లాలో మొత్తం 1,09,543 మంది రైతులకు పరిహారం కింద రూ.130.08 కోట్లను విడుదల చేసినట్లు జిల్లాధికారి ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. ఈ పంట నష్టపరిహారం సొమ్మును పొందడంలో కొందరు రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. -
డెంగీపై జాగృతి జాతాకు శ్రీకారం
హొసపేటె: జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రజల సహకారంతో డెంగీని అదుపు చేద్దాం అనే నినాదంతో నగరంలోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం వద్ద జెడ్పీ సీఈఓ సదాశివ ప్రభు పచ్చజెండా ఊపి అవగాహన జాతాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగీ జ్వరంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే డెంగీ జ్వరం ప్రాణాంతకం కావచ్చన్నారు. వర్షాకాలం ముందు, తర్వాత డెంగీ దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. దోమ ఎప్పుడు కుడుతుంది, డెంగీ వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై సంఘసంస్థలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారి డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ వ్యాధులు వచ్చినప్పుడు చికిత్స పొందడమే కాకుండా రాకముందే జాగ్రత్త పడడం మంచిదన్నారు. ప్రజలు ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తరచుగా మార్చుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. -
స్వచ్ఛతతో డెంగీని పారదోలుదాం
చిక్కబళ్లాపురం: ప్రాణాలు కబలించే డెంగీని పారదోలుదామని డీహెచ్ఓ మహేష్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగీ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా పాలక మండలి, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన ప్రారభించారు. ఆయన మాట్లాడుతూ పగటిపూట కరిచే ఈడీస్ దోమల ద్వారా డెంగీ వ్యాపిస్తుందన్నారు. ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచిన ప్రాంతాల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు. పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా డెంగీని అరికట్టవచ్చన్నారు. డ్రమ్ములు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ర్యాలీ శిడ్లఘట్ట సర్కిల్ వరకు సాగింది. అక్కడ పారామెడికల్ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా వర్కర్లు మానవహారం ఏర్పాటు చేసి డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఆరోగ్య శిక్షణ అధికారి హరీశ్, వైద్యాధికారులు ఉమా కృష్ణప్రసాద్, ప్రకాశ్ పాల్గొన్నారు. -
సాహిత్యంతో సంప్రదాయాలు పదిలం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రతి ఇంటిలో భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ఆచార విచారాలు, కట్టుబొట్టు వంటి వాటిపై ప్రజల్లో ప్రచారం చేయడానికి పండిట్ గురు పుట్టరాజ సాహిత్యం ఎంతో దోహద పడుతోందని గురు పుట్టరాజ సేవా సమితి సంస్థాపకుడు చెన్నవీరస్వామి హిరేమఠ అన్నారు. ఆయన దావణగెరెలోని కన్నడ కువెంపు భవనంలో ఏర్పాటు చేసిన డాక్టర్ పండిత్ గురు పుట్టరాజ సాహిత్య గ్రంథాలను పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రమీల, సౌమ్య, సతీష్, శివరాజ్, రేవణ సిద్దప్ప, గీతాలున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు హొసపేటె: ఘన, సంప్రదాయ, ద్రవ వ్యర్థాల నిర్వహణపై న్యాయశాఖకు సమర్పించిన అఫిడవిట్లోని అంశాలను నిర్ణీత గడువులోగా అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ హెచ్చరించారు. ఆయన గురువారం తన కార్యాలయ సభామందిరంలో జిల్లాలోని పట్టణ పంచాయతీ, స్థానిక సంస్థల, జిల్లా వాయు కాలుష్య నియంత్రణ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పట్టణ పంచాయతీ, స్థానిక సంస్థలు జాతీయ గ్రీన్ జ్యుడిషియరీ ఆదేశాలను పాటించే అంశంలో ఘన వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రీయ గ్రీన్ జ్యుడిషియరీ బెంచ్లో కేసు నమోదైందన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్న చర్యల గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అర్బన్ డెవలప్మెంట్ సెల్ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగరాజ, ఏఈఈలు వీరేష్, శిల్పశ్రీ, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ జగదీశ్, జిల్లాలోని అన్ని పట్టణ పంచాయతీ, స్థానిక సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. -
రెబల్గా నామినేషన్ వేయాల్సిందే
మైసూరు: దక్షిణ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి జేడీస్ రెబెల్ అభ్యర్థిగా కేటీ శ్రీకంఠేగౌడ పోటీ చేయాలని మద్దతుదారులు పట్టుబట్టారు. ఈసందర్భంగా జరిగిన తోపులాట, గలాటలో శ్రీకంఠేగౌడ కిందపడి చేతికి గాయాలయ్యాయి. కేటీ శ్రీకంఠేగౌడ జేడీఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దక్షిణఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వివేకానందను జేడీఎస్ బరిలోకి దించింది. నిరాశలో ఉన్న కంఠేగౌడ నగరంలోని ఆలమ్మ కల్యాణ మంటపంలో గురువారం తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న జేడీఎస్ కోర్కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ, కార్యాధ్యక్షుడు సారామహేశ్, సీఎస్ పుట్టరాజు అక్కడికి చేరుకుని శ్రీ కంఠేగౌడను బుజ్జగించే ప్రయత్నం చేయగా మద్దతుదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్యలోనే వాగ్వాదం, తోపులాట జరిగి శ్రీకంఠేగౌడ కింద పడగా చేతికి గాయమైంది. ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ మద్దతుదారులు ఆయన్ను వదలలేదు. నామినేషన్ పత్రాలను సమర్పించాలని ఒత్తిడి చేశారు. చివరికి పుట్టరాజు, జేడీఎస్ నాయకలు శ్రీకంఠేగౌడ మద్దతుదారులను ఒప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఎక్స్రే తదితర పరీక్షలను శ్రీకంఠేగౌడకు చేశారు. అంతలోనే నామినేషన్ల సమర్పణ గడువు కూడా ముగిసింది. సమావేశంలో పట్టుబట్టిన శ్రీకంఠేగౌడ మద్దతుదారులు కిందపడి గాయపడిన శ్రీకంఠేగౌడ -
చెక్ దుర్వినియోగం.. అధికారిపై కేసు
మైసూరు: చెక్ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మైసూరు మహానగర పాలికె ఆరోగ్యాధికారిపై సరస్వతీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సరస్వతీపురంలో అన్నపూర్ణ ఆఫ్సెట్ ప్రింటర్స్ నిర్వహిస్తున్న మీరా అనే వ్యక్తి తన వ్యవహారాల నిమిత్తం ఇచ్చిన చెక్లో రూ. 4.5 లక్షలను నమోదు చేసి బౌన్స్కు అధికారులు యత్నించారు. పాలికె సీనియర్ ఆరోగ్యాధికారి వెంకటేశ్, హాసన్ నివాసి కేశవమూర్తిలు ఈ మోసానికి పాల్పడ్డారు. వారిపై మీరా ఫిర్యాదు చేశారు. పాములు కనిపిస్తే చంపొద్దు బనశంకరి: వేసవి తాపం తాళలేక పాములు చల్లటివాతావరణం కోసం ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోకి రావడం సహజమని, ఇళ్లలోకి, వీధుల్లోకి పాములు వస్తే భయపడి చంపరాదని పాలికె తెలిపింది. పాములను రక్షించడానికి తక్షణం సమాచారం అందించాలని కర్ణాటక ఎక్స్ ఖాతాలో తెలియజేసింది. పాములు కనిపనిస్తే బీబీఎంపీ సహాయవాణి 9902794711 కు ఫోన్చేయాలని తెలిపింది. 