Sakshi News home page

పార్సిల్‌ ట్రాకింగ్‌ పేరిట కొత్త మోసాలు 

Published Fri, Jun 9 2023 5:15 AM

New scams in the name of parcel tracking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆన్‌లైన్‌లో వస్తువులను కొనడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే మనకు వచ్చే ఆ పార్సిల్‌ ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్‌ చేయడం పరిపాటి. ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు.

ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్‌ చేసేందుకు మా వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. అంటూ నకిలీ యాడ్స్‌ను ఇస్తున్నారు. అదేవిధంగా ట్రాకింగ్‌ కోసం అంటూ ఆన్‌లైన్‌లో కొన్ని ఫేక్‌ కాల్‌ సెంటర్‌ నంబర్లను పెడుతున్నారు. వాటిని నమ్మి ఎవరైనా ఆ నంబర్లకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారికి నకిలీ మాల్‌వేర్‌ లింకులతో కూడిన ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ మెసేజ్‌లు పెడుతున్నారు.

వినియోగదారులు ఆ లింక్‌లపై క్లిక్‌ చేస్తే మన ఫోన్‌లోని పూర్తి సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లడంతోపాటు మన ఫోన్లను వారి నియంత్రణలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాకింగ్‌ పేరిట ఇచ్చే యాడ్స్‌ను నమ్మి మోసపోవద్దని, ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల నుంచి మాత్రమే ఫోన్‌ నంబర్లు తీసుకోవాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.   

Advertisement
Advertisement