Sakshi News home page

FactCheck: నిజాలకు పాతర.. 'అబద్ధాల జాతర'

Published Wed, Apr 17 2024 5:13 AM

Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan Govt - Sakshi

‘బందిపోటు పాలన’ంటూ రామోజీ వీరంగం 

రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ వ్యాఖ్యలకు వక్రీకరణ 

ఆయన మాటలను రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బరితెగింపు 

రాష్ట్రం అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఉన్నా వికృత రాతలు 

కేంద్ర గణాంకాల మేరకు 2023–24లో జీఎస్‌డీపీ వృద్ధిలో ఏపీది ఆరో స్థానం

చంద్రబాబు పాలన కన్నా జీఎస్‌డీపీ పెరుగుదలలో భారీ వృద్ధి 

ఏ సీఎం అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన 

కొత్తగా పీవీ రమేష్‌ చెప్పారంటూ ఏపీలో అందుకు విరుద్ధ పాలన సాగుతున్నట్లు ఈనాడు పైత్యం 

అభివృద్ధి, సంక్షేమం సమతుల్యతతో ఐదేళ్లుగా సీఎం జగన్‌ పాలన 

17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? 

అవినీతిలేకుండా పేదలకు నేరుగా నగదు బదిలీచేస్తే వారిది అభివృద్ధి కాదా?  

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ముసుగులో వంధిమాగధులతో రామోజీ చర్చాగోష్టి  

సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లోనే  ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకో అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పా­ఠ­కులు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం, సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్‌ క్రికెట్‌.. స్లీప్‌ క్రికెట్‌.. డ్రింక్‌ క్రికెట్‌ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏ పనిచేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్‌ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు.

ఇందులో భాగమే ఆయన కనుసన్నల్లో సాగిన తాజా పచ్చపైత్యం ‘బందిపోటు పాలన’ కథనం. డొంకతిరుగుడు రాతలతో ఎప్పటిలాగే సీఎం జగన్‌ పాలనపై రామోజీ అక్షరం అక్షరంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు ‘గోల’ చేస్తూ పండగ చేసుకున్నారు.  నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని.. అది బందిపోట్లు చేసే పనవుతుందని.. అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పీవీ రమేష్‌ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్‌ పాలనకు ఆపాదిస్తూ పైశాచికానందం పొందారు. 

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ముసుగులో..
నిజానికి.. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన సాగిస్తారని.. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా పాలన సాగుతున్నట్లు పీవీ రమేష్‌ చెప్పారంటూ ఈనాడు తన వక్రబుద్ధిని, సీఎం జగన్‌పై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ముసుగులో వందిమాగధులతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై చర్చాగోష్టి పేరుతో సీఎం జగన్‌ పాలనపై ఈనాడు రామోజీ విమర్శలు చేయించి వాటిని వక్రీకరించీ మరీ అనైతికంగా అచ్చువేశారు. ఏ ప్రభుత్వమైనా దోచుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు బందిపోట్ల పాలన అవుతుందని సీఎం రమేష్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు ఈనాడు రామోజీ తెగ ఆరాటపడిపోయారు.

మరోవైపు.. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు ఒక్కటే.. రెండూ అవసరమేనని, డబ్బులు పంచడం సులభతరమేనని, అందుకు బటన్‌ నొక్కితే సరిపోతుందని, అలాగే ఇంటర్నెట్‌ ఉంటే చాలంటూ పేదలకు నగదు బదిలీ చేయడాన్ని పీవీ రమేష్‌ అవహేళన చేస్తూ తన పెత్తందారీ ధోరణిని బయటపెట్టుకున్నారు. ఈనాడు రామోజీ కూడా పెత్తందారే కాబట్టి పీవీ రమేష్‌ మాటలు చాలా రుచికరంగా ఉండటంతో ఆయన మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి ప్రముఖంగా అచ్చువేశారు.