1972 వన్యజీవి యాక్ట్ ప్రకారం పాములను చంపరాదని తెలిపింది. జన్మదిన వేడుకలకు దేవెగౌడ దూరంశివాజీనగర: మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ 91 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈనెల 18న 92వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తామున్నచోట నుంచే శుభాకాంక్షలు తెలియజేయాలని దేవెగౌడ ఒక పత్రికా ప్రకటన ద్వారా కోరారు. శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ తమ ఇంటికి రావద్దని సూచించారు. ఎన్నో రాజకీయ ఉన్నత పదవులు అలంకరించిన దేవెగౌడకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఏటా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకునేవారు. కార్యకర్తలు, నాయకులు ఆయన ఇంటి వద్దకు వచ్చి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే కొన్ని కారణాలతో ఈ ఏడాది జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు దేవెగౌడ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా విధానపరిషత్ ఎన్నికల్లో జేడీఎస్–బీజేపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు, నాయకులు శ్రమించాలని, పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి బాధ్యతలను నిర్వహించాలని ఆ ప్రకటనలో కోరారు. -
పరిహారాన్ని రుణాలకు జమ చేయడం క్రూరం
●మాజీ సీఎం కుమారస్వామి శివాజీనగర: కేంద్రం విడుదల చేసిన కరువు పరిహార సొమ్మును రైతుల రుణాలకు జమ చేస్తున్నారని, ఇది అత్యంత క్రూరమైన విషయమని మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. అన్నదాత కన్నీరు తుడవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చొన్నదని ధ్వజమెత్తారు. ఈమేరకు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయినా ఆ సొమ్మును బ్యాంకులు రుణాలకు జమా చేసుకుంటున్నాయన్నారు. బ్యాంకుల వైఖరి క్రూరమైన విషయమన్నారు. తీవ్ర కరువు, పంటల నాశనంతో నష్టపోయిన రైతుల కళ్లల్లో రక్త కన్నీరు తీసుకొచ్చే అమానవీయ చర్యలని అంటే తప్పు కాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్యాంకు అధికారులతో సమావేశాన్ని నిర్వహించి కరువు పరిహారం రుణాలకు జమ చేయరాదని ఆదేశాలు జారీ చేయాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. 1నుంచి 4వరకు మద్యం విక్రయాలు బంద్ దొడ్డబళ్లాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు, 6వ తేదీ మద్యం విక్రయాలు నిషేధిస్తూ బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా ఓటింగ్కు 48 గంటల ముందు, ఓట్ల లెక్కింపు రోజు మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కామాంధుడి అరెస్ట్ మైసూరు: చెల్లెలి కూతురిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెల్లి కూతురిని ఇంట్లో దిగబెడుతానని చెప్పి కారులో ఎక్కించుకున్న రౌడీషీటర్ దైత్యరాజ్.. తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో నగర పోలీసు స్టేషన్లో దైత్యరాజ్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని మైసూరు హారోహళ్లి గ్రామంలో అరెస్టు చేశారు. కేఈఏ ఎండీపై బదిలీ వేటు దొడ్డబళ్లాపురం: సీఈటీ ప్రశ్నపత్రాల వ్యవహారంలో కేఈఏ ఎండీ రమ్యపై వేటు పడింది. కేఈఏ పదవి నుంచి ఆమెను తొలగించి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థానంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉన్న ప్రసన్నను నియమించారు. సీఈటీలో 50కి పైగా సంబంధం లేని ప్రశ్నలను పొందుపరిచారు. ఇందుకు కారణమైన కేఈఏ ఎండీని బదిలీ చేయాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండు చేశారు. దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుంది. నా గెలుపునకు కృషి చేయండి మండ్య: దక్షిణ ఉపాధ్యాయ నియోజకవర్గం పోటీ చేస్తున్నట్లు, తన గెలుపునకు కన్నడ తదితర అన్ని సంఘాలు, సంస్థల నుంచి మద్దతు కావాలని కన్నడ చళువళి వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ మనవి చేశారు. నగరంలోని సర్ ఎంవీ విగ్రహం ఎదుట వివిధ సంఘాల ముఖ్యులను కలసి మీడియాతో మాట్లాడారు. ఈసారి విధాన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తానని, మండ్య జిల్లాలో తన అభిమానులు, వివిధ కన్నడ సంఘాలు, కార్యకర్తలు తన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కోరారు. కన్నడ పరిరక్షణ కోసం తనపోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అయోధ్యకు సైకిల్ యాత్రగౌరిబిదనూరు: అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంచేనహళ్లి సమీపంలోని రాయనకల్లు గ్రామానికి చెందిన యువకుడు భానుప్రకాశ్ (22) సైకిల్ యాత్ర చేపట్టాడు. గురువారం ఆయన డీ పాళ్య (దారినాయకనపాళ్య)లో తాలూకా విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో సాయిబాబా, ఇతర ఆలయాల్లో పూజలు నిర్వహించి సైకిల్పై అయోధ్యకు బయల్దేరాడు. సుమారు 40 రోజుల్లో అయోధ్య చేరుకుంటానని యువకుడు తెలిపాడు. బాలరాముడిని దర్శించుకొని వీలైతే తిరిగి సైకిల్పైనే స్వగ్రామానికి వస్తానని భాను ప్రకాశ్ తెలిపాడు. ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో విశ్వహిందూ పరిషత్ తాలూకా అధ్యక్షుడు సాగానహళ్లి శివకుమార్, హోటల్ రమేశ్బాబు, మారుతి, హరీశ్ శెట్టి, మైలప్ప, రవి, శ్రీనివాస కల్యాణ, ఆదినారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ నియంత్రణకు ముందస్తు చర్యలు
బనశంకరి: డెంగీ నియంత్రించేందుకు చర్యలు చేపట్టామని బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్ సురళ్కర్వికాస్కిశోర్ తెలిపారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం బెంగళూరు నగరంలోని తూర్పు వలయం రామస్వామిపాళ్యలో ఏర్పాటుచేసిన జాగృతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్షం వచ్చినప్పుడు దోమలు ఉత్పత్తి పెరుగుతుందని, దీంతో డెంగీ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్షాలు కురుస్తున్నందున అన్ని వార్డుల్లో నీరు నిలిచే ప్రాంతాల్లో దోమల నియంత్రణకు రసాయనాలు పిచికారీ, ఫాగింగ్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో వార్డులో నాలుగు పిచికారీ బృందాలను నియమించినట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద పూలకుండీలు, పడేసినటైర్లు, తొట్టెల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పీహెచ్సీ అధికారులు, ఆశా కార్యకర్తలు, నమ్మక్లినిక్ డాక్టర్లు ఇంటింటి సర్వేచేపట్టి డెంగీ కేసులు ఆచూకీ కనిపెడుతున్నారన్నారు. డెంగీ ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాలు, లౌడ్స్పీకర్ల ద్వారా జాగృతం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీబీఎంపీ ప్రధాన ఆరోగ్యాధికారి డాక్టర్ మదని, తూర్పువలయ ఆరోగ్యాధికారిణి డాక్టర్ భాగ్యలక్ష్మి, డెంగీ నోడల్ అధికారిణి సుజాత, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రేమ వ్యవహారం.. యువకుడి హత్య