గురవింద గింజలా పీవీ రమేష్‌..
ఇక ప్రజలకు అవసరమైన సేవలందించడమే ప్రభుత్వ పాలనంటూ పీవీ రమేష్‌ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్‌ జగన్‌ కూడా ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాల తరహాలో గ్రామీణ, పట్టణ ప్రజలు తమకు అవసరమైన సేవలకు రాజకీయ నేతలు, మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటికే పాలనందిస్తున్న విషయం రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌కు కనిపించడంలేదా? కనిపించినా ఈనాడు రామోజీ తనకు కావాల్సినట్లు రాసుకున్నారా? అసలు రమేష్‌ రిటైర్‌ కాగానే ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఆయన ఇతరులకు నీతులు చెప్పడం అంటే తన కింద నలుపు చూసుకోకపోవడమే అవుతుంది.

ఈనాడు రామోజీ వంటి పెత్తందారుకు కావాల్సినట్లు మాట్లాడాలి కాబట్టి పీవీ రమేష్‌ కూడా ఆ ముసుగు ధరించారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ప్రగతిపథంలో వెళ్తున్నట్లు కనిపించడంలేదని.. రివర్స్‌ ఇంజన్‌లో రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను ఈయన చూడలేకపోతున్నట్లు ఉన్నారు. అందుకే గణాంకాలపై కూడా పెత్తందార్లకు ఏదీ కావాలో అదే ఎంపిక చేసుకుని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలోని 99 శాతం అంశాలను అమలుచేసి పేదవర్గాలకు పైసా లంచం లేకుండా నగదు బదిలీచేస్తే దాన్ని కూడా పీవీ రమేష్‌ తప్పుపట్టారంటే పేదలు అభివృద్ధి చెందకూడదనే ధోరణిని ఆయన కూడా చాటుకున్నారు. 

ఇవేవీ అభివృద్ధి కావా రమేష్‌..?
మరోపక్క.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడితే ఇది అభివృద్ధిగా రమేష్‌కు కనిపించడంలేదా? ఇదే పీవీ రమేష్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాడు–నేడు పేరుతో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు పెత్తందారుల పంచన చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే..

► నాలుగు పోర్టులను, పది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అభివృద్ధి కాదా పీవీ రమేష్‌?
► పేదలందరికీ ఇళ్లు పేరుతో 31 లక్షల మం­దికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఇది పేదలు అభివృద్ధి చెందడం కాదా?
► గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఆ సమయంలో ఇదే పీవీ రమేష్‌ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రుణమాఫీకి తూట్లుపొడవడంలో రమేష్‌ పాత్ర కూడా ఉంది. ఆయన దీనిని మర్చిపోతే ఎలా?
► 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా జీఎస్‌డీపీలో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత చంద్రబాబు పాలన కన్నా జీఎస్‌డీపీ పెరుగుదల ఇప్పుడే ఎక్కువగానే ఉంది. దీనిని ఆయన ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా లేక రామోజీ ఇచ్చి­న స్క్రిప్ట్‌ను బట్టీపట్టారా? ఏం పీవీ రమేష్‌? 
► ఇక రాష్ట్ర అప్పులు కూడా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి. జీఎస్‌డీపీతో సమానంగా అప్పులున్నాయంటూ పీవీ రమేష్‌ పచ్చమీడియా వల్లిస్తున్న అబద్ధాలనే వల్లించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులుచేయడం తప్పుగా పీవీ రమేష్‌ అనడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. 
► ఎందుకంటే.. గత ఎన్నికల ముందు ఇదే పీవీ రమేష్‌ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్ధలో పనిచేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు కోరిక మేరకు 2019 ఎన్నికలకు ముందు పసువు–కుంకమ పేరుతో డబ్బులు పంచేందుకు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి అప్పు మంజూరు చేసిన విషయం మరిచిపోతే ఎలా? 
► కానీ, ఇందుకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సీఎం జగన్‌ ఐదేళ్ల పాలన సాగింది.  

Advertisement
Advertisement