బనశంకరి: ప్రేమ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. ఈఘటన బెళగావి మాళమారుతి పోలీస్స్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు..గాంధీనగర నివాసి ఇబ్రహీంగౌస్(22) ఇదే ప్రాంతంలోని ముజమిల్సత్తగేరి అనే వ్యక్తి సహోదరితో ప్రేమలో ఉన్నాడు. ఇదే విషయం పై ఇద్దరిమద్య గొడవ చోటుచేసుకుంది. గతంలో ఇబ్రహీంకు ముజమిల్సతేగేరి వార్నింగ్ కూడా ఇచ్చాడు. గురువారం ఆ యువతితో కలసి బైకులో ఇబ్రహీం వెళ్లడాన్ని ముజమిల్సత్తగేరి గమనించాడు. వారిని వెంబడించి స్క్రూడ్రైవర్తో ఇబ్రహీంపై దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. ఈఘటనపై మాళమారుతి పోలీసులు కేసు నమోదు చేసుకుని ముజమిల్సత్తగేరిని అరెస్ట్చేశారు. దావణగెరె వద్ద హత్య యశవంతపుర: దావణగెరె నగరానికి చెందిన యువకుడు సమీపంలో ఓబజ్జిహళ్లి వద్ద హత్యకు గురయ్యాడు. బూదాళ్కు చెందిన సుదీష్ (24) హతుడు. ఘటనాస్థలిని ఎస్పీ ఉమా ప్రశాంత్, సీఐ కిరణ్కుమార్లు పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియటంలేదు. బుధవారం రాత్రి హత్య జరిగింది. బాలికకు వేధింపులు బాలికను మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అడ్డగించి వేధించిన ఘటన హాసన్ జిల్లాలో జరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక అంగడికి వెళ్లి కొనుక్కుని వెళ్తుండగా తాగుబోతు అడ్డగించి పట్టుకోవడానికి యత్నించాడు. పాప గట్టిగా కేకలు వేయడంతో ప్రజలు అతన్ని పట్టుకోవడానికి యత్నించగా పారిపోయ్యాడు. కడుపునొప్పితో ఆత్మహత్య మైసూరు: కడుపు నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా ఒకటో బ్లాక్ దొడ్డ హరవే గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (40) తరచూ కడుపు నొప్పి తో బాధపడేవాడు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్ ఆ బాధను భరించలేక పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే మడికెరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మరణించాడు. మృతుని తండ్రి మటగిరి బైలకుప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజ్వల్ బ్లూ టిక్ పోయింది దొడ్డబళ్లాపురం: లైంగిక వేధింపులు, లైంగిక దౌర్జన్యం కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్కు ఎక్స్లో బ్లూ టిక్ పోయింది. ప్రముఖులకు వెరిఫైడ్ అకౌంట్గా పేర్కొంటూ ఎక్స్ కొందరికి బ్లూ టిక్ను ఇస్తుంది. అయితే కొన్నిరోజుల నుంచి అతని ఖాతాలో బ్లూ టిక్ మాయమైంది. దీనిపై ఎక్స్ ఎటువంటి కారణాలు పేర్కొనలేదు. కొందరు వినియోగదారులు బ్లూటిక్ కోసం ఎక్స్కు డబ్బులు కూడా చెల్లిస్తారు. పలువురికి కస్టడీ వీడియోల కేసులో బాధిత మహిళను కిడ్నాప్ చేశారనే ఆరోపణపై అరైస్టెన సతీష్బాబును కోర్టు మే 24 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఎమ్మెల్యే రేవణ్ణకు బెయిలు వచ్చింది. మరో నిందితుడు కీర్తిని పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. -
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లలో తవ్వకాలు
బనశంకరి: కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లను ఓ సంస్థకు చెందిన కాంట్రాక్టర్లు తమ అవసరాల కోసం తవ్వి నాశనం చేశారని బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ ఆరోపించారు. ఆ రోడ్లను తవ్విన వారిపై , తవ్వకాలకు అనుమతి ఇచ్చిన పాలికె అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు బీబీఎంపీ పాలనాధికారి రాకేశ్సింగ్, కమిషనర్ తుషార్గిరినాథ్కు లేఖరాశారు. పద్మనాభనగర నియోజకవర్గపరిధిలో సుమారు రూ.17 కోట్లతో 8 నెలలక్రితం తారువేసిన అత్తిమబ్బేరోడ్డు, పుట్టలింగయ్యరోడ్డు, బీవీ.కారంత్రోడ్డు, శాసీ్త్రనగర 14 రోడ్డుతో పాటు చాలా రోడ్లను రాత్రికి రాత్రి గేల్ సంస్థ పైపులైన్ అమర్చడానికి కంట్రాక్టు తీసుకున్న కంట్రాక్టరు తవ్వించారన్నారు. దీంతో పాలికెకు కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. వైట్ట్యాపింగ్ పనులు పూర్తయిన తర్వాత తవ్వకాలకు తవ్వడానికి అనుమతి ఇవ్వరాదన్నారు. పద్మనాభనగర నియోజకవర్గంలో కెంపేగౌడ మెడికల్కాలేజీ ఆసుపత్రి, పరిశోధనాకేంద్రం నుంచి మోనోటైప్ వరకు 6.3 కిలోమీటర్ల మేర కేఆర్.రోడ్డును సుమారు రూ.96 కోట్లతో, కృష్ణరావు పార్కుజంక్షన్ నుంచి సారక్కి జంక్షన్ వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డును సుమారు 108 కోట్లతో వైట్టాపింగ్ రోడ్డుగా ఇటీవల మార్చారు. ఈ రెండురోడ్లలో తవ్వకానికి అనుమతి ఇవ్వడం చట్టవ్యతిరేకమన్నారు. -
విమానాశ్రయం రోడ్డులో వేగానికి కళ్లెం
బనశ ంకరి: బెంగళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారి రక్తమోడుతోంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో వాహనదారులు గాయపడుతున్నారు. అతి వేగంతోనే ఈఘటనలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇకపై 80 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లరాదని ఆంక్షలు విధించారు. అతివేగంగా వెళ్తే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తారు. వేగ నియంత్రణకు స్పీడ్ట్రాప్ పరికరం అమర్చినట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. తిరుగు ప్రయాణంలోనే ప్రమాదాలు అధికం.. హెబ్బాల నుంచి కెంపేగౌడ విమానాశ్రయం వరకు నాలుగు, విమానాశ్రయం నుంచి వెనక్కి వచ్చే దారిలో 34 కిలోమీటర్ల మేర నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగర ప్రదేశం నుంచి విమానాశ్రయం వరకు వెళ్లే సమయంలో కంటే తిరుగు ప్రయాణంలో అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డులో రోజూ లక్షకు పైగా వాహనాలు సంచరిస్తున్నాయి. రోజుకు సరాసరి 300 నుంచి 600 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కెంపేగౌడ విమానాశ్రయానికి వాయువేగంతో వెళ్లే వాహనాలు ఆచూకీ కనిపెట్టే కెమెరాలను అమర్చామని నగర పోలీస్కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. బెంగళూరు నగరంలో రోడ్డు ప్రమాదాలు... ●2021 సంవత్సరంలో 3,213 ప్రమాదాలు జరగ్గా 654 మంది మృతి చెందారు. 621 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి, 2,820 మంది గాయపడ్డారు. ●2022లో ప్రమాదాల సంఖ్య 3,822 కాగా 772 మంది మృతి చెందారు. 752 మందికి తీవ్ర గాయాలు, 3,189 మందికి గాయాలయ్యాయి. ●2023 సంవత్సరంలో 4,974 ప్రమాదాలు జరిగాయి. 910 మంది మృతి చెందారు. 82 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 4191 మంది గాయపడ్డారు. ●2024 సంవత్సరం ఏప్రిల్ 30వరకు 1, 633 ప్రమాదాలు జరిగాయి. 310 మంది మృతి చెందగా 304 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,376 మందికి గాయాలయ్యాయి. కెంపేగౌడ విమానాశ్రయం రోడ్డులో ప్రమాదాలు ●2021 సంవత్సరంలో 239 ప్రమాదాలు జరిగాయి. 43 మంది మృతి చెందారు. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 244 మంది గాయపడ్డారు. ●2022 సంవత్సరంలో 278 ప్రమాదాలు జరిగాయి. 73 మంది మృతి చెందగా 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 247 మంది గాయపడ్డారు. ●2023 సంవత్సరంలో 322 ప్రమాదాలు జరిగాయి. 87 మంది మృతి చెందారు. 85 మందికి తీవ్రమైనగాయాలయ్యాయి. 278 మంది గాయపడ్డారు ●2024 సంవత్సరం ఏప్రిల్ 30వరకు 110 ప్రమాదాలు జరిగాయి. 30 మంది మృతి చెందగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. 111 మంది గాయపడ్డారు. వేగమితి గంటకు 80 కిలోమీటర్లు మించరాదు 34 కిలోమీటర్ల మేర వచ్చి వెళ్లే మార్గాల్లో 8 సీసీ కెమెరాలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు -
హోసూరు వార్తలు..
తాగునీటి కోసం ధర్నా హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలో గత రెండు నెలలుగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కార్పొరేషన్ యంత్రాంగం పరిష్కరించాలని అన్నానగర్ ప్రాంతవాసులు గురువారం ఉదయం సిటీ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. గత ఫిబ్రవరి నుంచి వేసవి ఎండల వల్ల బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో పట్టణంలోని 45 వార్డుల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. కార్పొరేషన్ యంత్రాంగం కొన్ని వార్డులకే నీటిని అందిస్తున్నారు, మా పరిస్థితి ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. పెద్దఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. అధికారులు ఆందోళనకారులతో చర్చించి వెంటనే తాగునీరు అందే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సిడి వేడుక సందడి కెలమంగలం: కెలమంగలం పట్టణ పంచాయతీలో వెలసిన గ్రామదేవత పటాలమ్మ ఆలయ రథోత్సవం మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రథోత్సవం, బుధవారం పల్లక్కీ ఉత్సవం జరిగాయి. గురువారం సిడి ఉత్సవాలలో పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కెలమంగలం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కారు ఢీకొని బైకిస్టు మృతి కెలమంగలం: రోడ్డు పక్కన నిలిచి మిత్రునితో మాట్లాడుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఏర్పడిన ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి చెందిన ఘటన డెంకణీకోట వద్ద జరిగింది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని కళుగోపసంద్రం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి (45) బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో డెంకణీకోట వైపు వెళుతూ మార్గమధ్యలో మిత్రుడు కనిపించడంతో నిలిపి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. వేసవి దుక్కులపై జాగృతి హోసూరు: వేసవి దుక్కితో ఉపయోగాలపై వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు చైతన్యం కల్పించారు. హోసూరు వ్యవసాయ శాఖ ఉపడైరక్టర్ భువనేశ్వరి ఆధ్వర్యంలో గురువారం బేగేపల్లిలో వేసవి దుక్కి, మట్టిసేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంగారు వర్షాలు కురవడంతో రైతులు వేసవి దుక్కి ప్రారంభించారు. రైతుల పొలాల వద్దకు వెళ్లి వేసవి దుక్కి దున్నే విధానం, మట్టి పరీక్షల విధానాలపై చైతన్యం కల్పిస్తున్నారు. వీటి ద్వారా అదనపు దిగుబడులు పొందవచ్చునని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నష్టాల్లో మామిడి రైతులు హోసూరు: మామిడి రైతులకు తమిళనాడు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలని సాగుదారులు డిమాండ్ చేశారు. మామిడి సాగులో క్రిష్ణగిరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో రైతులు పండించే మామిడి దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది వర్షాలు అంతంత మాత్రమే ఉండడంతో 80 శాతం దిగుబడి పడిపోయిందని తెలిపారు. ఇప్పుడు వడగండ్లు, గాలీవానల వల్ల పంట రాలిపోతోందని వాపోయారు. తీవ్రంగా నష్టపోయామని, తమిళనాడు ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
చివరి రోజు జోరుగా నామినేషన్లు
మైసూరు: విధాన పరిషత్లో ఖాళీ అయిన ఆరు స్థానాలకు జరగనున్న ఎన్నికకు సంబంధించి నామినేషన్ల సమర్పణ గడువు గురువారం ముగిసింది. ఈక్రమంలో చివరి రోజు నామినేషన్ల దాఖలు జోరుగా సాగింది. దక్షిణ ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్, జేడీఎస్–బీజేపీ మైత్రి పక్షం అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. జేడీఎస్–బీజేపీ మైత్రి అభ్యర్థి వివేకానంద మైసూరు ప్రాంతీయ కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్, జేడీఎస్ పార్టీ కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీదేవెగౌడ తదితరులు ఉన్నారు. నైరుతీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఆయనూరు మంజునాథ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి మధు బంగారప్ప, ఎమ్మెల్యే తన్వీర్సేఠ్్ పాల్గొన్నారు. నైరుతి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేకే మంజునాథ్ రెండు సెట్ల నామినేషన్ను సమర్పించారు. నైరుతి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ధనంజయ నామినేషన్ పత్రాలను అందించారు. ఆయన వెంట బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్ర, ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స, జేడీఎస్ కార్యాధ్యక్షుడు సారా మహేశ్ ఉన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- బదిలీల తర్వాతే హింస!
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
Advertisement